20 అక్టో, 2012

విహారి మాటల్లో పుట్టపర్తి









నే నీ మధ్య కొందరితో 
సెల్ ఫోన్ సంభాషణ జరిపాను
మా అయ్యగారితో పరిచయం బాంధవ్యం 
సాహితీ మితృత్వం కలిగిన వారి స్వరాలను సేకరించటం

ఈ వరుస క్రమంలో 
విహారి గారినీ అడిగాను
ఆయన నేను మీకు మైల్ చేస్తాను అన్నారు 
అలా కాదండీ 
మీ గొంతులో వుంటే బాగుంటుందండీ అన్నాను

ఓ రెండు రోజులలో మెయిల్ వచ్చింది
చూసిన నాకు ఆశ్చర్యం ఆనందం
వెంటనే స్పందించిన విహారిగారికి 
హృదయ పూర్వక ధన్యవాదాలు





అనురాధ గారు,

నమస్కారం !!

నాన్న గారితో నా పరిచయం తెలుపుతున్నాను. స్వీకరించండి.


పుట్టపర్తి వారంటే పుంభావ సరస్వతి. 
సరసవతీ పుత్రుడు. 
ఎన్నెన్నో భాషల్లో 
ప్రాచీన అర్వాచీన సాహిత్యాల్ని 
ఆబగా అమృతాసేచనం  చేసిన అమరుడు.

1979 లో 
మధురాంతకం రాజారాం గారితో కలిసి 
కడప లో వారింటికి వెళ్ళటం 
మా మధ్య తొలి సమావేశం. 

మధ్యాన్నం రెండు గంటలైంది.   
నేల  మీద గోడకానుకుని కూర్చుని, 
షావుకారు గుమాస్త డెస్క్ ని ముందు పెట్టుకుని 
ఏదో  చదువుకుంటున్నారు. 
చేతిలో  పుల్ల కలం. 
పరిచయాలైనాయి. 
'మీ పేరు విన్నాను. 
బుచ్చి బాబు మీద మీ eligee 
భారతి లో  వచ్చింది కదూ? 
బాగుంది. 
అతనికి నిఖార్సైన నివాళి అది.' 
అన్నారు. 
ఆశ్చర్యపోయాను. 

ఎప్పుడో పధ్నాలుగేళ్ళ ముందు విషయం అది. 
అదీ వారి జ్ఞాపకశక్తి. 
కాసేపు సాహిత్య విషయాలు చెప్పారు. 
జనప్రియ రామాయణం 
కిష్కింధ లోని కొన్ని చరణాలు చదివారు. 
తమ ఇంగ్లిష్ దీర్ఘ కవిత 
లీవ్స్ అఫ్ ది విండ్ గురించి చెప్పారు. 

మాటల మధ్యలోకి milton వచాడు. 
ఊగిపోయారు ఈయన. 
సాయంత్రం ఐదు అవుతుండగా 
సెలవు తీసుకున్నాం.

ఆ తరువాత, 
1979 నుంచి వారి చివరి రోజుల వరకు 
ఎన్నెన్నో సభల్లో, సమావేశాల్లో , 
ఇంటి దగ్గరా, రామకృష్ణ సమాజం లో, 
ఎన్నో సార్లు వారిని కలుస్తూనే ఉన్నాను.

1983 లోనో 1984 లోనో అనుకుంటాను. 
ఆకాశవాణి వారి ఆహూతల ముందు 
ప్రత్యేక దీపావళి కవి సమ్మేళనం 
కర్నూలు లో జరిగింది. 
పుట్టపర్తి వారే అధ్యక్షులు. 
మహామహులు చాలా మంది ఉన్నారు. 

నేను పాల్గొన్నాను అందులో. 
'మనసులో దీపాలు' 
అని నేను కవిత ఎత్తుకొంగానే 
వారు కుర్చీ లో సర్దుకుని ముందుకి కదిలారు. 
కారణం 
ఆ కవిత లో మొదటి నాలుగు పాదాలు
'శాఖోటకం  పిందేల్ని ఊహించి, పళ్ళ రుచి తలచి
నోరూరించుకుంటూ కూర్చోవటం - అమావాస్య
మట్టి అంతఃపురాన్ని పలకరించి
రసాల బీజాన్ని బహూకరించటం - దీపావళి!'
అనేవి ఆ పాదాలు. 
కవితంతా అలా విపర్యోక్తి గా సాగుతుంది. 
నా కవిత పూర్తి  అయిన తరువాత 
'శాఖోటకం' పదాన్ని 
అద్భుతంగా విపులీకరించారు పుట్టపర్తి వారు. 

భూమి మీద పూతా, పిందే, 
ననలూ, చిగురూ, 
మొగ్గా, పోలూ లేని చెట్టు. 
'ఈ విహారి అసాధ్యుడు. 
సాహితీ వైదూష్యం కల కవి.' 
అన్నారు. 

ఆ కవితలో ఇంకా కొన్ని పాదాలు 
సామాజిక స్పృహ తో నిండి ఉండి 
సభ లో సంచలనం కలిగించాయి. 
ఆ మర్నాడు పత్రికల్లో నూ 
నా కవితకు పుట్టపర్తి వారి అధ్యక్ష వ్యాఖ్యానాలకి మంచి ప్రశంసలు వచ్చాయి.

ఆ తరువాత 
పుట్టపర్తి వారి ఆంగ్ల దీర్ఘ కవితను 
అన్నవరం ఆదిశేషయ్యగారు 
తెలుగులో 'గుండె గులాబీలు' పేరుతో 
అనువాదం చేయటం 
ఆ పుస్తకాన్ని నేను, 
N .C .రామసుబ్బారెడ్డి, 
M .జానకిరాం, 
ఆదిశేషయ్య కలిపి స్థాపించిన
 'రచన సాహిత్య వేదిక' 
తరఫున ప్రచురించటం జరిగింది. 

ఆ సందర్భంగా ఎన్నో సార్లు 
వారితో ముచ్చటిమ్పులు జరిగాయి.

తొమ్మిది ఏళ్ళు నేను కడప లో ఉండటం, 
పుట్టపర్తి వారితో సన్నిహితంగా మెలగటం, 
వారి పూర్ణ ప్రజ్ఞలో 
కొన్ని వీచికల్లో మునిగి తేలటం 
ఒక అపూర్వ ఆనందం, 
ఒక అనన్య అనుభూతి. 

వారిని ఈ విధంగా స్మరించుకునే 
అవకాశం కలిగించినందుకు 
మీకు ప్రత్యేక ధన్యవాదాలు.

సెలవు, 
అభినందనలతో..
విహారి.