1 మార్చి, 2016

శిల్పాలలో నవరసాలు



శృంగారం హాస్యము కరుణ 
రౌద్రం వీరం భయానకం 
భీభత్సం అద్భుతం శాంతం..
ఇవీ నవరసాలు
నటులు నవరసాలు పలికించటం తెలుసు.. 
మరి శిలలు నవరసాలు పలికించటం విన్నారా.. 
ఈ నల్లని రాలలో .. ఏ కన్నులు దాగెనో .. ఈ బండల మాటున ఏ గుండెలు మొగెనో అన్నది సినిమా పాట 
 కదల లేని మెదల లేని ఆ శిలలు 
ఉలి అలికిడి వినగానే జల జలా భావాలను ప్రవహింప జేస్తాయి .. అని కవి వాక్కు 

'ఎట్లు పైకెత్తిరో..  ఏన్గు గున్నలకైన తలదిమ్ము గొలుపు 
ఈ శిలల బరువు '
అని బాల పుట్టపర్తి ఆశ్చర్యపడ్డారు..

'శిలలు ద్రవించి యేడ్చినవి.. '
కొడాలి సుబ్బారావు గారు 
శిలలకు మనసుంటుందని 
వాని హృదయమూ ద్రవిస్తుందని 
అవి కన్నీరు పెట్టుకుంటాయని చెబుతున్నారు

'ఉలి చేరాలకు చక్కిలింతలిడి ..
ఆయుః ప్రాణములు' శిల్పి పోస్తాడని 
పుట్టపర్తి తన పధ్నాలుగో యేట పెనుగొండలక్ష్మిలో వ్రాసుకుంటే.. 
అబ్బురపడ్డారు రాళ్ళపల్లి అనంత కృష్ణశర్మ వంటి పెద్దలు. 

పుట్టపర్తి పెనుగొండలక్ష్మి లో 
ఇటువంటి అద్భుతమైన వర్ణన లున్నాయి  .. 

మనమూ కొన్ని వందల వేల సంవత్సరాలు 
శిలలై పడివుండి..
ఎవరో మహాత్ముడు మనపై పాదం మోపిన పుణ్యానికి .. మన కర్మ నశించి .. 
జన్మల నడక మొదలై..
ఇదిగో మనిషి వరకూ వచ్చామట..


మరి ఆ శిలల నవరసావిష్కరణ 
పుట్టపర్తి నోటి వెంట వింటే ఎలా వుంటుంది .. 
విజయ నగర సామాజిక చరిత్ర నుంచీ .. 




































విరుపాక్ష స్వామి గోపురములు


విఠలాలయం సమీపం లోనే రాతిరధం వుంది ..
ఇది ఒకే శిల
దీని చక్రాలు తిరుగుతాయి.. కదులుతాయి కూడా..


28 ఫిబ్ర, 2016

యువ రేడియో లో పుట్టపర్తి శివ తాండవం


యువ రేడియో లో పుట్టపర్తి శివ తాండవం 







మరి పుట్టపర్తి గళం లో శివతాండవం 
మరోసారి వింటే ఎలా వుంటుంది .. 








27 ఫిబ్ర, 2016

కుహు .. కు హూ ..



ప్రాచీన కావ్య సాహిత్యములు జెప్పెడి కొన్ని ఆచారములు మనకర్థమేగావు.
జీవన విధానమే మారిపోయినవి కదా..
నాచనసోముడు మొదలైన వారు ఇట్టి ప్రయోగము లెన్నిటినో చేసినారు.
కీర్తిశేషులు సురవరం ప్రతాపరెడ్డిగారు .. 
వేటూరి ప్రభాకరశాస్త్రి గారి వంటి విద్వాంసులెంతయో శ్రమకోర్చి కొన్నింటి కర్థములను వివరించిరి.
కాని .. ఇంకను దెలియని వెన్నో గలవు.
అన్నమయ లోనిట్టివి వేలకు..
నలుగురు చెప్పని రీతిగా జెప్పవలె ననునాస వరాహపురాణములో నెక్కువ..
ఈ గుణము హర్షింపదగ్గదే..
కాని.. సాధించుట కష్టము..

ఆంధ్ర సాహిత్యములో నీ ''మురారే స్త్రుతీయః పంధా' ను సమర్థముగా నెగ్గించి కొన్నవారిద్దరే..
రాయలు.. తెనాలి రామకృష్ణుడు..
ఈ క్రిందిది వీరి వసంత వర్ణనములోనొకటి..

