25 ఆగ, 2012

గురజాడ ఒక విద్యుత్తు.




"ఒపీనియన్స్  అప్పుడప్పుడూ చేంజ్ చేసుకోకపోతే పొలిటీషియన్ కానేరడోయ్.."
ఇది గురజాడ ప్రసిధ్ధి చెందిన వ్యాఖ్య..
ఇప్పటి నాయకులు 
దాన్ని అక్షరాలా పాటిస్తున్నారు
 
"ఈ సురోమని మనుషులుంటే 
దేశమేగతి బాగుపడునోయ్.."
అన్నది మరోటి
ఇ ది నాయకులు మనకు చెబుతుంటారు.
వాళ్ళు స్కాములమీద స్కాములు భోంచేస్తుంటే..
 
పాపం ..
మనుషులు అతీ గతీ లేక ఈశురోమని తయారవుతున్నారు.
అది వేరే విషయమనుకోండి..
 
"సొంత లాభము కొంత మానుక..
 పొరుగువాడికి సాయపడవోయ్.."
అన్నదీ
మనందరికీ తెలిసినా..
సొంత లాభం మానడానికి 
మనకెవరికీ ఇష్టం ఉండదు..
 
ఇక..
"కన్యాశుల్కం" 
బాల్య వివాహాలు .. వేశ్యావృత్తి లపై 
ఆ రోజుల్లో ప్రకటించిన ఓ యుద్ధం ..
 

1890ప్రాంతాల్లో రచింపబడి ..
వందల సార్లు ప్రదర్శింపబడి ..
అనేక భాషలలో అనువదింపబడిందీ నాటకం
వాడుక భాష లో రచనలు చేయటం  
చేతకాని తనం గా పరిగణించేవారు ఆ నా డు ..

గ్రాంధికం  రాజ్జమేలుతున్న రోజుల్లో 
గిడుగు రామ్మూర్తితో కలిసి 
వాడుక భాషావ్యాప్తికి కృషి చేసాడు..

అంతేకాదు..
ముత్యాలసరాలు
పుత్తడిబొమ్మ పూర్ణమ్మ..
కన్యక ..
ఇలా ఎన్నో రచించా
డు .

రాసిలో కొద్ది అయినా 
వాసిలో కెక్కినవి ఆయన రచనలు

అందుకే ..
1915 లో ఆయన మరణించినా..
1915 తర్వాతే ఆయన జీవించడం ప్రారంభించాడని దేవులపల్లి అన్నారు.

ఆంగ్ల కవి 
 "చాసర్ వాల్మీకి వంటి వాడని" అన్నాడు గురజాడ 
ఇంగ్లీషు వారికి లేని ప్రేమ ఈ యన కెందుకని అన్నారుకొందరు  

అలానే 
వర్డ్స్ వర్త్ అన్నా ..
ఆయన ఇంగ్లీషు అభిమానం 
సారంగధర కావ్యం గా అవతరించింది  


ఈ ప్రసంగం 30.11.1959 న కడప 
రామకృష్ణ సమాజం లో పుట్టపర్తి వారు చేసినది 
తదుపతి విశా లాంద్ర వారు ప్రచురించారు .

"తెలుగులో నన్నయభట్టే ఆదికవి 
అని చాలారోజులు అనుకొనేవాళ్ళం ..
నన్నయ భారతం వంటి ప్రౌఢ రచన 
హఠాత్తుగా ఒకనాడు  ఆవిర్భవించిందంటే 
 నమ్మడం చాల కష్టం ..

ఎన్నో తరాలుగా 
ఎంతమంది విస్మృత కవుల చేతిలోనో 
తెలు గు కవిత్వం క్రమక్రమంగా 
అభివృధ్ధి చెదుతూ వచ్చి ..
నన్నయ నాటికి భారతం పరిపక్వ స్తితికి వచ్చిందనుకోవడం సమంజసం .."
అంటారు వారు ..

"నన్నయ భారతంలో..
పంప భారతం యొక్క ప్రభావం కనపడుతున్నదని కొన్ని యేండ్ల క్రిందట ..
ఆలంపూర్ సాహిత్య సభలో ..
నేను సోదాహరణంగా నిరూపించినప్పుడు..
తెలుగు భక్తులందరూ ..
నామీద విరుచుకు పడినారు.."

అనడంలో ఆయనలోని 
చారిత్రక పరిశో ధకుడు  నిర్భయంగా  తొంగి చూసాడు 

ఇందులో  
మహాకవి ..
నన్నయ కు ముం దు..
పం డి తు డు ..
క్రాంతదర్శి..
ఇలా వివిధ ముఖాలుగా 
గురజాడను స్మరించడం జరిగింది 



మహాకవి మాత్రమే కాదు 
                    మహా పురుషుడు గురజాడ..               

               అప్పారావు కవికి శ్రీ పుట్టపర్తి నివాళి.

 
శ్రీ పుట్టపర్తి వారు కడపలో ఉపన్యసించిన తేదీ          30.11.1959
విశాలాంధ్రలో ఉపన్యాస పాఠం ప్రకటించిన తేదీ 30.12.1959

 
కడప పట్టణ యువజన సంఘ అధ్వర్యాన 
నవంబర్ 30 వ తేదీన 
శ్రీ రామకృష్ణ సమాజంలో 
"గురజాడ" వర్ధంతి జరిగింది 
శ్రీ ఆర్ . రంగనాధం గారు అధ్యక్షత వహించారు 
మహాకవి శ్రీమాన్ పుట్టపర్తి నారాయణాచార్యులు ఉపన్యసించారు.
"దేశమును ప్రేమించుమన్నా"
అనే గురజాడ గీతాగానంతో 
సభ ప్రారంభమైంది. 

