20 జన, 2013


స్వాంతస్సుఖాయ


ఆధునిక కవిత అభిప్రాయ వేదిక
సేకరణ 
ఆచార్య తిరుమల 
కిన్నెర ప్రచురణ ద్వితీయ ముద్రణ 2000

"సరస్వతీ పుత్రునితో సంభాషణలు "
పద్మశ్రీ పుట్టపర్తి నారాయణాచార్యుల వారి 
భావతరంగాలు సంకలనం 
ముద్రణ :పుట్టపర్తి నాగపద్మిని



తెలుగులో ఆధునిక కవిత్వం ఎప్పటినుంచి మొదలయిందని మీ రను కుం టు న్నా రు  ..?  



ఆగ్లంలో కీట్స్,షెల్లీ వీరిద్దరి కాలాన్నీ Renaissance age అంటారు. అంతకు ముందున్నవారంతా ఏదో ఒక కావ్య వస్తువుని తీసికొని రచన చేస్తూ వచ్చారు. అది కడౌ శుష్క రచన అయినా 'pope' వరకూ వచ్చింది షెల్లీ కీట్స్ ల ప్రభావం Tagore పైన సమృధ్ధిగా పడింది. ఆయనకు నోబుల్ ప్రైజ్ రావడంతో ఆయన రచనలు విపరీతంగా ప్రచారమయ్యాయి. ఆ కాలంలో వచ్చిన కవిత్వమంతా దాదాపు టాగూర్ అనుకరణమే. దీన్ని ఒక రకంగా 'ఆత్మాశ్రయ' కవిత్వమని పిలుస్తారు. తెలుగులో 'భావ కవిత్వం' అంటూ వచ్చారు. ఆనాడు భావ కవిత్వాన్ని నడిపిన అతిరధ మహారధులు చాలా మంది ఉన్నారు.


ఆధునిక కవిత్వం అంటే మీ దృష్టిలో ఏమిటి..?


నేననుకొనేది ఆధునిక కవిత్వమనేది ఆత్మాశ్రయ కవిత్వం తో మొదలైనదే. తరువాత తరువాత సామాజిక స్పృహ అనే మాటను ఎక్కువ అలవాతు లోనికి తెచ్చినారు. ఎప్పుడు ఈ మాటను ఏ మహాను భావుడు వాడాడో కానీ అప్పటినుండీ ఈ మాట భాషలో స్వైర విహారం చేస్తూ వచ్చింది వాళ్ళకు తోచిందంతా రాసి సామాజిక స్పృహ అనే తెర వెనుక ఎందరో అనక్షరాశ్యులు అల్పాక్ష్యరాస్యులు స్వైరవిహారం చేస్తూ వున్నారు. సాహిత్యం లోకి రాజకీయాలు చొచ్చుకొని వచ్చి ప్రతిభ లేని వాళ్ళకు కల్పవృక్షం లాగా తయారయ్యాయి. ప్రతి ఒక్కడూ ఏదో ఒక రాజకీయపు గొడుగు క్రిందకు దూరటం ఇదంతా కవిత్వమని ప్రజల నెత్తిన రుద్దడం జరుగుతూంది. కనుక ఇప్పుడు ఆధునిక కవిత్వం అంటే నా దృష్టిలో రాజకీయ కవిత్వమని అర్థం.


1981 లో చందో బధ్ధ కవిత్వం రాసేవాళ్ళు 
ఏ తెగకు చెందిన కవులవుతారు.?


ఛందోబధ్ధ వ్రాయాలంటే సామాన్యమైన శక్తి చాలదు కొంత వ్యుత్పత్తి దానికవసరం కాని ఈనాటి రచయితలనేకులకు ఈ వ్యుత్పత్తి కొత్తపదంగా కనిపిస్తుంది. ప్రాచీన కాలంలో కూడా అందరూ సాంకేతికాలైన ఛందస్సులో రచన చేయలేదు. స్వతంత్రాలైన ఛందస్సు రచన చేసిన వాళ్ళు ప్రాకృతంలో ఎంతో మంది ఉన్నారు. తెలుగులోనూ వున్నారు. కాని ఈనాడు ఛందస్సును వెక్కిరిస్తూ ఉండేవాళ్ళల్లో ఛందస్సులో వ్రాసే దమ్ము చాలక దాన్ని అవహేళన చేస్తూంటారనే నా నిజమైన అభిప్రాయం. సాంకేతికమైన ఛందోబధ్ధం కాని కవిత్వమంటే నాకు అసహ్యమేమీ లేదు కానీ ఛందోబధ్ధమైన కవిత్వాన్ని అసహ్యించుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు వాళ్ళను చూస్తే నాకు జాలి వేస్తుంది.



నేను రెండు తెగల కవిత్వాలూ వ్రాసాను. వ్రాస్తున్నాను కూడా నా చిన్నతనంలో సాహిత్య సృష్టి చేసిన వాళ్ళంగరినీ ఏదో ఒక శాస్త్రంలో పాండిత్యం ఉండేది. శాస్త్ర గంధం లేని సాహిత్యాన్ని వాళ్ళు గొడ్డు సాహిత్యమనే వాళ్ళు రాగ రాగ సాహిత్యంలో కూడా జ్ఞానం పోయింది. దీంతో ప్రతిభా శక్తి లేని ఎందరో కవులు అనిపించుకొనేవారు మేం మేం అని  ముందుకు వస్తున్నారు.





ఆధునిక కవులంతా పనికిమాలిన వారని నేనడం లేదు నారాయణరెడ్డి దాశారధి గుంటూరు శేషేంద్ర శర్మ వంటి ప్రతిభావంతులెందరో ఉన్నారు ఛందోబధ్ధ కవిత్వంలో ప్రత్యేకతను ఏర్పరచుకొన్న వానమామలై వంటి వారూ ఉన్నారు కాని ఇట్టి వాళ్ళు తక్కువ.


