29 ఆగ, 2014

నల్లకుంట రామాలయంలో.. T.K.V.రాఘవన్

 

ఇది T.K.V.రాఘవన్ గారు 
నల్లకుంట రామాలయంలో2012 లో ఇచ్చిన ఉపన్యాసం..
ఇంకా ఈనాటి పలువురు పెద్దలతో పుట్టపర్తిని గురించి పలు చోట్ల మాట్లాడించాలని మా కోరిక..
ప్రొద్దుటూరులో సామవేదం షణ్ముఖ శర్మ గారు 
సుమారు రెండు గంటలు మట్లాడారట..
విగ్రహ స్థాపన అప్పుడు
మరో చోట గరికపాటి వారు కూడా సుదీర్ఘంగా మాట్లాడినరు
కానీ వీడియోలు కానీ టేప్ చేసినట్లు కూడా
 దాఖలాలు లేవు..
ఇది నాగపద్మిని స్వయంగా పూనుకొని ఏర్పాటుచేసిన సభ..

28 ఆగ, 2014

సరస్వతీ పుత్ర శ్రీ మాన్ పుట్టపర్తి నారాయణాచార్యులు (2వ భాగం ) --- రచన వి. సదానందేశ్వరయ్య


గో తెలుగు.కాం లో పుట్టపర్తిని గురించిన వ్యాసం పడింది
శ్రీ చెరుకు రామ్మోహన రావ్ గారు ఎంతో ఆత్మీయంగా బదులిచ్చారు..
 

కడపలోని రోజులను జ్ఞాపకం చేసుకున్నారు..
ఆయన facebookలో మెసేజ్ చేస్తూ 

నీ అన్న కాని అన్న..
అని పోస్ట్ చేసారు..
నా హృదయం పులకించిపోయింది..
వారు వ్రాసిన వ్యాసంలో మెరుపులివి..



ఒక మహాకవిని..
పండితుడిని
పధ్నాలుగు భాషల దిట్ట
నాలుగు రూపాయల కోసం ఆశపడడం అవీ దొరకకపోవడం..
ప్చ్..
 

అందరూ పద్మశ్రీ వస్తే చాలని ఎదురుతెన్నులు చూస్తే..
దాని ద్వారా యేవైనా డబ్బులు వస్తాయని అనుకున్నారట..
కానీ ఒక కాగితం స్మృతి చిహ్నం ఇచ్చారట..
సహాయంకోసం శ్రీమతి ఇందిరా గాంధీ ని అడిగారట..
ఆమె కలెక్టర్ కు అప్లయ్ చేసుకోమన్నారట..
ఆ కలెక్టరూ స్కూల్ టీచర్లకు ఆ అర్హత లేదన్నారట..
యేమిటివన్నీ.

మంచి మంచి అవకాశాలను 

చేజేతులా వదులుకొని..
మంచి ఉద్యోగాలను.. 

తృణమాత్రంగా వదిలేసి..
వాళ్ళనూ వీళ్ళనూ సహాయం కోసం అర్థించడం..

అవకాశం వచ్చినపుడు..

ఉద్యోగం కంటే స్వాభిమానం గొప్పది..
వాళ్ళకాళ్ళూ వీళ్ళకాళ్ళూ పట్టుకోవటం చిన్నతనం..
ఒకరికి పెట్టటమే కానీ
దేహీ అనటం ఎందుకు
భగవంతుడు ఇచ్చినది తినడానికీ తాగడానికీ సరిపోదా..
అన్న భావనలు.,



కుటుంబా వసరాలు మీద పడినప్పుడు 
ఎవడైనా సహాయం చేస్తే బాగుండు నన్నతలంపు 
అంటే డబ్బు ఆ అవసరాలకు సరిపడా వస్తే చాలు 
ఎక్కువ వద్దు.. 
దాచుకోవడం 
దాన్ని చూసి మురిసిపోవటం అంటే ఏహ్యత 

ఈ  వ్యక్తిత్వాలు ఈరోజుల్లో కనిపిస్తాయా..?


ఒక సంగీతవిద్వాంసుడు పాడితే..
చెమర్చిన కళ్ళతో భార్య చేతిగాజులు 

ఆయన కాళ్ళ దగ్గర పెట్టే సుబుధ్ధులెవరండీ..
 


మా పెద్దక్కయ్య పెళ్లి చందాలెత్తి చేసారట 
పిల్ల పెళ్ళికి చెం దాలెత్తడం పెళ్ళి చేయడం
అదేమీ తప్పుకాదు..

 అలానే శిష్యులు పుట్టపర్తి కథ నడిపించారనుకోండి .. 