అధ్యక్షు ని ప్రసంగం తర్వాత 
శ్రీ నారాయణాచార్యులు గారిలా ప్రసంగించారు.
 
మహాకవి గురజాడ ఒక ఉద్యమం 
ఆయన సమకాలీకులు 
ఆయననేవిధంగా భావించినా 
మనం మాత్రం ఆయనను ఒక మహాకవిగా 
ఒక మహాపురుషు ణి గా గౌరవిస్తున్నాము. 

ఆ మహనీయుని 
ఈనాడు సంస్మరించుకోవటం సముచితం
 
పది ఉపన్యాసాలకంటే యెక్కువగా 
మహాకవి వాక్కు ఒకటి 
వేల హృదయాలను కదలింపగలదు. 
భావుకుడైన కవికి అట్టి శక్తి ఉంది. 

సృజనాత్మక శక్తి లోని ఆ మెరుపును 
ఆ ఆంతరంగిక జ్యోతిని గమనించి వినియోగించుకోలేకపోతే 
సామాజిక ఉద్యమాలు 
తమ ప్రయోజనాలను నెరవేర్చలేవు 

ఆనాటి సామాజిక ఉద్యమాలకు 
చేయూతనిచ్చిన గురజాడ
ఒక విద్యుత్తు. 
ఆయన మహాకవి మాత్రమే కాదు 
ఒక మహాపురుషుడు.

సాహిత్య కారులలో చాలమందికి 
"ఆత్మ స్తుతి"
ఒక చాపల్యంగా వుంటుంది. 
అది కొంతవరకు అవసరమేమో కాని 
దాని పాలు మితిమీరితే 
దురభిమానం అవుతుంది 
దురభిమానం విమర్శకులలో 
ఎక్కువగా ఉంటుంది. 
గురజాడమీద కూడ 
ఆ కాలంలో నిందా పూర్వకమైన 
దురుసు విమర్శలు అనేకం వచ్చాయి. 

కాని ..
ఆయన అన్నిటినీ శాంతంగా పరిశీలించి 
సరసంగా సమధానం చెప్పారు 
గొప్పవాళ్ళ లక్షణం అది.

అంతకంటే గొప్పది 
ఆయన సాహసం 
ఎండుగడ్డి వంటి శుష్క పాండిత్యమే 
కవిత్వం అనుకొనే రోజుల్లో 
అంతమంది కవి "వృషభులనూ.."
"కవి శరభులనూ.." ధిక్కరించి 
సంప్రదాయానికి ఎదురు తిరిగి నిలబడే 
సాహసం సామాన్యమైనది కాదు. 

ఆనాటి  పండితులు కూడా 
సామాన్యులేమీ కాదు. 
దిగ్దంతులవంటివాళ్ళు. 
శతావధానులు 

వాళ్ళందరూ వ్యావహారిక భాషకు వ్యతిరేకులు 
వా ళ్ళ గ్రాంధిక భాషావాదాన్ని 
చీల్చి చెండాడిన పిడుగు వంటి గిడుగు 
లక్షణ కర్త కాగా 
ఆయన లక్షణాలకు లక్ష్యంగా 
గురజాడ సాహిత్య సృష్టి సాగించినారు.
 
ఆనాటి సంఘ సంస్కరణోద్యమానికి 
వీరేశలింగం ఒక మహానేత . 
ఆయనకు అన్ని విధాలా 
అండదండగా వుండినవాడు గురజాడ. 

అయినా ..
కందుకూరిని కూడా విమర్శించడానికి 
వెనుదీయని సత్యప్రియుడు గురజాడ. 
శ్రీ కందుకూరి రచనల్లోని శృంగారాన్ని 
నిస్సంకోచంగా ఆయన విమర్శించారు.
 
క్రాంతదర్శి..
 
కవి క్రాంతదర్శి. 
నేటి పరిస్తితులను గమనించి 
రేపటికి సూచనలు చేయడమే క్రాంతదర్శి పని. అటువంటిది  గురజాడలో వుంది. 
ఒకనాటి అతివాదులు 
మరికొన్నాళ్ళకు మితవాదులు కావడం 
మనం చూస్తూనే వున్నాం 

ఈ దృష్టితో చూస్తే 
గురజాడ యెల్లప్పటికీ అతివాదే. 
ఆయన బ్రతికివుంటే 
మనలోని అతివాదుల కంటే 
అతివాదిగా ఉండేవాడనిపిస్తుంది.

 "నాచ్" (భోగం మేళాలు) సమస్య..
ఆనాడు ఒక ముఖ్య సాంఘీక సమస్య 
సానుల సమస్య కేవలం నైతిక సమస్య అని 
ఆనాటి వాళ్ళ అభిప్రాయం 

నీతి బోధలతోనే సానులను 
సంస్కరించవచ్చునని అనుకొనేవాళ్ళు 

కాని ..
వేశ్యావృత్తి ఆర్థిక సమస్యతో ముడిపడివుందని
ఈనాడు అందరికి తెలిసినదే ..
ఈ విషయాన్ని ఆనాడే గుర్తించారు గురజాడ 
"సంస్కర్త హృదయం" అన్న కధలో 
ఆయనకున్న ఆర్థిక దృక్పధం 
స్పష్టంగా కనపడుతుంది. 

పరివర్తన చెందే కాలంతో పాటు 
పరిణమించగల మేధస్సంపదా 
విశాలహృదయమూ సత్య ప్రియత్వమూ మహపురుషుని గొప్ప గుణాలు.
 
మహాకవి
 
నిజంగా గురజాడ మహాకవి. 

తెలుగువాళ్ళు గుడ్డివాళ్ళు 
కాబట్టి 
గురజాడ గొప్పతనాన్ని 
గుర్తించలేరని కొందరంటారు. 
ఇందులో సత్యం ఉన్న మాట నిజమే..!