వ్యాకరణం నడుములు విరగ్గొడతామని సంప్రదాయం ప్రాణాలు తీస్తామనీ వెర్రి కేకలు వేసేవాళ్ళు చాలా మంది అయిపోయారు. వారి దృష్టిలో వారు పలికిందే కవిత్వం ఒకరు వ్రాసిన దాన్ని మరొకరు చదవరు చదవడానికేముంటుంది కనుక..? అసలు సభల్లో కవిత్వం చదవడమనేది నా దృష్టిలో పెద్ద దురభ్యాసం. కవిత్వమనేది ఆలోచనామృతమైనది. అలాంటి దాన్ని సభల్లో చదివినప్పుడు గాఢంగా అనుభవించే వాళ్ళు ఎంతమంది ఉంటారు ఎంత అవకాశం ఉంటుంది. వాళ్ళకర్థమయ్యే భాషలో వాళ్ళందుకొనే భావాలు చెబితే చాలామంది చప్పట్లు కొడతారు. ఎంతమంది ఎక్కువగా చప్పట్లు కొడితే ఆ వ్రాతగాడికి అంత ఆనందం. దానితో తాను కృతార్థుడైనట్లు సామాన్యులకే భావాలర్థమవుతాయని శాబ్దికాలైన చమత్కారాలూ అవహేళనలూ పరిహాసాలూ నిజ జీవితంలో పది పైసలు బిచ్చగానికి వేసి ఎరుగని వాడు కూడా వాని పక్క నడు కట్టి అయ్యో నాయనా ఎంత కష్టాపడి పోతున్నావని ముసలి కన్నీరు కారుస్తారు.నాదృష్టిలో ఎవ్వరేమనుకున్నా ఇది క్షీణయుగం. ఇది చాలాకాలం ఉంటుందన్న నమ్మకం నాకు లేదు.



అనేకులు పాశ్చాత్య దేశాల్లో పాతబడిపోయిన రంగులన్నీ పులుముకొంటున్నారు. అన్నిటిలోనూ ఈ దశ కనబడుతోంది. అంటే సంగీతంలో సినిమాల్లో చిత్రలేఖనంలో ఇంకా అనేకాల్లో ఈ స్థితిలో ఛందస్సులో కవిత్వం వ్రాసేవాళ్ళు ఏ తెగ వాళ్ళంటే నేనేం చెప్పేది. వాళ్ళు ఛందో బధ్ధమైన కవిత్వం వ్రాసేవాళ్ళు. ఒక సంప్రదాయాన్ని ఆదరించే మనస్తత్వం గలవాళ్ళు. బ్రతుకులో వ్రాతలోనూ కూడా తక్కిన వాళ్ళు తెగిన గాలిపటాలు. ఈ నా భావాలు చాలా మందికి సరిపోవని నాకు తెలుసు కాని నేనేం చేసేది.




సంప్రదాయానికి విరుధ్ధంగా రాసేదే ఆధునికమవుతుందా..?



మన దేశంలో సంప్రదాయమూ ధర్మము రెండూ ముడిపడి వున్నాయి. కవిత్వం యొక్క ప్రధాన లక్షణం ధర్మాన్ని బోధించడమే కాదు ఆ కార్య నిర్వహణానికి ధర్మ శాస్త్రాలు స్మృతులూ మొదలైన ఉపకరణాలున్నాయి. కనుక కవిత్వం అనేది ధర్మ నిర్వహణలో పెద్ద ఉపకరణమేమీ కాదు అట్లానే ధర్మాన్ని పూర్తిగా ఉల్లంఘించటం కూడా యోగ్యతను మీరిన అధిక ప్రసంగమవుతుంది. కవిత్వం యొక్క ప్రధాన లక్ష్యం దానిని చదివే సమయంలో బాహ్యములను మరచిపోయి దానిలో లీనమయ్యేటట్లు చేయడం. ఆ రీతిగా చదివినప్పుడు ఒక సంస్కారం మనకు ఏర్పడుతుంది. దానితో మనసు విశాలం అవుతుంది. అందుకే పెద్దలు రసానుభూతిని 'బ్రహ్మానమద సద్ బ్రహ్మచారే' అన్నారు.


కావ్యంలో నాయికా లక్షణాలున్నాయి పరకీయ నాయికలనే తీసుకున్నారు అభిసారికా వర్ణనలు అక్కడక్కడా కావ్యాల్లో వస్తాయి. కాళిదాసు రఘువంశంలోనే వర్ణించాడు ఇంకా అనేక కావ్యాల్లో వస్తాయి. అందులో కొంత అనీతే అంతర్గర్భితమై ఉన్నదనుకొందాం. ఇవి ఏవో సామాన్య విషయాలు. లోకంలో సర్వత్రా కాకపోయినా ఎక్కడో ఒక చోట జరిగితే జరగవచ్చు అటులనే సంప్రదాయాన్ని సమూలంగా ఖండించి విశృంఖలత్వాన్ని ప్రేరేపించే రచనల్ని చేసి ఇది ఆధునికత అని ఎద గుద్దుకోవటం బుధ్ధిలేనిపని
చాలా దినాల క్రిందనుకుంటాను ఏదో ఒక కావ్యమో కథో చదివాను. అందులో అశోకవనంలో ఉన్న సీత రావణాసురుణి ప్రేమను చూచి జాలిపడి అతనిని కౌగిలించుకోవటానికి తయారవుతుంది. నా మనస్సుకు చాలా నొప్పి కలిగింది. మన మనస్సే మన రచనల్లో అభివ్యక్తమౌతుంది. ఎక్కడో ఎవ్వరో వ్రాస్తే చదివానో ఘట్టం భరతుడు శ్రీరాముని పాదుకలను నెత్తిమీద పెట్టుకుని వచ్చేది. చెప్పులు మోసేవాడు వీడేం మనిషి అన్నాడాయన రచయిత మనస్సలాంటిది. మరి రాముని చెప్పులపైనే దేశికులు పాదుకా సహస్రము వ్రాసినారు. ఆ పాదుకలను మనం పూజిస్తున్నాం. 
ఇలా మాట్లాడే వాళ్ళంతా ఆటవిక మనస్తత్వులని నా కనిపిస్తుంది. వారూ మమ్మల్ని అదే మాటంటారనుకుంటున్నాను అస్తు. నాకేమీ నొప్పిలేదు. కాని దీన్నంత ఆధునికత అని వాదిస్తే మాత్రం నా మనస్సంగీకరించదు.


