20 ఫిబ్ర, 2014

ఒకసారి అమ్మతో గండికి పోదామా




మా ఇంట్లో కొన్ని డబ్బులు కూడాయి
అమ్మ అయ్యకు దిక్కు తోచలేదు
డబ్బులేకపోతే ఒకటే సమస్య
డబ్బుంటే చీంతే చింత
కవి వైసీవీ రెడ్డి ఒక దిక్కుమాలిన సలహా చెప్పాడు
 

ఒక పెంచలమ్మ
ఆమె మున్సిపాలిటీలో స్వీపరు
కానీ పెద్ద పెద్ద వారితో పరిచయాలు
వడ్డీ వ్యాపారం చేస్తుంది
పోలీసు అధికారులు ఎందరో పెద్దవాళ్ళు 

ఆమె దగ్గర తమ డబ్బు దాస్తుంటారు
ఆమె నెల నెలా వడ్డీ తెచ్చి ఇస్తుంది
 

అమ్మ అయ్య ఇద్దరూ బాగానే ట్రాప్ లో పడ్డారు
పెంచలమ్మ వచ్చింది
ఇంట్లో మూలన కూచుంది
అచ్చం బాపు బొమ్మలా వుంది 

ఇంకా మాట్లాడితే 
విష్ణువు ఎత్తిన మోహినీ అవతారంలా వుంది
పెద్ద కుంకుమ బొట్టూ నోట్లో తమల పాకులూ
 

మధ్య వర్తి యైసీవీ.. 
డబ్బు తెచ్చి ఆమె చేతిలో పోసారు  
ఒకానొక దుర్ముహూర్తంలో ఆమె  పరారైంది 


 అమ్మ అయ్యల వేదన కంతులేదు
ఇంట్లో ఇద్దరాడపిల్లల పెళ్ళి చేయాలి 

పెద్ద సంసారం
అయినా యీ మాయలో మనం పడటమేమిటి 

అన్న పశ్చాత్తాపం
అమ్మ అయ్య ఆజ్ఞ మేరకు వేంపల్లె ప్రయాణమైంది
అప్పట్లో ప్రయాణమంటే 

బియ్యం పప్పులూ చింతపండు మూటగట్టుకొని బస్సెక్కడమే
అమ్మ వెంటే నేనూ 

మొండిచేయటం ఒక బ్రహ్మాస్త్రం
సరే..
 

గండి ఆంజనేయ క్షేత్రం
చుట్టు కొండలు పారే నది పచ్చటి ప్రకృతి
 

బస్సు దిగినాక చాలా దూరం నడవాలి
అక్కడ యే వసతులూ లేవు
భక్తులు వస్తారు అంతే
రోగగ్రస్తులూ మానసిక రోగులూ ఎక్కువ
నదిలో స్నానం చేయడం గుడిలో కూచోవటం
నమ్మిన వారికి నమ్ముకున్నంత
 

ఒంటరిగా ఆడమనిషి ఎలా వెళుతుంది
ఎక్కడ వుంటుంది

భద్రత వుందా
ఇవేవీ అయ్యా ఆలోచించరూ
అమ్మా ఆలో చించదూ..
యేం మనుషులో కదూ
 

అయ్య ఆజ్ఞా
 వెంటనే  రామాయణం చంకలో పెట్టుకొని 

 అమ్మప్రయాణం
సరే కథ కొస్తా
అక్కడ ప్రకృతి ఎంత బాగుందనుకున్నారు
అబ్బ..
 నడక దారిలో చిన్న నీటిపాయ
అందులో చిన్న చిన్న చేపపిల్లలు
పెద్ద పెద్ద చామ ఆకులు   
నేను చిన్న పిల్లను కదా ఆటలే ఆటలు

 పాపఘ్ని నది అట
అమ్మ నదిలో స్నానం చేసి గుడిలో కూర్చొని 
పారాయణ చేస్తుంది
నలభై రోజులు
పారాయణ యే రెండుకో మూడుకో నాలుగుకో 