కాని ఇలాంటి పోలికలు 
ఒక దౌర్బల్యం..

ఉదాహరణకు "ఇక్బాల్.. బంకిం"ల 
రచనలు మనకు తెలియవు 
మన కన్యాశుల్కం వంటి నాటకం 
తమిళులకు మళయాళీలకు లేనిమాట 
నిజం కావచ్చు 

కాని 
భారతి రచనల వంటి 
గానత్మక కవిత్వం మనకు లేదు 

అట్లే 
"వల్లధోల్" వలె బహు గ్రంధాలను 
ఉత్తమమైనవి రచించిన మహాకవులు 
మనకు లేరు. 

తమ రచనలతో బీరువాలు నింపిన కవులు 
మనకూ వున్నారు 
కాని వాళ్ళు గుణంలో 
వల్లధోల్  తో దీటురారు. 

మన పరోక్షంలో కూడా ఇతరులు మన్నించేటట్లు 
మనం మాట్లాడుకోవడం న్యాయం.
గురజాడ దేశభక్తి గీతం చాలా గొప్ప ది 
తెలుగులో అటువంటిది మరిలేదు 

అంతమాత్రాన 
ప్రపంచం సాహిత్యంలోనే 
అటువంటిది లేదనడానికి సాహసించరాదు 

అలాగే 
"మధురవాణి" పాత్ర విషయం 
మధుర వాణి పాత్ర గొప్పదే 
కాని వసంత సేన కంటే గొప్పదని నేననలేను. 

గురజాడకు కూడా 
ఇలాంటి అభిప్రాయాలున్నాయి 
"చాసర్ వాల్మీకి వంటివాడని.."
గురజాడ అన్నాడు 
చాసర్ మీద ఇంగ్లీస్ వాళ్ళకే లేని గౌరవం 
ఈయన కెందుకు కలిగిందో 
నాకు అర్థం కావడం లేదు 

అట్లే ..
వర్డ్స్ వర్త్ మీద కూడ 
గురజాడకు విపరీతమైన గౌరవం 
వర్డ్స్ వర్త్ కు పూర్వం ఉన్న కవిత్వమంతా 
రాజుల రాణుల ప్రేమ పురాణాలూ వీరగాధలే 

సామాన్యుల జీవితాన్ని 
ప్రతిబింబించే కావ్యాలు కూడా చాలవరకు 
ఆ విధంగానే వుందనవచ్చు 

కాని 
సంస్కృత ప్రాకృతాలలో 
మాగధి అపభ్రంశ వంటి భాషల్లో 
సామాన్యు ల  గాధలు అనేకం ఉన్నాయి
 
జైన బౌధ్ధ సాహిత్యమంతా సామాన్యుల కథలే ప్రసిధ్ధమైన గాధాసప్తశతి 
ఆనాటి సామాన్యుల జీవితాన్ని చిత్రించే 
మనోహర కావ్యం 

తెలుగులో మాత్రం 
మొన్న మొన్నటి వరకు 
కవులు రాజుల దగ్గర 
వేశ్యలవలెనే బ్రతికినారని చెప్పవచ్చు 

కాని 
తెలుగు సాహిత్యం అంతా 
అట్టి సాహిత్యం అనలేము.
 
నన్నయకు పూర్వం
 
తెలుగులో నన్నయభట్టే ఆదికవి 
అని చాలారోజులు అనుకొనేవాళ్ళం 
నన్నయ భారతం వంటి ప్రౌఢ రచన 
హఠాత్తుగా ఒకనాడు  ఆవిర్భవించిందంటే 
 నమ్మడం చాల కష్టం ..

ఎన్నో తరాలుగా 
ఎంతమంది విస్మృత కవుల చేతిలోనో 
తెలు గు కవిత్వం క్రమక్రమంగా 
అభివృధ్ధి చెదుతూ వచ్చి 
నన్నయ నాటికి భారతం పరిపక్వ స్తితికి వచ్చిందనుకోవడం సమంజసం
 
ముఖ్యంగా
బౌధ్ధులూ జైనులూ
దేశీయ భాష అయిన తెలుగులో 
ఎన్నో కావ్యాలు వ్రాసి వుంటారని నా విశ్వాసం 

ఆ యుగాల నాటి మత కలహాలలో 
హిందూ దురభిమానులు 
తమది పైచేయి అయినప్పుదు 
ఆ సాహిత్యాన్నంతా నాశనం చేసి వుంటా రు. 

గురజాడ బ్రతికి వుండగానే 
యుధ్ధమల్లుని బెజవాడ శాసనం దొరికింది. 
"యుధ్ధ మల్లుడే ఆదికవి.."
 యని ఆయన సాహసంగా గుర్తించినాడు. 
కన్నడంలోని పంప భారతం గురించి కూడా 
ఆయన ప్రస్తావించాడు. 


నన్నయ భారతంలో 
పంప భారతం యొక్క ప్రభావం కనపడుతున్నదని కొన్ని యేండ్ల క్రిందట 
ఆలంపూర్ సాహిత్య సభలో ..
నేను సోదాహరణంగా నిరూపించినప్పుడు 
తెలుగు భక్తులందరూ 
నామీద విరుచుకు పడినారు.
 
నేనసలు తెలుగు వాణ్ణే కాదనీ 
మారువేషంలో ఉన్న కన్నడం వాణ్ణనీ కూడా 
నన్ను నిందించారు 
నేను చెప్పిన అభిప్రాయం 
గురజాడ ఆనాడే వెలిబుచ్చినాడు
 
కానీ ..
తెలుగు వాళ్ళ దురభిమానం మితిలేనిది. 
నన్నయ మహాకవి 
అంటే వాళ్ళకు తృప్తి లేదు 
నన్నయ ఋషి అనే చాదస్తులూ 
నన్నయ దేవుడు అనే మూర్ఖులూ 
బయలుదేరినారు.
 