ఉన్నపధ్ధతిని విడిచి కొత్త పధ్ధతిని పాటించడమేఅ ఆధునికత అయితే పాల్కురికి సోమన నుండి ఉంది. దాని మాటేమిటి..?


కొత్తపధ్ధతిని పాటించడమనేదినేడే కాదు ఎప్పుడూ ఉంది. ప్రాకృత కవులు కొత్త ఛందస్సులు వ్రాసినారు. తమిళ కన్నడ మలయాళ లలో కూడా ఎన్నెన్నో కొత్త ఛందస్సులున్నాయి. ప్రతిభావంతుడైన వాడు ఓ కొత్త మార్గాన్ని వెతుక్కుంటాడు. తన వైలక్షణ్యం స్థాపించుకోవటానికి వాని వైలక్షణ్యం శబ్దాలలో అర్థాన్ని చెప్పే భంగిమలో ఏరుకున్న ఛందస్సులో ప్రతిభాసిస్తూ ఉంటుంది. కాని వాడేది చెప్పిన సంప్రదాయాన్ని నరికి వేయడానికి ప్రయత్నం చేయడు. పాల్కురికి సోమనాధుడు ద్విపదలు వ్రాసినా వీరశాఇవ సంప్రదాయాన్ని దాటిపోలేదు. జైనులూ బౌధ్ధులూ వారికిన్ని సంప్రదాయాలున్నయి అవి మనకన్నా భిన్నమైనవి కావచ్చు అట్లే పాశ్చాత్యులకు భిన్న సంప్రదాయాలునాయి అవి వాళ్ళకు అరుగుతాయి. కాని ఆరంగులన్నీ మనల్ని పులుముకోమనడం మాత్రం అహర్షించదగ్గ విషయం కాదు. 
ఒక్కొక్క జాతికి ఒక్కొక్క సంప్రదాయం ఉంటుంది. అది రూపొందించడానికి ఎన్నెన్నో కారణాలు సామాన్యమైన మానవజన్మ అందరూ అవలంబించవలసిందే. కాని ఆ పేరు పెట్టుకుని నీ సాంప్రదాయాన్ని తుంగల్లో తొక్కి వాళ్ళ సాంప్రదాయాన్ని అనుసరించవలెననేది కోరదగిన పధ్ధతి కాదు. 



ఆధునికత అన్నది ప్రక్రియను అనుసరించా..? వస్తువుని అనుసరించా..? 

ఈ ప్రశ్నే నా కర్థం కావడంలేదు. కవితా రచనలో ఎప్పటికప్పటికి ఆధునికత ఉండనే ఉంటుంది. ప్రతిభావంతుడైన కవి తన స్వంత ముద్రను ప్రతిదాన్లో వేస్తాడు ఈ ఆధునికత శబ్దంకి ఆధునా అనే శబ్దంతో సంబంధం ఉంది. ఆ దృష్టితో చూస్తే ఈ కాలంలో ఏవేవో కొత్త వస్తువులను ఎన్నుకొంటున్నారు. అందరి కలాలు బీదవానిపైనా వాని జీవితంపైనా సానుభూతిని ఒలకబోస్తున్నాయి. దానికి తగిన ప్రక్రియలు కూడా వేతి వేటినో ఎన్నుకుంటున్నారు. సాగుతూంది కాలం ఈ రచనల ఆయుష్షెంతో భావికాలం నిర్ణయిస్తుంది.

ఆధునిక కవిత్వంలో కవికి 
సామాజిక స్పృహ కట్టుబాటు అంటే కమిట్మెంట్ లాంటివి 
ఉంటే తప్ప అది కవిత్వం కాదు. 
అన్న ధోరణిని మీరెంత వరకు సమర్థిస్తారు.?

ఈ సామాజిక స్పృహ అనే పదం కల్పవృక్షం లాగా కనిపిస్తుంది. వాడు ఏ చెత్త వ్రాసినా సామాజిక స్పృహ అనే గొడుగు కింద చేరి బ్రతికి పోతున్నాడు. ప్రాచీనులకు సామాజిక స్పృహ లేనట్లు వీళ్ళకే ఉన్నట్లు పోజులు కొడుతు వుంటాడు పూర్వకాలంలో కూడా ప్రతి రచయితా సామాజిక స్పృహ అంతో ఇంతో ఉన్నవాడే వీళ్ళు వ్రాసే రచనల శారీరమెంత ఒక పది లైన్లు. మహా అయితే ఒక ఇరవై లైన్లు. ఉన్నదంతా సామాజిక స్పృహే అది తీసేస్తే రచన ఏమైనా ఉంటేకదా..

మీరు రాసేటప్పుడు మీ కమిట్మెంట్ ఏమిటి? 
మీ కవిత్వ సిధ్ధాంతం ఏమిటి?

నా కమిట్మెంట్ ఆస్తికతా బుధ్ధిని ఎక్కువ చేయడం ఈ భావాలకు సనాతన భావాలనే ఒక బిరుదు తగిలిస్తారని నాకు తెలుసు నాకూ అప్పుడప్పుడూ సామ్యవాదం పై మనసుపోతుంది కాకపోతే ఒకప్పుడు మన దేశంలో కూడా ఉన్నదే ఇది ఏవేవో కొత్త కొత్త పేర్లు తగిలిస్తున్నారు. బీదవాణ్ణి దోచుకోవడానికి మన సమాజం ఎప్పుడూ అంగీకరించలేదు. ఇవన్నీ పాశ్చాత్య దేశ వర ప్రసాదాలే. కాకపోతే పుణ్యమనీ పాపమనీ కర్మ నీ ప్రారబ్ధమనీ మాటలాడుతూ వచ్చారు. ఏది ఎట్లున్న నేను ఈ విషయంలో వాదానికి దిగను. నాకు రాజకీయాలంటే వెగటు. దైవమున్నాడనే భావం నన్నెప్పుడూ పీడిస్తూ ఉంటుంది. వాడు లేడని నేటి సైన్సులు ఇతర శాస్త్రాలు కానీ నన్నొప్పించలేవు. ఎప్పటికైనా మిగిలేభావం అదేనని సంపూర్ణ విశ్వాసం నాకుంది. సైంటిస్టులు అప్పుడప్పుడు చెప్పే మాటలు కూడ నా భావాలకే బలం ఇస్తున్నాయి.