కం. తన పగతు కంఠమును బో
లె నటించురతీశ్వరుండలిగి కత్తుల బో
నున బెట్టిన మూల్గెడి విధ
మున పికము ప్రవాళ మధ్యమున నెలుగించెన్..

వసంత కాలములో కోకిల కూసిన స్వారస్యమిది 
మనకవులు కోకిల స్వరమును పంచమ స్వరముతో బోల్చి యెంతయో మురిసిరి..
దాని కషాయ  కంఠమున కేమేమో మేత లు ..
వీరి కోకిల మూల్గినదట..

వరాహ పురాణము పీఠిక నుంచీ..

24 ఫిబ్ర, 2016

ధార..



సాధారణముగా విమర్శకులు పూర్వకవులను 'ధారాశుధ్ధిగలవారని..'
యొకటే గాటిలో గట్టివేయుట కద్దు

కాని ..
వారు వారు సాధించిన ధారాశుధ్ధులలో దేడాలున్నవి

నన్నయ్యగారిది శ్రోత్రపేయమైన ధార..
'దీని తెర గిట్టిదీ' యని నిర్ధారింపరాని సంగీతము..
తిక్కన్నది ఎండాకాలపు వాగు..
నిలిచి.. నిలిచి .. ప్రవహించును..
శ్రీనాధునిది నాద శుధ్ధిపై ప్రత్యేక దృష్టిలేని 
వర్షాకాలపు ప్రవాహపు హోరు...
పెద్దన్న గారిది 
వీణానిక్వాణములు ఆనుషంగికముగా వెంట రాసాగిన ధార..
రాయలు .. రామకృష్ణుడు 
వీరిర్వురిది.. డొంకతిరుగుడు ధార..
ప్రవాహములో నెక్కడ సుడులున్నవో .. తెలియదు..
తలలెత్తిన గుండ్లెక్కడున్నవో యెరుగలేము..
నారదుని మహతినే.. 
కనకాద్రి కూట గర్జత్కాళికతో బోల్చిన రసికుడు వాడు..
రామరాజ భూషణుడు సాధించినది .. 
మాధురీధుర్యమైన తానా మృతముల  ధా ర ..
సంగీతములో జెవిగలిగిన సాహిత్యకారుల కీవింగడింపులంత కష్టసాధ్యముగాదు..

'వరాహపురాణము ' పరిచయము నుంచీ..

15 ఫిబ్ర, 2016

ఎందుకయా సాంబశివా..


అది ప్రొద్దుటూరు దగ్గర చీపాడు..
చుట్టూ పొలాలే..
అతి తక్కువ  వర్షపాతం
అందులో పండే ఏవో కొన్ని పంటలు 
ఇదీ రాయలసీమ

ఆ పొలాలలో ఓ గుడిసె
అందులో ఇరవయయిదేళ్ళ పుట్టపర్తి..

మంచి పేరు ప్రతిష్టలు..
పెద్ద పెద్ద వాళ్ళనుంచీ ప్రశంసలు..
వాళ్ళు కూడా పుట్టపర్తి మేధకు అబ్బురపడ్తూనే
ఆయన విచిత్ర వైఖరికి ఆశ్చర్య పడి దూరం వెళ్ళిపోయేవారు..

ఉద్యోగం లేదు..
ఎప్పుడూ పూజలూ జపాలూ భజనలూ
అంతే..
ఇదీ ఆయన జీవితం
ఇంతకూ ఆయన సన్యాసి కాదు.
భార్య ఇద్దరు ఆడపిల్లలు
చదువు లేదు సంధ్య లేదు వాళ్ళకి..
ఆరేళ్ళు పదేళ్ళు
మరి తిండి..
వాళ్ళూ వీళ్ళు దయతలచి ఇస్తే..
వారి గురించి ఆయనకు అసలు యోచనే లేదు..

భార్యా పిల్లలపై బంధం లేదు..
వారి భద్రతపై పట్టింపు లేదు
రేపెలా అనే విచారం లేదు
అసలు అతనికి సంసారమే అక్కరలేదు..