సదానందీ శ్వరయ్య గారు వ్రాసిన ఈ వ్యాస భాగం ఇది 
అవును సదానందం చెప్పినట్లు 
పద్మశ్రీ తీసుకొని తప్పు చేసాను 
అన్న వాక్యం వెంటాడు తూం ది ..



సరస్వతీ పుత్ర శ్రీ మాన్ పుట్టపర్తి నారాయణాచార్యులు (2వ భాగం ) --- రచన వి. సదానందేశ్వరయ్య


శ్రీమాన్ పుట్టపర్తి వారికి 
ప్రభుత్వము పద్మశ్రీ బిరుదునిచ్చిన సందర్భముగా మైదుకూరులో యువజనసాహితీ సంస్థ తరుపున 1973లో ఆచటి హైస్కూల్ ఆవరణలో 
ఒక బహిరంగసభ జరిగింది. 

ఆచార్యులవారికి సన్మానం, 
కవి సుధాకర ఎస్. రాజన్న కవి అధ్యక్షత వహించగా 
నేను వక్తను, 


ఆ రోజుల్లో సహజ యవ్వనం కారణంగా ఆచార్యులవారుపద్మశ్రీ తీసుకొన్నందుకు ఆక్షేపించాను. ఆ బిరుదు సినీనటుడు రేలంగి వేంకటరామయ్యకు ఇచ్చిన తర్వాత ఇచ్చారు. 


అంతకు మునుపే నారాయణాచార్యుల వారిని
 రేడియో గుర్తించని నాడు, 
శాసనమండలి, 
సాహిత్యపరిషత్తులు తిరస్కరించిన నాడు కూడా

 ప్రజలు, 
సాహితీ పిపాసులు, 
ప్రజల మనిషని గుర్తించారు. 


హంగులతో అహంతో 
కవులు గగనసీమలో విహరించే రోజుల్లో 
ఆయన మానవత్వమున్న మనిషిగా
 ప్రగతిపథంలో పయనించినారు. 


కావున ఆచార్యులవారు 
జనప్రియ రామాయణందే కాకుండా 
సమాజగతిని నగ్నంగా చిత్రించగల 
జనతారామాయణం వ్రాయుమని 
మరొక గుడిగంటలు మ్రోగించి, 
పురోగమనాన్ని వ్రాయమన్నాను. 


స్వామికి ఏ రోజు సభలోను 
అధ్యక్ష, ముఖ్య అతిధి, ముఖ్యోపన్యాసకులు అని సంభోదించేఅలవాటు లేదు. 
సన్మానానికి జవాబిస్తూ ఇలా అన్నారు. 

“వాడు సదానందం” చెప్పినట్లు 
నేను పద్మశ్రీ తీసుకొని తప్పుచేసినాను.
 ఇంకా MLCకి ప్రయత్నించాను. 
రేడియోలో ఉద్యోగం ఇస్తామంటే ఆశపడ్డాను.
 ఇవన్నీ పొరపాట్లే. 


పద్మశ్రీ అంటే ఏదో కొంత డబ్బు ఇస్తారనుకున్నాను. 
కాని డిల్లీలో ఒక కాగితం, స్మృతిచిహ్నం ఇచ్చారు. 
ఈ మాటను నేను 
శ్రీమతి ఇందిరాగాంధి గారిని అడిగాను.
 ఆమె ఆర్ధిక సహాయానికి 
మీ జిల్లా కలెక్టరుకు అప్లయ్ చేయమన్నారు. 


కడపలో కలెక్టరు గారిని అడిగినాను. 
ఆయన ఉపాధ్యాయవృత్తిలో ఉన్నవారు 
Below poverty line క్రింద రారని చెప్పి
 రిక్తహస్తాలు చూపించారు. 


కానీ సదానంద చెప్పినట్లు 
ఒకేరకమైన కవిత్వం నేను వ్రాయలేను. 
వ్రాయను. 


నేను వానివలె 
ఏ committed Ideology కు చెందిన వాడిని కాను. 
నా మనస్సు ఎలా స్పందిస్తే అలా వ్రాస్తాను. 