కమిట్మెంట్ అవసరం లేదంటే కవి ఎందుకు రాస్తున్నట్లు ?
ఆత్మానందం కోసమా? 
అయితే ఎందుకు ముద్రించాలి.?

కమిట్మెంట్ లేకపోతే ఎందుకు రాస్తున్నట్లు అని ప్రశ్న ఆత్మానందం కోసమే వ్రాసినా తనతో సమాన మైన ధర్మం కల మనస్తత్వలకోసం వ్రాస్తారు. అందుకే ముద్రిస్తారు. ఏ రచన కూడా మెడకాయ పైన తలకాయ గల ప్రతి ఒక్కడూ చదవడు కదా.. అంటే ఎప్పటికేనా రచన యొక్క ప్రాపకం పరిమితమే. వాడు వాడు వాని వాని మనస్సంస్కారాన్ని బట్టి తనకు నచ్చినదాన్ని చదువుకొంటాడు. 


కాలానుగుణంగా ధనవంతులు మధ్య తరగతివారు పేదవారు అన్న తేడా లేకుండా దాదాపు అన్ని తరగతుల వారు ఒకే రకమైన కవిత్వం రాస్తూండటం కనిపిస్తుంది. అంటే శ్రామిక కార్మిక పీడిత తాడిత జనబాధల్ని గురించి అనుకోండి అప్పుడు ఎక్కడో ఒక వర్గం లో అనుభవం లేకపోవడం వల్ల చిత్తశుధ్ధి స్పష్టత లోపించవచ్చు అటువంటి పరిస్తితులలో కవిత్వాన్ని గుర్తించటానికి తగిన కొలమానాలేమిటి
కవి యొక్క జీవితం రచనలో ప్రతిఫలిస్తుందని ఇంతకు ముందే చెప్పినాను ఒకానొక కాల్మలో కవికి కవిత్వానికి తేడా వుండేది కాదు. తాను నడిచే జీవితానికంటే భిన్నంగా కవిత్వం రాసేవాడు కాదు కవి ఒక కవి జీవితం చదివితే వాని జీవితం ఇట్లుంటుందని ఊహించడానికి శక్యంగా ఉండేది కాని ఈనాడది పోయిమిది. అంటే చిత్తశుధ్ధి లేదన్నమాట. బ్రతకడానికి గుండెకాయ ఉంది. కాని దాన్ని చిత్తమనలేము కదా అందువల్ల ఈనాటి కవుల కవిత్వాన్ని అర్థం చేసుకోవటం కష్టం ఏవో రాజకీయాలు మనసులో పెట్టుకొని వ్రాస్తారు. పూర్వకాలంలో ఈ ప్రశ్నకు చోటుండేదికాదు. ఇప్పుడు ప్రశ్న కావలసివచ్చింది. కాలాన్ని బట్టి కవిత్వం వ్రాసేవాడు సామాన్యునిలో చేరిపోతాడు. తన కాలానికి ఒక కర్తవ్యాన్ని బోధించేవాడు కవి. ప్రాచీనులు అలానే చేసేవారు. నన్నయ భారతాన్ని వ్రాశాడు. అంటే ఆనాడు జనులకు వైదికత్వం బోధించే అవసరం ఉండేది. పోతన భాగవతం వ్రాశాడు అంటే ఆనాడు అందరూ భక్తులుగా ఉండేవారని అనుకొంటామా. ఆయన మహాక్రాంతి కాలంలో రచన చేసాడు. ఎందుకు కొందరినైనా భక్తులుగా మారుద్దామని. ఇది ఆనుషంగికమైన ఫలమే. ప్రధానమైన ఫలము సూరదాసన్నట్లు స్వాతస్సుఖాయ.

కవిత్వ జీవితానికి వ్యాఖ్యానంగా ఉండాలంటారు కదా 

మీరు ఏకీభవిస్తారా..?
మామూలుగా జీవిత పరిధిలోకి రాకుండా అనుభవించే 
వివిధ ఆనందాల మాటేమిటి.?
అవి మాటలకందవుకదా ..
అప్పుడు కవివం అసంపూర్ణ కళ అనవచ్చా..?
 అలా కాక ఆనందం కూడ జీవితంలో భాగమే అనుకుంటే 
రాక్షసానందం(హింసాత్మకమైన ఆనందం)మాటేమిటి..?
అదికూడా జీవితంలో ఒక భాగమని ఒప్పుకుంటే 
దాన్ని వర్ణించటం కూడా వాస్తవిక చిత్రణే అవుతుందా..?
అప్పుడు జీవితంలోని అసౌందర్యాన్ని వర్ణించటం 
ఔచిత్యం కావచ్చు కదా. 
కాబట్టి అసౌందర్యం కూడ కవిత్వంలో భాగమని ఒప్పుకుంటారా..?
అలా ఒప్పుకుంటే ఔచిత్యానికి మీరిచ్చే నిర్వచనం ఏమిటి..?
 దిగంబర కవితా ప్రక్రియ మీద మీ మాట ఏమిటి..?


ఎవరి జీవితానికి తన జీవితానికి వ్యాఖ్యానమని అర్థమా కవిత్వం జీవితాన్ని ఇలా ఉండాలని నిర్దేసిస్తుంది. ఈ విషయాన్నే కాంతా సమ్మితయా ఊపదేశ యుజే అని పూర్వులు వ్య్యఖ్యానించినారు ధ్వనికారుని వంటి వాళ్ళు కవిత్వానికి ఆనందమే ప్రధాన ఫలమన్నా ఆ ఆనందం కూడా ఉదాత్తంగా ఉండాలన్నది వారి అభిప్రాయం కనుక ఎలాగు చూచినా కావ్యం ఉపదేశం క్రిందకే వస్తుంది. మనస్సుకు గొప్ప సంస్కారాన్ని ఇచ్చి దాని ద్వారా జీవితాన్ని ఉదాత్తంగా మార్చడానికి ప్రయత్నం చేస్తుంది.

