20 డిసెం, 2011

మా ..రాజన్న



రాజన్న అయ్య శిష్యుడు..
నరాల రామారెడ్డి ..,

రాజన్న.. 
అయ్యను గురువుదేవుడని 
ప్రతి సభావేదిక పైనా స్తుతించేవారు.


రాజన్న కవి.. గాయకుడు..
వసు చరిత్ర పద్యాలను 

కమ్మగా పాడేవాడు..
అతని గొంతులో పద్యాలు కొత్త అందాలను సంతరించుకొనేవి..
నరాల రామారెడ్డి

చక్కని రూపం..

కమ్మటి కంఠం..
 


గూగుల్లో రాజన్న కవి ఫొటో లేదు..
జమ్మలమడక మాధవ రాయ శర్మ గారిదీ లేదు..                                                
నాకు చాలా నిరాశ కలిగింది..
జనాలు మంచి వారిని 
ఇలా మరిచి పోతున్నారేమిటా 
అని బాధ ..

C.V.సుబ్బన్నా కవే..
అయ్యంటే సరిపోదని అనేవారు..
గాయకుడని కవులు వదిలేస్తారు..
కవి అని గాయకులొదిలేస్తారు..
ఇలా రెండు విధాలా 

బ్రతికి పోతున్నాడు రాజన్న అనేవాడాయన..

కవుల మధ్య 

ఈ మత్సరాలెందుకో నాకు అర్థం కాదు..
కానీ రాజన్నను 

నా చిన్నతనం నుంచీ చూస్తున్నాను..
పైన అయ్యతో మాట్లాడి కిందకి వచ్చి 

అమ్మతో మాతో కూడా చక్కగా మాట్లాడే వాడు..
ఇప్పుడు రాజన్న లేడు...
మనసులో  ఏదో బాధ..
నరాల రామారెడ్డి కూడా 
మాకు బాగా పరిచయం 
అష్టావధానాలు ఎంత బాగా చేసే వాడో..
రాజన్న నరాల రామారెడ్డి 

అయ్య శిష్యుల మనే వారు..
పంచకావ్యాలు చదివారు..
నరాల రామా రెడ్డి కార్తీక దీపం
 సినిమాలో ఒక పాట రాసాడు..
అయ్యకు శిష్యులంటే వల్లమాలిన వాత్సల్యం..


శ్రీ S.రాజన్నకవి..

ఒక గాంధర్వ కళా తపస్వి భువిపై .., నుల్లాసియై డిగ్గి..,దే
వకథా మర్మములన్నియుందెలిసి..,భావస్నిగ్ధుడై .. పల్కు గా..
యకుడై..,నాట్య రసజ్ఞుడై..,యారాధ్య శౌండీర్యుడై..
సుకవీంద్రుండగు పుట్టపర్తి గురుపూజ్యున్ గొల్తు భక్త్యున్నతిన్..

చనువో..భక్తియో..! పారవశ్యమో..!మరె సారస్వతా కాంక్షయో..!
ఘనమౌ నీ కవితా రసమ్ము మది సోకన్ హర్ష పూరమ్ములో..
మునకల్ వైచెదనోయి..! రమ్య కవితా మూర్దన్య..! నీ కీర్తి నెం..
తని వర్ణింతును పుట్టపర్తి గురుదేవా..! భవ్య వాగ్వైభవా..!!

విధి రమణీస్మితాతిగము విభ్రమమున్ బెనవైచుకొన్న నీ..
పదియును నాల్గుభాషల యపార పరిశ్రమ తెల్గు నేలలో ..
సదమల చంద్రికా ధవళ చర్చితమైనది.. కావ్య మోహినీ ..
మధుర దృగంబుజాత పరిమార్గిత సత్కవి లోక తల్లజా..!!

రచియింతువో..! భక్తి రక్తి స్పృహా దీప్తి..
కవిరాజు శ్రీనాధ కమ్ర ఫణితి..
రచియింతువో..! మా ప్రబంధ కవీంద్ర సౌం..
దర్య భావాల మాధుర్యలీల..
పలికింతువో..!! నాటి వాగ్గేయ కారుల ..
కిన్నరీ బృంద సంగీత రీతి..
నడిపింతువో ..! యుపన్యాస భంగిమ తుంగ ..
భద్రా సముత్తుంగ భంగ భంగి..!!
సర్వ కవులు నీలోన సాక్షాత్కరింత్రు..
నేను నేనని ప్రతిభా ప్రణీత మతులు..
ముగ్ధ హృదయ ..! పద్మశ్రీ విభూష..!! పుట్ట
పర్తి గురుదేవ..! సూక్తి పుంభావ మూర్తి..!!