పండితుడు
 
గురజాడ చిన్నప్పటినుండే 
ఇంగ్లీషులో గద్యపద్యాలలో 
రచనలు చేసేవాడు. 
సంస్కృతం బాగా రావడమేగాక 
సంస్కృత వ్రాకరణం తో కూడ 
మంచి పరిచయం వున్నట్లు  ఊహించవచ్చు. 

ఆనంద గణపతి 
మహా ప్రౌడుడైన కవి 
ఆయన చుట్టూ 
దిగ్దంతులవంటి పండితుల చేత కూడా 
గౌరవం పొందినాడంటే 
వారి పాండిత్యం కూడ సామాన్యంగా వుండదు 

గజపతి వంటి వారు 
గురజాడను ఆదరించడం 
ఒక ఆశ్చర్య కరమైన విషయం
 
ఆయన సాధించిన సాహిత్య విప్లవం 
చాలా గొప్పది 
బాల వ్యాకరణ 
ప్రౌడ వ్యాకరణ సూత్రాలకు లోబడిన ప్రయోగాలు తెలుగులో చాలా ఎక్కువగా వున్నాయి 

ఆంధ్ర శబ్ద చింతామణి మొదలుకొని 
మన తెలుగు వ్యాకరణాలన్నీ 
చాలా సంకుచిత దృష్టి కలవి. 
మన వ్యాకరణ కర్తలు 
శైవ సాహిత్యాన్ని గుర్తించనేలేదు 

కృష్ణదేవరాయల తర్వాత వచ్చిన 
ప్రబంధాలకూ ..
మధుర ....
తంజావూరు ..
రాజుల కాలంలో వచ్చిన వచన సాహిత్యానికీ 
వాళ్ళు యేమాత్రమూ విలువ ఇవ్వలేదు. 
అందుకనే ఆ వ్యాకరణాలు 
అంత సంకుచితంగా తయారైనాయి.
 
అసలు ఒక జీవద్భాషను 
వ్యాకరణ సూత్రాలలో బంధింపజూడడమే 'కుంజరయూధమును దోమ కుత్తుకలో.." ఇరికించడానికి చేసే ప్రయత్నం వంటిది. 

జీవద్భాష అయిన తెలుగులో 
అనంతమైన ప్రాంతీయ భేదాలు వున్నాయి 
అట్లే సంస్కృతంలో కూడ 
పాణిని వ్యాకరణానికి 
వ్యతిరేకమైన ప్రయోగాలు 
వ్యాసునిలో.. వాల్మీకిలో ..
అంతకు పూర్వపు వైదిక సాహిత్యంలో ..
అనేకం వున్నాయి. 

సంస్కృతం జీవద్భాషగా వున్న రోజులలో 
బౌధ్ధ జైన వాఙ్మయాలలో 
ఈనాటి మహా పండితులకు కూడా 
అర్థం తెలియని ప్రయోగాలు చేయబడినాయి 

కాబట్టి జీవద్భాషను 
వ్యాకరణపు సంకెళ్ళతో బంధించబూనడం సాహితీపరులెవ్వరూ సహింపకూడని విషయం 

ఈ దృష్టితో వ్యాకరణ భక్తులకు 
వ్యతిరేకంగా గురజాడ చేసిన రచనలు 
తెలుగు సాహిత్యానికి 
నూత్న యవ్వనం ప్రసాదించినాయి.
 
సామాజిక దృష్టి.
ఆయన ప్రయత్నించిన సామాజిక విప్లవం కూడా 
చాలా గొప్పది 
తన కాలానికి అతీతమైన సామాజిక దృష్టి 
ఆయనకు వుండేది
ఆయన కథలలో ఆ దృష్టి బాగా కనపడుతుంది.

ఇక ఆయన హాస్యం 
తెలుగు సాహిత్యాలలో సాటిలేనిది. 
ఆయన ఉత్తరాలలో ..వ్యాసాల్లో కూడ ..
ఈ హాస్య దృష్టి కనపడుతుంది. 

సర్కస్ బఫూన్ లు చేసే 
ఆంగిక వికారాలతోను 
కృతకమైన శబ్ద చమత్కారాలతోనూ 
సృష్టించే హాస్యం అల్పమైనది. 

కన్యాశుల్కం లోని హాస్యం 
పాత్రల స్వాభావిక ప్రవర్తనలోనూ 
కథకు సహజమైన 
సన్నివేశాలలోనూ ఇమిడివుంది. 

ఇటువంటి హాస్యమే ఉత్కృష్టమైనది 
గురజాడ సృష్టించినట్టి నాజూకైన హాస్యం 
తెలుగులో మరి లేదు 
గిరీశం వంటి పాత్ర 
తెలుగు సాహిత్యంలో మరి లేదు 
గురజాడ కవిత్వంలో 
ఆంగ్ల సాహిత్యపు చాయలు వున్నాయి.
 
మొత్తం మీద 
ఇంగ్లీషు ప్రభావం 
ఆయన మీద ఎక్కువగా వుందని చెప్పవచ్చు 
ఆంగ్ల విద్య మీద ఆయనకు అమితమైన గౌరవం 
ఇది ఆనాటి కాల ప్రభావం 
అని చెప్పవచ్చు. 

ఇంగ్లీషురాని పండితులు 
ఆనాడు మహా చాందసులు 
కూపస్త మండూకాలు 
ఇంగ్లీషు విద్య వచ్చినవాళ్ళే 
అంతో ఇంతో స్వతంత్రంగా విశాలంగా 
ఆలోచించగలిగే వాళ్ళు 

ఇంగ్లీషు విద్య వల్లనే 
స్వతంత్ర ఆలోచనా శక్తీ 
విశాల దృష్టీ అలవడుతాయని అనుకోవడం 
ఆనాటి పరిస్తితులలో న్యాయమే. 