వాడు చేసే రచన అంతా వాని జీవితానికి వ్యాఖ్యానంగా ఎట్లా ఉంటుంది. కొంత మాత్రమే రచనల్లో వాని వాని జీవితం ప్రతిఫలిస్తుంది. అటువంటి జీవితాలు కలవాళ్ళే వాటిని చదువుతారు లేకుంటే అటువంటి జీవితాలను ప్రేమించే వాళ్ళు అంతేగాని రచనంతా వాని జీవితమే అయితే దాన్నుంచీ ఇతరులు నేర్చుకోవలసింది ఏముంటుంది. ఇతరుల జీవితాలు కూడా అందులో వుంటాయి. కనుకనే నలుగురూ దాన్ని చదువుతారు.



భావ కవిత్వం నుండి తీసుకుంటే భావకవిత్వం గానీ అభ్యుదయ కవిత్వం గానీ ఆ త్qఅర్వాత వచ్చిన అతి నవ్య కవితా ధోరణులు అంటే అధివాస్తవికత అరాచక వైచిత్రీ ప్రియత్వ నిరాశావాదాలు విశృంఖల కామ భావం మొదలైనవన్నీ మనకు విదేశాల నుంచి ముఖ్యంగా పాశ్చాత్య దేశాలనుంచీ వచ్చాయి కదా మరి వాటి వల్ల మన తెలుగు సాహిత్యం పరిపుష్టమయ్యిందని మీరు అనుకుంటున్నారా..?
అనుకుంటే ఎందుకు..?
ఎలా..?
అనుకోకపోతే ఇంత కవిత్వం కళ్ళ ముందు కనిపిస్తోంటే దాని ప్రభావాన్ని  కాదనటం ఎలా..?

పాశ్చాత్య దేశాలనుండి ఎన్నో దురభ్యాసాలు మనకొచ్చాయ్ వాళ్ళల్లో మంచి లేదని కాదు మనం వాళ్ళ దురభ్యాల పైనే దృష్టిని కేంద్రీకరించినామేమో అనిపిస్తుంది. ఈ నడుమ ఎన్నెన్నో ధోరణులు తెలుగులో వచ్చినయ్ అవన్నీ పాశ్చాత్య దేశాలనుంచీ దిగుమతి చేసుకున్నవే ఇక్కడ కూడా వాటిలో కొన్ని చ్చ్చాయ్. కొన్ని చస్తూ వున్నాయ్ ఇవన్నీ స్తిరంగా వుంటాయని ఆశించడం వారి అమాయకతకు గుర్తు. కాలం మన వంటి అజ్ఞాని కాదు. తనకు కావలసింది ఏదో దాన్ని నిలుపుకుని తక్కున దాన్ని చెరిపి పారవేస్తుంది. ఈ ప్రబుధ్ధులు ఆ శవాలను నెత్తిపై వేసుకున్నారు.


ఆధునిక సాహిత్యంలో కొన్ని వాదాలు 

అంటే మానవతా వాదం అనుభూతి వాదం 
ఇలా రక రకాల వాదాలు ఉన్నాయి కదా..! 
వీటిమీద ఎవరి అభిప్రాయాలు వారు చెప్పటం వలన 
ఇదమిధ్ధమైన ఒక అభిప్రాయం కుదరలేదు..! 
మీ దృష్టిలో ఆధునిక సాహిత్యానికంతటికీ 
అన్వయించే సూత్రం లేదా వాదం ఉందా..?
ఉంటే మీ నిర్వచనం ఏమిటి..?
లేదంటే మీ రచనల్లో ప్రధానంగా ఉన్న అభిప్రాయం ఏమిటి..?

నా రచనల్లో ఉన్న అభిప్రాయం ఇంతకు ముందే చెప్పినాను. 


సాహిత్యంలో అభిప్రాయ భేదాలు ఎన్నో ఉంటాయ్. బుధ్ధులు కూడా ఎన్నో కదా.. ఈ కాలంలో 40 పేజీల పుస్తకం వ్రాసిన వాడంతా నాదొక సిధ్ధాంతం అని ముందుకు వస్తాడు. డెమొక్రసీ కదా..కానీ తన అభిప్రాయం చెప్పడంలో వానికెంత స్వాతంత్ర్యం వుందో దాన్ని ఆచరించడంలో చదువరులకు కూడా అంతే స్వాతంత్రం వుందని గుర్తుంచుకోవాలి

ఆధునిక సాహిత్య సృష్టి చేయడానికి ప్రాచీన సాహిత్య పరిచయం అనవసరం అంటారు కొందరు. వ్యుత్పత్తి లేకుండా ప్రతిభ మాత్రం ఉంటే మంచి కవిత్వం రావటానికి వీలుందా మీ అనుభవం ఏమిటి మీ ఆదేశం ఏమిటి

వ్యుత్పత్తి లేకుండా కేవలం ప్రతిభ మాత్రమే ఉంటే అది చాల మందికి అంగీకార యోగ్యంగా ఉండదు. అందుకే ప్రాచీనులు ప్రతిభకు పట్టాభిషేకం చేసినా నిపుణత లోక శాస్త్ర కావ్యాదులను అభ్యాసం చేయడం మొదలైన కారణాలు చెప్పినారు నా మట్టుకు వ్యుత్పత్తి లేని రచనలపైన గౌరవం ఉండదు. మీ ప్రశ్నలో మంచి కవిత్వం అనేచోట ఈ మంచేమిటో మీరే వ్యాఖ్యానిస్తే బావుండేది.
నా దృష్టిలో కవిత్వం ఆనందదాయకంగా ఉండవలె అంతేకాకుండా ఉపదేశ పూర్వకంగా కూడా ఉండవలె. కేవలం ఆనందాన్ని మాత్రం అందించే రచనలు పూర్వకాలంలో కూడా వచ్చాయి. కానీ అవన్నీ కూడా పోయినాయి. కుమార సంభవం లో కాళిదాసు పార్వతీ పరమేశ్వరుల శ్రంగారాన్ని వర్ణించినాడు దాన్ని ఎందరో ఆలంకారికులు ఆక్షేపించినారు కానీ ఆయన అతిలోక ప్రతిభావంతుడు కనుక ఆ దోషలేశం ఉన్నా కాలంలో నిలువ గలిగినాడు. వాని కిష్టమైన భావాలన్నీ చెప్పి ఇందులో ఆనందం ఉంది కగా అంటే వానితో ఇష్టపడే మనస్తత్వం నాకు లేదు.

