13 సెప్టెం, 2017

అప్పటి నుండి బుధోత్తమ..

అప్పటినుండి బుధోత్తమ
చెప్పెడు భగవత్కథావిశేషంబులు నా
కెప్పుడు దనివి జనింపదు
చెప్పగదే చెవులు నిండ శ్రీహరి కథలున్

సముద్ర మథన కథా ప్రారంభము..



పుట్టపర్తి గారిని తీవ్రంగా నొప్పించింది ..
తరుచూ రెచ్చగొట్టింది..
గట్టిగా ప్రతిస్పందించేలా చేసింది..
ఈ సంకుచిత ప్రాంతీయ ధోరణే..
ఆయన ప్రతిస్పందనలోని పదును చూసి..
పెద్ద పండితులు నొచ్చుకున్నారు.. 
కాని..
ఆయన పడిన నొప్పి వెనుక ఉన్న న్యాయాన్ని గూర్చి ఆలోచించిన వారెందరు..??

ఆ ప్రాంతీయ ఆధిక్యతా భావాల వల్ల..
అఖిల భారతస్థాయిలో ఆ అప్రమేయ ప్రతిభామూర్తికి రావలసిన గౌరవం రాకపోవడంతో..
కలిగిన నష్టాన్ని గూర్చి బాధపడేవారెందరు..??

ప్రతిభ దారి ప్రతిభది..
ప్రశస్థి దారి ప్రశస్థిది..
అని సరిపెట్టుకోక తప్పదు..
అప్పుడప్పుడు.. 
ఆవేదనతో స్పందించినా..

చిన్ననాడే షాజీ లో వర్ణించిన 
'' నిమిష నిమిషంబునకు నెన్నేవిధాల..
బాటు వడుచున్న పరమాత్ము ప్రతిభ జూచి..
సరస సౌందర్య విధికి నాశనములేని 
సృష్టి కలదేమొ యంచు యోచించుచుండు.. ''

ప్రశాంతయోగి చిత్తములోన కలవాడు కాబట్టి..
ఆ రసికత కలిమితో జీవితమంతా 
కావ్య సౌందర్యాలను అన్వేషిస్తూనే వెళ్ళాడు.
కవిత్వీకరిస్తూ సాగాడు..

అయినా..
ఆయన ప్రతిస్పందించింది ..
చాలామంది అనుకున్నట్లు .. 
అన్నట్లు..

తనకేదో దక్కలేదనే అక్కసుతో కాదు..
తన ప్రాంతపు పలుకుబడిని న్యూన పరచినందుకు..
తన రచనల్లో కనిపించే సీమ నుడికారాన్ని వెక్కిరించినందుకు..

ఆ కాలంలో వారే కాదు..
రాయలసీమ మహాకవి.. విద్వాంసులందరూ 
  ఆ వివక్షకు గురయ్యారు..
వ్యధపడ్డారు..

రాళ్ళపల్లి గారంతటివారు 
విద్వాన్ విశ్వం గారి పెన్నేటిపాట మున్ను డిలో 

'' ఇక్కడివారికి చదువు సంతలు లేవని..
వారు అనాగరకులని పరిహాసమును .. 
ఆక్షేపమును జేసినవారును కొందరుండిరి..
నేడును లేకపోలేదు..

ఇది ' క్షతేక్షారమివాసహ్యం ' అన్నట్లయినది..
ఆ సీమలవారికి.
ఇది ముఖ్య కారణముగా .. 
ఈ ఆంధ్ర ఖండమునకు 'రాయలసీమ ' అని 
 విభిన్న నామమును 
తాము ఇతరాంధ్రులతో చేరియుండలేమను భావము ఇందలి ప్రజలకును వ్యాపించినది..''

అని నిర్మొగమాటంగా చెప్పారు .
ఈ వికటాధిక్య విభావ వైఖరి ఇప్పటికీ కొనసాగుతున్నందువల్లే.. 
మహాంధ్రభారతికి ఇటీవలగా అలాంటి గర్భ శోకం కలిగింది.
ప్రాంతీయ పరమైన వివక్షకు తోడు అద్వైత, విసిష్టాద్వైత శాఖా భేదం కూడా ఆ రోజుల్లో ధ్వనించిందనడన్నది బహిరంగ సత్యం


- ''ఆధునికత సమకాలీనత (కొన్ని పార్శ్వాలు)''
ఆచార్య గంగిశెట్టి లక్ష్మీనారాయణ
పూర్వ ఉప కులపతి 
ద్రావిడ విశ్వ విద్యాలయం

6 సెప్టెం, 2017

నిజభక్తిఁ దలంచెదఁ బుట్టపుట్టువున్‌...



పుట్టపట్టికి సరిజోడు పుట్టపర్తి ..
అనేవారు నరాల రామారెడ్డి ..
తన అవధానాల ప్రారంభంలో ..
ఆ మాట అప్పట్లో ఒక నానుడి అయింది.. 

పుట్టపట్టి వాల్మీకి రామాయణాన్ని దర్శింపజేసి భారతీయ సాహిత్యాన్ని పునీతం చేశాడు. 
అదే మాధురీ రస పంథాలో పుట్టపర్తి గారు 
ఒక్క రామాయణమేమిటి .. ??
భాగవతమేమిటి..??
తెలుగు వారి ఇలవేలుపు శ్రీనివాసుని ప్రబంధమేమిటి..??
సాక్షాత్తూ సకల కళాధీశుడు శివుని తాండవాన్ని అమ్మలాస్యాన్ని దర్శించి దర్శింపజేసి..
తెలుగు భారతిని మహిమోపేతం చేశాడు..

20 వ శాతాబ్ది సర్వశ్రేష్ట భారతీయ కృతుల్లో శివతాండవమొకటి..
తెలుగు భాషకు చెందడం దాని దురదృష్టం..
మన మహాదృష్టం..

అలాగే ..
20 వ శతాబ్ది తెలుగునాట ఎల్లలెరుగని ప్రతిభామూర్తులలో 
ఆయన వరిష్టుడు..
నిస్సీమా నిరంకుశ ప్రతిభా గరిష్టుడు..

గత వైభవానికి తావలమైన రాయలసీమలో కాక ..
అక్షర పరిశ్రమకు కేంద్రమైన 
మధ్యాంద్రదేశంలో గనుక జన్మించివుంటే..
అక్కడి తెలుగే నేడు సకల జన ప్రామాణికమైనట్లు
వారే ..
సకలాంధ్రావనికి సర్వోన్నత మాన్యులై ఉండేవారు..

యావదాంధ్ర ప్రజ 
మరెంతో మిన్నగా బ్రహ్మ రథం పట్టి ..
భారత పీఠంపై ఆ సరస్వతీపుత్రుని 
ఎన్నడో ప్రతిష్టించి వుండేవారు.. 