ఆనాటి యుగ స్వభావమే 
ఆయనలో ప్రతిఫలించింది.
"ముత్యాలసరాలు"
ఆయన తెలుగు కవిత్వానికి ఇచ్చిన కానుక 

ఆ చందస్సులో అంత క్రొత్తదనం లేక పోయినా 
బంధ కవిత్వాలూ 
గర్భ కవిత్వాలూ 
వ్రాసుకొనే రోజుల్లో సరళమైన గేయ ఛందస్సులో కవిత్వం రాయబూనడమే 
ఒక విప్లవం 

ఆయన సుభద్రలో 
అక్కడక్కడా కావ్య భాష దొర్లింది. 
ఋతశతకం అనేది 
సామాన్యులకు అర్థమయ్యేటట్లు లేదు 

వీటిని ఆయన చిన్నప్పుడు 
అంటే సాహిత్యాన్ని గురించే 
ఆయన విశ్వాసాలు పరిణతి చెదక మునుపు వ్రాసినాడేమో అనిపిస్తుంది. 

ఆయన ఖండ కావ్యాలు
 ఏవేవి యెప్పుడు వ్రాసిందీ తేదీలు కూడా 
లభ్యమయి వుంటే బాగుండేది.
 
కన్యక ..
పూర్ణమ్మ..
రెండూ కరుణాత్మక కావ్యాలు 
ఎంతో గంభీరమైన భావాలను కూడా 
సుటిగా హృదయాలకు తాకేటట్లు తేటగా 
పిల్లలకు అర్థమయ్యేటట్లు చెప్పడం 
గురజాడ లోని ఒక మహా శక్తి. 

కన్యకలోని ఇతివృత్తాన్ని 
మరేవి అయినా 
గంభీరమైన ప్రౌఢకావ్యంగా మర్చివుండును.

పూర్ణమ్మ కథలోని కరుణ 
మహా సుకుమారమైనది. 
దీనిలోని యెత్తుగడ ..అంతము ..
యెంతటి గంభీర హృదయాలనైనా 
చలింపచేసేటంత లలితంగా వున్నాయి. 

 ఇంత సరళంగా 
సూటిగా సుకుమారంగా చెప్పగలగడం 
మహాకవులకు మాత్రమే సాధ్యమౌతుంది. 

ఈ చిత్తవృత్తిలో 
ఆయన బాల సాహిత్యం వ్రాసివుంటే 
ఎంత బాగుండునో ..!!
 
యువజన సంఘ అధ్యక్షుడు రామచంద్రారెడ్డి 
వందన సమర్పణ తో సభ ముగిసింది.

24 ఆగ, 2012

సంగీత జ్ఞానమూ..


పెనుగొండలో ..
పక్కా హనుమంతా చర్యులు అని ..
ఒకాయన గొప్ప సంగీత విద్యాంసుడు. 

పాపం..
సంగీత పాఠాలు చెప్పుకొనేవాడు. 
పేరు మీకు తెలిసే వుంటుంది.. 
సంధ్యావందనం శ్రీనివాసరావ్ అని ..
వాడూ.. నేనూ ..
ఈ పక్కా హనుమంతాచార్యుల వద్ద..
సంగీతం ఆరంభించిన వాళ్ళం..

తరువాత..
ఆయనకు జీవనం జరుగక ..
కొక్కొండ సుబ్రమణ్యం
అనంతపురం పాయ..
అందువల్ల..
ఆయన వద్ద ..
సరళీ వరుసలూ ..
జంట వరుసలూ ..
అలంకారాలూ ..
యభై అరవై వర్ణాల వరకూ నాకు పాఠం చెప్పినారు.. 

వర్ణ సాధన ఎంత బాగా చేస్తే ..
స్వర విన్యాసం అంత బాగా వుంటుందని..
వారి ఊహ ..
 
అరియక్కుడి రామనుజయ్యంగార్
మా అమ్మ ఫిడేలు ఎక్కువగా వాయిస్తూ వుండేది. దానివల్ల ..
ఆయన వెళ్ళి పోయిన తరువాత..
ఆమె దగ్గర సంగీత సాధన మొదలు పెట్టినాను. 
ఆమె సుమారు ..
యాభై ..అరవై కృతులదాకా..
నాకు పాఠం చెప్పింది.

ప్రొద్దుటూరుకు వచ్చిన తరువాత..
పెద్ద జమాలు..
గొప్ప విద్వాంసుడు.. 
గొప్పగా ఫిడేలు వాయించేటటువంటి వాడు.

ఈ విద్యా విషయంలో ..
నా ఆశకు అంతు లేదని ..
ఇంతకు ముందే మీకు మనవి చేసి నాను. 
అందువల్ల ..
ప్రొద్దుటూరికి వచ్చిన తరువాత..
ఆయన దగ్గర సంగీత సాధన చేస్తూ..
సుమారు నూరు ..నూట యాభై కృతులు..
పాఠం చేసుకున్నాను. 


ఈ రేడియో వాళ్ళు వచ్చిన తరువాత ..
కొక్కొండ సుబ్రమణ్యం అని ..
రేడియోలో పని చేస్తూ వుండినాడు
మంచి విద్వాంసుడు.
అరియక్కుడి రామనుజయ్యంగార్

అతని దగ్గర కొన్ని కృతులు పాఠం చేసి నాను. 

ఈ రీతిగా ..
సుమారు అయిదు నూర్లు ..
ఆరు నూర్లు కృతులు ..
సంగీతంలో చక్కగా పాఠం చేసుకున్నాను. 