ఆధునిక వచన కవిత్వానికి మీరేదైనా లక్షణం చెప్పగలరా..?

ఆధునిక కవితలు నేను ఎక్కువగా చదవను అందువల్ల వాని యొక్క లక్షణం నేనేం నిర్వచించేది? ఆధునికుల్లో కూడా నా మనస్సును కరిగించే వారున్నారు. వాటిని కేవలం కవిత్వంగా మాత్రమే నేను చదువుతాను. అందులో ఆధునిక ప్రాచీన కవిత్వం అనే వింగడింపు లేదు. నన్నాకర్షించే గుణం ఉంటుంది కనుక చదువుతాను.

ఇప్పుడు మినీ కవితలని వస్తున్నాయి 
వాటిమీద మీ అభిప్రాయం ఏమిటి?

మినీ కవిత్వాలు అప్పుడప్పుడూ చెబుతూ ఉంటారు. ఏమో నాకు అయోమయంగా ఉంటుంది. ఒక అంత్యప్రాస తప్పితే మధ్యలో ఏమేమో చేరుస్తున్నారు. కవిత్వమనేది ఇంత తక్కువ పదార్థమైపోయిందా అనిపిస్తుంది నాకు. ఒకసారి నా సన్మానంలో ఒక నూరు మంది వరకూ కవితలు వ్రాసినారు. అప్పటికప్పుడు సభలో కూర్చుని వ్రాసిన ఘనులు కూడా ఉన్నారు. అందరూ కవులే. కవిగా సంపాదించుకోవలసిన పదార్థం వారి దృష్టిలో ఏమీ లేదు. చేతిలో కాగితం కలం ఉండాలంతే. ఇవన్నీ ఏమిటి ఏవో మర్కట చేష్టలు. శరీరాన్ని బట్టి కవిత్వాన్ని నిర్ణయించడం గొప్ప భావం కాక పోయినా వారు చెప్పేందుకేమీ లేదు కనుక అది కవిత్వం కాదంటున్నారు. ఏదో చమత్కారం మాత్రం ఉంటుంది. చత్కారం కాక రసానుభూతిని కలిగించే మినీ కవితలు ప్రాకృతాల్లో ఎన్నో ఉన్నాయ్.


కవికి కల్పించే అధికారం లేదు. 
ఉన్నదున్నట్లు గా చెప్పటమే ధర్మమన్నప్పుడు 
ఆ చెప్పినదాన్ని కవిత్వమని ఎదుకనాలి?
అప్పుడు వాడు కవి ఎలా అవుతాడు?

ఉన్నది ఉన్నట్లు చెబితే అది కవిత్వం ఎలా అవుతుంది కల్పన కవిత్వానికి ప్రాణం ఉన్నది ఉన్నట్లు చెప్పే పుస్తకాలు శాస్త్రాలు కాని కవి చేసే కల్పనలో లోకంతో ఏమీ సంబంధం లేనిది ఆకాశ విహారంగా ఉండరాదు. కవిత్వమనేది నియతికృత నియమరహితమైనది అనన్య పరతంత్రము కూడా.
శబ్దాలు పాతవే అర్థాలు పాతవే గ్రధన కౌశలంతో ఒక్కొక్క మహాకవి తన వ్యక్తిత్వాన్ని నిరూపించుకుంటాడు. స్వభావోక్తి కవిత్వమే అవుతుంది. స్వభావోక్తి అంటే ఉన్నది ఉన్నట్లు చెప్పటం కాదు. ఉన్నదాన్ని శిల్పంతో రంగరించడం.

కవిత్వంలో శిల్పం అంటారు.. 
అంటే ఏవిటో ఒక్క ఉదాహరణతో చెప్పగలరా..?

శిల్పమనేకరీతులుగా ఉంటుంది. శబ్దకృత శిల్పమూ అర్థకృత శిల్పమూ రెండు ప్రసిధ్ధమైనవి ఒక్కొక్క పదంలో కూడా ఎంతో శిల్పం ఉంటుంది. కాళిదాసు కుమార సంభవంలో శైలాధిరాజ తనయా నయయౌ నతస్థే అంటాడు. 
నయయౌ అని నిలిపినప్పుడు నిలిపిన దాన్ని మరలా ఎత్తుకుని నతస్థీ అనడం ఎంతో గొప్పగా ఉంది. ఒక సెకండు ఆగి మరలా కదిలిందని అర్థం ఇలా ప్రతిభావంతుడైన కవి ఎంతో శిల్పాన్ని చూపిస్తాడు. సన్నివేశ శిల్పం కూడానూ మహాకవుల రచనలను చదివేటప్పుడు ఈ శిల్పాన్ని అవగాహన చేసుకొనే రసవంతమైన మనసు కావాలి. అది లేకపోతే మహాకవి ప్రయాస వ్యర్థమౌతుంది. 


ప్రజా కవిత్వమంటే మీ దృష్టిలో ఏమిటి?
ఇటీవలి వారిలో ప్రజాకవులుగా మీరెవరినైనా పరిగణిస్తారా?
ఎందుకు?

నా దృష్టిలో ప్రజాకవి అని వేరే వింగడింపు లేదు అన్ని రచనలూ ప్రజలకోసం ఉండేవే అధికార విశేషాన్ని బట్టి వాడు వాడు రచనలను చదువుకుంటాడు. ఈ ప్రజా సాహిత్యమని చెప్పబడే వాటిలో మాత్రం వివక్ష లేకుండా అన్నీ అందరికీ అర్థమవుతున్నాయా? తప్పెటకొడితే కొందరికి సంతోషం దాసరి వాడు సంఖం పూరిస్తే కొందరికి సంతోషం లైట్ మ్యూజిక్ అంటే కొందరికి సంతోషం ఏ పినాకపాణి గారెఒ బాలమురళి గారో పశుపతి గారో పాడితే కొందరికి సంతోషం అందుకే నేనింతకు ముందన్నది అధికార భేదమని పురజనులకూ గిరిజనులకూ వీళ్ళు రాసే ప్రజా కవిత్వాలు ఎంతవరకు అర్థమవుతాయి. ప్రజల్లో ఎరుకలు ఏనాదులు కూడా ఉన్నారు కదా అందరికీ పనికి వచ్చే రచన బ్రహ్మదేవుడు కూడా చేయలేడు. ప్రజాసమస్యలు అంటే కూడూ గుడ్డా రెండూ మాత్రమే కాదు ఇంకా ఎన్నెన్నో ఉన్నాయి.

