8 నవం, 2015

మునిమాణిక్యం గారితో ముచ్చట్లు..




                  పెళ్లిళ్లలో  మా అమ్మ అయ్యల  ఆశీర్వా దమే వారికి పదివేలు .. 

ఇరవయ్యవ శతాబ్దం మొదటిపాదంలో 
అంటే కథలు రూపుదిద్దుకుంటున్న తరుణంలో మునిమాణిక్యం గారు 
హాస్య కథలతో ముందుకు కదిలారు

వారి రచనలలో 
కుటుంబ జీవితంలోని కష్టసుఖాలు
దాంపత్యజీవితంలోని సౌందర్యమూ కనిపిస్తాయి

వారి కాంతం 
సాహిత్య వేదికపై అలంకరించిన స్థానాన్ని 
వేరుగా చెప్పవలసిన పనిలేదు..

వీరు ఆంధ్ర సారస్వత పరిషత్ లో
 ఉపాధ్యాయునిగా పనిచేశారట..
ఆకాశవాణిలోనూ పనిచేశారట..
ఆయన నవల '
టీ కప్పులో తుఫాను'
వారి అమ్మాయే కాంతంగా వేసి మెప్పించారట
వారి రచనలు చదువుతున్నా..
అందులో ఇల్లు ఇల్లాలు ఒకటి

మునిమాణిక్యం గారికీ వాళ్ళావిడకూ రోజూ తగవేనట
విసిగిపోయారు ఆయన
కేవలం మా ఇంట్లోనే నా 
అందరీళ్ళలోనూఇంతేనా
వాళ్ళెలా నెట్టుకొస్తున్నారూ
అని సందేహం వారిని తగులుకుంది..
పైకి పొక్కటం లేదు ఎవ్వరూ చెప్పుకోవటం లేదు

సాహిత్య వీధిలో శోధన మొదలు పెట్టారు..
'మీకూ మీ భార్యకూ అభిప్రాయ భేదాలు రావా..
వస్తే ఎలా జరుపుకొని వస్తున్నారు' అని 
ఇంద్రగంటివారిని అడిగారట..
వారు మంచి పండితులు 
సాహితీపరులు మనస్తత్త్వ శాస్త్రం తెలిసిన వారు

ఆయన యేం సమాధానం చెప్పారో తెలుసా..
'నాకూ నా భార్యకూ అభిప్రాయ భేదాలు రాకుండావుండవు
ఆవిడ అభిప్రాయానికి భిన్నమైన అభిప్రాయం కలిగివున్నప్పుడే మేము
భిన్నాభిప్రాయము గలవారము అవుతాము
భిన్న తత్త్వాలకు గల అభిమతాలకు 
సంఘర్షణ యేర్పడి తగవుగా పరిణమిస్తుంది
కాబట్టి అభిప్రాయ భేదం వచ్చినప్పుడు 
నా అభిప్రాయం చస్తే చెప్పను
ఇంక ఆవిడ యేం చేస్తుంది.. 
నోరు మూసుకుని ఊరుకుంటుంది
ఇదే నేను అవలంబిస్తున్న మార్గం 
పోట్లాటలు రాకుండా వుండటానికి..'

అభిప్రాయ భేదాలు వచ్చినపుడు 
నేనే నోరుమూసుకుని వుంటాను 
అని ఎంత చత్కారంగా చెప్పినారు 
అని సంబర పడ్డారట ముని మాణిక్యం గారు

సరే..కాటూరి గారిని అడిగి చూద్దాం అని
'ఏమండీ అన్నగారూ మీ ఇంటో పోట్టాటలు లేవా..?'
అంటే
'లేవు.. మేమెప్పుడూ పోట్టాడుకోలేదు..'
 అని ఫెడీ మని జవాబు చెప్పారట..

ముని మాణిక్యం గారు ఆశ్చర్య చకితులై .. 
'అదిఎలాగండీ ..
మీ ఆవిడ అంత వినయ సంపన్నురాలా..
సుగుణవతా..చెప్పినట్లు వింటుందా..?'
అని అడిగారు..