యాభై అరవై వర్ణాల వరకూ పాఠం చేసుకున్నాను
ఇంతకు మించి ..
అనేక మంది గొప్ప గొప్ప గాయకులను..
వినేటటువంటి అదృష్టం నాకు జీవితంలో పట్టింది. 

అరియక్కుడి రామానుజయ్యంగారేమి..
శెమ్మంగూడి శ్రీనివాసయ్యంగారేమి..
బాలమురళీ కృష్ణ ..
ఇప్పుడందరూ వింటున్నారు ..
నేనూ వింటున్నాను.

చాలా గొప్ప గొప్ప ..
విద్వాంసుల యొక్క కచేరీలువిన్నాను. 
సంధ్యావందనం శ్రీనివాసరావ్
సంగీతానికెప్పుడూ శ్రవణం ప్రధానం..

బాగా పాడ్తావు పోప్పా..
అని ఏదో అంటాను కానీ ..
మనస్ఫూర్తిగా అనేటటువంటి మాటకాదది. 
పైగా ..
అనంత కృష్ణ శర్మ గారి దగ్గర ..
సంధ్యావందనం శ్రీనివాసరావ్
అనేకములైన సంగీత విద్యా రహస్యములను నేర్చుకునేటటువంటి
అవకాశం నాకు ఏర్పడింది.  

ఆయన సంగీతంలో చాలా గొప్ప విద్వాంసుడు.
 సంగీత శాస్త్రంలో గొప్ప లాక్షణికుడాయన..
 ఈ రాగం యొక్క స్వరూపం ఇట్లే వుండవలె..
 ఇంతకంటే భిన్నంగా ..
ఈ రాగం యొక్క స్వరూపం వుండేదానికి వీలు లేదు
 అని అనంత కృష్ణ శర్మ చెబితే ..
గొప్ప గొప్ప విద్వాంసులంతా కూడా..
 ఆయన మాటకు గౌరవమిచ్చి ..
అట్లనే పాడేటటువంటి వాళ్ళు ..
చాలా గొప్ప విద్వాంసులు ..

నాకు చాలా సార్లు తోస్తుంది..
 సంగీతాన్న్ని నమ్మి ..
సాహిత్యంలో ఎక్కువగా కృషి చేయనివాడు..
 అనంత కృష్ణ శర్మ అయితే ..
సాహిత్యాన్ని నమ్మి ..
సంగీత ..నాట్యాలను ..
రెండింటినీ కూడా నిర్లక్ష్యం చేసిన వాణ్ణి నేనేమో అని.

23 ఆగ, 2012

మీ తండ్రిని మించి పోయావయ్యా..




నీకు ..
మీ స్కూల్ లోని 
తెలుగు అధ్యాపకుడంటే 
అమిత మైన అభిమానం.. 
ఆరాధన..
 

ఆయన వలననే ..
తెలుగు సాహిత్యం లోని 
సొబగులు దర్శించగలిగావ్..
 
అంతే కాదు..
ఆయనలో ఒక గొప్ప నటుడున్నాడు..!
ఆయన  వేసే పౌరాణిక నాటకాలలోని 

అభినయానికి నీవు ముగ్ధుడివి..
 

ఆ తరువాత ..
నీ జీవితం ఎటెటో పయనించింది..
చిన్ననాట 

నీకేర్పడిన ఆ సాహిత్యాభిరుచి..
నిన్ను ఊరికే ఉండనివ్వలేదు..
ఆపై కొంత నీ పరిశ్రమా..

సాహిత్య రంగంలో నీకో గుర్తింపు నిచ్చింది.
 

అయిందా..
ఇప్పుడు నీకు అరవై..
ఓ కలెక్టరు కొడుకు..
సంఘంలో మంచి స్థానం..
 

అప్పుడు హఠాత్తుగా ..
ఒక సాహితీ మేరువును నీవు దర్శించావ్..
అతని ప్రతిభకు గల పలు పార్శ్వాలు గమనించి అచ్చెరువొందావ్..

నీకో ఆశ్చర్య కర మైన విషయం తెలిసింది..
ఆ సాహితీ మేరువు ఎవరో కాదు..
 చిన్ననాటి నీ తెలుగు అధ్యాపకుని కొడుకే..
నీ పరిస్థితి ఏవిటీ..
 

ఆశ్చర్యం ఆనందం ఉద్వేగం
బాబోయ్..
నీవు  మా గురుపుత్రుని వా ..?
అదిగో ఆ తేజస్సు ..
ఆ మేధస్సు నీ అడ్రసును చెప్పకనే చెబుతోంది..
ఈ సంగీత నాట్య కళాభిరుచి 

మీ నాయన నుంచే నీకొచ్చిందోయ్..
మీ నాన్న ఎంత గొప్ప వాడనుకున్నావ్..
అబ్బా.. అబ్బా.. అబ్బా..
ఆరోజుల్లో ..

ఆయనను చూసి మేం పులకించి పోయే వాళ్ళం..
ఇదీ  నీ పరిస్థితి..
 

అవునా..
ఇక్కడ..
ఆ నీవు..
ఎవరో కాదు..
పైడి లక్ష్మయ్య గారు..
వారి గురువులు 

శ్రీమాన్ పుట్టపర్తి శ్రీనివాసా చార్యులు గారు.
అంటే మా అయ్యగారి తండ్రి ..
మాకు తాత
గారు..

మా తాత గారి వద్ద విద్య నభ్యసించిన 

పైడి లక్ష్మయ్య గారు..
వారి గురించి తలుచుకొని పొంగిపోతారు.
మా తాతగారు 

పౌరాణిక పాత్రలు అద్భుతంగా పోషించే వారట..
పాండిత్యం.. సరేసరి..
 