-ఆధునికత సమకాలీనత (కొన్ని పార్శ్వాలు)
ఆచార్య గంగిశెట్టి లక్ష్మీనారాయణ
పూర్వ ఉప కులపతి 
ద్రావిడ విశ్వ విద్యాలయం

2 సెప్టెం, 2017

మన సారధి .. మన సచివుడు..




ఈ రోజు మా అయ్య వెళ్ళి పోయిన దినం..
 సమయం రాత్రి మూడు .. 
 మంచం చుట్టూ  శిష్యులు ..
దశమ స్కంధం పుట్టపర్తి నోట పొంగింది 
మరణ వేదమై ..
......
....

అదే రోజు .. 
ఏకాదశి పుణ్య తిథి .. 
తెల్లవారి ..
గబ గబా స్నానం చేసి..
కలశం పెట్టి సత్యనారాయణ వ్రతం మొదలు పెట్టాను .. 
జీవితంలో సత్యనారాయణ వ్రతం వదలద్దు..
అమ్మ మాటలు..
అయ్యా నాకేమైనా చెప్పు..
నీకేం చెప్పేది..
సత్యనారాయణ వ్రతాలు వదలకుండా చేసుకో..


ఒక టెంకాయ ..
గ్లాసులో నీళ్ళు..
రెండు దీపాలు..
అంతే..
ఏమీలేకపోతే..నీళ్ళైనా నైవేద్యం పెట్టు ..అమ్మ

మనసంతా బాధగా వుంది..
కళ్ళు వర్షిస్తున్నాయి..
విగ్రహం పైఅరచేతిని వుంచి ..
స్వామీ..సర్వ జగన్నాథా..
పూజ ముగిసే వరకు ప్రీతిభావనతో వుండవయ్యా..
ప్రాణప్రతిష్ఠ..
.......
......
 హాస్పిటల్లో..
అందరూ మగత కౌగిట్లో జోగుతున్నవేళ..
ఒక గురువు..
 తన ఆఖరి ప్రయాణానికి సామాను సర్దుకుంటున్నాడు..
లోతైనకళ్ళు..
వణుకుతున్న గొంతుక..
కృష్ణ తత్వాన్ని ప్రవహింపజేస్తోంది  ..
వినిపించని వేణువు శ్రద్ధగా వింటున్న 
ఆ శిష్యుల గుండెల్లో మోగుతోంది...
బ్రతికిఉన్నంతకాలం ..
ఒక దివ్య తేజస్సు ఆ శరీరంలో వుంది కాబట్టి
ఆ అవయవాలు ఇప్పటికీ 
ఆ తేజస్సును వ్యక్తం చేస్తున్నాయ్..
శరీరం భగవంతుడు కాదు..
కృష్ణుడనగానే నెమలి పింఛం వేణువు..
ఇవి కాదు,,
కృష్ణుడు ఆత్మ స్వరూపుడు..
కృష్ణుడంటే ఆత్మ స్పృహ 
ఆత్మ భక్తి..


హఠాత్తుగా ఆయన శ్రీనివాసా..
అంటూ గుండె పట్టుకుని వొరిగి పోయాడు..
శిష్యులు
 అయ్యా..
స్వామీ..
గొల్లుమన్నారు..

అక్కడ నిర్యాణం .. 
ఇక్కడ ప్రాణ ప్రతిష్ట .. 
దేవునిలో లీన మవడమంటే ఇదేనా.. ??











2 ఆగ, 2017





మాతండ్రిగారైన పుట్టపర్తి వారి
గ్రంథముల కొరకు

9032796394 నందు
సంప్రదించగలరు
పుట్టపర్తి అనూరాధ

6 జూన్, 2017

వస్తా వట్టిదె .. పో తా వట్టిదే ..

అలెగ్జాండరు ..
ఎన్నో కథలు..
రాజ్యకాంక్షను పెనవేసుకున్న 
పదహారేళ్ళ పసి హృదయం ..
ఒకవైపు యుథ్థోన్మాదం..
మరోవైపు గురువు పయనించిన 
తత్త్వ రహస్యదారులపై ఆసక్తి..

ఎంతమంది మహనీయులను చూసినా..

మరణం చేయి చాచేవరకూ..
ఆ సారసమీరం హృదయాన్ని స్ప్రుశించనేలేదు..

రాచరికపు నెత్తుటిదారులలో పడిపోతున్నప్పుడు

 అతణ్ణి అరిస్టోటిలు పట్టినిలిపినట్లనిపించేది..
ఆయన తన విద్యా బోధకుడు. 
 ప్లేటో ఆరాధకుడు .. 
 గొప్ప తాత్త్వికుడు ప్లేటో.. 


మనిషిమార్గాన్నిమార్చేవి రెండే రెండు..

తల్లి.. గురువు..
గురువు నతడు సొంతం చేసుకునే సరికి..
కాలం జారిపోయింది..
రిక్త హస్తాలే మిగిలాయి..
వాటినేఅతను ప్రపంచానికి చూపాలనుకున్నాడు..


కాస్త మట్టి..

గంగాజలం..
రామాయణ భారతాలు.. 
ఒక గురువు..
భారత దేశం నుంచీ కానుకగా కావాలని  
అరిస్టాటిల్ ఎందుకడిగాడో అర్థమైంది ..
అప్పటికే సమయం మించిపోయింది .. 
జీవితం అతి త్వరగా ముప్ఫయి రెండేళ్ల కే 
ముగిసి పోయింది .. 
ఇది అలెగ్జాండరు  జీవితం .. 
మరాఠీ నుంచీ 
''భారతీయ ఇతిహాసాం తిల్ సాహసోనేరిసావే''
 అనువదించిన పుట్టపర్తి 
మన గురించి ఏం చెబుతారో చూద్దాం.. 
పుట్టపర్తి ఒరిజినల్ మరాఠీ నుంచీ తర్జుమా చేసిన వ్యక్తి 
అంతే కానీ 
మరాఠీగ్రంధానికి  ఇంగ్లిష్ అనువాదం 
దానికి మళ్ళీ తెలుగు అనువాదం .. 
ఇలా కాదు 
మరాఠీ భాష సొగసులు పరిమళాలు 
ఆత్మ జారిపోనివ్వని కథ ఇది .. 
అనువాదాలలోను పుట్టపర్తికి గొప్ప పేరే వుంది .. 




గ్రీ కు చక్రవర్తి దేశమున నలువేపులకును 

జారుల నంపుచుండెను.

జయించిన జయింపవలసిన దేశములలో 

వారు సంచరించి వచ్చి..
యక్కడి స్థితి గతులను చక్రవర్తికి దెలిపెడువారు.

