13 సెప్టెం, 2017

అప్పటి నుండి బుధోత్తమ..

అప్పటినుండి బుధోత్తమ
చెప్పెడు భగవత్కథావిశేషంబులు నా
కెప్పుడు దనివి జనింపదు
చెప్పగదే చెవులు నిండ శ్రీహరి కథలున్

సముద్ర మథన కథా ప్రారంభము..



పుట్టపర్తి గారిని తీవ్రంగా నొప్పించింది ..
తరుచూ రెచ్చగొట్టింది..
గట్టిగా ప్రతిస్పందించేలా చేసింది..
ఈ సంకుచిత ప్రాంతీయ ధోరణే..
ఆయన ప్రతిస్పందనలోని పదును చూసి..
పెద్ద పండితులు నొచ్చుకున్నారు.. 
కాని..
ఆయన పడిన నొప్పి వెనుక ఉన్న న్యాయాన్ని గూర్చి ఆలోచించిన వారెందరు..??

ఆ ప్రాంతీయ ఆధిక్యతా భావాల వల్ల..
అఖిల భారతస్థాయిలో ఆ అప్రమేయ ప్రతిభామూర్తికి రావలసిన గౌరవం రాకపోవడంతో..
కలిగిన నష్టాన్ని గూర్చి బాధపడేవారెందరు..??

ప్రతిభ దారి ప్రతిభది..
ప్రశస్థి దారి ప్రశస్థిది..
అని సరిపెట్టుకోక తప్పదు..
అప్పుడప్పుడు.. 
ఆవేదనతో స్పందించినా..

చిన్ననాడే షాజీ లో వర్ణించిన 
'' నిమిష నిమిషంబునకు నెన్నేవిధాల..
బాటు వడుచున్న పరమాత్ము ప్రతిభ జూచి..
సరస సౌందర్య విధికి నాశనములేని 
సృష్టి కలదేమొ యంచు యోచించుచుండు.. ''

ప్రశాంతయోగి చిత్తములోన కలవాడు కాబట్టి..
ఆ రసికత కలిమితో జీవితమంతా 
కావ్య సౌందర్యాలను అన్వేషిస్తూనే వెళ్ళాడు.
కవిత్వీకరిస్తూ సాగాడు..

అయినా..
ఆయన ప్రతిస్పందించింది ..
చాలామంది అనుకున్నట్లు .. 
అన్నట్లు..

తనకేదో దక్కలేదనే అక్కసుతో కాదు..
తన ప్రాంతపు పలుకుబడిని న్యూన పరచినందుకు..
తన రచనల్లో కనిపించే సీమ నుడికారాన్ని వెక్కిరించినందుకు..

ఆ కాలంలో వారే కాదు..
రాయలసీమ మహాకవి.. విద్వాంసులందరూ 
  ఆ వివక్షకు గురయ్యారు..
వ్యధపడ్డారు..

రాళ్ళపల్లి గారంతటివారు 
విద్వాన్ విశ్వం గారి పెన్నేటిపాట మున్ను డిలో 

'' ఇక్కడివారికి చదువు సంతలు లేవని..
వారు అనాగరకులని పరిహాసమును .. 
ఆక్షేపమును జేసినవారును కొందరుండిరి..
నేడును లేకపోలేదు..

ఇది ' క్షతేక్షారమివాసహ్యం ' అన్నట్లయినది..
ఆ సీమలవారికి.
ఇది ముఖ్య కారణముగా .. 
ఈ ఆంధ్ర ఖండమునకు 'రాయలసీమ ' అని 
 విభిన్న నామమును 
తాము ఇతరాంధ్రులతో చేరియుండలేమను భావము ఇందలి ప్రజలకును వ్యాపించినది..''

అని నిర్మొగమాటంగా చెప్పారు .
ఈ వికటాధిక్య విభావ వైఖరి ఇప్పటికీ కొనసాగుతున్నందువల్లే.. 
మహాంధ్రభారతికి ఇటీవలగా అలాంటి గర్భ శోకం కలిగింది.
ప్రాంతీయ పరమైన వివక్షకు తోడు అద్వైత, విసిష్టాద్వైత శాఖా భేదం కూడా ఆ రోజుల్లో ధ్వనించిందనడన్నది బహిరంగ సత్యం


- ''ఆధునికత సమకాలీనత (కొన్ని పార్శ్వాలు)''
ఆచార్య గంగిశెట్టి లక్ష్మీనారాయణ
పూర్వ ఉప కులపతి 
ద్రావిడ విశ్వ విద్యాలయం

6 సెప్టెం, 2017

నిజభక్తిఁ దలంచెదఁ బుట్టపుట్టువున్‌...



పుట్టపట్టికి సరిజోడు పుట్టపర్తి ..
అనేవారు నరాల రామారెడ్డి ..
తన అవధానాల ప్రారంభంలో ..
ఆ మాట అప్పట్లో ఒక నానుడి అయింది.. 