భావ,అభ్యుదయ విప్లవ కవిత్వాల కోవకు చెందని 
శ్రీ జాషువా శ్రీ దువ్వూరి వంటి వారి స్థానాలేమిటి?

జాషువా పదశిల్పాన్ని బాగుగా ఎరిగినవాడు. ఆయన చెప్పిన అర్థానికంటే చెప్పేది బావుంటుంది. దువ్వూరి వారిలో పారశీక కవిత్వ ఛాయలు అక్కడక్కడా తొంగి చూస్తూ ఉంటాయ్. మన భాషకు ఆ భావాలు కొత్తగా ఉంటాయ్.


కృష్ణ పక్షం 
భావకవిత్వమైతే గబ్బిలం ఏమిటి?

కృష్ణపక్షం భావకవిత్వమని మీరే అన్నారు. గబ్బిలం సంఘాన్ని సంస్కరించాలనే ఉద్దేశంతో వ్రాయబడింది కాని అందులో కూడా వస్తువును బట్టి కాదు గౌరవం ఆయన రచనా శిల్పాన్ని బట్టి.

ఆధునిక తెలుగు కవిత్వానికి మార్గదర్శకులని చెప్పదగిన వారు మీ దృష్టిలో ఉన్నారా ఉంటే ఎవరు. ఎందుకు
ఆధునికత అన్నది ఎక్కడినుండి మీరు విడదీస్తున్నారో నాకర్థం కావడం లేదు. మంచి రచనలు చేసిన వాళ్ళు చాలామందే ఉన్నారు. కాని వాళ్ళ్లో అంతా టాగూర్ ప్రభావం ప్రత్యక్షం గానో పరోక్షం గానో కనబడుతూ ఉంటుంది.

మీ దృష్టిలో ఆధునిక సాహిత్యం లో 
పది కాలాల పాటు నిలబడగల రచనలేమైనా ఉన్నాయా ?
మీవి ఏమైనా ఉన్నాయా ?
లేవంటే ఇంత సాహిత్య కృషీ వ్యర్థమైపోయిందనుకోవడానికి 
ప్రత్యేక కారణాలున్నాయా..?

పది కాలాల పాటు నిలిచే కవిత్వాలు లేవని నేనెట్లా చెప్పేది ఒకానొకనాదు దేశభక్తి కవిత్వాలు ప్రముఖంగా ఉండేవి. అటు తరువాత ఏవో మత కలహాలకు సంబంధించిన గ్రంధాలు ఈ భావాలన్నీ ఎప్పుడూ తాజాగా ఉంటాయని నాకు నమ్మకం లేదు. ఇలాంటి రచనలన్నీ వాటి అవసరం తీరుతూనే మరుగున పడిపోతాయి. శ్రీ శ్రీ కవిత్వం కూడా అంతేనేమో ఎవరికి తెలుసూ కానీ రామాయణ భారతాల ఆవశ్యకత ఎప్పుడూ ఉంటుంది.

భారత కథలో సన్నివేశ గాంభీర్యం ఉంది. రామాయణ కావ్యంలో రచనా శిల్పం ఉంది. సంస్కృత భారతం మన విజ్ఞాన సంపుటి. అందువల్ల ఏ కాలంలో నైనా దాన్ని చదువుతాం. సంస్కృతం పనికిరాదు. అది బ్రాహ్మణుల భాష ఇలాంటి పిచ్చి పిచ్చి వాదాలు శాశ్వతంగా నిలవవు. ఏనాటికైనా ఎందరు ద్వేషించినా అగౌరవించినా సంస్కృతానికున్న మర్యాద తొలగదు. తమిళం కూడా మొదట సంస్కృతాన్ని బహిష్కరించడానికి ప్రయత్నించింది. ద్రావిడ నాగరికత కొంత ప్రత్యేకత ఉన్నదని వారి వాదంగా ఉండేది. వేదాల్లోనే కొన్ని ద్రావిడ పదాలు చొచ్చుకొని పోయినాయని వారు ఈనాటికీ వాదిస్తారు. ఏదెట్లున్నా సంస్కృతం తరువాత తమిళం అంత ప్రాచీన భాష మరొకటి లేదు. ఈ దృష్టితో రామాయణం ఆర్య ద్రావిడ నాగరికతల సమ్మేళనాన్ని మనసులో ఉంచుకొని చేసిన కల్పనగా కొందరు వాదిస్తారు రామాయణమేమిటి అంతకు ముందే ఆర్యులు ద్రావిడులు కలిసిపోవడం బహుళ ప్రచారంలో ఉంది.

ఇంతకూ చెప్పొచ్చేదేమంటే సంస్కృతానికి లోబడని అనంత శబ్ద సంచయం వారికున్నా సంస్కృతాన్ని బహిష్కరించడం వారికీ సాధ్యం కాలేదు. ఇలాగా ఎన్ని భావాలు మారినా భారతదేశంలో ఆస్తికతా బుధ్ధి పోదేమో అనే విశ్వాసం నాకుంది. దానికి సంబంధించిన ఉత్తమ శిల్పంతో కూడిన కావ్యాలు నిలుస్తాయేమో నని నా ఆశ.

నా రచనలేమైనా ఉన్నాయా అంటే నేనేమీ చెప్పలేను దానిని కాలమే నిర్ణయిస్తుంది.

నా సృష్టి వ్యర్థమై పోయిందని నేనెట్లా అనుకోను? నేను కాలంలో నిలుస్తాననే అహంకారం నాకుంది.


మీరు కవిత్వం రాయటం ప్రారంభించిన నాటినుంచీ 
నేటి వరకూ చూస్తే ఎన్నో మార్పులు వచ్చాయి. 
మీరిప్పుడే కవిత్వ రచన ప్రారంభించే దశలో ఉన్నట్లయితే 
మీరెటువంటి కవిత్వం రాస్తారు?