వారు దెచ్చిన వృత్తాంతములలో 

నరణ్యముల నేకాంతవాస మొనర్చు తపస్వులు.. తపోవనములు.. 
నిస్సంగులు..
గ్రామైక రాత్రముగ దిరుగు తత్త్వ చింతకులు .. 
వీరి వర్ణనములు గూడ నుండెడివి.

గ్రీకు చక్రవర్తికి స్వయముగ తత్త్వజ్ఞానమునందభిరుచిగద్దు..

అతడరిస్టోటిలు శిష్యుడు..

భారతదేశమునందలి ఇట్టి 

నిస్సంగులైన పురుషుల విషయమున..
గ్రీకుదేశమునందే యెంతయో యాదరముండెడిది..
భారతదేశమునకు రాకముందే వీరి కీర్తి 
యలగ్జాండరు చెవులకెక్కినది..

గ్రీకు దేశస్తులిట్టి యతులు మొదలైన వారిని 

తమ భాషలో
జిమ్నాసోఫిస్ట్  Gymnosophist  అని పిలచెడివారు..

ఇట్టివారిని ప్రత్యక్షముగ జూచి .. 

వారితో మాటాడవలెనని గ్రీకులకెంతయో ఆశ.

అరణ్యల దపమొనర్చికొను సన్యాసులనెందరినో 

అలగ్జాండరు దనకడకు రప్పించుకొనెను..
కొన్ని యెడల దానే పోయి వారిని జూచెను..
ఇట్టి సన్నివేశముల గురించిన కొన్ని కథలు
గ్రీకు చారిత్రకులు వ్రాసిరి..
వానిలో నొకటి రెండు కథల నిచట నుధ్ధృతీ కరింతును..

ఈ యుదాహరణములతో గ్రీకులు 

భగవంతుని పుత్రుడనుకొన్న యలగ్జాండరు
వ్యక్తిత్వము గూడ మనకు బోధపడగలదు..

గ్రీకు చక్రవర్తి 

యొకనాడొక యతిని గలిసికొన్నాడు..
అతనినితడు
'' నాకీ దిగ్విజయములో సంపూర్ణ యశస్సు లభించునా లేదా..??''
యని ప్రశ్నించెను..
దానికాసన్యాసి యేమియు బదులివ్వలేదు..
అతడొక కృష్ణాజినమునుదెఛ్చి ఇఛ్చి .. 
దీనిని బరచికొని గూర్చుండుమని 
చక్రవర్తితోనన్నాడు.

ఆ కృష్ణాజినమరటియాకువలె 

ముడుచుకొని పోయినది..
దానిని జక్కగా నేలపై బరచి కూర్చొనవలసినదనియతియన్నాడు..

దానిపై యలగ్జాండరో ... 

లేక యతని యాజ్ఞ తో మరియొకరో .. 
కూ ర్చొనుటకై యత్నించెను..

కాని దానిని బరచికొనుటెట్లు..??

ఒకవైపు సరిజేసిన మరియొకవైపునుండీ.. 
యది ముడుతలువడుచు వచ్చును..

వారెంతయోబ్రయత్నించిరి..

దాని ముడు తలుబోగొట్టుటకు సాధ్యము గాలేదు..

ఆయవస్తజూచి యాయతి ఫక్కున నవ్వినాడు..

అపుడాతడనెను..
'' చక్రవర్తీ..!! భారతదేశ దండయాత్రవలన 
నీకు గలుగబోవు లాభమింతే..!!
నీవొకవేపునుండీ ముందుకు సాగిపోవునప్పుడు..
నీచే జితులైన రాజ్యములు మరల నూత్న శక్తిని సంపాదించుకుని నీపై బడును.. 
వారిని జయించుటకు నీవు వెనుదిరిగినప్పుడు.. 
జయింపవలసిన రాజ్జములు నీపై బడును.. 
నీవెట్లును.. భారతదేశ సామ్రాట్టువు కాజాలవు..''

1 జూన్, 2017

వినర ఓ రన్న..

రావణుణ్ణి రాక్షసునిగా చూడటమే 
మనం ఇంతవరకూ  చూసాం..
కానీ అదే రావణుణ్ణి దేవునిగా..
తమ పూర్వీకునిగా చూసే ఆదీవాసీలున్నారు..
రావణునికి ఆలయాలూ వున్నాయి....]
అంతే కాదు రావణునికి రాక్షస ముద్ర వేసి..
చరిత్ర వక్రీకరిచి.. 
సాంస్కృతిక దాడి చేసారన్నది ఆదివాసీల వాదన..

ఇప్పటికీ చాలాచోట్ల రావణుని ఆలయాలున్నాయంటే
రావణుని వారెన ఆదరిస్తారో అర్థం చేసుకోవచ్చు..

మధ్యప్రదేశ్ లోని విదేశ జిల్లా..
రావణ్ గ్రామంలోలేని ఆలయం.. రాజస్థాన్ లో జోధాపూర్ సమీపంలోని
స్థానికులు రామ రావణ యుద్ద్ధం తర్వాత.. 
శ్రీలంకనుంచి జోధాపూర్ వఛ్చి స్థిరపడినట్లు చెబుతారు ..

వీరితో పాటూ మరికొన్ని తె గల వారు కుడా
రావణుని వీరునిగా గౌరవిస్తారు ..
కాన్పూర్ లోనూ రావణుని ఆలయం వుంది..

ఆ ఆలయాన్ని దసరా రోజు మాత్రమే తెరిచి
 పూజలు నిర్వహిస్తారు ..
ఇంకా చాల ప్రాంతాలలో రావణుడే ఆరాధ్య దైవం..
వీరు ప్రపంచంలోనే
అతి పెద్ద ఆదివాసీ తెగవారు..
వీరి భాషకు లిపి లేదు..
ఇలా చరిత్రలోఈ హీరోలనుకున్న వాళ్ళు
కాలక్రమంలో విలన్ లుగా మారిపోతే ఆశ్చర్య పడక్కర్లేదు..

తొడకొట్టడాలు ..
మీసం తిప్పడాలు ..
కట్టి దూయతలు వంటి 
భీకర దృశ్యాలతో ప్రేక్షకులను వెర్రెత్తి పోయేలా చేసిన 
గౌతమీపుత్ర శాతకర్ణి  లో 
సత్యమెంత.. ??
చరిత్ర ఎంత .. ??
కల్పనా ఎంత .. ?? 
అని తరచి చూస్తే .. 
గందరగోళమే తప్ప మరేం కాదని 
సినీ పండితుల ఉవాచ.. 

ఇలాంటివే చాణక్యునిపైనా కల్పించారట.. 
ప్రసిధ్ధ వ్యక్తులపై అభూత కల్పనలు 
బయలుదేరడం సహజమే కదా.. 