ఒక దరికి చేరుకుంటుంది
అప్పుడు సత్రానికి వచ్చి వంటచేస్తుంది
 

ఎట్లంటారా
మూడు రాళ్ళు పెట్టి కట్టెలతో వంట..
అన్నం పప్పు
నాకు అన్ని స్తోత్రాలు పాటలూ వచ్చేవి..
ఆడుతూ ఆడుతూ స్తోత్రాలు చెప్పేదాన్ని


ఇంకో విషయం
అక్కడ దయ్యం పట్టిన వాళ్ళు ఎక్కువగా వచ్చే వాళ్ళు స్వామి దగ్గరికి
 

నర సిం హస్వామి ఆంజనేయ స్వామి
దగ్గరికి వీళ్ళు ఎక్కువగా తీసుకొస్తారు
వీళ్ళు ఫేమస్  దయ్యాల డాక్టర్లు..
నలభై రోజుల సేవ చేయించి తీసుకెళ్తారు
తగ్గుతుందేమో
తగ్గకపోతే ఎందుకు వస్తారు 


వాళ్ళు మనపక్కనే కూచుని ఊగుతుంటారు
మా అమ్మ అయ్యలతో నేను ఘటికాచలామో 

మరి తులజాపూరో పోయినప్పుడు
అక్కడా ఇదే
యీ దయ్యం పట్టిన వాళ్ళని  ఎక్కువగా తీసుకొచ్చేవాళ్ళు
 

భక్తులు ప్రదక్షిణలు చేస్తుంటారు దండం పెట్టుకొని
 వీరి మధ్యనుంచే వెళుతుంటారు
వీళ్ళు ఎవరినీ యేమీ చేయరు
 

ఆఖరికి పన్నెండు గంటల వేళ గంటలు పెద్దగా మోగిస్తూ హారతి ఇస్తూ పాటలు పాడుతూంటారు
అప్పుడు యీ పూనకమొచ్చిన వళ్ళని చూడాలి రెచ్చిపోతారు
 

ఒకామె రాతి స్థంభాన్ని సర సరా యెక్కింది
ఆ స్థంభానికి పట్టు యేమాత్రం దొరకదు 

యేవో బొమ్మలు చెక్కివున్నాయి
ఆమె ఆ స్థంభాన్ని యెక్కి వూగుతున్న పేద్ద గంటని అందిపుచ్చుకుంది
స్థంభాన్ని వదిలేసి గంటని పట్టుకొని వెళ్ళాడుతూంది
ఉల్టా కాలి వేళ్ళతో ఆ స్థంభం గొలుసులని పట్టుకొని
ఆ గంటమీదినుంచీ కిందికి వేళ్ళాడుతూంది
తన శరీరంతో ఆ గంటని పెద్ద పెద్దగా వూపుతోంది
ఎంత వేగంగా  అంటె నేను చెప్పలేను
 

భక్తులు భయంగా ఆమెను చూస్తూ దేవుణ్ణి చూస్తూ హారతిలో పాల్గొంటున్నారు
ఆమెకు ఆ కాలి వేళ్ళతో ఆ గంట గొలుసులలో 

ఎట్లా గ్రిప్ దొరికిందో
కిందపడకుండా అంత వేగంగా ఎలా ఊగిందో నాకే తెలీదు అసలా స్థంభం ఎలా సర సరా యెక్కిందో కూడ ఆశ్చర్యమే..

వాళ్ళ దీక్ష అయిపోతూనే  

వారి ఉన్మాదం నెమ్మదిస్తుండవచ్చు
 

అంతెందుకండీ
ఒకసారి ఒక ప్రఖ్యాత వైద్యుడు అతి కష్టమైన కీలకమైన ఆపరేషను చేస్తున్నాడట
దాన్ని వైద్య విద్యార్థులు చూస్తున్నారు
రోగి బంధువులు వున్నారు
టీవీల గుండ అది ప్రసార మవుతూంది
ఆపరేషన్ సక్సెస్ అయ్యింది 

విలేకరులడిగారు అంత పెద్ద ఆపరేషను అంతమంది చూస్తుండగా ఎంతో నిబ్బరంగా ఎలా చేసారు అని
 

దానికి అతనేం చెప్పాడో తెలుసా..
అక్కడ ఎవరున్నారు ముగ్గురమే.
నేను రోగి ఆ భగవంతుడు అన్నాడట..


