9 ఆగ, 2013

విద్వాన్ విశ్వం సూచన.. పుట్టపర్తి మేఘదూత రచన ..









ఎందుకోమరి, 
నారాయణాచార్యులు కొద్దికాలం విరక్తికి లోనైనారు. 
అప్పుడే వారికి అత్యంత ప్రీతిపాత్రమైన 
విజయనగర చరిత్రను 
తనదైన శైలిలో గ్రంథస్తం చేస్తూ 
 ప్రొద్దుటూరు సమీపంలోని ఒక గ్రామంలో ఉన్నారు. 


1948-49 ప్రాంతంలో 
కుందూ నదికి వరదలు వచ్చాయి. 
వారి పర్ణ కుటీరం కూడా కుందూ ఆగ్రహానికి గురైంది. 


‘అస్త సామ్రాజ్యం’ అన్న కావ్యం వరద పాలైంది. 
పాత విరక్తికి కొత్త విరక్తి తోడైంది. 
కావ్యం కుందూ మింగేయడం 


ఆయనను బాగా బాధించింది. 


అప్పుడే 
విశ్వంగారు పుట్టపర్తివారిని కలుసుకున్నారు.
  ‘‘అప్పా! 
నాకెందుకో ఈ మధ్య పద్యరచన చేయాలంటే 
అచ్చుబాటు కావడం లేదు.


ప్రజల హృదయాల్లో నిలిచే 
కావ్య రచన చేయాలని ఉంది. 
దానికి తగ్గ వస్తువేదైనా ఒకటి సూచించు!’’ 
అన్నారట పుట్టపర్తి. 

‘‘స్వామీ! పద్యం కంటె 

మాత్రా ఛందస్సులో గేయ రచన 
అయితే బాగుంటుంది.’’ 
అంటూ మొదట రూపాన్ని సూచించి, 
తరువాతే 
తన దృష్టిలో ఉన్న ఒక వస్తువును కూడా 
నారాయణాచార్యులతో చర్చించారు విద్వాన్ విశ్వం. 

అదే ‘మేఘదూతము’గా 

తెలుగు సాహితీ వినీల వీధులలో విహరించింది. 
ఆచార్యుల వారి మేఘదూతము 
వారి అభ్యుదయ భావావేశానికి ప్రతీక. 
మానవతావాదాన్ని 
ఎలుగెత్తి చాటిన గొప్ప గేయకావ్యం.





ఇది పుట్టపర్తి వారి సరస్వతీ సంహారము 
(కన్నడ రచయిత బీచీ నవలకు పుట్టపర్తి తెలుగు అనువాదం)
 పై 1959  వచ్చిన సమీక్ష 

ఆనాటి స్త్రీ పై రుద్దిన సాంఘీక దురాచారాలకు 
ఒక నమూనా యీ నవల

కన్నడభాషలో ప్రసిధ్ధ రచయిత
"బీచీ "
పేరొందిన రచన ఇది
"పెళ్ళాన్నేం చేస్తావురా బాళప్పా..?"
అంటే 
"గొంతు పిసికి బాయిలో వేస్తాను"
అన్న వాక్యాలతో ప్రారంభమైన కథ
ఆ మాటలతోనే ముగుస్తుంది

ఈనాడు స్త్రీ స్వేఛ్చ కై 
ఎవరూ పోరాడవలసిన అవసరం లేదు
కావలసిన చదువులు చదువుతున్నారు
విదేశాలకు వెళ్ళుతున్నారు
నచ్చిన వాణ్ణిపెళ్ళాడుతున్నారు
వారి పిల్లలనూ వారి అభిరుచులకు అనుగుణంగా పెంచుతున్నారు

ఒకవేళ పెళ్ళి జరిగిన తరువాత 
భర్త ప్రవర్తన ..
ఆ ఇంటి వారి ట్రీట్మెంట్ సరిగ్గ లేకపోతే
ఎంతో ధైర్యంగా 
వివాహ బంధాలను తెంచుకొని 
స్వతంత్రంగా బ్రతకటానికీ 
ఈనాటి స్త్రీ భయపడటంలేదు

"కార్యేషుదాసీ..
కరణేషు మంత్రీ.." 
లాంటి  ధోరణులను తేలిగ్గా 
పాత చింతకాయ పచ్చళ్ళుగా  చేసేస్తూంది..

అందుకు తగ్గట్టు 
తలిదండ్రుల ఆలోచనా ధోరణీ  ఎంత మారిందంటే
భర్త చనిపోయిన తమ కుమార్తెకు 
ఇంకో భర్తను 
ఎంతో జాగ్రత్తగా బాధ్యతగా వెతుకుతున్నారు

ఆమె మొదటి భర్త సంతానమేమైనా వుంటే 
వారి పెంపకం బాధ్యతను తాము స్వీకరించి 
తమ కూతురి  సుఖ సంతోషాలకు 
తమ వంతు సహాయం చేస్తున్నారు

యువకులు కూడా 
తమ సహృదయ భావనలను ఇనుమడింపజేసుకొని 
ఒకసారి పెళ్ళయిన స్త్రీ నుదుటన 
తిరిగి కుంకుమ దిద్దటానికి వెనక్కు తగ్గటం లేదు

"పవిత్రత" అనేది
 ఆడ మగలిద్దరికీ వర్తిస్తుందనీ
అంగీకరిస్తున్నారు.
ఈనాడు స్త్రీకి ఏవిధమైన ఆటంకాలూ 
ఏరంగంలోనూ లేవు..

కానీ 
ఒకనాడు పరిస్థితి ఇలాలేదు
స్త్రీ ఒక బలిపశువు

తల్లిదండ్రుల అత్తమామల ఒడంబడికకు 
తలవూచి పుట్టింటి చెరసాల నుంచీ 
అత్తింటి చెరసాలకు తరలివెళ్ళే ఒక జీవి
అంతే

ఒకనాడు పందెంలో పెట్టబడింది
మరోనాడు అంగడిలో అమ్మబడింది
ఇంకోనాడు కారడవులకు పంపబడింది
శీలపరీక్షకు అగ్నిలోనూ దూకమన్నారు

ముసలి వరుళ్ళకు 
ముక్కుపచ్చలారని పిల్లను కట్టటం 
మనం విన్నాం

ఆ పిల్లకు 
యవ్వనం రాకముందే ఆ ముసలి చస్తే
కఠినాతి కఠినమైన నిబంధనలకు 
బలియైన కన్నెల జీవితాలను 
మనం చదువుకున్నాం

గుండు గీయించారు
బొట్టూ పూలు రంగుల బట్టలూ నిషేధించారు
తెల్ల చీర చుట్టబెట్టారు
ఉపవాసాలూ ఉప్పూ కారం లేని తిళ్ళూ తినమన్నారు
కదూ..

ఇలాంటివానిని దురాగతాలన్నారు వీరేశలింగం
కన్యాశుల్కంగా కలమెక్కించారు గురజాడ

అలాంటి ఒక కథే ఈ సరస్వతీసంహారము 
ఆ రోజులలో అందరి ఆదరణా పొందిన నవల
అందుకు తగ్గని చిత్రణతో 
మన్నన పొందిన అనువాదం
ఇప్పుడు మీరు చదవబోతున్నది 
ఆ అనువాదానికి జరిగిన సమీక్ష.. 
సేకరణ శ్రీ రామావఝుల శ్రీశైలం