చంద్రగుప్తుని కండగా నిలచిన చాణక్యునిపై.. 
కథలు .. నాటకాలు.. కావ్యాలు ..  రాయడానికి.. 
ఆకాలంలో చాలామంది ప్రయత్నించి ఉండవచ్చు .. 

ఎందుకంటే .. 
అర్థశాస్త్రవేత్తగా .. రాజనీతిజ్ఞునిగా నందులనంతం చేసి ప్రతిజ్ఞ నెరవేర్చుకున్న పౌరుషవంతునిగా 
ఏంతో మందికి సుపూర్తి ప్రదాత కదా.. 
కొంత మంది వీరత్వాన్ని ఎంచుకుంటే.. 
కొందరు శారీరకంగా ఆయనపై దాడి చేయడానికి కూడా వెనుకాడలేదు.. 

ఒక నాటకకర్త.. 
చాణక్యుని కురూపిగా.. 
వికృత  వానిగా మలచి .. 
 ఆనంద పడినాడట .. 

ఈ విషయాలు .. 
మన పుట్టపర్తి తెనిగించిన మరాఠీ గ్రంధం.. 
'' భారతీయ ఇతిహాశాంతిల్ సాహసోనేరి సావే''
 "స్వర్ణ  పత్రములు ''       లో మనకు కనిపిస్తాయి.. 

శక హూణాది విదేశీ దురాక్రమణదారులందరినీ తరిమికొట్టి 
జాతిని రక్షించిన చంద్రగుప్త విక్రమాదిత్య యశోధర్మాది భారత వీరుల విజయ గాధలను అభివర్ణించే స్పూర్తిప్రదమగు చారిత్రక పరిశోధక గ్రంధం  వీర సావర్కరు మరాఠీ భాషలో రచించిన 
'' భారతీయ ఇతిహాసాంతిల్ సహసోనేరి పానే '' 


ప్రసిధ్ధపురుషులను గురించి గాధలల్లుట సాధారణముగ వాడుక..
ఆ స్థితి యాతనికి దప్పలేదు.
చంద్రగుప్త చాణక్యులు మరణించిన పిదప 
ననేక సంవత్సరములకు వ్రాసిన గ్రంధములలో గట్టుకథలకు లెక్కలేదు..

జైన , బౌధ్ధ, వైదిక గ్రంధములలో నీ గాధలు

 భిన భిన్నములుగ గల్పింపబడెను..

సంస్కృత నాటక మొకటి గలదు..

ఆ నాటక కర్త కళాదృష్టితో గొన్ని గాధలల్లినాడు..
చాణక్యుడు కురూపియట..
అతని వికృత దంతములను గురించి 
నాటకకారులు విపులముగ వర్ణించిరి..

చంద్రగుప్తునాతడొకనాడు ద్రోవలో గలసెను..

నాటికి జంద్రగుప్తుడొకనాడొక గ్రామీణ తరుణుడు మాత్రమే.
వాని సాముద్రిక లక్షణములను చాణక్యుడు గమనించి యాతనిని సామ్రాజ్యాధిపతిగ నొనర్ప దలచెనట..
ఇట్టి వెన్నియో గల్పనలు..
ఈ కల్పనలలో గొన్ని యైతిహాసింక 
సత్య కణికలేమైనను గంపించునాయని జూతముగాక..

29 మే, 2017

పలికితి వేదార్థ భావమెల్ల..

శ్రీ గిరిజామనోహర్ గారికి కృతజ్ఞతలతో..
పుట్టపర్తి అనూరాధ

26 మే, 2017

ధ్యానారూఢుడనైన తలపులో..

ఆనందాశ్రులు గన్నులన్ వెడల.. రోమాంచంబుతో..తత్పద 
ధ్యానారూఢుడనైన నా తలపులో..నద్దేవుడుందోచె... నే
నానందాబ్ధి గతుండనై.. యెరుగలేనైతిన్..ననున్నీశ్వరున్..
నానా శోకహమైన యత్తనువు గానన్ లేక.. యట్లంతటన్..
(Telugu bhagavatam.org nunchee)

నా కళ్ళల్లో ఆనందబాష్పాలు పొంగిపొర్లాయి. నా శరీరమంతా పులకించింది. ఆ భక్తి పారవశ్యంలో భగవంతుని చరణాలు ధ్యానిస్తున్న నా చిత్తంలో ఆ దేవదేవుడు సాక్షాత్కరించాడు. నేను కన్నులు తెరచి చూచేసరికి భక్తుల దుఃఖాలను పటాపంచలు చేసే పరమేశ్వరుని స్వరూపం అదృశ్యమైపోయింది.



25 మే, 2017

దొరకునా ఇటువంటిసేవ..




శృతిలయలు సినిమా ఫంక్షన్ కడపలో జరిగింద.
విశ్వనాథ్ గారు వచ్చారు. 
మాఅయ్య పుట్టపర్తి ముఖ్య అతిథి. 
ఆ సందర్భంలో జరిగిన విషయం 
కళాతపస్వి ప్రస్థావన వచ్చిన ప్రతిచోటా 
విశ్వనాథ్ గారు చెబుతూనే వున్నారు.

30.10 నిమిషాలకు అయ్యమాట వస్తుంది. 
ఇవన్నీ దాచుకోడం..పెట్టుకోడం అయ్యకు ఇష్టం వుఃడదు.. అయ్యకు తెలీకుండా దొంగ దొంగగా చేయాలి. అందుకే..ఏదో సంశయం..
మీకుతెలుసా..ఆ పద్మశ్రీ అవార్డు 
ఆ పతకం ఎక్కడ పోయాయో.. 
బ్రౌన్ లైబ్రరీ లో వున్నాయేమో..

24 మే, 2017

నాపుణ్యమేమిజెప్పుదు..

కడప రేడియో స్టేషన్ డైరెక్టర్ గా పనిచేస్తూ..
మాఅయ్య సరస్వతీపుత్ర డా.పుట్టపర్తి వారికీ..
కుటుంబ సభ్యులమైన మాకు
ఎంతో ఆత్మీయులైన డా.రేవూరి అనంత పద్మనాభరావు గారు.
 నాకు ఈ ఆర్టికల్ పంపారు.
రేవూరి వారు అవధానాలలో అందె వేసిన చేయి.
 బహు గ్రంథ కర్త.
మీదుమిక్కిలి పుట్టపర్తి వారికి చేరువైనవారు.

 ఇదివరలో స్వర్గీయ శ్రీశైలం గారు
అయ్య అభిమాని..
ఎన్నో పేపర్ కటింగ్స్..
అయ్యవి భద్రపరచి నాకు అందజేశారు.

వానిని నా బ్లాగ్ లో ప్రచురించడం జరిగింది..
ఇప్పుడు అనంతపద్భనాభరావుగారు
నన్ను గుర్తు పెట్టుకుని ఆర్టికల్ పంపారు.
వారిపై నున్న భక్తి భావంతో దీనిని తిరిగి ప్రచురిస్తున్నాను.