ఎంత డాక్టరైనా 
తాను ఒక పనిముట్టును మాత్రమే నని 
అతనికి తెలుసు

సరే..
నలభై రోజులు ముగిసాయి
చివరిరోజు అక్కడ అమ్మ పూజముగుస్తుందని తెలియగానే
అయ్య శిష్యులు మా ఇంటి చుట్టుపక్కలవాళ్ళు 

మా నాగక్కయ్య స్నేహితుల కుటుంబాలు
అందరూ గండికి ప్రయాణమై వచ్చారు
అమ్మ అయ్య యేం చేసినా వారికి అపురూపమే
 

చివరికి యేం జరిగింది ..
ఆ పెంచలమ్మ ఊరికి తిరిగి వచ్చింది 

మాఇంట్లో అదే మూలన వచ్చి కూచుంది
 ఆ హనుమంతుడు తన తోకతో పట్టి తీసుకు వచ్చాడని మురిసిపోయారందరూ

శత వసంత సాహితీ కీర్తి పుట్టపర్తి


"శత వసంత సాహితీ కీర్తి పుట్టపర్తి "

ద్రవిడ విశ్వ విద్యాలయం తెలుగు శాఖ వారు 
పుట్టపర్తి శతజయంతి సందర్భంగా 

3 నుంచీ 5 వ తారీకు కుప్పం లో వరకు మూడు రోజుల జాతీయ సదస్సు నిర్వహిస్తున్నారు

వారు సూచించిన వివిధ అంశాలు 
చాలా కొత్తగా వైవిధ్య భరితంగా ఉన్నాయి
ఔత్సాహికులు పాల్గొనవచ్చు








 



18 ఫిబ్ర, 2014

స్పర్శవేది

       తలగవు కొండలకైనను
        మలగవు సింగములకైన! మార్కొను గడిమిన్
        గలగవు పిదుగులకైనను
        నిల బల సంపన్నవ్రుత్తి! నేనుగ గున్నల్
        
       నీరాట వనాటములకు
        బోరటం బెట్లు గలిగె! బురుషోత్తముచే
        నారాట మెట్లు మానెను
       ఘోరాటవిలోన భద్ర: కుంజరమునకున్

 యీ పద్యాలు చదువుతుంటే

భావం  అది వ్యక్త పరిచే పధ్ధతి
ఆ పదాలు దానిలో దాగున్న లయ
అవి మనల్ని వెంటాడతాయి


కానీ విమర్శకులు మాత్రం
 భూతద్దాలతో తయారై
మంచివని మనమనుకున్న వాటిల్లోంచీ కూడా లోపాలు వెదికి  చూపిస్తుంటారు
 

ఆరంధ్రాన్వేషణ వలన వారికీ మనకూ కూడా ఒరిగేదేమీలేదు
కాగా
కొంతకాలానికి మనకూ ఆజాడ్యం అంటుకోగలదు
 

మనకెందుకీ రభసలు 
హాయిగా నచ్చిన కవిత్వం చదువుకోక అనుకుంటాం మనం

మరి పోతన్నకు యెదురైన విమర్శలేమిటి
చూద్దామా


గజెంద్రమోక్షంలో అడవిని వర్ణిస్తూ 
పోతన్న వ్రాసిన వచనం వారి కాహారమైంది.
 