ఇప్పటికే కొన్ని వందలపేజీల గేయసాహిత్యం, ప్రాచీనసాహిత్యం వ్రాశాను 
‘ఎవరైన ప్రచురించి నాకు కొన్ని ప్రతులిస్తే సంతోషిస్తానన్నారు” 

ఇదే ఆయన సిసలైన నిజాయితితో వెలిబుచ్చిన నిఖార్సయిన మనస్తత్వము

26 ఆగ, 2014

వేనుడు

రాజ్జ పాలన..
దానిని పవిత్రమైన యజ్ఞంగా భావించి పాలించిన రాజులు
మనకు ఎందరో కనబడతారు
వారి చరిత్రలు 
మనకు రాజ్జ్య పాలన యెలా చేయాలో చెబుతాయి

యువరాజుగా పట్టాభిషిక్తుడవబోయేముందు శ్రేయోభిలాషులు ప్రజారంజకుడిగా రాజ్జం చేయమని
ప్రజల మాటనే శిరోధార్యంగా భావించాలని
వ్యక్తిగత ప్రయోజనాలు కుటుంబ ప్రయోజనాలను పక్కనపెట్టి ప్రజాసేవలో తరించాలని హితోపదేశం చేస్తారు..

 ఉన్నతమైన విలువలతో జీవించి తాను అందరితో శభాషనిపించుకోవాలని 
ఆనాటి రాజులూ  తహ తహ లాడారు
అందుకు ఉదాహరణలుగా
చాకలివాని మాటకు ఒగ్గి
 సీతను అడవులపాలు చేసిన రాముడు
సత్యసంధతనే నియమంగా పెట్టుకున్న హరిశ్చంద్రుడు
సహనం శాంతి మూర్తీభవించిన 
స్థితప్రజ్ఞు డు .. అజాత శత్రువైన ధర్మ రాజు
స్నేహధర్మానికి ప్రాణం ఇస్తానన్న 
దానగుణ సంపన్నుడైన కర్ణుడు..
కళ్ళకు గంతలు కట్టుకున్న గాంధారీ..

ఇలా ఎందరో మనకు దర్శనమిస్తారు..


 కానీ అటువంటి సత్యకాలంలోనూ
పంటికింద రాళ్ళలా..

 దుర్మార్గులైన ప్రభువులు తారసపడతారు
వారు అధికార గర్వితులు
వారు చేసిందే పాలన
వారు చెప్పిందే చట్టం
 

వారు ఎవ్వరి సలహాను తీసుకోరు జోక్యాన్ని సహించరు..
అటువంటివాడే ఈ వేనుడు
 

మహా దుర్మార్గుడు..
బలవంతుడు..

వాడికి  ఎవ్వరిని పూజించాలో తెలియదు.. 
ఎవ్వరిని గౌరవించాలో తెలియదు..
ఎవ్వరిని రక్షించాలో తెలియదు..


అటువంటి వాడి పాలనలో రాజ్జ్య వ్యవస్థ పాడైపోయింది..
విద్రోహశక్తులకు ధైర్యమొచ్చింది
అమాయకులు వేధింపబడ్డారు..
 

ప్రజలు తపోనిష్టులైన మునులనాశ్రయించి కాపాడమన్నారు..
వారు మరికొంతకాలం ఓపిక పట్టారు..
 

ఎందుకు..
వాడు మాట వినాలి..
లేకపోతే వాని పాపం పండాలి..


కాని రెండవదే నిజమైంది
రాచరికమునకు ధర్మము ప్రధానమైన చక్రము..
ధర్మ శక్తి లేనిది రాజయంత్రము నడువనే నడువదు..
కాబట్టి ధర్మ బధ్ధుడవై నడువుమన్నారు..

 ప్రభువు విష్ణ్వంశ..
ప్రభువేదిచేస్తే అదే ధర్మం..
ప్రశ్నించడానికెవ్వరికీ అధికారం లేదు.. 

పొండన్నాడు వాడు..
అప్పుడేమయింది..


 వారి తపోనిష్టత కళ్ళు తెరిచింది..
వారి మాట 

వహ్ని పర్వతములనుండి దుమికిన లావా అయ్యింది..
వాడు ఆ అగ్నిలో శలభ మయ్యాడు 


 విచిత్రమేమంటే ప్రతి దుర్మార్గుని గూటిలోనూ
వేదాలు వల్లించే చిలుక ఒకటి వుంటుంది
వీడు చేసే దుర్మార్గాలకా ప్రాణినుంచీ 

రక్షణ లభిస్తూ వుంటుంది..

వేనుని తల్లి సునీథా దేవి
ఆమె కొడుకును మంచి మార్గంలో పెట్టటానికెప్పుడూ ప్రయత్నిస్తూనే వుంది
కానీ వాడు వినడు..


తనకొడుకును శపించిన మునులపై 
ఆమె క్రోధం పెట్టుకోలేదు..
మునుల ఆగ్రహానికి మాడి మసైపోయిన వేనుని శరీరాన్నామె కాపాడింది 
ఎన్నోరోజులు పుత్రప్రేమతో..