18 మే, 2017

పుణ్యంబై..మునివల్లభ గణ్యంబై..


ఒక కొడుకు తనను వీడిపోయాడు
అదీ తనవల్ల
కారణం తనకు ధర్మబధ్ధమే
కానీ పర్యవసానం అతి ఘోరం
మనసు దహించుకుపోతోంది..
స్వాంతన కావాలి
ముగ్గురు భార్యలు
ఒక్కోరిదీ ఒక్కో పంధా..
చిన్నదని ముద్దు చేసిన మూడవ భార్య తన నిస్సహాయతను అడ్డంపెట్టుకుని
కోరరాని కోరిక కోరింది..
ఇచ్చిన మాట వలన తను నిస్సహాయుడు

ఫలితం ..
ముక్కుపచ్చలారని కొడుకు అడవులు పట్టిపోవలసివచ్చింది
ఇక మిగిలిన ఇద్దరు భార్యలు ప్రజలు అధికారులు అందరు తనని అపరాధిగా చూస్తున్నారు
తన ఆత్మే తనని చిత్రవధ చేస్తూంది
కొడుకు కోడలు పసిపిల్లలు వట్టికాళ్ళతో నడచివెళ్ళారు
ఇంకో కొడుకు అన్నకు అండగా వెళతానని పోయాడు
అతని భార్య చేసేదేమీలేక దీర్ఘ నిద్రను ఆశ్రయించింది
అన్నీ తనవల్లే..
ఇంతకీ తన తప్పేమిటి
సత్య సంధత ధర్మ పాశానికీ సత్యపాశానికీ కట్టుబడిన నేరం తనది
సత్యం ధర్మానికీ కట్టుబడటం తప్పెలా అవుతుంది

కుమిలి కుమిలి పలవరిస్తూ కళ్ళుమూసాడు
నలుగురు కొడుకులున్న ఆయనను అంతిమ సంస్కారాలు చేయడానికి ఒక్కడూ లేడు
ప్రేతసంస్కారం జరపడానికి వీలులేని ఆ శరీరాన్ని నూనె తొట్టిలో పెట్టవలసివచ్చింది..


ఇది దశరధ పాత్ర.
ఇలాంటి ఎన్నో సంఘర్షణల కలయిక రామాయణం.

ఇంత అద్భుత సృష్టి గురించి 
మిగిలిన  మహాకవుల స్పందన ఎలా ఉండేది .. 
ఇవి మనకెవరు చెబుతారు .. 
పుట్టపర్తి తప్ప .. 

ఏ ముహూర్తంలో వాల్మీకి రామాయణ రచన ఆరంభించినాడో ..
అందరికీ దాని పైననేకన్ను..

గత దశాబ్దాలలో కొందరు పాశ్చాత్యులు 
 రహస్యంగా మత దురభిమానం ఎక్కడో పని చేసేవారు
తమ గ్రంధాలతో రామాయణాన్ని పోల్చి చూడటానికి 
వ్యర్థ ప్రయత్నాలు చేశారు
కానీ అవి వ్యర్థాలుగానే మిగిలిపోయాయ్ 

వారు కూడా కడకు రామాయణ కవిత్వానికి 
తలవంచక తప్పదు
రష్యా దేశంలో సుమారు ఇరవైయేండ్లనుంచీ 
కొన్ని నూర్ల సార్లు రామాయణం నటింపచేశారట.

ఇంకా వారి హృదయాలు రామాయణచాపల్యాన్ని వదలలేదని 
వాళ్ళ వ్రాతలే చెబుతున్నాయి
కవిత్వం వరకూ పోకుండానే
కేవలం కథయే వారి దృష్టిని ఎంతో ఆకర్షించింది

రాముని పితృవాక్యపరిపాలనా
ఏకపత్నీవ్రతమూ
భ్రాతృప్రేమ
ఇలాంటి గుణాలే వారిని సమ్మోహితుల్ని చేశాయి

ఇక భారతీయులకు రామాయణమంటే నిత్యదాహం
దేశ భాషల్లో ఎందరో
 రామకథను వ్రాసుకుంటూ వచ్చినారు
రామకథాకారుల్లో పరమభక్తులై 
భగవత్సాక్షాత్కారం పొందినవారున్నారు
మహారాష్ట్రలో పండరీనాధుణ్ణి సాక్షాత్కరించుకున్న ఏకనాథుడు
భావార్థరామాయణం రాసినాడు
అవధీభాషలో తులసీదాసు రామకథను పాడినాడు
అతడు రామభక్తాగ్రేసరుడు
తమిళంలోని కంబరామాయణం చాలా ప్రసిధ్ధమైనది
మళయాళంలో ఎజుత్తచ్చెన్ రామాయణ కర్త.
వీరంతా కూడా భగవదనుభూతి కల్గినవారే.

వీరే కాక కావ్యరచనా దృష్టితో రా మకథను చేపట్టినవారెందరో
కన్నడంలో రెండు మూడు రామాయణాలున్నాయి
ఇక తక్కిన భాషల్లోను లేకపోలేదు
జైన రామాయణాలూ కొన్ని
విదేశీయ రామాయణాలూ కొన్ని.
తెలుగు కన్నడాలలో మొన్న మొన్న కూడా ఏదో శిల్పమని పేరుపెట్టి
రామకథను కొత్తరంగులు పూసిన వారున్నూ లేకపోలేదు

కానీ
 ఎవరెన్ని వ్రాసినా ఇవన్నీ 
వాల్మీకి రచనా కౌశలమ్ముందు పిల్లి మొగ్గలే అయిపోయినాయి

సావిత్రి వంటి మహాకావ్యాన్ని వ్రాసిన అరవిందయోగికి కూడా 
వాల్మీకి వంటి రచన చేయలేకపోయానే అనే నిరాశ.

ఇక సంస్కృత కవులందామా
ప్రతి ఒక్కరికి రామాయణం పైననే కన్ను
ఇది ఒక అమృత సముద్రం
సంస్కృతకవులలో అనేకులు ఆ సముద్రానికి దూరంలోనే నిలిచి నమస్కారం చేసినారు
కొందరు గట్టువరకు పోయి నిలబడినారు
కొందరు ఏవో చిన్న చిన్న మునకలు వేసినారు

ఉత్తర రామ చరిత్ర చూస్తే ఒక్కొక్కసారి నా దృష్టికి రామాయణాన్ని పూర్తిగా జీర్ణించుకోలేకపోతినే
అని భవభూతి పడిన వేదనగానే అర్థమవుతుంది


ఒక భవభూతి యేమిటి ..
అలా మథన పడిన వారెందరో ఉన్నారు. 