ఆయన ముఖం చిట్లించి విసుగుతో
'నేను చెప్పినట్లు ఆవిడ వింటుందని ఎవరన్నారయ్యా..
ఆవిడ చెప్పినట్లే నేను వింటాను..
ఏదైనా మాటా మాటా వచ్చి ఆవిడకు కోపం వస్తే..
'దోషము గల్గె నావలన..
 దోసిలి యొగ్గితి నేలుకొమ్ము ..నీ దాసుడ..
 అని ముట్టెద తత్పదద్వయిన్'
అని చెప్పేసి గబ గబా వెళ్ళిపోయారట..

మునిమాణిక్యం గారు 
ఇంకా నయం మాఇంట్లో ఆ పరిస్తితి రాలేదు అనుకొన్నారు 
అనుకొని ఊరుకున్నారా..
దేవులపల్లి గారిని కదిపారు

'ఏమండీ మీ ఆలుమగల మధ్య పోట్లాట పొరుపూ వుంటాయా..'
అని అంతే..
'అమ్మో నా ప్రియురాలితో పోట్లాట..
 నేను భరించలేను..
ఒకవేళ వచ్చిందో నాకు దుఃఖం వస్తుంది..
దుస్సహ గాఢ దుఃఖం నేను తట్టుకోలేను..
ఏడుపు వస్తుంది..
నా సంగతి నీకు ఆమాత్రం తెలియదేం..
మృదుల కరుణామధురము నా హృదయము
ఈ సంగతి ఎవ్వరికీ తెలియక పాయె..
ఎవ్వరెరుగ జాలరు ఏమని ఏడ్తునిప్పుడు.. '
అంటూ రుమాలు తో కళ్ళు వత్తుకుంటూ వెళ్ళిపోయారు..

అక్కడితో ఆగినా బాగుండేది .. 
వెళ్ళి వెళ్ళి వేదుల వారినడిగారు

ఆయనేమన్నారు..


'పోట్లాటలు లేకేమయ్యా..
నేనెంత బాధపడుతున్నానో నీకేమి తెలుస్తుంది..
నా బాధ ఎవరికీ చెప్పను
నాలోన నేనే మూల్గుకొందు 

కనికరము జూపు చిరునవ్వు తునకయే కరువయ్యె
నాకు పాడులోకాన'

అని గుట్టు విప్పారట..

 అదీ సంగతి అనుకొని

'మరి దేవులపల్లి వారు రోదనము చేస్తారట.
మీకు ఏడ్పు రాదా..'
అని ఏమైతే అదయిందని అడిగేశారు..

'రాకేమయ్యా చచ్చేట్లు వస్తుంది..
కానీ కనుల రానీనొక బాష్పకణమునైన..' 
అన్నారట దీర్ఘంతా నిట్టూరుస్తూ..

అందుకనే 'మహా సాగరాగాధ హృదయ బడబానల యెవ్వరికి తెలియు' అని గోలపెట్టాడు 

ఇక కవులతో లాభంలేదని
గురువుగారైన శివశంకర స్వామి వారిని అడిగారట..
'స్వామీ..
 భార్యా భర్తలమధ్య పోట్లాటలు లేకుండా వుండే మార్గం ఏది..'
అని
అందుకు వారు గొప్ప సూత్రాన్ని విడమరిచారు
'నాయనా..భార్యా భర్తలమధ్య పోట్లాటలు లేకుండా వుండటము అసంభవం.
ఇది అనాదిగా వస్తున్న సదాచారము.
అనుకూలవతి అంటే కొద్దిగా తేలికగా సరసంగా
ఏదో సంసారపక్షంగా కలహించేది అని ..
అంతే కాని
బొత్తిగా నోరు మూసుకొనికూర్చునేది కాదని అర్థం..
అదీ అసలు రహస్యం..
ఈ పరమ రహస్యాన్ని తెలుసుకొని
నీ జీవిత గమనాన్ని దిద్దుకో..
లేదా సన్యాసం పుచ్చుకో ఎవ్వరికీ చెప్పకుండా
అప్పుడు నీ భార్య చచ్చినట్టు వచ్చి
నీ కాళ్ళపై పడుతుంది..

చూశారా.. ప్రశాంత దాంపత్య జీవనానికి రహస్యం
ఒకటి భార్యా విధేయత లేదా సన్యాసం..
అని ఒక నిర్ణయానికొచ్చారు..