అమ్మమ్మ గొప్ప ధనవంతురాలు 
ఆ కాలంలోనే వడ్డాణం వంటి ఆభరణాలు కలిగినది.
ఆమె అమ్మ స్థితిని చూసి గుండె తరుక్కుపోయేలా ఏడ్చేది.. పాపం

కట్టెలపై వంట..
అమ్మ వంట చేసి ఆ పొలాల్లోని పొదల్లో ఏ చాటునో కూచుని ఏడుస్తు వుండేది..అమ్మ
అక్కయ్యలకు ఆ పరిస్తితులలో భయం
అమ్మ ఒక్కతే వారికి తోడు.
అమ్మా
అమ్మా
అని అరుస్తూ ఏడుస్తూ వారు అమ్మను వెతుక్కునే వారు..
ఆ పరిస్తితులెంత భయానకం..
ఒక గృహస్తు తన గృహస్తు ధర్మాన్ని నిర్వహించాలి..
గృహస్తు ధర్మం లో వుంటూనే సాధన కొనసాగించవచ్చు..
ఒక గృహస్తు మానసిక స్థితి
 సన్యాసి  స్థితిని పోలినప్పుడు..
 అటు సాధువూ కాలేక 
ఇటు గృహస్తూ కాలేక ..
అటు భక్తి వదలలేక ఇటు రక్తిని వదిలించుకోలేక ..

12 ఫిబ్ర, 2016

జీవితం ఏమిటి ..??


పుట్టుకనుంచీ మరణం దాకా సాగే ప్రయాణమే జీవితం
చదవగలిగితే ప్రతి  జీవితమూ చరిత్రే..

జీవితం ఒక్కొక్కరి దృష్టికి ఒక్కోలా కనిపిస్తుంది
చార్లీ చాప్లిన్ హాస్యనటుడు
ఆయన జీవితం గురించి యేమంటారంటే..
లాంగ్ షాట్ లో ఆనందం గా 
క్లోజప్ లో విషాదంగా కనిపించేదే జీవితం
ఆరుద్ర గారైతే జీవితాన్ని రేడియో సెట్టుతో పోల్చారు 
జీవితం రేడియోసెట్టుకు భర్త ఏరియల్ భార్య ఎర్త్ 
అట..
'జీవితంలో అందరిప్రయత్నమూ గెలవడానికే..
 ఎవ్వడూ ఓడదలచడు..'
ఇది దాశరధి రంగాచార్య గారి మాట .. 
బాగా చదివి వుద్యోగం సంపాదించి పెళ్ళాడి పిల్లల్ని కని
వీలైనంత డబ్బు కూడబెట్టి పిల్లలకిచ్చి
ఇది అందరూ చేసేది
కొందరు తాము చేసే ఉద్యోగాలతో పాటు ఒక పని పెట్టుకుంటారు
ఆడటమో పాడటమో జంతువుల్ని పెంచటమో..
పార్టీలు విందులు విలాసాలు వీలైనంత జీవితం యాష్ చేయటం మరికొందరి అలవాటు
కొందరు మాత్రం డిఫరెంట్గా ఆలోచిస్తారు
వారు ఏదో లక్ష్యం కోసం తపిస్తుంటారు
వారికి ఏది వున్నా లేకున్నా వానిపై దృష్టివుండదు
అనుక్షణం ఆ లక్ష్యమే గుర్తొస్తుంటుంది
పోనీ ఆ లక్ష్యం నెరవేరిన తరువాత వారు పొందేది
ఏది వున్నా లేకపోయినా సరే.
క్రింద ఇచ్చిన వారి అభిప్రాయాలు చూడండి
ఒక్కొక్కరు ఒక్కో మార్గం ఎంచుకున్నారు
తర్వాత 
జీవితం గురించిపుట్టపర్తి వారేం చెప్పారో చూద్దాం  .. 

















భగీరధుడు గంగను దెచ్చెను.
రురుడు తాను ప్రేమించిన ప్రమద్వరకు 
తన యాయువులో సగమిచ్చినాడు.
పురూరవుడు ఊర్వశీ వ్యామోహితుడై 
ఆమెను గనుగొను వరకును వదలలేదు
రాజైన కౌశికుడు బ్రహ్మర్షి యగువరకును దపించినాడు
నడుమ వచ్చిన యపజయములాతని పట్టుదలను సడలింపలేదు..

అవియన్నియు మనపాలికి పురాణములు.
ఆనాడు జీవితమున కొక యర్థముండెను.
మానవులకు పురుషకారములో విశ్వాసముండెను.
జీవితము ..
యేదో అనుభవించి పోవలసిన వెర్రి పదార్థము గాదనియు
ఐహికాముష్మికములను సాధించుటకు 
గొప్ప అవకాశమనియు..
 ప్రతియొక్కడు విశ్వసించెను

ఐతిహాసిక యుగమునందుకూడ
మానవులలో నా సుగుణముండెను.
ప్రతియొక్కరేదో యొక విషయమున 
గట్టుదాకుచునే యుండిరి.