15 మే, 2017

వ్యాఖ్యాన వైఖరి

జిన కంచి  గురించిన వివరాలు .. 
http://www.thehindu.com/thread/arts-culture-society/article8179948.ece

12 మే, 2017

పరమ భాగవతుల పాదసేవ .. (పుట్టపర్తి కీర్తి శిఖరాల మాట గరికపాటి నోట..)


నవజీవన వేదంలో  
గరికపాటి నోట సరస్వతీ పుత్ర పుట్టపర్తి 
ప్రస్తావన వచ్చింది. 

ఈ కాలంలో నాలుగు అవధానాలు చేసినా... 
నాలుగు ప్రవచనాలు చెప్పినా 
అతణ్ణి సరస్వతీ పుత్రుడు ..
వాణీ పుత్రుడు.. 
శారదా జ్ఞాన పుత్రుడు అంటూ బిరుదాలు ఇచ్చి పరవశిస్తూ వుంటారు..
 వారి పేరు ముందా బిరుదు వారికి వన్నె తెస్తుందేమో 
కానీ ఆ బిరుదానికే వన్నె వచ్చేది 
అది తగినవ్యక్తి చెంత చేరినప్పుడు మాత్రమే..  


నిజానికి ఈ సరస్వతీపుత్ర బిరుదము 
ఎక్కడో హిమాలయాలలో 
తత్త్వ శోధన చేస్తున్న 
మౌని జ్ఞాని తపస్వి అయిన 
స్వామి శివానంద సరస్వతుల వారిచే 
పుట్టపర్తి వారికి 
పదునాల్గు భాషలలో పాండిత్యాన్ని 
బాగా పరీక్షించిన తదుపరి 
ఆనంద పరవశులై ప్రదానం చేయడం జరిగింది.

పుట్టపర్తి వారు  దేశంలోని 
అనేక కవులు  యోగులు అవధూతలు 
మొదలైన వారిని కలుస్తూ.. 
భగవదన్వేషణలో 
జీవితంపై విరక్తి చెంది పర్యటిస్తూ 
తనకు తృప్తి కరమైన సమాధానం దొరకని కారణంగా విసిగి వేసారి  ప్రాణత్యాగానికై 
ఆ మంచు కొండలనెక్కారు. 

వెంటనే స్వామి శివానంద ద్వారా 
వారి అన్వేషణకు ఒక సమాధానం దొరికింది.
 పుట్టపర్తి వారిని స్వామివారు తమ ఆశ్రమంలో 
కొన్ని నెలలు వుంచుకుని అన్ని శాస్త్రాలలోనూ 
వారి పాండితికి సంతుష్టులై 
'సరస్వతీపుత్ర '
అనే బిరుదాన్ని శిష్యవాత్సల్యంతో ఇచ్చారు..

నాకీ బిరుదులు యేమీ వద్దు 
ఎన్ని కోట్ల నామజపం చేసినా 
ఎటువంటి అనుభూతి కలుగలేదు..
 ఎందుకు అన్న ప్రశ్నకు సమాధానం కావాలి 
అని పుట్టపర్తి నివేదించగా 

'నీకు నీ జీవిత అంత్యకాలంలో కృష్ణ దర్శనమౌతుంది' అని వాగ్దానం చేసారు. 
అదే వాగ్దానాన్ని కంచి పరమాచార్యులైన 
నడిచేదైవం అని పేర్గాంచిన 
శ్రీశ్రీశ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతులవారు 
పుట్టపర్తికి మళ్ళీ ఇచ్చారు..

శివానందుల వారు నీవు నాపైని అభిమానంతో 
ఈ బిరుదాన్ని స్వీకరించవలసింది అని కోరారట.
అంత గంభీరమైన ఉదాత్తమైన నేపధ్యం కలిగినదీ సరస్వతీపుత్ర అనే బిరుదం.. 
తరువాతి కాలంలో 
పుట్టపర్తి వారిని ఎన్నో బిరుదాలు వరించినా అవి అక్కడే మర్యాద పూర్వకంగా తిరిగి ఇచ్చివేసిన సందర్భాలు వున్నాయి పుట్టపర్తి వారి జీవితంలో.. 

కానీ పరమ యోగి పుంగవులైన 
స్వామి శివానందులవారిపై గౌరవంతో 
ఒక్క సరస్వతీపుత్ర అన్న బిరుదాన్ని మాత్రం 
వారు తమ పేరులో వుంచుకోవటం జరిగింది.

అప్పటినుంచీ అది పుట్టపర్తి వారికి మరింత శోభనద్ది తనను తాను శోభితం చేసుకుంది.
ఇదే విషయాన్ని మహా సహస్రావధాని గరికపాటివారు వివరించారు.. 
సరస్వతీపుత్ర ఆంద్ర దేశం లో ఒక్క పుట్టపర్తి నారాయణాచార్యులు వారికే వుంది 
ఇంకెవ్వరికీ అది శోభించదు ,
అంటూ వాక్రుచ్చారు .. 

-పుట్టపర్తి ప్రియపుత్రిక పుట్టపర్తి అనూరాధ భక్తి పూర్వక సమర్పణ.

10 మే, 2017

రాయల రాజభక్తి

krishnadevaraya childhood కోసం చిత్ర ఫలితం
రాజులకాలంలో 
రాజు కొడుకే మళ్ళీ పాలనాధికారాలు చేపట్టేవాడు..
చిన్నప్పటినుంచే గుర్రం స్వారీ.. ఖడ్గ చాలనం వంటి ఎన్నో విద్యలు నేర్పించేవారు
తండ్రిని చూసే పాలనాదక్షత రాజకీయపుటెత్తుగడలు ప్రజాపాలన మొదలైనవి ఫాలో అయిపోయ్యేవాళ్ళు

మరిప్పుడు ప్రజాస్వామ్యం
అయిదేళ్ళకోపారి ఎన్నికలు..
ప్రజలెన్నుకున్నవాడే నేత...
కానీ మనకలా అనిపిస్తుందా ..
కె సీ ఆర్ కొడుకే కాబోయే ముఖ్యమంత్రి..
చంద్రబాబు బాబే మనకు కాబోయే మరో బాబు..
పధ్ధతి మారింది కానీ అంతా సేం టు సేం..

 ప్రతిపక్షాన్ని ఎదుర్కొనడం తొక్కిపెట్టటం..రిగ్గింగ్ రెండుసంవత్సరాలముందే రాబోయే ఎన్నికలకు జనాల నెలా బుట్టలో పడేసుకోవాలి 
అనే అంశాలమీద తర్ఫీదునిప్పిస్తున్నారు..

