11 ఏప్రి, 2017

'రాస్కోరా సాంబా,,'


ఇంటికో వుద్యోగం .. పేదలకు ఇళ్ళు..
ఇరవైనా లుగ్గంటలూ విద్యుత్తూ..
వాగ్దానాల వరాలు ఎన్నికల సమయంలో నాయకుల నోట్లో పొంగి పొర్లుతుంటాయి
అందులో నెరవేరేవెన్నో ఎవ్వరికీ తెలియదు 
ఆఖరికి వాళ్ళకు కూడా
ఒక్కొక్క నాయకుడి ఆస్తులు మాత్రం అనూహ్యంగా పెరిగి పోతుంటాయి
పేదలు పేదలే ఎప్పటికైనా..

పొద్దున్నే పేపరు తెరిచినా టీవీ ఆన్ చేసినా 
ఒకటే వార్తల వరద..
అలంకానిపల్లె నుంచీ అమెరికా దాకా ఎక్కడ చీమ చిటుక్కుమన్నా మరునిమిషంలో 
అది breaking news
ఇవేవీ లేనికాలం ఎలా వుండేది..

బాహుబలి ..గౌతమిపుత్ర.. 
వీటివలన మళ్ళీ జనాల్లో ఆ గుర్రాలు ఆ డేరాలు ఆ యుధ్ధాలు మళ్ళీ గుర్తొచ్చాయి..

రాజు గుర్రం పై ఏ ఊరెళ్ళినా .. 
వెనకే వందమంది పరివారం
వాళ్ళలో  లేఖకులొకరు
రాజెక్కడికి పోయినా పుస్తకా లకెక్కించడమే వారిపని
మంతనాలు..  రాజకీయాలు ..దానాలు.. హెచ్చరికలు 
ఓహ్ ..
ఒకటేమిటి
లేఖకుడు అన్నీ ఎక్కించేవాడు రికార్డుల్లోకి 
'రాస్కోరా సాంబా,,' అంతే
రాజు కార్యక్రమాలన్నీ వారి డైరీల్లో నిక్షిపమై వుండేవి..
ప్రజలు రాజు దైవంశ సంభూతుడని నమ్మినా 
రాజు తోచినట్లు ప్రవర్తించేది వారు కాదట .. 
అందుకు కారణం . 
నైతిక ఆధ్యాత్మిక శక్తులు .. 
ఇప్పుడు లేనివే అవి.. 
పుట్టపర్తి విజయనగర సామాజిక చరిత్ర లో విషయాలివన్నీ .. 




''చక్రవర్తికి కూడ ప్రత్యేక విలేఖరులుందురు..

ఊరు వదలినప్పుడు చక్రవర్తి వీరిని వెంట బెట్టుకొని పోవును..
రాజేదేన మాటాడును..
వారు వెంటనే దస్త్రములకెక్కింతురు.. 
ఎవరెవరిని జూచినది
యే విషయముల చర్చించినది..
యే నిర్ణయమునకు వచ్చినది
సమస్తమును వారు వ్రాసి పెట్టుదురు..
ప్రభువిచ్చిన దానములను గూడ వారు గుర్తువేతురు..
వీరికా రాజ్యమున గొప్ప గౌరవము..
ప్రసక్తి వచ్చినపుడు వారు దమవ్రాతలలోనుండి ప్రభువునకు విషయములందింతురు..
ఏ యాజ్ఞ కాని ..
రా జు వ్రాసి యివ్వడు..
దానము గూడనంతే..
అతనిది మాట.. 
వీరిది వ్రాత..
మరి ప్రతిగ్రహీతకు గుర్తేమి..?? 
చక్రవర్తి యుంగరమునకు బ్రతికృతులు కొన్ని మహాప్రధాని కడనుండును..
నాతడొకదానిని లక్కపై ముద్రించి దానము గ్రహించిన వారి కొసగును..
అతనికంతే గురుతు..
దాన వివరములు పొత్తములలో నుండును..
మహామంత్రి రాజుమొహరుల నాధికర పత్రములపై వాడును.''

8 ఏప్రి, 2017

భగవంతుడెవనిపై మైత్రి పాటించునో..

భగవంతుడెవనిపైమైత్రి పాటించు
సత్కృపానిరతి  బ్రసన్నండగుచు 
నతనికి దమయంత ననుకూలమైయుండు 
సర్వభూతంబులు సమతబేర్చి
మహిదలపోయ నిమ్న ప్రదేశములకు
ననయంబుజేరు తోయముల పగిది..