రాజులేని రాజ్జ్యం ఎలా కొనసాగుతుంది..
మళ్ళీ రాజు అవసరమయ్యాడు
అప్పుడు కుమారుని శరీరాన్ని కాపాడుకుంటూ
తమ దయ కోసం మౌనంగా నిరీక్షిస్తున్న

 సునీథా దేవి సౌశీల్యం వారిని మెప్పించింది..

వారు తిరిగి వచ్చారు
వేనుని తొడపై మథించారు..
అందులోంచీ ఒక ఆజానుబాహుడుద్భవించాడు
ఆయనే ప్రజల కోసం తపించిన పృథు చక్రవర్తి.


అయ్యయో .. మొత్తం చెప్పేశాను..
మీకిప్పుడు 

నేను క్రింద జత చేసిన రాయల నీతి కథలలోని 
వేనుడు 'సస్పెన్స్ లేని స్టోరీలా' వుంటుందేమో..
కానీ .. పుట్టపర్తి కథనానికీ నా రాతకూ పోలికెక్కడ..

ఈ వేనుని కథను విశ్వనాధవారు 

'వేనరాజు '
అనే నాటకం గా వాశారట..
అది గొప్ప సంచలనాలకు.. వివాదానికీ కేంద్రబిందువైందట..
అంతే మరి గొప్పవారు యేంచేసినా అలానే వుంటుంది..
 

విశ్వనాధవారు
వేనరాజు పాత్రను కౄరుడైన పాలకునిగా, 

వేదధర్మంపై అక్కసుతో 
దారుణ కృత్యాలు చేసే వ్యక్తిగా చిత్రీకరించారు. 

గౌతమ మహర్షితో వేనుడికి వైరం ప్రబలి 
తుదకు వేనుణ్ణి గౌతముడు తపశ్శక్తితో సంహరించడం ప్రధాన ఇతివృత్తంగా పేర్కొనవచ్చు

మరి పుట్టపర్తివారి  వేనుణ్ణి చూద్దామా..



25 ఆగ, 2014

మహాభారత విమర్శనము తెలుగు పరిశోధనలో

 తెలుగు పరిశోధన వారు పుట్టపర్తి వారి మహాభారత విమర్శనము గ్రంధాన్ని పెట్టారు లింక్ ఇది.



తెలుగు పరిశోధన teluguthesis.com: మహాభారత విమర్శనము Maha Bharatha Vimarshanamu: మహాభారత విమర్శనము Maha Bharatha Vimarshanamu పుట్టపర్తి నారాయణాచార్యులు Puttaparthi Narayanacharyulu పుట్టపర్తి నారాయణాచార్...

21 ఆగ, 2014

కోపగృహ నిర్మాణము

కోపగృహము..
రాజుల కాలంలో ఇది తప్పనిసరిగా వుండేది
అదీ రాణుల అంతఃపురాలలో
 


దేనికైనా రాణిగారికి కోపం వస్తే..
ఆవిడ ఆభరణాలన్నీ తీసి విసరి కొడుతూ..
సిగనలంకరిం
చుకున్న పూలు పీకి పడేస్తూ..
పైనున్న వస్త్రాలనూ తీసివేసి నల్ల చీరను ధరించి 

ఆ గృహంలో ఏడు స్తూ కూచుంటుంది
 

ఆ విషయం రాజుగారికి వెళుతుంది
ఆయన పరుగు పరుగున వచ్చి
ఆవిడని బతిమాలి బామాలి కోప కారణం తెలుసుకొని
ఆమె అలుక తీరుస్తాడు
అక్కడికి రాణి అలుకను విడిచి నవ్వుతుంది
 

ఈకాలంలో అంత తీరిక మగవారికెక్కడుంది
పొద్దునలేస్తే పరుగులు పెట్టటమే పని
కృష్ణుడు సత్యభామతో ఈ పాట్లన్నీ పడ్డాడు
 

పాపం రుక్మిణి  ఇలా కృష్ణుని సతాయించి ఎరుగదు
తక్కిన సతుల కింత సీనున్నట్లు కనపడదు..
ఇంక రామాయణంలో కైక కూడ కోప గృహాన్ని ఉపయోగించి రాముణ్ణి అడవుల దారి పట్టించింది..


 రాయలనాటి రసికతా జీవనము చూస్తే..
రాయల నాటి జీవనము.. జనుల వ్యవహారశైలి.. ఆచార వ్యవహారాలు తాను చూచినట్లే
మన కళ్ళకు కట్టి చూపించే  పుట్టపర్తి ప్రతిభ కాశ్చర్యము కలుగుతుంది..


