6 అక్టో, 2014

సిరి కల నాడు ..


 దానం..
ఒక్కొక్కరు ఒక్కో నియమం పెట్టుకుంటారు
కొందరు గోవులను సేవిస్తూ .. గోదానాలు చేస్తుంటారు 
కొందరు
బీదలకు పుస్తకాలు పంచిపెట్టి చదివిస్తూ విద్యాదానమే గొప్పదని అంటారు..
దానధర్మాలు చేస్తూ తృప్తి పొందుతుంటారు ఇంకొంతమంది..
రోగగ్రస్తులకు ఉచితంగా వైద్యం చేయిస్తూ.. 
ఇదే మంచిదని అనేవాళ్ళూ ఉంటారు..

తమ శరీరావయవాలను తమ తదనంతరం 
ఇతరులకు అమర్చాలని కోరేవాళ్ళు కొంతమంది..
మంచిదే చూపునూ శ్వాసనూ ఇతరులకు ప్రసాదిస్తే మెచ్చనివారెవ్వరు..

ప్రపంచంలో మాల్టా లైబీరియా ప్రజలకు 
దాన గుణం ఎక్కువట.
వరల్డ్ గివింగ్ ఇండెక్స్ సంస్థ 
153 దేశాల్లో నిర్వహించిన సర్వేలో
 శ్రీలంక ,ఐర్లాండ్, కెనడా, గయానా, 
సియర్రా లియానె వాసుల్లో 
దానం చేసే లక్షణాలు ఎక్కువగా ఉన్నట్లు వెల్లడైంది


  • వైశాఖమాసము దానాలు ఇవ్వడానికి ప్రశస్తమైన మాసంగా పురాణాలు పేర్కొన్నాయి.
  • బలి చక్రవర్తి మూడడుగులు విష్ణుముర్తికి దానం చేసి చిరస్మరణీయుడైనాడు.
  • శిబి చక్రవర్తి పావురం రూపంలో వచ్చిన దేవతలకు తన శరీరాన్ని కోసి దానం ఇచ్చిన ఉత్తముడు.
  • కర్ణుడు తనకు సహజంగా ఉన్నకవచకుండలాలను రక్షకకవచాన్ని దానం చేసి "దాన కర్ణుడి"గా నిలిచాడు.
  • ఏకలవ్యుడు తన బొటనవేలును కోసి ఇచ్చాడు

దానం చేసే వ్యక్తి 
దానం స్వీకరించే వ్యక్తి 
దానం స్వీకరించడానికి తగిన పాత్రుడా కాదా 
అని ఆలోచించి 
లేదా రుజువు చేసుకొని 
అతను దాన స్వీకరణకు అర్హుడు అయినట్లయితే 
అతనికి దానం ఇవ్వాలి. 

దానం స్వీకరించే వ్యక్తి 
దాన స్వీకరణకు తగిన పాత్రుడు కానప్పటికి 
అతనికి దానం ఇచ్చినట్లయితే 
అటువంటి దానంను అపాత్రదానం అంటారు.

''అన్నిదానములను నన్నదానమే గొప్ప
కన్నతల్లికంటే ఘనములేదు
ఎన్నగురునికన్న నెక్కుడు లేదయా
విశ్వదాభిరామ వినురవేమ.''
 వేమన కూడా అన్నదానం గొప్పదన్నాడు 


నిత్య జీవితంలో మనం ఎదుర్కొనే అనేక ఇబ్బందులనుండి, 
ఇక్కట్ల నుండి బయటపడడానికి 
చక్కటి రెమిడీగా పనిచేస్తుంది అన్నదానం 
అని చెప్తారు పండితులు. 

 పోతనకూ మంచి కుటుంబము 
తృప్తి కరమైన జీవితమూ ఉన్నాయట

హాయిగా తానూ జీవిస్తూ దానధర్మాలు చెస్తూ పోతన తరించే వాడని పుట్టపర్తి అంటారు .. 

అందుకే పోతన రచనలోను అట్టి సందర్భాలను ఎంతో 
సానుభూతితో వర్ణిస్తాడని చెబుతారు వారు.. 

రంతి దేవుడు నిట్రుపవాసం తో  తపస్సు చేసాడు 
నలభై ఎనిమిది రోజుల తరువాత 
అన్నం తిందామని అనుకున్నాడు 
ఒక బ్రాహ్మడు వచ్చాడు 
తన భోజనంలో సగమిచ్చాడు 

మళ్ళీ తిందామనుకొనేంతలో ఎవరో శూద్రుడు .. 
మిగిలిన అన్నంలో ఒక భాగం ఇచ్చాడు 

నోటముద్ద పెట్టబోయేంతలో 
కుక్కల గుంపుతో మరొకడు అన్నమడగడం..
విసుక్కోకుండా..
ఆకాస్తా ఇచ్చేయటం..

సన్నయములాడి  సాగనంపటం
వచ్చిన వాడు ఇంద్రుడో.. శివుడో ఎవరికి తెలుసు..

మిగిలినవి నీళ్ళు
అవైనా గుక్కెడు నోట్లో పోసుకుందామనుకుంటే..
ఒక చండాలుడు దప్పి దప్పి అంటూ అగపడ్డాడు..
 

ఈ మాటలు విన్న రాజు హృదయం
 దయారసముతో పొంగినదట..
 

వాళ్ళకెంత ఓర్పు ఎంత నిదానమో కదా..
ఒక రోజు పూజ చేసి 

రెండుదాకా ఖాళీ కడుపుతో వుండి
కాస్త అన్నమో టిఫెనో  నోట్లో వేసుకుందామనుకొనేసరికి యెవరో వచ్చి అది నాకిచ్చెయ్ అంటే 

మనమంత శాంతంగా
 ప్లేటులో పెట్టుకున్న పదార్థాన్ని ఇచ్చేయగలమా..
వెంటనే కోపం వస్తుంది..