ఒక్కడు మహాయోగి
మరియొకడు మహా భోగి
భోగమును గూడ వారు తృణీకరించలేదు..
యోగికున్న గౌరవమునే భోగికి కూడ నొసగినాడు

అల్పముగా నారంభములైన జీవితములు 
ఆకసమంతటి విశాలములుగా పరిణతము లగుచుండెను
మేరుశిఖరములంతటి యున్నతములుగా బెరుగుచుండెను.
సత్యమును జెప్పుటకు వారికి జంకులేదు
దాని నాచరించుటకు గూడ గొంకు లేదు

ఇతరులెన్ని విమర్శించినను తన లక్ష్యమును సాధిం చునంతవరకును వాడు నిద్రబోవుటలేదు.
 ప్రతియొక్క గుణమునందును 
వారు దివ్యతత్త్వమునే జూచిరి
ఒక్క గుణమునే కడముట్ట నుపాసించిరి.

హైద్రాబాద్ లోని సాలార్జంగ్ మ్యూజియము ను చూచినప్పుడు ..
'ఒక్క మనుష్యుడింతటి పని యొనర్పగలడా..?'
యని మనకాశ్చర్యము గలుగును.
అందులోనే 
గొన్నిబహమనీ సుల్తానులు ధరించిన 
ఇనుప తొడుగులున్నవి
ఒక్కొక్క తొడుగును నేడొక రెండెడ్ల బండి మోయవలెను.
వారి కత్తులు గూడ 
మనవంటి నల్వురు మనుష్యులు మోయవలెను
వానిని బూని వారు యుధ్ధము లొనర్చెడువారు

నేటికిని స్వతంత్ర్యములైన దేశములోనున్న జాతులలో 
ఆ గొప్పతనములున్నవి

షా పత్రికలను బంచువాడుగా జీవితములో ప్రవేశించెను.
కడకు బ్రహ్మాండమైన పురుషుడైనాడు.
ఇట్టివారెందరో యున్నారు
అంతమాత్రముతో ఆ దేశములో ధనిక తత్త్వములోని దుర్మార్గములు లేవనుటకు వెలులేదు.

కాని మనకన్నను ఆ జాతులలో ఋజుత్వమెక్కువ
హుందాతనమెక్కువ..
సత్యశీలత యెక్కువ.
జీవితమనుట కర్థమెక్కువ

దానికి కారణము..?
కొన్ని నూర్లయేండ్లుగా ప్రజాతంత్ర జీవితమున కలవాటుపడినవారు వారు.
ఆ వాసన వారికా గొప్పదనమునిచ్చెను

మన సమాజ మార్థికముగా 
చచ్చిపోయిన స్థితిలో నున్నది
జీవితమర్థరహితమైన వెర్రిపాటగా మారినది
మన ధర్మములు వీధిలోని బిచ్చగాండ్రను సృష్టించినది.
వారిని జూచి మనకు కరుణ గలుగు స్థితి గూడ పోయినది.
పుట్టుకును, చచ్చుటకును 
మన సమాజములో నర్థములేదు

మానవుని కనీస ధర్మములైనను శూన్యములై పోయినవి
మన వేదాంతమునకు సామాన్యునివైపు చూపేలేదు.
అదెప్పుడును ధనికునకు చామరము వీచును
పేదవానివైపుదిరిగి  ''నమ్ము .. నమ్ము'
 మని యాజ్ఞాపించును
'శరణాగతుడవైననే .. నీకు గతి' యని బెదరించును
ఉన్న కాస్త బుధ్ధిని తృణీకరించమని యాదేశించును
అట్టడుగునబడిన వానితో 
'నీ జీవిత మింతేయనియూ .. '
అది నీ ప్రాచీన కర్మ'
యని వాదించును
'కర్మ యెప్పుడుబుట్టినదని'
 యెదురు ప్రశ్న వేసినచో 
'అది అనాది'  యని.. గ్రుడ్లెర్రజేయును

అందుకే
వివేకానందులు 
'దరిద్రదేశము దరిద్ర వేదాంతమునే బోధించునని శంఖారావము జేసెను. 
పాపము ..'దేశమున బీదరికము పోవువరకును వేదాంతమును మరచిపొండని ..'బ్రతిమాలెను
'పుణ్యము చేయుటకు చేతగాకున్నచో ..
పాపమైనను చేయుమని..'
వేసరికతో ఉద్బోధించెను
'జీవితమున కర్థమున్నదని 'సూచించెను
కాని యట్టివారి మాటలు మనము విందుమా..??
విన్నచో సమాజములోని చీడపురుగు లెట్లు బ్రదుకును..??
జీవితం ఏమిటి  ..??