9 మే, 2016

ప్రభు దృష్టి




అసలే ఎండాకాలం.. ఎగసిపడే ఎండలు.. 
బయటికి పోవాలంటేనే భయం వేస్తోంది

కానీ మా ఇంటి పని సాగుతున్న చోట.. 
పాపం కూలీలు 
ఆ భగ భగ మండే ఎండలో ..
వెన్నెల్లో పనిచేస్తున్నట్టు 
నిదానంగా పనిచేస్తున్నారు..
ఉస్సూ బుస్సూ మనేది నీడకు కూచున్న నేనే

అందరి ఎడలా ఆ భగవంతుడు కన్నతండ్రిలా 
తన సహాయాన్ని పలువిధాలుగా పలు రకాలుగా అందిస్తున్నాడు
అందుకే చిన్న కీటకం మొదలు 
పెద్ద మదగజం వరకు ఆయన నీడలో నిశ్చింతగా బ్రదుకుతున్నారు
భూమి బీటలు వారి  నోరు తెరిచి ఎదురుచూస్తూంది

నీటిచుక్కకోసంజనాలు మంచినీళ్ళో మంచినీళ్ళో 
అని మొత్తుకో ళ్ళు .. 
పొలాలు గట్టున  ఎండిపోయిన  రైతుల దిగులు ముఖాలు  .. 
ప్రతి నీటి చుక్కా ఒడిసిపట్టుకోండి 
అంటూ ఇద్దరు చంద్రులు దోసిళ్ళతో సంకేతాలు..
ఇంకుడు గుంతలు   సగం తవ్వి
 అవి పూడ్చక గ్రాంటు కోసం
 కిందా మీదా అవుతున్నపంచాయితీలు
ఇది 2016 మనుష్య లోకపు హైరానా

మరి ఒక ప్రకృతి 
దాని పై ఆధార పడి కవిత్వాలల్లుకుంటున్న కవులు..
ఆ కాలంలో కవిత్వాన్ని ప్రేమించే ప్రభువులు జనాలు
బహుశా .. 
ఈనాటి ఇబ్బందులేవీ వుండి వుండవేమో
ఎటు చూసినా నీటి ఎద్దడిని తెలియనివ్వని జలాశయాలు..
నష్టపోయిన రైతులను ఆదుకొనే ప్రభుత్వాలు 
అధర్మం పాలు తక్కువవటం వల్ల 
ప్రకృతి కూడా సహృదయంతో
 ఏకాలానికి ఆ ధర్మాన్ని పాటిస్తుండవచ్చు 

చీకూ చింతా లేని పాలనలో 
కవులకు వేసవిలోను అందమే కనబడింది

మరి వర్షంకోసం పర్జన్యుడనే దేవతకు లంచమివ్వడానికినదీకన్యకలు 
పద్మాలనే చేతులతొ వడలి వాలిన రేకులనే వేళ్ళతో నడుమ కర్ణికలనే నాణేలనుపట్టుకున్నట్ట్లు రాయలు వర్ణించాడట..

ఎందుకంటే వానలు ఎక్కువగా కురవాలి
తాము నీటితో కళ కళ లాడాలి
ఆపైవడి వడిగా బిర బిరలు పోతూ
 గల గలలాడుతూ సముద్రుడిలో కలవాలి..
తనవానికై తపించే ప్రతి స్త్రీ మనసూ 
ఇక్కడీ ఉత్ప్రేక్షలో వ్యక్తమవుతుంది..

ఎంతైనా ఆయన ప్రభువు కదా
లంచగొండుల లీలలు కొన్నైనా 
ఆయనకు తెలియక పోవా 
అందుకే నదీ కన్యకలులంచమిచ్చే సాహసం చేస్తున్నాయని ఇట్టే పట్టేశాడు..

ఎంత లంచావతారులున్నా 
ఈరోజుల్లోలా 
కోట్లకు కోట్లు భోంచేసే పెద్ద పొట్ట వుండదనే అనుకుంటున్నా..

ఇది ఉత్ప్రేక్షాలంకారం
ఇది రాయటం చాలా కష్టం
మంచి తీరిక .. ఆపై కలంలో మంచి దన్ను ఉండాలిట..