కానీ అటువంటి సమయం లోనూ సంయమనం  పాటించడమే నిజమైన భక్తి
తపస్సు కాదంటారా..


విశ్వామిత్రుడు తూర్పు దిక్కుకు వెళ్ళి 
కామ క్రోధాలను నిగ్రహిస్తూ బ్రహ్మాండమైన తపస్సు చేయసాగాడు
కుంభకం ఉపయోగించి శ్వాస తీసుకోవడమూ నిలిపేశాడు
ఎన్ని సంవత్సరాలూ..
వెయ్యి ..


శరీరం పుల్లలా ఎండిపోయింది..
శరీరాన్ని నిలబెట్టుకోవడం కోసం
ఒకరోజింత అన్నం తిందామని కూర్చునేంతలో
ఇంద్రుడు బ్రాహ్మణ రూపంలో వచ్చి బిక్ష అడుగుతాడు
మౌనంగా ఆ అన్నాన్ని ఇచ్చేసి 

మళ్ళీ తపస్సులో మునిగిపోతాడు విశ్వామిత్రుడు..
 

అందుకే ..
తపస్సంటే కేవలం ముక్కుమూసుకుని 

మంత్రాన్ని జపించటం కాదు
కామ క్రోధ లోభ మోహాలను జయించటం..
 

అందులో దేవతలు పెట్టే పరీక్షలు నెగ్గటం ఒక తంతు..
వాళ్ళ ఆమోద ముద్ర పొందాక 

వాళ్ళు రెకమెండ్ చేస్తే..
యే శివుడో బ్రహ్మో  వచ్చి..
లేవవయ్యా నీవు మహర్షి వైనావు ..
ఋషి వైనావు అని 

ఒక మెడల్ ను మెడలో వేసి వెళతారు..
 

అది నిలుపుకుంటూ 
తదుపరి గ్రేడ్లకు అప్పియర్ కావడమే తపస్సు
 పదండి పుట్టపర్తి రంతిదేవుని కలుసుకుందాం.. 

చక్కని గృహస్తున కుండవలసిన గుణములన్నియు నాతనికున్నవి 
అతిధి పూజ 
ఆ మహాకవికి ప్రాణముతో సమానము

 అయాదరమునకు పోతన్న దృష్టిలో నీయాజాతిలేదు.. భగవంతుడు విశ్వాత్ముడన్న సత్యము 
ఆతని నరనరమునను జీర్ణించినది..
అన్ని దానములకంటెను 

అన్నదాన మాతనికి చాల ప్రియమైనది..
 

నిజమే
ధనములిచ్చి యతిధిని దృప్తి పరచుట యసాధ్యము.
అన్నము బెట్టి యెట్టివానినైనను దృప్తిపడినాననిపించవచ్చును
 

అందుకే యట్టి ఘట్టములు వచ్చినపుడు
 పోతన్న యెంతయో సాహుభూతితో వర్ణించును.
 

రాజ వంశోత్తములైన రంతిదేవుడు 
తపస్సు జేయుచుండెను.
ఆతడు నలువది యెనిమిది దినములు నిట్రుపవాసమొనర్చినాడు.
 

మరుదినమున గొంత యన్నము దిన సంకల్పించెను..
తొలుత వొక బ్రాహ్మణుడు వచ్చి యాచించినాడు
కలిగిన యన్నములో రంతిదేవుడు సగమాతనికిచ్చెను..
 

మరియొక శూద్రుడు వచ్చినాడు
ఆ రాజు మిగిలిన యన్నములో నొక భాగమిచ్చెను
 

ఇంతలో వేరొ క్కడు కుక్కల గుంపుతో గూడవచ్చి యన్నమడిగెను
 

రంతిదేవుడణుమాత్రమైనను విసిగి కొన్నవాడుగాడు
అన్నశేషమిచ్చి.. సన్నయము లాడిపంపెనట..
 

అంతతో పరీక్ష దీరిపోలేదు..
మంచినీళ్ళు మిగిలినవి..
వానినైనా ద్రావుదమని రంతిదేవుడు తయారయ్యెను
ఇంతలో నొక ఛండాలుడు సాక్షాత్కరించినాడు
వాడనెను.. 


కం. హీనుడ చండాలుడను
మానవ కులనాధ..దప్పిమానదు, నవలన్
బోనేర, నీకు జిక్కిన
పానీయము నాకు బోసి బ్రతికింపగదే..

 
ఈ మాటలు విన్న రాజు హృదయము 

దయా రసముతో బొంగిపోయినది..
అతడెంతో యాదరముతో ..


ఉ.
అన్నములేదు కొన్ని మధురాంబువులున్నవి ద్రావుమన్న రా
వన్న,శరీరదారులకు నాపద వచ్చిన వారి యాపదల్
క్రన్నన మాన్పి వారికి సుఖంబులు సేయుటకంటె నొండు మే
లున్నదే ? నాకు దిక్కు పురుషోత్తము డొక్కడే సుమ్ము పుల్కసా !(న.స్క.647)

 
అని పలికి


మ. బలవంతంబగు నీరు వట్టున నిజ ప్రాణాంతమై యున్నచో
నలయండేమియు వీని హృజ్జ్వరము నాయాసంబు ఖేదంబు నా
జల దానంబున నేడు మానుననుచు సర్వేశ్వరాధీనుడై
జలమున్ బోసెను రంతిదేవుడు దయన్ చండాల పాత్రంబునన్..

 

ఈ సన్నివేశము నింత మధురముగా పోతన్న వర్ణించుటకు గారణము ఆ గుణముపై నాతనికికి గొప్ప సానుభూతి యుండుటయే..