1975 లలో 
వారి ప్రేమ సాగరం 
అయ్యనూ మమ్మల్నీ ముంచెత్తింది..
అయ్యను గతంలోకి లాక్కెళ్ళింది..
చదవండి మరి.



మా గురు పుత్రులు
పైడి లక్ష్మయ్య


"భావస్థిరాణి జననాంతర సౌహృదాని"
 అని మహాకవి కాళిదాసోక్తి. 
పూర్వ జన్మ సంస్కార ఫలముచే 
నీ జన్మలో నాశ్చర్య హేతుకమగు మేధాశక్తి 
అనన్య సామాన్య భక్తి. 
అగణ్య గద్య పద్య కావ్య రచనాసక్తి. 
సరస సంగీత సాహిత్య కళాభిరక్తి 
యోగీంద్ర సమ్హిత ప్రాపంచిక వ్యామోహ విరక్తి 
తదితర దివ్య భావోచిత సుగుణమణులు. 

తమకు తామే మనుజునికి లభ్యమగునని 
విజ్ఞుల విశ్వాసము. 
'శుచీనాం శ్రీమతాం గేహే యోగభ్రష్టోభిజాయతే' అని కదా గీతా వాక్యము. 

ఒక వ్యక్తి విద్వత్కుటుంబం నుంచీ గానీ 
విత్తాధిపతియైన శ్రీమంతుని గృహమునగాని 
జన్మించి సర్వానుకూల వాతావరణమున 
శ్రేయస్కరముగ పెరిగి..
పెద్దవాడో ..మహా కవియో..
లేక పండితుడో.. లేక ఆగర్భ శ్రీమంతుడో..
లేక రాచఠీవి గలిగిన పరిపాలనా దక్షుడో అగుట..
అతని పూర్వ పుణ్య ఫలమని చెప్పక తప్పదు.
 
దాన ధర్మాది గుణములు 
పాండితీ ప్రతిభ శూరత్వము 
సహజముగ అలవడు గుణములే గాని 
ఒకరు నేర్పించిన 
లేక చూచి నేర్చుకొనునట్టి విద్యలు కావు 
అనుట లోకవిదితము. 

పద్మశ్రీ డా.పుట్టపర్తి నారాయణాచార్యుల వారిని గాంచినపుడెల్లను..
వారికి గల 
కూలంకష ప్రజ్ఞ బహుముఖ వైదుష్యము రసజ్ఞత స్మరించి నపుడెల్లను ..
వారి  పితృపాదులగు..
శ్రీమాన్ శ్రీనివాసా చార్యులవారు 
నా మనమున జ్ఞప్తికి వచ్చుచుందురు.
 
పూజ్యులు 
పండితాగ్రేసరులు 
శ్రీమాన్ శ్రీనివాసాచార్యులు 
నాకు పదునాల్గవయేట 
అనంతపుర మండలమందలి 
కల్యాణదుర్గము మాధ్యమిక పాఠశాల లో 
తెనుగు పండితులుగా నుండి గురువర్యులైరి. 

ఆంధ్ర సారస్వతములో 
నొకింత పరిచయము పాండిత్యమూ 
నాకీనాడు  లభించిందన్న 
వారు ఆనాడు 
నా హృదయ క్షేత్రమున నాటిన 
సారస్వత బీజమే కారణమనదగును 

అది అంకురించి 
చిగిర్చి 
చిన్న మొలకయై 
యావల 
శ్రీ ప్రయాగ వెంకట రామ శాస్త్రులవారి 
వాత్సల్య దోహదముచే మ్రానై 
ఈనాడు కొన్ని దృశ్య కావ్య ఫలములీయగల్గినది.

శ్రీ శ్రీనివాసాచార్యుల వారు 
అనవద్య హృద్య విద్యా విశారదులు 
అతులిత కవితా చాతురీ ధురీణులు 
సరస సంగీత కళా కోవిదులు 
నటకావతంసులు 
ఆంధ్ర నాటక పితామహుని 
"పాదుకా పట్టాభిషేకము"నాటక ప్రదర్శన లో 
వారు గావించు చుండిన 
దశరధ పాత్రాభినయము 
ప్రేక్షకులను కంట తడి పెట్టించుచుండెను..
 
శ్రీరాముడరణ్య వాసమునకేగు తరి ..
వారి అభినయ చాతురి వలన 
సభ్యుల హృదయములు కరిగి 
కంటినీరై కారుచుండ 
చేతి గుడ్డలను తడుపుచుండుట 
నేను కనులార గాంచిన విషయము. 

అదే రీతి 
"చిత్రనళీయము"లో 
"కలి" వేషము ధరించి 
రౌద్ర భయానక రసములతో 
పాత్ర పోషణ గావించి ప్రశంస లందుకొనుచుండిరి.

మహాకవి రసికుడు 
పురాణేతిహాస పారంగతులగు పౌరాణికులు వారు. 
వారి పురాణ ప్రసంగము 
పండిత పామరుల నమితముగ ఆకర్షించుచుండెను. 

కమ్మని కవితా చమత్కృతి గల పద్యములతో 
సరస వచనా వైఖరితో 
సభలలో చక్కగ ఉపన్యసించి 
సభ్యులను ముగ్ధులను గావించెడివారు. 


అట్టి విద్వత్కవివరేణ్యుని 
నటకాగ్రేసరుని పుత్రరత్నంబగు 
సరస్వతీపుత్ర శ్రీమాన్ 
పుట్టపర్తి నారాయణాచార్యుల వారు 
దిట్టమైన కవి. 
పండిత 
విమర్శక 
వాక్ప్రతిభావతంసుడగుటలో వింతయేమున్నది...? 'పుత్రాదిచ్చేత్ పరాజయం' అని కదా 
కవి తల్లజుడగు భారవి సూక్తి...!!
 