ఈ ప్రశ్న సంస్కారి అయిన వారి విషయంలో వేయదగ్గది కాదు. ప్రతిభావంతుడైన కవి ఎవర్నీ గుడ్డిగా అనుకరించడు. తన్నితరులు అనుకరించేలా చేసుకుంటాడు. వాని మార్గాన్ని వాని ప్రతిభ నిర్ణయిస్తుంది. ఇప్పుడు నేను రచనను మొదలు పెట్టి ఉన్నట్లయితే నా మార్గాన్ని నేను అనుసరించే వాణ్ణి.

మీ సాహిత్య జీవితంలో మరపురాని సంఘటనలు ఉంటే చెప్పండి

ఎన్నో ఉన్నాయ్ మరపురాని సంఘటనలు. అహమేవ పండితాః అనే భావనతో మొదలు పెట్టినవాణ్ణి ఇప్పుడు నాహం పండితాః అనే స్థితికి వచ్చాను. ఈ స్థితికి రావటానికి కొన్ని నూర్ల సంఘటనలు జరిగి ఉంటాయ్.


వయసు దానితో బాటు పరిపక్వత చెందుతుండే మనసు నన్ను మార్చివేశాయ్ నా కాలంలో పెద్దవాళ్ళనిపించుకున్న ఎందరితోనో పేచీ పడ్డాను. ఈనాటికీ నా భావాలట్లే వున్నాయ్. కానీ వాటిని వెల్లడించే పధ్ధతి లో మార్పు వచ్చిందంతే. చెళ్ళపిళ్ళవారూ శ్రీపాద వారూ వీరితో పెద్ద రగడలే జరిగిపోయాయ్ చిన్న వయసున పెద్ద పరిశ్రమ కావడంతో చాలా మందితో పోట్లాడవలసివచ్చింది. ఒక చిన్న ఉదాహరణ చెప్తాను నేను నా 19 వ సంవత్సరంలో భారతిలో ప్రాకృత కావ్యాల్ని గూర్చి కొన్ని వ్యాసాలు వ్రాసాను. అప్పుడు మల్లంపల్లి వారు భారతి ఎడిటర్ గా వుండేవారు. నేనొక సారి భారతి ఆఫీసుకు పోయినాను. మల్లంపల్లి వారు అఫీసులో ఉన్నారు. నన్నెవరో పిల్లవాడనుకున్నారు. నేనే పుట్టపర్తి నారాయణాచార్యులంటే ఆయన ఆశ్చర్యంగా నా వేపు చూశారు. ఆయన అన్నారు నీ వయస్సేదో అరవయ్యో డెభ్భ్య్యో పెద్ద నామాలూ ఇట్లా ఉంటారని భావించానండీ  అన్నారు.

తరువాత ఆయన మరణించే వరకూ నన్నెంతో గౌరవంగా చూసేవారు. ఆయన చారిత్రికుడుగా కూడా నన్ను చూసేవారు.శ్రీపాద వారితో నేను కలిసినప్పుడు పెద్ద రంధే అయిపోయింది. చెళ్ళపిళ్ళవారు నీ తెలుగు కవిత్వం కంటే సంస్కృత కవిత్వమే నాకు బావుంది నాయనా అన్నారు ఎన్నో ఇలాంట్లివి. నేనేమని చెప్పేది. విశ్వనాధ వారితో సవాలక్ష సార్లు కొట్లాట. కానీ ఆయన మహా రసికుడు మహా మనస్వి బెజవాడలో ఒకసారి నా శివతాండవం విని నన్ను భుజాలపై ఎక్కించుని ఆనందించాడు. అంతటి రసలుబ్ధుడాయన. ఇంకా ఇలాంటి సందర్భాలు నూర్లకు ఉన్నాయ్.


మీ రచన వెనుక ఉన్న ప్రభావాలేమిటో చెప్తారా..

నా రచన వెనుక ప్రభావాలు ఎన్నని చెప్పేది 10-15 భాషల ప్రభావం నా రచనల్లో ఉంది. సంగీతమూ నాట్యమూ నా రెండు ప్రాణాలు. కానీ ఆ రెండున్నూ కుడా సరిగా రావే. కారణం ఆ రెంటికీ తెలుగుదేశంలో దండిగా కూడు పుట్టదు కనుక నేను నా జీవితాన్ని బేరీజు వేసుకుంటే నేను ఎక్కువగా కష్టపడింది మూటికి సంగీతమూ నాట్యమూ ఇంగ్లీషు భాష కానీ ఈ మూడున్నూ సరిగ్గా రాలేదు ఈ జన్మ కా ప్రాప్తి లేదేమో సంగీత నాట్యాలను సాహిత్యం మింగేసింది. ఈనాటికిన్నీ సంగీత నాట్యాలు సరిగ్గా తెలియక పోతే నా రచనా విధానం సరిగ్గా అర్థం కాదేమో ననిపిస్తుంది.

ఈ అనేక భాషా ప్రభావాల వల్ల రచనలో నేను పడ్డ బాధలు కొన్ని వున్నాయ్. నేను ఏది వ్రాసినా అంతకంటే బావుండేది ఏదో నా మనసులో మెదులుతుంది. నాలో నిరుత్సాహం బయలుదేరుతుంది. మళయాళంలో వళ్ళత్తోళ్ మహాకవి ఆయన గాంధీజీని గురించి ఏండ్రె గురునాధన్ అనే ఓ ఖండిక వ్రాసాడు. అలాంటి ఒక దాన్ని నా జీవితంలో వ్రాయలేకపోయానే అనుకుంటూ వుంటాను. 

ఈ ముఫ్ఫై ఏళ్ళనుండీ ప్రభుత్వం గానీ 
ప్రభుత్వం ఏర్పాటుచేసిన సంస్థలు గానీ 
వాని దృష్టిలో ఉత్తమ రచనలనిపించిన వాటికి బహుమతులిస్తున్నాయి ఈ విధానం బాగుందా..? 
ఉత్తమ రచనకు మీరు సూచించే విధానం ఏదైనా ఉందా....?

ఏదో వారికి తోచిన రచనలకు బహుమతులిస్తుంటారు ఆ విధానం మంచిదే  ఆ విధంగా కొంతమందికి ఉత్సాహం లభిస్తుంది కదా.