28 డిసెం, 2011

బ్రాహ్మీమయమూర్తి

బ్రాహ్మీమయమూర్తి
పుట్టపర్తి అరవింద్










శివతాండవం ఊరికే పాడటమేనా ఆడికూడా చూపిస్తావా ఆచార్లూ..
ఆ కాలేజీ ఉపన్యాసకులు ఆంజనేయ శర్మ గారు


అంతే..
కాళ్ళకు గజ్జెలు కట్టి నడుముకు దట్టీ కట్టి..
సాక్షాత్తూ ఆ పరమ శివుడు కైలాసంలో నాట్యం చేసినట్లు పుట్టపర్తి వారు నాట్యం చేసి చూపించారు..


ఈ సన్నివేశం మదనపల్లె కాలేజీలో జరిగిందట..

అరవింద్ మా అన్నయ్య..
అయ్య అరవిందుల వారి తత్వాన్ని..సాహిత్యాన్ని.. మధించే సమయంలో పుట్టాడని..



ఆయనపై తనకు గల ఆరాధనకు గుర్తుగా
అరవిదుల వారి పేరును మా అన్నయ్యకు పెట్టారు.
అన్నయ్య అయ్యను తన మాటలలో చెప్ప ప్రయత్నించాడు ..
చదవండి మరి...

పదునాల్గు భాషల పండితుడునూ ..
సరస్వతీ పుత్రులును ..
ప్రపంచ కవుల చరిత్రలో పేరెన్నిక గన్న..
శ్రీమాన్ డాక్టర్ పుట్టపర్తి నారాయణాచర్యులవారు పూజ్యులగు మాపితృ పాదులు...
అశేష శేముషీ దురంధరురాలు ..
సాక్షత్తూ లలితా స్వరూపిణి..
శ్రీమతి కనకమ్మ గారు మా తల్లిగారు..
ఈ దంపతులకు ఏకైక పుత్రుడను. ..
మా తండ్రిగారు అరవిందుల శిష్యులు. 
వారి ఉపనిషద్వాణి 
మా తండ్రిగారి కవితలో సంలీనమైనది. 
వారి  గురువులైన అరవిందుల జ్ఞాపకార్థము..
నాకు అరవింద్ అని నామకరణము చేసినారు..

బాల్యమునుండి 
మా తండ్రి గారు రచించిన అనేక కవితలను 
అనేక శ్లోకములను 
అనేక గేయములను వినుచూ 
పరవశించెడి వాడను. .
మా తాత గారు శ్రీ పుట్టపర్తి శ్రీనివాసాచార్యుల వారు ప్రసిధ్ధ పండితులు కావడం..
మా నాయనమ్మ ప్రసిధ్ధ సంగీత విద్వాంసురాలు కావడంవలన..
మా తండ్రి గారికి బాల్యం నుండి
 సంగీత సాహిత్యాలు అలవడినవి..


వారు బాల్యమునుండి మహా ప్రతిభా సంపన్నులు. 
దీనికి తోడు మహా కోపిష్టులు. 
వీరి హృదయము చాలా సరళమైంది...
నిర్మలమైంది..
మా తండ్రి గారు ఎంతో కరుణార్ద్ర హృదయులు..


నేను పుట్టక పూర్వం 
వారు రచించిన గ్రంధములు అనేకములు. 
నా పుట్టుక తర్వాత కూడా 
శతాధిక గ్రంధములను రచించినారు. 


మా పితృపాదులకు పదునాల్గు భాషలలో పాండిత్యము ఎనిమిది భాషలలో కవిత్వము వ్రాయు శక్తి ఉండెడిది.


దాక్షిణాత్య భాషలగు 1) ఆంధ్రము 2) తమిళము 3) కన్నడము 4) మళయాళము (సౌథెర్న్ లంగూగెస్) ఔత్తరాహుల భాషలగు 
1) సంస్కృతము 2) ప్రాకృతము
3) హింది 4) అవధి 5) మహరాష్ట్ర 6) బెంగాలి 7) వ్రజ 8)పంజాబి 9) కాశ్మీరి 
ఇవి గాక మాగధి అర్థమాగధి సౌరసేని పైశాచికము అను భాషలు 
తరువాత ఇతర దేశ భాషలగు (Forign languages) 1) ఇంగ్లిష్ 2) లాటిన్ 3) గ్రీకు కలవు.

ఇంగ్లీషు భాషలో బ్రిటన్ ఇంగ్లీష్ 2) అమెరికన్ ఇంగ్లీష్ 3) రష్యన్ ఇంగ్లీష్ కలవు. 
పై అన్ని భాషలను 
మా తండ్రి గారు అభ్యసించినారు. రాత్రి పూట రేడియోను ద్గ్గరగా పెట్టుకోని ఇతర దేశ భాషలను 

ఇవి గాక ..
బానిస భాషలగు ఎరికల భాష ..
సుగాలీ భాష.. 
కోయభాష ..
అను మూడు భాషలలో 
తిరువాన్కూరులో ఉన్నప్పుడు మా తండ్రిగారు 
ఎరుకల భాషకు లిపిని కనుగొన్నారు.

వార్థక్యములో పలక బలపము తీసుకొని 
ఉర్దూ భాషను నేర్చుకొనటము 
నేనెరుగుదును. 
ఆ ముసలితనములోనే మృదంగమును 
కూడా అభ్యసించినారు. 
మా తండ్రి గారు పై భాషలను నేర్చుకొనుటలో 
ఎంతో పట్టుదల 
ఆకలి నిద్రలను లెక్కజేసేవారు కాదు. 




