12 అక్టో, 2016

గంధవహు తాళానికనువుగ..






బహు రత్నద్యుతి మేదురోదర దరీ భాగంబులన్ - బొల్చుని
మ్మిహికాహార్యమునన్ జరింతు మెపుడున్ ప్రేమన్నభోవాహినీ
లహరీ శీతల గంధవాహ పరిఖేలనంజరీ సౌరభ
గ్రహణేందిర తుందిలంబులివి మత్కాంతార సంతానముల్

పై పద్యం ప్రత్యేకంగా చెళ్ళపిళ్ళ వేంకటశాస్త్రి గారికి యెక్కువగా ప్రీతిపాత్రమైనదంటారు. 
మాటిమాటికీ వారీ పద్యం చెప్పేవారని 
చాలా మంది చెప్పగా విన్నాను. 

నేనొక్కసారి మాత్రమే చెళ్ళపిళ్ళవారిని చూశాను.
అప్పటికే ఆయనవృధ్ధుడు. 
ఏదో నా అంధ్ర సంస్కృత కవిత్వాలు వినిపించి వచ్చేశాను. ఇంతకూ ఆయన అం తగా మెచ్చుకునే వాడంటే 
ఈ పద్యంలో యేదో వుండివుంటుంది.

వరూధిని తన అ డ్రసుప్రవరునితో చెప్పే 
ఘట్టంలోనిదీ రచన. 

హిమవత్పర్వతాలలో అనేకాలు దరులుంటాయట. 
ఆ దరులలోపల నానా వర్ణములు గలిగిన రత్నాలు 
ఆ రత్నాల కాంతులతో 
ఆ గుహలు జిగ జిగ వెలిగిపోతుంటాయి. 

ఆకాశగంగ అక్కడే పారుతూ వుంటుంది. 
ఆ నదిపై నుండి వీచే చల్లని గాలులు 
పైగా అవి వట్టి గాలులు కావు. 
చందన మందారాదులైన అనేక వృక్షాలనూ పూలనూ స్పృశించి చల్లగా వీస్తుంటాయి. 

గాలికి ప్రధానంగా మూడు గుణాలు చెప్తారు. 
గంధమూ శైత్యమూ మాం ద్యము 
గంగానదీ తరంగ సంగమంతో వీచే గాలులైన దానివలన అవి చల్లగా వున్నై. 

వివిధ పుష్పలతాదులను స్పృశించి వచ్చేదానితో 
ఆ సుగంధాలన్నీ గాలిలో మిళితమై వుంటాయి. బ్రహ్మాండములైన చెట్లు 
వాని సంచారాన్ని అడ్డగించే దానివలన 
ఆ వాయువులు మందంగా వీస్తున్నాయి. 

ఇన్ని గుణాలనూ పెద్దన్న 
 'గంధవహ ' శబ్దంతో సూచిస్తున్నాడు. 
ఆ గాలుల తాకిడివల్ల 
తీగలలోని పుష్ప మంజరులు చలిస్తున్నాయి. 

ఆ పూగుత్తుల సౌరభములతో ఆకర్షింపబడి 
తుమ్మెదలు బారులు గట్టి పరిగెత్తుతూ వుంటాయట. 
అట్టి తుమ్మెదలతో నిండినవి 
తాను నివసించే హిమాలయ ప్రాంతాలని వరూధిని 
తన ఘనతను చెప్తూ వుంది. 

ఈ మాటలు అందరు కవులూ చెప్తే 
ఇక్కడి 'గంధవహ' శబ్దం 
అర్థపుష్టితో పరమ ఆకర్షణీయంగా వాడబడింది. 

రెండవ పాదం తుద నుండీ ప్రారంభమైన సమాసం సుమారొకటిన్నర పాదాన్నాక్రమించుకుంది. 
అది సంస్కృత సమాసమైనా
 సంస్కృత సమాసమని మనకు తోపింపచేయదు. 
కఠిన పదమొక్కటిన్నీ కనిపించదు. 
మెత్తగ ద్రాక్షారసం వలె సమానంగా సాగిపోతుంది

ఇలాంటి సమాసాలు సృష్టించడంలో 
పెద్దనామాత్యుడు సిధ్ధహస్తుడు. 
ఆయన రచన  అంతా శిరీష కుసుమ పేశలమైనది. 
బుధ్ధిని వేధించే క్లిష్ట కల్పనలకు గానీ 
సమ్యుక్తాక్షరాలకు గానీ పెద్దన్నగారు విరోధి. 

ఆయన కావ్యమంతా విసుగు లేకుండా 
ఒక్క వూపుతో చదివేయవచ్చు. 
పై పద్యంలో సమాసానికి మురిసిపోయి వుంటారు చెళ్ళపిళ్ళవారు. 
వారి మెప్పు నిజమైనదే.