మన సాహితీ సమరాంగణ సార్వభౌముడు రాయలవారు తన ఇరవయ్యవయేట రాజ్జాధికారాన్ని చేపట్టి
అంధ్ర భోజునిగా
కన్నడ రాజ్య రమా రమణునిగా
కీర్తించబడి..
గొప్ప రాజనీతిజ్ఞునిగా..సైనికాధికారి భుజబల సంపన్నుడు ఆర్థికవేత్త వ్యూహ నిపుణుడు..పట్టినపట్టు విడువనివాడు
అంతే కాదు
కవిపోషకుడు.. సాహితీ సమరాంగణ సార్వభౌముడు గా నుతింపబడ్డాడు..
మరి ఈయన తన వారసుణ్ణి తన తర్వాత రాజుగా చూసుకున్నాడా..
ఇందులో కొన్ని సందేహాలు
మనచరిత్ర అంతా యే పోర్చుగీసు వాడో.. 
లేకపోతే మనల్ని పాలించి పోయిన బ్రిటిషు వాడో చెబితే తెలుసుకోవలసిన దుస్థితి..

వాళ్ళలో ఒకడైన న్యూనిజ్ 
మన రాయల పాలనా వైభవాన్ని పరాయి దేశస్తుడైనా కళ్ళకు కట్టినట్టు చూపించాడు


1346 లోని యొక శాసనమిట్లున్నది..
'' మహామండలేశ్వర భాషగె రాయరగండ హిందూసురత్రాణ, శ్రీవీర అరియప్ప వడయరు బుక్కప్ప వడయరు రాజ్యపాలన్ చేస్తుండంగాను..''

తమిళములోనే మరియొకటి యిట్టిదే గలదు..
హరియప్ప బుక్కణ్ణ లిర్వురును జేరి 
తెక్కల్ నాడు లోని జనులకిచ్చిన యాజ్ఞాపత్రమది..

1386 లో గూడ 
హరిహర బుక్కల సమిష్టి పాలనము దెల్పు శాసనము గద్దు..
దేవరాయల సుతుడైన విజయ రాయుడును 
దండ్రి కాలముననే సహాయ సం రక్షకుడుగ నున్నట్లు శాసనములున్నవి..

అట్లే..
విజయరాయసుతుడైన రెండవ దేవరాయుడు గూడ
ఇతడు వీర విజయ రాయల సహాయ సమ్రక్షకుడుగ పనిజేసెను..

విరూపాక్ష రాయలును దన కుమారునితో గలసి రాజ్యపాలన మొనర్చినట్లు శాసనాధారములుగలవు..

ఇంతలో సాళువ నరసిమ్హుడు సిమ్హాసనము నాక్రమించెను..

కృష్ణదేవరాయలుగూడ దన కుమారుడైన తిరుమలునితో జేరి సమిష్టి పాలన మొనర్చెనేమో..
ఈ విషయమును ధ్రువపరచు 
1524 లోని యొక దాన శాసనము గలదు..

దానివిషయమిది.
'' తిమ్మరుసు 
గృష్ణదేవరాయల కాయురారోగ్యములు బ్రాప్తించుటకై.. గొన్ని పల్లెలపైని సుంకమును
 'మాగడీ లోని తిరువేంకటేశ్వరునకు సమర్పించెను..
ఈ సుంకములా దేవుని భూషణసేవకు..

తిమ్మణ్ణ ధన్నాయకుడను మరియొక యుద్యోగి తిరుమల రాయని నిరంతరాభివృధ్ధికి  
మరికొన్ని సుంకముల నా దేవునికే యొసగెను..

కృష్ణ దేవరాయడు దన కొడుకుతో జేరి పరిపాలనమును కొన్ని దినములు సాగించెనని
న్యూనిజ్ వ్రాతగూడ నున్నది..
పైశాసనమావ్రాతకు దోడ్పాటు..

కృష్ణదేవరాయల కుమారునిపేరేమో 
న్యూనిజ్ వ్రాయలేదు ..
తురుష్కులపై విజయమును సాధించిన తరువాత రాయలేమి చేసెనో యాతడిట్లు దెలిపెను.

'వృధ్ధాప్యమున దాను విశ్రాంతి గైకొనవలెనని 
రాయల యాశ.
తన యనంతరము
 గుమారుడు సిం హాసనము నెక్కి పరిపాలింపవలెనని వేరొక యాకాంక్ష.

ఈ రెండు కోరికలను సాధించికొనుటకు 
బూర్వ రంగమున దాను బ్రతికియుండగనే 
వానిని రాజుగ నొనర్చుటకు రాయలు సంకల్పించెను
అప్పటికి గుమారుని వయస్సు 
ఆరు సంవత్సరములు మాత్రమే..

తన యనంతరము పరిస్తితులెట్లుండునో యని యనుమానించి రాయలు గుమారునకు బట్టాభిషేకమొనర్చెను..
తన యధికారములన్నియు వానికి గట్టబెట్టినాడు..
సిం హాసనము నప్పగించెను..

తాను మహాప్రధానియైనాడు..
తిమ్మరుసు మహామంత్రికి సలహాదారుడు..

కృష్ణరాయల రాజభక్తి యెంతవరకు వచ్చెననగా..
సిం హాసనాధిష్టుడైన కుమారుని యెదుట 
నాతడే మోకరిల్లుచుండెనట..
పట్టాభిషేకమహోత్సవములు 
సుమారెనిమిదినెలలు సాగినవి..
ఈ వేడుకలలోనే .. 
చిన్నరాజుకు జబ్బువచ్చి మరణించెను..''

అదే న్యూనిజ్ మరియొక చోట 
''కృష్ణరాయ సుతుని వయస్సు పదునెనిమిది నెలలు మాత్రమే నన్నాడు అతని వ్రాతలలోననేక చోటులనిట్టి వ్యాఘాతములు దగులుచుండెను..''
అదీ సంగతి .. 
 రాచరికపు రాజకీయాలు .. 
సొంత తమ్ములు... సవితి తమ్ములు.. 
చిన్నాయన  పెదనాయన పిల్లలు.. 
చంపడాలు బందీలుగా చేసి మగ్గబెట్టడాలు .. 
ఎన్ని పన్నాగాలో.. 
అందులోనూ 

వారసులను కాపాడే రాజభక్తులు 
వేరేచోట పెంచి పెద్ద చేసి .. 
ఆఖరికి పుట్టుమచ్చలాంటి ఋజువు లు చూపి రాజును చేసేయడాలు  .. 
అన్నీ మనం సినిమాలలో చూసేసాం .. 
ఆ పసివానిముందు మోకరిల్లిన 
రాయల రాజభక్తి మన కట్టప్పనుపోలి లేదూ.. 