ఇందులో కో పగృహ ప్రస్తావన ఉంది 
రాయల నాటి ప్రజలు 
హాలు కిచెను బెడ్ రూమ్ లున్నట్లే 
కోప గృహాలూ నిర్మించే వారట
 చదవండి .. 
 
 వారి గృహములయందొక రాయియైనను 
యలంకార హీనముగ నున్నచో 
వారి మనస్సు 'కళక్కు 'మనును
 

ప్రతి చోటను కొంచెము సందు దొరకినచో 
 నొక చేపను.. 
నెమలిని 
కడకొక మల్లెపూవునైనను జెక్కించెడివారు
 

కుడ్యములయందు  వారు వర్ణ చిత్రములు వేయుదురు..
ఒక్కొక్కప్పుడింటి పైకప్పులను గూడ

 తైల వర్ణచిత్రములతో అలంకరింతురు
 

అంతేకాదు 
ఇక్కడ ఇంకో విచిత్రమైన సంగతి యేమిటంటే
వారు వారి ఇండ్లలో 

భోజనశాలలు.. మజ్జన శాలలు చిత్రశాలలు 
వేరువేరుగ నుండెను
 

మనకు దెలియని మరియొక వి శేషమానాడుండెడిది
అది 'కోపగృహ నిర్మాణము'
ఇంటి ఆవిడకు కోపము మగనిపై వచ్చినపుడామె  యాగదిలోనికి బోయి దూరికొనును
 

కాని యాకాలమందును 
మగవారికి గోపగృహమున్నట్లు కనుపింపదు.. అంటారు..

(కోపతాపాలు అలకలు అన్నీ ఆడవారి సొత్తు 
ఆమె అలక తీర్చటమూ 
శృంగారములో ఒక భాగం కామోసు..)
 


''ఈనాడే గనుక కోపగృహముల ఆచారమున్నచో మగువలకన్న ముందే.. 
మగవారక్కడ జేరియుందురని నా యనుమానము
కారణమేమనగా
 

మనకీనాడు సంపాదించిపెట్టలేక 
దినమున కొక్కసారియైనను భార్యపై 
గోపము వచ్చుచుండును.
 

ఆనాళ్ళలో యైనను 
అందరు కవులకు కోపగృహముతో నక్కరలేదు
ముక్కుతిమ్మన్నకు మాత్ర  మాయవసరము కలిగినది
 

కృష్ణునిపై గోపమునునుగొన్న సత్యభామాదేవి
 చీకటింటి కడకంకటిపై 
'జలదాంత చంద్రరేఖాసదృశాంగియై'
శరీరమొకచోట పొందక పొరలి పొరలి యేడ్చెనట..

ఏ వాస్తు శాస్త్రకారుడు గనిపెట్టినాడో గాని 


కోపగృహాలవాడుక చాల మంచి యాచారము 
కోపగించిన యావిడ చీకటింటిలో జేరినచో 
తక్కినవారు తకరారు లేకుండ 
తమ పనులను జేసికొన వచ్చును

చూసారా.. 
మా అయ్య ఇలాంటి ప్రబంధప్రమాదాలను  
జాగ్రత్తగా బుర్రలోనే వుంచేసి.. 
ఇంట్లో కోపగృహ నిర్మాణం చెయలెదు.. 
ఒకవేళ చేసి వుంటే మేమూ అప్పుడప్పుడూ  ఉపయోగించేవాళ్ళం కదా.. 

(కోపగృహము సంగతి తెలియక నేను నా చిన్నప్పుడు
మోచెంపేటలో వుండగా నేలపై పడి పొర్లి పొర్లి యేడ్చేదాన్ని
అది కావాల.. ఇది కావాల అని
మా అయ్య వద్దకుంటె గుద్దుకో వాకిట్లో పండుకో
ఎవరైన తొక్కితె లబ లబ మొత్తుకో
అని తాను భుజాలేగిరేస్తూ  పాడేవాళ్ళు
 

ఆ కోపగృహము మా అమ్మ ఉపయోగించదు 
అంత తీరిక ఆమె కెక్కడ .. 
మా అక్కలకు బాగా పనికి వచ్చేది
వాళ్ళల్లో వాళ్ళకు పోటీలెక్కువ
వాళ్ళు పుట్టింటికి వచ్చినప్పుడు..

కోపగృహము ఎప్పుడు ఖాళీగా వుండదేమో బహుశా
ఎప్పుడూ ఎవరో ఒకరు దాన్లో వుంటారు
పైగా బయట మరొకరు వైటింగూ
మా అయ్య పట్టించుకో
రు..
మా అమ్మకు తల వాచిపోయుండేదివాళ్ళ అలకలు తీర్చలేక .. )

16 ఆగ, 2014

రేపు కృష్ణాష్టమి..