భగవంతునిదయకు పాత్రమైన వాని దగ్గరికి అందరూ తమంతతామే అనుకూలభావంతో పల్లానికి పారే నీటి వలె చేరుకుంటారు.
(ధృవోపాఖ్యానము)


6 ఏప్రి, 2017

తడివోవని పూలసెజ్జ..

శ్రీరామ నవమి.. అమ్మకు చాలా ప్రియమైన పండుగ..అసలు అమ్మ ఆరాధ్య దైవం శ్రీరాముడే! (అయ్య అష్టాక్షరీ ఉపాసకులు) అమ్మ పాటల్లో యెక్కువ శ్రీరామాంకితాలే!మా అమ్మగారి భావాలన్నీ, కోమల భావ భరితాలు..., లలిత పద బంధ సౌరభ సమంచితాలు....మీరూ చదివి, విని అనుభూతిస్తారని నా ఆశ.  వాటిలో యీ పాట, యెక్కువ ప్రజాదరణ పొందింది ఆకాశవాణి ద్వారా!  (శ్రీరామ నవమి శుభ తరుణాన, మా అమ్మ పవిత్ర స్మృతిలో..మా మూడో అక్కయ్య. డా.పుట్టపర్తి తులజాదేవి, .నా చెల్లెలు శ్రీమతి పుట్టపర్తి అనూరాధ తో కలిసి యీ పాట మీకోసం)

రాముని సేవించెనూ, ప్రేమమ్మున సకల ప్రకృతి
 రాముని సేవించెనూ...

అడవుల త్రోవల జనగా, అడుగులు కందెడునోయని,
తడివోవని పూల సెజ్జ అడుగడుగున పరచిలతలు..

రాముని..

తోయజ మకరంద ధునీ తోయంబుల మెల్లగా,
తోయజాంబకుని  మృదుపద తోయంబుల కడిగి నదులు..

శ్రీ రాముని...

తారక రాముడు రాముడు కారడవుల పయనించగ,
పోరాములు మాని ప్రకృతి గారాములు నెరపీ...
శ్రీ రాముని...

రచన : శ్రీమతి పుట్టపర్తి కనకమ్మగారు
సంగీతం డా.మాడభూషి చిత్తరంజన్ గారు
భక్తి రంజనికోసం ఆకాశవాణి విజయవాడలో
ముందుగా గానం చేసినది: శ్రీ డీ.వీ.మోహన కృష్ణ (బాలమురళిగారి ప్రియ శిష్యుడు) బృందం
ఇప్పుడు వినయపూర్వక సమర్పణ : నాగపద్మిని

4 ఏప్రి, 2017

సిద్ధులో..సాధ్యులో..చెప్పరయ్య..


ఎవ్వరు మీరయ్య..యీ భవ్య రూపముల్ ,
గన్నుల కద్భుత క్రమమొనర్చె..,
దివిజులో ..భువిజులో ..దేవతా ప్రవరులో ..,
సిద్ధులో.. సాధ్యులో.. చెప్పరయ
(అజామీళోపొఖ్యానము)


మాఅమ్మ పుట్టపర్తి కనకవల్లి ఎన్నో కృతులు రచించారు..
అంతేకాదు అద్భుతమైన సంగీతపరిజ్ఞానం కలిగివుండడంతో
వానికిరాగాలుకూర్చడం..తానేపాడటం..
మాఅక్కచెల్లెళ్ళం..
మాఇంటికి వచ్చే శిష్యులు..
ఇరుగు పొరుగు వాళ్ళు..
అందరూ సంతోషంగా నేర్చుకొనేవారు..
మాఇంట్లో మాఅమ్మ రామాయణ పారాయణం చేసేది..
శనివారం పట్టాభిషేకం..
అందరూ అమ్మ పారాయణంఅయిందా..అయిందా అని మూడు నాలుగు తిరిగేవాళ్ళు పొద్దున్నుంచీ..
మద్యాహ్నం పన్నెండు పన్నెండున్నర అప్పుడు పట్టాభిషేకం మొదలవుతుంది.. కన్నుల పండుగగా..మూడువరకూ..
ఆరామయ్యపట్టాభిషేకం నిజంగా ఇలానే అయోధ్యలో జరిగిందా అన్నంత ఆనందంగా
మాఇంట్లో జరిగేది
అందరూ అమ్మ పాటలు..అయ్య పాటలు..
ఇంకా త్యాగయ్య అన్నమయ్య ..పాటలూ పాడి పాడి అందరూ ఆనందించేవారు..
మాఅమ్మ చేతి పులిహోర ప్రసాదం అందరికీ పంచిపెట్టే వాళ్ళం..
అప్పుడు మాకు ప్రతిశనివారం రామనవమే..