"ప్రకృతికో ..మాయకో ..కాక భావనా ప్ర
     పంచ సౌదామినికో ...తపః ప్రభకో..,శూన్య
     మునకో.., యానంద రూపమై మోదమొసగు..
     సాత్విక వ్యక్తికీ నమస్కార శతము.."

    "షాజీ" నుంచీ..

పర్వీన్ సుల్తానా ఒకసారి మా వూరు వచ్చింది..
అయ్యకు ఆహ్వానం ..
అయ్య తో మేమూ అందరం వెళ్ళాం..
బ్రహ్మండంగా పాడింది 
అంటే చాలా చిన్నమాట..

ఆమె తన గానంతో..  
ప్రకృతిని  అత్యంత సుందరంగా 
దృశ్యం గావించింది..

ఆమె అమృతం తాగిందా..
ఇంత మధురంగా పాడుతుంది ..
అని  రాగానుభూతిలో 

మైమరచిపోయేలా  
మంత్ర ముగ్ధులమైపోయాం..

నేనప్పుడు పధ్నాలుగేళ్ళ పిల్లనేమో..
 
పాడుతూ పాడుతూ మధ్యలో ఆపి ..
అదిగో చూడండి.....
చీకటి నిండిన తూరుపు..
మెల్లగా ఓ వెలుగు రేక 
చీకటి ముసుగు తొలగించుకు కన్ను తెరిచింది..
అంటూ మళ్ళీ మమ్మల్ని 
తన వెంట తీసుకు పోయింది..

తన తిర్కాల పాటవంతో..
అదిగో ..
నీలాకాశం ..
చూడండి ..
పక్షులు ఆనందంగా ..
నిర్భయంగా..
పసిపిల్లల్లా ఆనందంగా 
గిరికీలు కొడుతున్నాయి..

మళ్ళీ రాగాలాపన..
మబ్బులు తొలగించుకుంటూ 
పైకొస్తున్న సూర్యుణ్ణి ..
ఆమె కంఠ లాలిత్యంలో మేము దర్శించాం..              
                         
అయ్య ఆమెను చూసి చాలా విచలితులైపోయారు..

ఆనందాశ్రువులు .. 
అయ్యను చూసి మేము ఇంకా పరవశించిపోయాము..

అక్కడ హిందుస్థానీ సంగీతం తెలిసిన 
వాళ్ళు యెవరూ లేరని 
ఆమె భావించినట్లుంది..


కానీ అయ్య ఊరికే వదలరుగా..

ఆమెకు రెండు మూడు ప్రశ్నలు వేసి 
ఆమె తన అన్నేళ్ళ సాధనను 
మళ్ళీ వెనక్కు తిరిగి చూసుకోవలసిన 
అవసరం కల్పించారు..

కానీ అయ్య లోని పాండిత్యం 
సంగీత సాధికారత 
ఊరికే విడిచి పెడతాయా మరి..
ఆమె కడపను ఇప్పటి వరకూ
 గుర్తు పెట్టుకుని వుంటుందని నేను అనుకుంటున్నాను.. 

అయ్య మిద్ది పైన హర్మొనియం వాయిస్తూ.. అన్నమాచార్యులు క్షేత్రయ్య..
కీర్తనలు మైమరచి పాడేవారు..

అదొక భావావేశం.. 

అక్కయ్యలు అందరూ చుట్టూచేరేవారు..
వాళ్ళూ పాడే వాళ్ళు..

రాళ్ళ పల్లి అనంత కృష్ణ శర్మ గారు స్వరపరచినవి..
తానే స్వరపరచుకున్నవి కొన్ని..

 మగువ తన కేళిక మందిరము వెడలెన్.....  క్షేత్రయ్య..

నాటికి నాడే నా చదువు మాటలాడుచును మరచే చదువూ ..........అన్నమాచార్యులు

నల్లనిమేని నగవూ చూపుల వాడు............అన్నమాచార్యులు

అలరులుకురియగ ఆడెనదే అలకల కులుకుల అలివేల్మంగా..........అన్నమాచార్యులు
అలరులు కురియగ ఆడెనదే  
నాగపద్మిని అక్కయ్య నాట్యం చేసేది..
అబ్బ.. మా ఇల్లొక ఆనందారామం ..

అయ్య కడప మోచంపేట శివాలయంలో 
గురువారం గురువారం 
సాయీ సచ్చరిత్ర మరాఠీ పుస్తకం చదివి 
తెలుగులో అనువదించి పురాణం చెప్పేవారు..

పురాణం తరువాత
 హార్మోనియం.. తబలా..వాయిస్తూ భజనలు..
ఆ చుట్టుపక్కల వారు అందరూ 
అయ్య భక్తి ప్రవాహంలో 
మునకలేయటానికి 
సాయంకాలం కోసం ఆశగా 
ఎదురుచూసే వారంటే అతిశయోక్తి కాదేమో..