రేపు కృష్ణాష్టమి..
కృష్ణుడుద్భవిస్తున్నాడు
అదిగో ప్రకృతి అంతా ఆనందంతో పరవశిస్తోంది
మనకంటే ముందే..
చెట్లకూ.. గాలికీ. మట్టికీ.. నీటికీ..
పశుపక్ష్యాదులకూ ప్రభుని రాక తెలిసిపోతోంది
ఎందుకో..

అదిగో అక్కడేదో పాట లీలగా వినిపిస్తోంది..
విందామా..


12 ఆగ, 2014

కుప్పించి ఎగసిన ..

అది కురుక్షేత్రం..
రథ ..గజ.. తురగ.. పదాతి  సైన్యం..
అతిరథ ..మహారథులు..
కౌరవులు .. పాండవులు
 

అర్జునునకు సారధి  కృష్ణుడు
కేవలం సారథ్యం మాత్రమే వహిస్తాడు
ఆయుధం పట్టడు..
ఇది ఆయన ప్రతిజ్ఞ..
  

భీష్ముడు మహాభక్తుడు
కృష్ణ స్వరూపాన్ని ఎరిగినవాడు..

కృష్ణుడు  ఎంత భక్త పరాధీనుడో భీష్మునకు తెలుసు..

తన భక్తులకు ఆపద వస్తే తల్లడిల్లిపోతాడు..
ఆ కృష్ణునికి అర్జునుడంటే ప్రాణం
కృష్ణుని ప్రాణాన్ని తన బాణాలతో రక్త సి క్తం చేసి..
కృష్ణుని కాగ్రహం తెప్పించి
తన ప్రతిజ్ఞ తానే మరచిపోయేటట్లు చేశాడు భీష్ముడు
తద్వారా..
తనను నమ్ముకున్న వారినాదుకోడానికి 

తాను ఎంతకైనా దిగిపోతాడు కృష్ణుడని  సంకేతించాడు
లేకపోతే జగత్ప్రభుడు రధ సారధ్యం చేయడమేమిటి..
 

వెనక్కి తిరిగి రక్తమోడుతున్న అర్జునుని చూసి అగ్రహోదగ్రుడయ్యాడు కృష్ణుడు
 

అంతే..పగ్గాలు విసిరేశాడు
 రధం మీదనుంచీ ఒక్క సారి కిందకి దూకాడు
కుండలాలు ఒక్కసారి పెద్దగా ఊగాయి
వాటి కాంతి గగనభాగమంతా అలమికొంది..
కడుపులోని లోకాలు కదిలిపోయాయి..


పైన వేసుకున్న పచ్చని పటం  జారిపోయింది..
చక్రం పట్టి ..భీష్ముని చంపుతానని 
ముందుకురుకుతున్న కృష్ణుని
''బావా బావా.. వద్దు వద్దు 

ఆగు బావా .. ఆగుబావా  నన్ను నగుబాటు చేయవద్దు ''
 అంటూ కాళ్ళు పట్టుకున్నాడర్జునుడు..

ఇది 'కుప్పించి యెగసిన' పద్యం
మరి సంస్కృతంలో వ్యాసుడు దీనినెలా రచన చేశాడు
దీనికి పోతన్న తెనిగింపెలా వుంది..
యేయే పదాలకు వానికి సరితూగే తెలుగు వేయడానికి పోతన్న ఎంత కష్టపడ్డాడు..
పుట్టపర్తి వారు మహా భాగవతోపన్యాసాలు లో 

ఇలా చెప్పారు..


 
ఆ కృష్ణ పరమాత్మ భక్త పరాధీనత యెలాంటిదంటే 

తను చేసిన ప్రతిజ్ఞ నైనా దాటేంతటిది..
తాను ఆయుధం పట్టనని కురుక్షేత్రం లో ప్రతిజ్ఞ
ఆ ప్రతిజ్ఞను దాటేలా చేస్తానని భీష్ముడన్నాడు
యెలా..
కృష్ణుని

''స్వనిగమ మపహాయ మత్ప్రతిజ్ఞాం ఋతమధికార్తు మవప్లుతో రధస్థః
ధృత రధ చరణో భ్యయాచ్చలగ్దు-ర్హ రిరివహం మిభం గతోత్తరీయః
శితవి శిఖవతో విశీర్ణ దంశః క్షతజ పరిప్లుత ఆతతాయినోమే
ప్రసభ మభిససార మద్వధారథః-సభవతుమే భగవాన్ గతి ర్ముకుందః''

 ఈ రెంటికి దెనిగింపే పోతనామాత్యుల..