విశ్వనాధ సత్యనారాయణగారు రచించిన 
ఏకవీర అను నవల మళయాళ భాషలోనికి అనువదించినారు. 
మహరాష్త్ర భాషలోని బుధ్ధ చరిత్రను 
తెనుగులోనికి అనువదించినారు.


వీరు ఇంగ్లీషులో మహాకవులై పండితులై 
Leaves in the wind 
అను నాటకమును రచించినారు. 
 The Hero  అను నాటకములో 
ప్రధాన నాయకుడు దుర్యోధనుడు. 
ఇతనిని శ్రంగార పురుషునిగా చిత్రించడములో
 మా తండ్రిగారు చూపించిన నేర్పు చాల గొప్పది. 

Leaves in the wind  అను కావ్యమును 
ప్రముఖ సమకాలీన ఆంల కవులు చాలా ప్రశంసించినారు. 
దైవభక్తి సంగీతము పెనవేసుకొనిన 
జీవితమగుట వలన మా తండ్రిగారు 
కొన్ని వేల భక్తి కృతులను 
అష్టాక్షరీ ప్రభావమును 
తెలుపుతూ రచించినారు. 
ఆంధ్రములో పెనుగొండ లక్ష్మి మొదలు 
శ్రీనివాస ప్రబంధము వరకూ గల 
శతాధిక గ్రంధాలు కాక 
సంస్కృతములో శివకర్ణామృతము 
త్యాగరాజ సుప్రభాతము 
అగస్యేశ్వరసుప్రభాతం 
అను మూడు కావ్యములను రచించినారు. 
మా తండ్రిగారి ప్రేరు ప్రతిష్టలకాలవాలమైనది శివతాండవము వీరు అనేక సభలలో ..

ఏమానందము భూమీతలమున..
శివతాండవమట శివలాశ్యంబట..

అని గొంతెత్తి ఆలాపన చేసినపుడు..
మనుషులే కాదు 
జంతువులు సైతం పులకరించి పోయెడివి. 

ఎండిన మోడులు  కిసలయించినవేమో.. 
ఆ మహనీయ గూధర్వమూర్తి 
సాహిత్య కవిత్వ సంగీతముతో పాటు
 నాట్య శాస్త్ర పారమెరింగినవారు.


ఒక పర్యాయము 
మదనపల్లె కాలేజీలో 
మా పితృపాదులు గానం చేసేటప్పుడు 
ఆ కాలేజీ ఉపన్యాసకులు ఆంజనేయ శర్మ గారు 

"గానం చేయడమేనా..? నాట్యం చేసి చూపిస్తావా.. ఆచార్యులూ..

అని అడుగగా వెను వెంటనే కాళ్ళకు గజ్జెలు కట్టి.. నడుముకు దట్టీ కట్టి..
ప్రత్యక్షంగా ..
సాక్షాత్తూ శివుడు తాండవము చేసిన యటుల..
మా తండ్రి గారు నాట్యం చేసి చూపించారు.

1981  వ సంవత్సరములో 
తిరుమల తిరుపతి దేవస్థానంవారు 
భాగవతముపై విమర్శ వ్రాయమని కోరగా
 మా తండ్రి గారు పోతన భాగవతము 
మరియు శ్రీధర భాగవతముల ఆధారముగా 
తన వ్యాఖ్యలతో 
"భాగవత సుధాలహరి" అను పేరుతో 
మా తల్లిగారు శ్రీమతి కనకమ్మ గారి సహాయ సహకారములతో ..
ప్రధమ ద్వితీయ స్కంధములను వ్రాసినారు. 


అప్పట్లో మా తండ్రిగారు చెబుతుంటే ..
మా తల్లిగారు వ్రతప్రతిని వ్రాస్తూ ఉండేవారు. 
1983 వ సంవత్సరము మా తల్లిగారి 
మరణానంతరము ఆ పని ఆగిపోయినది. 



మా తల్లిగారు చక్కని విదుషీ మణి. గొప్ప పండితురాలు. 
వాల్మీకి రామాయణమును 
వారం రోజులు పఠించి 
ప్రతి శనివారం రాముల వారి పట్టాభిషేకములు జరుపుతుండెడిది. 

ప్రముఖ కాశీ పండితులైన 
శ్రీ ధన్నవాడ రాఘవాచార్యులవారి 
మనుమరాలు మా అమ్మ. 
చిన్నతనమునందే పంచకావ్యాలు 
పఠించిన ప్రజ్ఞానిధి. 
మా తండ్రిగారి దగ్గరకు వచ్చే శిష్యులకు వచ్చే సందేహాలను తీరుస్తూండేది. 

మా తండ్రి గారి ఆదేశముననుసరించి ..
అప్పుడప్పుడూ..
వారికి సంస్కృత పాఠములను బోధిస్తూ ఉండేది.
ఇంతటి మహా పండితునకు సేవచేయుటకు 
వారసునిగా జన్మింపజేసిన 
ఆ భగవంతునికి కేల్మోడ్చుచూ..
ఊహా జనితమైన 
మా తండ్రిగారి పాదపద్మములకు నమస్కరించుచున్నాను.