"పువ్వు పుట్టినతోడనే పొసగు తావి..!" 
అన్న రీతి నారాయణాచార్యులవారికి 
పిన్ననాటనే సారస్వతాభిరుచి కలిగినది 
వారి మాతృదేవత కడ 
ఆంధ్ర గీర్వాణ భాషల అభ్యసింపమొదలిడెను. 

ఇంతలో దురదృష్టవశమున 
మాతృవియోగము కలిగెను. 

కాని 
ఆనాడు పెనుగొండ సబ్ కలెక్టరుగ నుండిన 
శ్రీ పిట్ గారి సతీమణి పి ట్  దొరసాని 
ఆ బాలుని కుశాగ్రబుధ్ధికి అచ్చెరువొంది 
అనురాగముతో తనయొద్ద ఉంచుకొని 
ఆంగ్లేయభాష నేర్పించమొదలిడెను. 

ఆ బాలుడు 
షేక్స్పియర్ నాటకములను చదివి 
కంఠస్థము చేయుటయేగాక 
మిల్టన్ కావ్యములను కబళించి 
కొంత ఆంగ్లభాషాపాండిత్యము గడించెను. 

ఇది 
ఆ బాలుని జీవితములో 
నొక అద్భుత సంఘటన 
పదునాల్గవ యేటనే
కమ్మని కవితలల్లుట నేర్చుకొని 
మహోన్నత భావావేశముతో 
"పెనుగొండ లక్ష్మి"
 యను ఖండకావ్యమును రచించెను. 

ఆచార్యులవారు 
విద్వాన్ పరీక్షకు కూర్చున్నప్పుడు ఈ కావ్యము 
పఠనీయ గ్రంధముగా నిర్ణయింపబడినదనగా యాగ్రంధముయొక్క కవిత్వ పటిమ
ఎంతటిదో ఊహింపదగును.
 
తిరుపతి ప్రాచ్యభాషా కళాశాలయందు..
 విద్వాన్ పరీక్ష చదువుచు 
సంగీత సాహిత్య నాట్య కళల నభ్యసించెను 

ఆవల 
హిందీ.. మరాఠీ ..మళయాళ.. తమిళ.. మాదిగ.. బహుభాషలలో ప్రావీణ్యత గడించెను. 

భారత దేశమంతయూ పర్యటించి ..
హృషీకేశము చేరి..
 అచటి శివానందాశ్రమమున ..
ఆ యతీశ్వరులచే "సరస్వతీ పుత్ర" బిరుదము పొందెను. 

అరవిందాశ్రమమున 
ఫ్రెంచి ..గ్రీక్ ..లాటిన్..
భాషల పరిచయము సంపాదించెనని  
తెలియుచున్నది. 

దాదాపు 
నూటికి పైబడి గ్రంధములను 
వీరు రచించినట్లు తెలియుచున్నది. 
పాల్కురికి సోమనాధుని పండితారాధ్య చరిత్రమునుబోలి వీరు రచించిన 
"పండరీ భాగవతమ"ను ద్విపద కావ్యము అద్వితీయముగ రాజిల్లి 
వీరి కవితా ప్రతిభను 
ధారా శుధ్ధినీ 
భక్తి ప్రపత్తినీ 
చాటుచున్నది 

వీరు రచించి 
పలుతావుల గానం చేయుచున్న 
శివతాండవం 
వీరి సరస సంగీత సాహిత్య కళాభిజ్ఞతకు తార్కాణము. 

మరాఠీ భాషలో 
డా.కోశాంబిగారి భగవాన్ బుధ్ధ చరిత్రను 
తెలుగులో అనువదించుటయు 
గోపీచంద్ గారి రచనలను 
విశ్వనాధ వారి ఏకవీర నవలను 
మళయాళమున కనువదించుట 
వీరి మరాఠీ మళయాళ తెలుగు భాషలలో గల వైదుష్యమును చాటుచున్నది. 

వీరి మేఘదూత కావ్యము 
కవికుల గురువగు 
కాళిదాసు "మేఘదూతము"నకు దీటైనదని 
డా . దివాకర్ల వేంకటావధాని గారి  అభిప్రాయము. 

వీరు వీరి సతీమణి కనకమ్మ గారు కలిసి రచించిన "అగ్నివీణ" అను కవితా సంపుటి 
వీరి అర్ధాంగి యొక్క వైదుష్యమును తెలుపుచున్నది.
 
వివిధ భాషాభిజ్ఞులై 
వైష్ణవుడుగానుననూ
 శైవమును నిరసింపక 
సమతా భావము గాంచుచూ 
బహు గ్రంధ రచనా క్రియచే 
"మహాకవియని"  "వక్త" యని పేరు గొ ని 
రాయల సీమలో జనించిన 
రత్న రాజమై విరాజిల్లుట 
రాయలసీమకే కాదు 
ఆంధ్ర దేశమునకే కాదు 
భరత ఖండానికే 
ఒక శోభ గూర్చెడిదనదగును 
ఇది మనకెల్లరికి గర్వకారణము..!!

సరస్వతీపుత్ర పద్మశ్రీ డా. పుట్టపర్తి ని 
సన్మానించుటతో 
కవిలోకమునే 
సన్మానించినట్లు భావింపనగును..

వీరిని 
శ్రీ వేంకటాద్రి నిలయుడగు శ్రీనివాసుడు 
ఆయురారోగ్య భాగ్యములొసగి 
చిరకాలము వర్ధిల్లజేసి 
మరికొన్ని జ్ఞానప్రబోధములు 
లోకోపకారములగు సత్కావ్యముల రచింపజేయుగాక.!!