''కుప్పించి ఎగసిన గుండలమ్ముల కాంతి
గగన భాగం బెల్ల గప్పికొనగ.. 
నురి కి న నోర్వక నుదరంబులో నున్న
జగములవ్రేగుకు జగతి గదల..
జక్రంబు జేపట్టి చనుదెంచు రయమున
బైనున్న పచ్చని పటముజార..
నమ్మితి నాలావు నగుబాటు సేయకు..
మన్నింపుమని క్రీడి మరల దిగువ
గరికి లంఘించు సింహంబు  కరణి మెర సి..
నేడు భీష్ముని జంపుదు నిన్ను గాతు..
విడువు మర్జున ..యనుచు మద్విశిఖవృష్టి
దెరలి చనుదెంచు దేవుండు దిక్కునాకు..''


యను పద్యము
తెలు గు దేశమున నీ పద్యము నోటికి రాని 

వా రుండరనుకొందును. 

ఇందులో మొదటిపాదము 
''అవప్లుతః"  యను దానికి దెనిగింపు
 

ఈ శబ్దములోని స్పూర్తిని
 'కుప్పించి యెగసిన'
 యనుట నిండుగా దెలుపుచున్నది
 

ఆ కుప్పించి యెగురు నప్పుడు 
గుండలంబులు చౌకళించి..
వాని కాంతి  గగనమున వింతరంగు బూయుట పోతనామాత్యుల భావనయే
 

'చలద్గు'
యనెడు సంస్కృతమున కాంధ్రీకరణము 

రెండవపాదము మూలమునందు 
'భూమి చలించుటకు' గారణములేదు
 

శ్రీధరులాకొరతను 
'ఉదరస్థ సర్వ భువన భారేణ '
యని పూరించిరి
 

ఆ విషయమును 'ఆంధ్ర కవి' యందుకొన్నాడు
'గతోత్తరీయః'

 యనుటకు 'పైనున్న పచ్చని పటము జారుట '
తెనుగు
'పచ్చని ' యను విశేషణము పోతన్నదే
 

కృష్ణ భగవానుడు ధరించిన యుత్తరీయ మేల జారినది.. ?
 దీనికి సమాధానము స్పష్టముగ వ్యాసుడీయలేదు
 

దానిని సమర్థించుట శ్రీ ధరుల వంతు
వారికిది చిక్కుగా గన్ప డినది 

'తేనైవ సమ్రంభేణ' యని
శ్రీధరులు తిన్నగా జారుకొనిరి
 

ఇక పోతనామాత్యులు దా నిని సవరించుకొనవలెను
'ఆ సంభ్రమము'  

రెండవ పాదములో రానే వచ్చినది
 

మరల నదే జెప్పినచో ససిగా నుండదు
అందుకై 'చక్రంబు జేపట్టి ' యన్నారు
 

ఇది 'ధృత రధ చరణః ' అను దానిని హేతువుగ నన్వయించుటయే
దీనితో నా 'యురుకు'టకు నీ 'రయము'నకు భేదమేర్పడినది
భూమి చలించుటకు 'వ్రేగు' హేతువు 

పటము జారుటకు 'పరుగు' కారణము ..

నాల్గవపాదము 
అమాత్యుల స్వకపోల కల్పితము
'నేడు భీష్ముని ... విడువు మర్జున'
యన్నమాట తెనుగు కవిదే
పద్యం చాల యందముగ కుదిరినది
 

కాని
'మత్ప్రితిజ్ఞాం ఋతమధికర్తుం'

 యనునది తెనుగున రాలేదు
 

రెండవ శ్లోకము 
మొదటిదానితోనే గతార్థమగుటచే పోతన్న వదలిపెట్టెను.