ఆధునికులు 
తండ్రితాతల అన్వేషణలో ముందుకు సాగితే
సంప్రదాయవాదులు గ్రామరునే ప్రామాణికంగా పెట్టుకున్నారు


అయినా ఉత్తమ గ్రంధాలను వ్రాసేవారు 
జనాలకోసం రాయనే రాయరు
తనకోసం తన ఆత్మానందం కోసం రాసుకున్నవి మనకు అమృతాలవుతాయి
జనాలను మెప్పించడానికి రాసేవానిలో ఆత్మ ఎక్కడుంటుందీ..


పోతన వ్రాసిన వర్ణన ఇదే
ఒకసారీ అడవిగుండా ప్రయాణించి అందాలు వీక్షించి పుట్టపర్తి వారేం చెప్పారో చూద్దాం సరేనా..


 అది మఱియును మాతులుంగ లవంగ లుంగ చూత కేతకీ భల్లాత కామ్రాతక సరళ పనస బదరీ వకుళ వంజుళ వట కుటజ కుంద కురువక కురంటక కోవిదార ఖర్జూర నారికేళ సిందువార చందన పిచుమంద మందార జంబూ జంబీర మాధవీ మధూక తాల తక్కోల తమాల హింతాల రసాల సాల ప్రియాళు బిల్వామలక క్రముక కదంబ కరవీర కదళీ కపిత్థ కాంచన కందరాళ శిరీష శింశుపాశోక పలాశ నాగ పున్నాగ చంపక శతపత్ర మరువక మల్లికామతల్లికా ప్రముఖ నిరంతర వసంతసమయ సౌభాగ్య సంపదంకురిత పల్లవిత కోరకిత కుసుమిత ఫలిత లలిత విటప విటపి వీరు న్నివహా లంకృతంబును, మణివాలు కానేక విమల పులిన తరంగిణీ సంగత విచిత్ర విద్రుమలతా మహోద్యాన శుక పిక నికర నిశిత సమంచిత చంచూపుట నిర్దళిత శాఖి శాఖాంతర పరిపక్వ ఫల రంధ్ర ప్రవర్షిత రసప్రవాహ బహుళంబును, కనకమయ సలిల కాసార కాంచన కుముద కల్హార కమల పరిమళ మిళిత కబళాహార సంతతాంగీకార భార పరిశ్రాంత కాంతా సమాలింగిత కుమార మత్త మధుకర విట సముదయ సమీపసంచార సముదంచిత శకుంత కలహంస కారండవ జలకుక్కుట చక్రవాక బలాహక కోయష్టిక ముఖర జలవిహంగ విసర వివిధకోలాహల బధిరీభూత భూ నభోంతరాళంబును, తుహినకరకాంత మరకత కమలరాగ వజ్ర వైఢూర్య నీల గోమేధిక పుష్యరాగ మనోహర కనక కలధౌత మణిమయానేక శిఖరితట దరీ విహరమాణ విద్యాధర విబుధ సిద్ధ చారణ గంధర్వ గరుడ కిన్నర కింపురుష మిధున సంతత సరససల్లాప సంగీతప్రసంగ మంగళాయతనంబును, గంధగజ గవయ గండభేరుండ ఖడ్గ కంఠీరవ శరభ శార్దూల చమర శల్య భల్ల సారంగ సాలావృక వరాహ మహిష మర్కట మహోరగ మార్జాలాది నిఖిల మృగనాథ సమూహ సమరసన్నాహ సంరంభ సంచకిత శరణాగత శమనకింకరంబునునై యొప్పు నప్పర్వత సమీపంబునందు.


                                                                       *** 




 
ప్రాచీనులలో అప్పకవి మొదలైన మహామహులకు పోతన్న కవిత్వము లాక్షణికముగ గనుపింపలేదు
అతడొనర్చిన పాపమేమనగా 
లఘ్వులఘురేఫములకు బ్రాస గూర్చుట..

ఇట్టి పనికిమాలిన యెత్తిపొడుపే పాలకురికి సోమనాధునిపైగూడ గలదు

యీ జాతి వారందరును 
కల్ప వృక్షములను దెగనరికి వంటకట్టెలు 
దయారు చెయుదమను రకము.