11 ఏప్రి, 2017

'రాస్కోరా సాంబా,,'


ఇంటికో వుద్యోగం .. పేదలకు ఇళ్ళు..
ఇరవైనా లుగ్గంటలూ విద్యుత్తూ..
వాగ్దానాల వరాలు ఎన్నికల సమయంలో నాయకుల నోట్లో పొంగి పొర్లుతుంటాయి
అందులో నెరవేరేవెన్నో ఎవ్వరికీ తెలియదు 
ఆఖరికి వాళ్ళకు కూడా
ఒక్కొక్క నాయకుడి ఆస్తులు మాత్రం అనూహ్యంగా పెరిగి పోతుంటాయి
పేదలు పేదలే ఎప్పటికైనా..

పొద్దున్నే పేపరు తెరిచినా టీవీ ఆన్ చేసినా 
ఒకటే వార్తల వరద..
అలంకానిపల్లె నుంచీ అమెరికా దాకా ఎక్కడ చీమ చిటుక్కుమన్నా మరునిమిషంలో 
అది breaking news
ఇవేవీ లేనికాలం ఎలా వుండేది..

బాహుబలి ..గౌతమిపుత్ర.. 
వీటివలన మళ్ళీ జనాల్లో ఆ గుర్రాలు ఆ డేరాలు ఆ యుధ్ధాలు మళ్ళీ గుర్తొచ్చాయి..

రాజు గుర్రం పై ఏ ఊరెళ్ళినా .. 
వెనకే వందమంది పరివారం
వాళ్ళలో  లేఖకులొకరు
రాజెక్కడికి పోయినా పుస్తకా లకెక్కించడమే వారిపని
మంతనాలు..  రాజకీయాలు ..దానాలు.. హెచ్చరికలు 
ఓహ్ ..
ఒకటేమిటి
లేఖకుడు అన్నీ ఎక్కించేవాడు రికార్డుల్లోకి 
'రాస్కోరా సాంబా,,' అంతే
రాజు కార్యక్రమాలన్నీ వారి డైరీల్లో నిక్షిపమై వుండేవి..
ప్రజలు రాజు దైవంశ సంభూతుడని నమ్మినా 
రాజు తోచినట్లు ప్రవర్తించేది వారు కాదట .. 
అందుకు కారణం . 
నైతిక ఆధ్యాత్మిక శక్తులు .. 
ఇప్పుడు లేనివే అవి.. 
పుట్టపర్తి విజయనగర సామాజిక చరిత్ర లో విషయాలివన్నీ .. 




''చక్రవర్తికి కూడ ప్రత్యేక విలేఖరులుందురు..

ఊరు వదలినప్పుడు చక్రవర్తి వీరిని వెంట బెట్టుకొని పోవును..
రాజేదేన మాటాడును..
వారు వెంటనే దస్త్రములకెక్కింతురు.. 
ఎవరెవరిని జూచినది
యే విషయముల చర్చించినది..
యే నిర్ణయమునకు వచ్చినది
సమస్తమును వారు వ్రాసి పెట్టుదురు..
ప్రభువిచ్చిన దానములను గూడ వారు గుర్తువేతురు..
వీరికా రాజ్యమున గొప్ప గౌరవము..
ప్రసక్తి వచ్చినపుడు వారు దమవ్రాతలలోనుండి ప్రభువునకు విషయములందింతురు..
ఏ యాజ్ఞ కాని ..
రా జు వ్రాసి యివ్వడు..
దానము గూడనంతే..
అతనిది మాట.. 
వీరిది వ్రాత..
మరి ప్రతిగ్రహీతకు గుర్తేమి..?? 
చక్రవర్తి యుంగరమునకు బ్రతికృతులు కొన్ని మహాప్రధాని కడనుండును..
నాతడొకదానిని లక్కపై ముద్రించి దానము గ్రహించిన వారి కొసగును..
అతనికంతే గురుతు..
దాన వివరములు పొత్తములలో నుండును..
మహామంత్రి రాజుమొహరుల నాధికర పత్రములపై వాడును.''

8 ఏప్రి, 2017

భగవంతుడెవనిపై మైత్రి పాటించునో..

భగవంతుడెవనిపైమైత్రి పాటించు
సత్కృపానిరతి  బ్రసన్నండగుచు 
నతనికి దమయంత ననుకూలమైయుండు 
సర్వభూతంబులు సమతబేర్చి
మహిదలపోయ నిమ్న ప్రదేశములకు
ననయంబుజేరు తోయముల పగిది..

భగవంతునిదయకు పాత్రమైన వాని దగ్గరికి అందరూ తమంతతామే అనుకూలభావంతో పల్లానికి పారే నీటి వలె చేరుకుంటారు.
(ధృవోపాఖ్యానము)


6 ఏప్రి, 2017

తడివోవని పూలసెజ్జ..

శ్రీరామ నవమి.. అమ్మకు చాలా ప్రియమైన పండుగ..అసలు అమ్మ ఆరాధ్య దైవం శ్రీరాముడే! (అయ్య అష్టాక్షరీ ఉపాసకులు) అమ్మ పాటల్లో యెక్కువ శ్రీరామాంకితాలే!మా అమ్మగారి భావాలన్నీ, కోమల భావ భరితాలు..., లలిత పద బంధ సౌరభ సమంచితాలు....మీరూ చదివి, విని అనుభూతిస్తారని నా ఆశ.  వాటిలో యీ పాట, యెక్కువ ప్రజాదరణ పొందింది ఆకాశవాణి ద్వారా!  (శ్రీరామ నవమి శుభ తరుణాన, మా అమ్మ పవిత్ర స్మృతిలో..మా మూడో అక్కయ్య. డా.పుట్టపర్తి తులజాదేవి, .నా చెల్లెలు శ్రీమతి పుట్టపర్తి అనూరాధ తో కలిసి యీ పాట మీకోసం)

రాముని సేవించెనూ, ప్రేమమ్మున సకల ప్రకృతి
 రాముని సేవించెనూ...

అడవుల త్రోవల జనగా, అడుగులు కందెడునోయని,
తడివోవని పూల సెజ్జ అడుగడుగున పరచిలతలు..

రాముని..

తోయజ మకరంద ధునీ తోయంబుల మెల్లగా,
తోయజాంబకుని  మృదుపద తోయంబుల కడిగి నదులు..

శ్రీ రాముని...

తారక రాముడు రాముడు కారడవుల పయనించగ,
పోరాములు మాని ప్రకృతి గారాములు నెరపీ...
శ్రీ రాముని...

రచన : శ్రీమతి పుట్టపర్తి కనకమ్మగారు
సంగీతం డా.మాడభూషి చిత్తరంజన్ గారు
భక్తి రంజనికోసం ఆకాశవాణి విజయవాడలో
ముందుగా గానం చేసినది: శ్రీ డీ.వీ.మోహన కృష్ణ (బాలమురళిగారి ప్రియ శిష్యుడు) బృందం
ఇప్పుడు వినయపూర్వక సమర్పణ : నాగపద్మిని