10 ఆగ, 2014

సాహిత్య ప్రక్రియల్లో నిష్ణాతుడు పుట్టపర్తి

సాహిత్య ప్రక్రియల్లో నిష్ణాతుడు పుట్టపర్తి

Sakshi | Updated: February 21, 2014 01:49 (IST)
వైవీయూ (వైఎస్‌ఆర్ జిల్లా), న్యూస్‌లైన్ : వివిధ సాహిత్య ప్రక్రియల్లో నిష్ణాతుడు పుట్టపర్తి నారాయణాచార్యులు అని యోగివేమన విశ్వవిద్యాలయం వైస్ ఛాన్స్‌లర్ ఆచార్య బేతనభట్ల శ్యాంసుందర్ అన్నారు. గురువారం వైవీయూలోని సర్ సి.వి.రామన్ సెమినార్ హాల్‌లో ఏపీ సాంస్కతికశాఖ, వైవీయూ తెలుగుశాఖ ఆధ్వర్యంలో పుట్టపర్తి నారాయణాచార్యులు శతజయంతిని పురస్కరించుకుని ‘పుట్టపర్తి నారాయణచార్యుల జీవితం-సాహిత్యం’ అనే అంశంపై రెండురోజుల జాతీయసదస్సు ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన వీసీ మాట్లాడుతూ పుట్టపర్తి వారి కలం నుంచి జాలువారిన శివతాండవం, మేఘదూతం సంకల్పిత గ్రంథాలన్నారు.

సదస్సులో కీలకోపన్యాసం చేసిన యునిసెఫ్ అవార్డు గ్రహీత శశిశ్రీ మాట్లాడుతూ 400 సంవత్సరాల క్రితం కష్ణదేవరాయల కాలంలో శ్రీవైష్ణవ సంప్రదాయానికి సంబంధించిన తిరుమల తాతాచార్యుల కోరిక మేరకు కష్ణదేవరాయల ఆజ్ఞతో తమిళనాడు నుంచి రాయలసీమకు పుట్టపర్తి నారాయణాచార్యులు విచ్చేశారన్నారు. తెలుగు వ్యాకరణం, ఛందస్సు నేర్వకనే ‘పెనుగొండలక్ష్మి’ కావ్యాన్ని రచించారన్నారు.

ఆయన జీవితంలో 143 గ్రంథాల రచన చేయడమే కాక గొప్ప మానవతావిలువలు కలిగిన వ్యక్తి అన్నారు. కార్యక్రమానికి అధ్యక్షత వహించిన రాచపాళెం చంద్రశేఖరరెడ్డి మాట్లాడుతూ ఆత్మస్థైర్యం, ఆత్మవిశ్వాసం, ఆత్మగౌరవం కలిగిన కవి పుట్టపర్తి వారన్నారు. సదస్సు సమన్వయకర్త డాక్టర్ తప్పెట రామప్రసాద్‌రెడ్డి మాట్లాడుతూ ఆధునిక తెలుగు సాహిత్యచరిత్రలో మూడవ తరానికి చెందిన పుట్టపర్తి నారాయణాచార్యులు నిజజీవితంలో ఎదుర్కొన్న సంఘటనల ప్రభావం ఆయన రచనలపై ఉందన్నారు.

అనంతరం జనప్రియరామాయణంపై డాక్టర్ గోష్లాపిన్ని శేషాచలం, శ్రీనివాసప్రబంధంపై విద్యాన్ కట్టా నరసింహులు, పండరిభాగవతంపై మల్లికార్జునరెడ్డి, బహుభాషావేత్త పుట్టపర్తి అనే అంశంపై చెన్నైకి చెందిన ఆచార్య సంపత్‌కుమార్ ఉపన్యసించారు. ఈ కార్యక్రమంలో తెలుగుశాఖ విభాగాధిపతి డాక్టర్ ఎన్. ఈశ్వరరెడ్డి, డాక్టర్ వినోదిని, పార్వతి, రమాదేవి, అంకమ్మ, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.

5 ఆగ, 2014

వింటే పుట్టపర్తి నోట శివతాండవం వినాలి

వింటే శివతాండవం పుట్టపర్తి నోటనే  వినాలి అని అందరూ అంటూంటారు కదా..
వినండీ భాగం..
ఝల్లుమన్న గుండెని చిక్కపట్టుకోటానికి ఎంతసేపు పడుతుందో..

2 ఆగ, 2014

శ్రీ రాధాదేవి

శ్రీ రాధాదేవి  కృతి అష్టాక్షరీ కృతుల లోనిది 
అయ్య రచన
అక్కయ్యలందరికీ నేర్పించే వారు
అయ్య స్వరపరిచిన రాగం 

(పెద్ద జమాలప్ప గారితో కలిసి )నాగ క్కయ్య పాడింది
తరువాత మంగళం పల్లి ఆకాశవాణి   కోసం పాడినారు..












ఎన్ని పేరులతోను..

ఆకాశవాణి భక్తి రంజని లో ప్రసారమౌతూ ప్రసిధ్ధిపొందిన పుట్టపర్తి వారి కృతి ఇది
గతంలో youtube లో దీనిని తయారుచేసి పెట్టాను
మీకోసం..ఇప్పుడు..
ఎన్ని పేరులతోను నిన్ను సేవించేరు..

సహకారం పుట్టపర్తి నాగ పద్మిని