''అతివృష్టిన్ మును వార్ధి గూర్చునెద కాడౌటన్ దమిన్ గూర్చుననృతి లంచంబుగ హేమటంకములు మింటన్ బొల్చు పర్జన్యదేవతకీ నెత్తిన కేల నా బొలిచె, నిర్వారిస్రవంతిన్ న్బయశ్చ్యుతి నమ్రచ్ఛద దృశ్య కర్ణికములై యున్నాళ నాళీకముల్''


ఎండాకాలం వచ్చింది. 
ప్రవాహాల్లో నీళ్ళు బొత్తిగా తగ్గి పోయినాయి . 
పద్మాల నాళాలు ..
పొడవుగా జొన్న దంటుల్లాగా నిలిచినాయి. 
పైన వుండే పద్మ పుష్పాల్లోని రేకులు.. 
ఎండకు వ్రాలి వ్రేలాడుతున్నాయి. 
తామరపూల మధ్యవుండే దుద్దులు 
బంగారు ఛాయలలో
 పైకి స్పష్టంగా కనబడుతున్నాయి. 

ఈ దృశ్యాన్ని రాయలు వర్ణిస్తున్నాడు.
పర్జన్యుడనే దేవత 
తమ్ము సముద్రంలో చేర్చేవాడు. 
ఎక్కువగా వానవస్తే నదులు పొంగి ..
దండిగా నీరుగలవై సముద్రంలో చేరిపోతాయి కదా.. 

నదులకూ సముద్రాలకీ దాంపత్యాన్ని వర్ణించడం పూర్వకవి సమయసిధ్ధమై పోయింది. 
పర్జన్యుడనే దేవత అనుగ్రహమే 
చక్కని వానలకు కారణం.
నదులనే స్త్రీలు 
ఆయన అనుగ్రహం సంపాదించుకోవాలి. 
అందుకేం చేయాలి..?
లంచాలివ్వడానికి పూనుకున్నారట. 
పద్మాలే నదీమతల్లులకు చేతులు. 
సాగి నిలిచియున్న బిసకాండాలే 
వాళ్ళు దాచిపట్టినముంజేతులు. 
వంగి వ్రేలాడుచున్న రేకులను 
నదుల చేతి వ్రేళ్ళుగా ఉత్ప్రేక్షించినాడు కవి. 
మధ్యలో కనబడుతుండేవి కర్ణికలు 
వాళ్ళు లంచమివ్వడానికై 
అరచేతిలో పట్టుకున్న నాణేలట.

చాలా క్లిష్టంగా రచించిన ఉత్ప్రేక్షాలంకారం. 
ఇలాంటి పద్యాలు వ్రాయడానికి చాలా తీరిక వుండాలి. శబ్దజాలం చేతిలో దండిగా వుండాలి. 
అందుకే అప్పకవి ;'నిలుకడవలయు కృతికిన్ ' అంటాడు.
రాయలది నారికేళపాకం. 
ఆయన రచనలోకి ప్రవేశిస్తే.. 
ఏదో పెద్ద గవిలోకి దూరినట్లుంటుంది. 
ఆ గవిలో కళ్ళు కనబడడం కష్టం. 
జాగ్రత్తగా ప్రయత్నించి చూస్తే మనకు ఆశ్చర్యం కలిగించే బౌధ్ధికమైన సంపద కనబడుతుంది.
ప్రబంధ కవులొకరీతిగా చూస్తే ఉత్ప్రేక్షాకవులు. 
కాని ఇటువంటి ఆశ్చర్యాన్ని కలిగించే ఉత్ప్రేక్షలు 
రాయలు తప్ప మరే కవీ చేయలేడు అనిపిస్తుంది.

ఈ పద్యంలో 
మనకు రాయలకాలంలో కూడా లంచాలు మొదలైనవి వుండేవని 
వాని తోబుట్టువులైన ఆశ్రిత పక్షపాతమూ 
మొదలైనవి సమృధ్ధిగా వుండేవనీ తెలుస్తుంది

పర్జన్య దేవతను గూర్చి చెప్పిన దాని వలన 
సమాజంలో  ఘరానా మనుష్యులు 
లంచాల కలవాటుపడి వుండే విషయం కూడా సూచితమైంది.

ఆనాడు బంగారు నాణేలు కూడా వాడేవారు. 
దీనికి ఉపష్టంభకంగా 
నాటి అనేక బంగారు పొన్నులు 
మనకు చిక్కుతూనే వున్నాయి. 

రాగీ వెండి బంగారు నాణెములు చేయడానికి 
ముఖ్యంగా వాడేవారని 
మనకు శాసనాల ద్వారా తెలుస్తూనే వుంది. 
సీసము మొదలైనవి చాలా తక్కువగా వాడేవారు కూడా.27-8-82




7 మే, 2016