పుట్టపట్టి వాల్మీకి రామాయణాన్ని దర్శింపజేసి భారతీయ సాహిత్యాన్ని పునీతం చేశాడు. 
అదే మాధురీ రస పంథాలో పుట్టపర్తి గారు 
ఒక్క రామాయణమేమిటి .. ??
భాగవతమేమిటి..??
తెలుగు వారి ఇలవేలుపు శ్రీనివాసుని ప్రబంధమేమిటి..??
సాక్షాత్తూ సకల కళాధీశుడు శివుని తాండవాన్ని అమ్మలాస్యాన్ని దర్శించి దర్శింపజేసి..
తెలుగు భారతిని మహిమోపేతం చేశాడు..

20 వ శాతాబ్ది సర్వశ్రేష్ట భారతీయ కృతుల్లో శివతాండవమొకటి..
తెలుగు భాషకు చెందడం దాని దురదృష్టం..
మన మహాదృష్టం..

అలాగే ..
20 వ శతాబ్ది తెలుగునాట ఎల్లలెరుగని ప్రతిభామూర్తులలో 
ఆయన వరిష్టుడు..
నిస్సీమా నిరంకుశ ప్రతిభా గరిష్టుడు..

గత వైభవానికి తావలమైన రాయలసీమలో కాక ..
అక్షర పరిశ్రమకు కేంద్రమైన 
మధ్యాంద్రదేశంలో గనుక జన్మించివుంటే..
అక్కడి తెలుగే నేడు సకల జన ప్రామాణికమైనట్లు
వారే ..
సకలాంధ్రావనికి సర్వోన్నత మాన్యులై ఉండేవారు..

యావదాంధ్ర ప్రజ 
మరెంతో మిన్నగా బ్రహ్మ రథం పట్టి ..
భారత పీఠంపై ఆ సరస్వతీపుత్రుని 
ఎన్నడో ప్రతిష్టించి వుండేవారు.. 

-ఆధునికత సమకాలీనత (కొన్ని పార్శ్వాలు)
ఆచార్య గంగిశెట్టి లక్ష్మీనారాయణ
పూర్వ ఉప కులపతి 
ద్రావిడ విశ్వ విద్యాలయం

2 సెప్టెం, 2017

మన సారధి .. మన సచివుడు..




ఈ రోజు మా అయ్య వెళ్ళి పోయిన దినం..
 సమయం రాత్రి మూడు .. 
 మంచం చుట్టూ  శిష్యులు ..
దశమ స్కంధం పుట్టపర్తి నోట పొంగింది 
మరణ వేదమై ..
......
....

అదే రోజు .. 
ఏకాదశి పుణ్య తిథి .. 
తెల్లవారి ..
గబ గబా స్నానం చేసి..
కలశం పెట్టి సత్యనారాయణ వ్రతం మొదలు పెట్టాను .. 
జీవితంలో సత్యనారాయణ వ్రతం వదలద్దు..
అమ్మ మాటలు..
అయ్యా నాకేమైనా చెప్పు..
నీకేం చెప్పేది..
సత్యనారాయణ వ్రతాలు వదలకుండా చేసుకో..


ఒక టెంకాయ ..
గ్లాసులో నీళ్ళు..
రెండు దీపాలు..
అంతే..
ఏమీలేకపోతే..నీళ్ళైనా నైవేద్యం పెట్టు ..అమ్మ

మనసంతా బాధగా వుంది..
కళ్ళు వర్షిస్తున్నాయి..
విగ్రహం పైఅరచేతిని వుంచి ..
స్వామీ..సర్వ జగన్నాథా..
పూజ ముగిసే వరకు ప్రీతిభావనతో వుండవయ్యా..
ప్రాణప్రతిష్ఠ..
.......
......
 హాస్పిటల్లో..
అందరూ మగత కౌగిట్లో జోగుతున్నవేళ..
ఒక గురువు..
 తన ఆఖరి ప్రయాణానికి సామాను సర్దుకుంటున్నాడు..
లోతైనకళ్ళు..
వణుకుతున్న గొంతుక..
కృష్ణ తత్వాన్ని ప్రవహింపజేస్తోంది  ..
వినిపించని వేణువు శ్రద్ధగా వింటున్న 
ఆ శిష్యుల గుండెల్లో మోగుతోంది...
బ్రతికిఉన్నంతకాలం ..
ఒక దివ్య తేజస్సు ఆ శరీరంలో వుంది కాబట్టి
ఆ అవయవాలు ఇప్పటికీ 
ఆ తేజస్సును వ్యక్తం చేస్తున్నాయ్..
శరీరం భగవంతుడు కాదు..
కృష్ణుడనగానే నెమలి పింఛం వేణువు..
ఇవి కాదు,,
కృష్ణుడు ఆత్మ స్వరూపుడు..
కృష్ణుడంటే ఆత్మ స్పృహ 
ఆత్మ భక్తి..


హఠాత్తుగా ఆయన శ్రీనివాసా..
అంటూ గుండె పట్టుకుని వొరిగి పోయాడు..
శిష్యులు
 అయ్యా..
స్వామీ..
గొల్లుమన్నారు..

అక్కడ నిర్యాణం .. 
ఇక్కడ ప్రాణ ప్రతిష్ట .. 
దేవునిలో లీన మవడమంటే ఇదేనా.. ??