ఎంతైనా కవులు ఉన్మత్తులు..
వచన రచనకారులను అడిగి చూద్దం అని ఆలోచించిచూడగా
మొక్కపాటివారు
చిన్నతనంలో సంగతి జ్ఞాపకం లేదుగాని ..
ప్రస్తుతానికి ప్రశాంతంగా వెళ్ళిపోతున్నాయ్ రోజులు ..'

హాశ్చర్యపోవటం మునిమాణిక్యం గారి వంతు
ఏముంది ..
ఆవిడ రాజమండ్రిలో ..నేను మద్రాసులో
 ఎప్పుడైనా ఫోనులో మాట్లాడుకుంటాం'

గిడుగు వారు
'నేను సవర భాషలో మాట్టాడతాను..
ఆవిడకది అర్థంకాదు..
 సింపుల్ గొడవలేముంటాయ్..'

వేలూరు వారు
ఇంటికి దూరంగా కుటీరం నిర్మించుకొని వుంటారట..
గిడుగు వారింట్లో  గొడవలే లేవు
ఆవిడ అరిచి చచ్చినా వారికి వినపడదట..

బుచ్చిబాబుగారు
తెలియనివారు..
తెలిసిన వారు చెప్పినపుడు వినాలి
మా ఆవిడ 'మీకేం తెలీదు ఊరుకోండీ'
 అంటూ వుంటుంది
ఆవిడమాట మెదలకుండా వినటమే నాపని'

జమ్మలమడకవారు
'మనం సంస్కృతం నేర్చుకోవలె..
 ఆవిడకు అర్థంకాదు. .'
సో ..గొడవలు బంద్..
ఈ విధంగా తన గొడవతో
మొత్తం సాహిత్య లోకపు గుట్టునంతా విప్పేసారు మునిమాణిక్యం గారు

అంటే ఈనాడే కాదు ఆనాటినుంచీ కూడా ఇవేపధ్ధతులన్నమాట ప్రశాంత జీవనానికి..
హోం మినిష్టర్ పదవా మజాకా.. అనిపించింది నాకు

పైన మునిమాణిక్యం గారు వినిపించింది
 నిజమో ..లేక కేవల హాస్యమో తెలియదు కాని..

బయట ఎంత పెన్ను తిప్పినా 
ఇంట్లో వీరంతా పిల్లులేనన్నమాట..

ఇదంతా చదివాక 
మా ఇల్లు గుర్తొచ్చిందినాకు
మా ఇంటి వాతావరణమూ పధ్ధతి 
అందరికంటే ఎంత భిన్నం ..

''చెలిమి పండగ నొక్క చీర దెచ్చితినేమి
కలిమి యొకనాడైన గడప ద్రొక్కినదేమి
మురిపంబు దొలుకాడ ముద్దులాడితినేమి..''

మా అమ్మను తలుచుకుంటే పై పాదాలే గుర్తుకొస్తాయి

''ఆభరణములు లేని దది వింత సొబగయ్యి 
మల్లెపూవట్ట్లు నా మగువ నవ్వినయపుడు
పట్టపగలే ఇంట పదివేల దీపాలు
వెర్రిబాగుల చాన వెన్నవంటీమనసు
దులకింప తోక చుక్కలవంటి కనులతో చూచెనా పదివేలు''

మా అమ్మ రూప వర్ణన ఇది
ఇక గుణ వర్ణన 

''నాపడతి యగుదాన నాతి యొకనాడైన
నిట్టూర్చెనా మారు బట్టలేని దినాల సిగ్గువోవు దినాల''

నేను మా అమ్మను చూచి 
నా జీవితం దిద్దుకున్నాను
నాకు తోచిన ఒకే పదం' సారీ'
ఎవరిది తప్పైనా అదే పదం నన్ను ఆదుకుంది

మా అమ్మ ఇంతకన్నా కష్టపడిందిగదా..
నా కష్టం ఏపాటి..
అని మా అమ్మను స్మరించుకొని 
ముందుకు సాగుతూ 
ఈరోజు ఇలా వున్నాను.

నిజంగా ఆ సారీ
ఎన్ని సారీలను తిరిగి ఇస్తుందను కున్నారు..
ఆ సారీ  ..
శారీలు గా  , బంగారు ఆభరణాలు గా ,
 ఎన్నో బహుమతులుగా
మధుర స్మృతులు గా మా వారు..
మా  సన్నిహితులూ మార్చేస్తుం టారు ..
నిజంగా సారీలో మేజిక్ లేదూ ..