31 అక్టో, 2015

పండరీ భాగవతము రచన సరస్వతీపుత్ర శ్రీమాన్ పుట్టపర్తి నారాయణాచార్యులు

పుట్టపర్తి రచనలు నా జీవి వున్నంతలో అందరికీ అందుబాటులో వుంచాలని తపన పడ్డాను. telugu thesis వారికి రిక్వెస్ట్ చేస్తూ మైల్ చేస్తే వారు ఎంతో ఆదరించారు..నేను పంపిన కంచి కామకోటి సంపాదకీయాలు ప్రచురించారు . ఇంకా పంపితే ప్రచురిస్తామన్నారు. ఇప్పుడు Teluguthesis.com లో పుట్టపర్తి గ్రంధాలు చాలావరకు లభ్యమవుతాయి.
మిత్రులారా.. పుట్టపర్తి పండరీ  భాగవతం విశ్వనాధ వెన్నోళ్ళ పొగడినది బయటికి తేవటమెలా చాలా పెద్ద పుస్తకం స్కానింగ్ చేయటం చాలా పెద్ద పని అనుకుంటూ వుంటిని అది ఈ రోజు నాకు అక్కడ దర్శనమిచ్చింది వెంటనే లింక్ తీసుకున్న్నాను. ఇదిగో..
ఇకపై పుట్టపర్తి పై పరిశోధనలు విస్తృతంగా జరుగుతాయి.. నా ఉడుతాభక్తిని దేవుడు అప్యాయంగా చేకొన్నాడు. 

                                                                                                              ముందుమాట
ఈ పండరీ భాగవత గ్రంధకర్త మహాకవి సరస్వతీపుత్ర పద్మశ్రీ శ్రీమాన్ పుట్టపర్తి నారాణాచార్యులు గారు. ఈయన ఈ గ్రంధం వ్రాసి ముప్పదియేండ్లైనదట.. ఈయన కీర్తి అంతకు ముందే మొదలుపెట్టినది. ఈ గ్రంధము మాత్రమిప్పుడు వెలికి వచ్చినది. ఇందులో పుండరీక చరిత్ర,చోకామీళుని కథ, నామదేవ చరిత్రము,గోరాకుంభారు కథ, నరహరి చరిత్రము అన్న అయిదు కథలు కలవు. మొదటి కథ పేరే ఇది. పండరీక్షేత్రమునందలి మహాభక్తుల కథల సంపుటి.
ఇది ద్విపదకావ్యము. పూర్వము మన దేశములో కొన్ని ద్విపద కావ్యములు కలవు. కొన్నింటికి కొంత మర్యాద కలదు. వేణుగోపాల శతక కర్త ద్విపద కావ్యములందు మర్యాద లేనివాడు. దానికి కారణమేమయి వుండును ? పద్యమునందున్న వైశాల్యము ద్విపదకు లేదనవచ్చును. ఒక లోతైన భావము ఒక విస్తారమైన భావము రచనా శిల్పముచేత మూర్తి కట్టించుటకు తగినంత వీలైన లక్షణము ద్విపదలో లేదని యాతడెంచినాడేమో..
కాని మన దేశములో స్త్రీల పాటలన్నియు ద్విపదలో నున్నవి. బసవ పురాణమునకు గౌరన హరిశ్చంద్రకు గల ప్రశస్తి కాదనుటకు వీలులేదు. రంగనాధ రామాయణము ద్విపద గ్రంధము. ద్విపద భారతమన్న గ్రంధము ఆంధ్ర విశ్వ విద్యాలయము వారు పూర్వమచ్చొత్తించిరి. అంద్లో చాల భాగము తిక్కన్న గారి పదాలు ద్విపదలో వ్రాసినట్లుండును. పద్య రచనకు ద్విపద రచనకున్న భేదము ఆ రెంటిని పోల్చి చుచినచో తెలియ గలదేమో..
ద్విపద యనిన తోడనే ఒక తాళము రెండు చరణములతో చెప్పదలచిన భావమైపోవుట. పాటకు వీలుగా నుండుట. సర్వ జనులకు చదువుటకు వీలుగా నుండుట మొదలైన లక్షణములుండవలసినట్లు కనిపించవచ్చును.
ఈ కావ్యములో నా లక్షణములు చాల నున్నవి. కాని ప్రౌఢి కూడా నున్నది. కొన్ని చోట్ల దీర్ఘ సమాసములు కలవు. ప్రతి చరిత్రకు చివర కవి తన కథ కొంత చెప్పి కొనుచుండెను. దాని వలననే కవిని గురించిన వాకబు చాల తెలియగలదు. 
ఈయన వ్రాసిన గ్రంధము పూర్వ ద్విపద కావ్యముల కేమియును తగ్గిపోదు. తగ్గిపోదు సరికదా కొన్నిచోట్ల పూర్వ ద్విపద రచనకు మెరుగు పెట్టినట్లుండును. 
ఈతడు కొన్నివిషయములలో నాకంటే ఘనుడు. అయినను ఈ రచనపై నా అభిప్రాయమడుగుట కేవలము స్నేహధర్మమని భావించుచున్నాను.
విశ్వనాధ సత్యనారాయణ


పండరీ భాగవతము రచన సరస్వతీపుత్ర శ్రీమాన్ పుట్టపర్తి నారాయణాచార్యులు

కామెంట్‌లు లేవు :

కామెంట్‌ను పోస్ట్ చేయండి