అప్పకవి వంటి వారికే గాదు కవుల మనుకొన్నవరిలోను చాలమందికి
పోతనామాత్యుల పై యనుగ్రహము మట్టమే

అందుకే 
ప్రాచీన కవి ప్రశంసల చిట్టాలలో నెక్కడో దప్ప
పోతన పేరు గనుపింపదు
యీ నడుమ
 పోతన్నను గురించి సాగిన విమర్శలు 
ఆయన యూరేది తండ్రి తాత లెవ్వరు
మొదలగు విషయములపైననే 
కొందరు విద్యాధికులాతని 
కవిగా తూచిన వ్రాతలును గలవు

కాని వీరిలో జాలమంది యాంగ్ల విద్యాభక్తులు
వారి సులోచనములు ధరించియే 
ప్రతి విషయమును జూతురు

ప్రాచీనులది అదొక గొడవ
కలమందికొన్నంతనే వారి కంటబడునది
మమ్మటుడు రుయ్యటుడు
తప్పులు బట్టుటలో నున్నంత చొరవ యొప్పులను గ్రహించుటలో లేదు

ఇంతకును 
నీ యిరుదెగల విమర్శనములతోను 
మనకు జరిగిన న్యాయము సున్న

గజేంద్ర మోక్ష కథలో నడవిని వర్ణించుచు 
పోతన్న యొక దీర్ఘ వచనమును వ్రాసినాడు 
దీనినొక ప్రసిధ్ధ విమర్శకుడు వెక్కిరించెను

అమర కోశమును దగ్గరుంచుకుని పోతన్న 
వనోషధి వర్గలోని చెట్ల పేర్లన్నియునిందు జేర్చినాడట
నిఘంటువును దగ్గర బెట్టుకుని 
పదములకు వెదుకవలసిన దురవస్థ 
ప్రాచీనకవులకు లేదు

వారు బాల్యముననే వానినెల్ల వల్లించెడు వారు
పూర్వకవులలో 
గొందరు సంస్కార హీనులైన నుండవచ్చును గాని యవ్యుత్పన్నులు లేరు

అట్టి ప్రబుధ్ధులున్నది మనలోనే..
ఆంగ్ల భాషాభ్యాసము మనకు గొంత 
స్వతంత్ర భావముల నొసగినది
అట్టివారును దక్కువయే

మనపూర్వులు ప్రాచీన సంప్రదాయములకు బానిసలని మనము వారిని నిందింతుము
కాని మనకథ యేమైనది ?
మనమంగ్ల సంప్రదాయములకు దాసులము

ప్రాచీనుల దాస్యములో 
మా యనుకొని సంతోషపడు నాత్మతృప్తియైన నున్నది
మనకదియులేదు..

14 ఫిబ్ర, 2014

యజ్ఞ వేదిక



తస్మాత్ జాగ్రత జాగ్రత.



''కామ క్రోధశ్చ లోభశ్చ దేహే తిష్టంతి తస్కరాః  
జ్ఞాన రత్నాపహారాయ తస్మాత్ జాగ్రత జాగ్రత.. ''
  
జీవితం ఒక కల వంటిది.. 
జీవి కనే కల 
షడూర్ములు కలలోని సన్నివేశాలను 
నిజమని భ్రమింపజేస్తాయి..
 

ఆ సన్నివేశాలతో మమేకమై 
జీవి  తప్పటడుగులు వేసేలా 
 పురికొల్పుతాయి

 ప్రయాణాన్ని నాలుగడుగులు ముందుకూ 
మూడడుగులు వెనక్కు పడేలా చేస్తాయి..

జ్ఞానమనే రత్నాన్ని అపహరించే దొంగలు  
కామ క్రోధ లోభాలు
జీవుని యాత్రలో వెనక్కి పోయేటట్లు..  

భయంకరమైన యాతన వేపుకు తోసివేయగల 
నైపుణి వాని సొత్తు
వానికి జీవితోటే కానీ 
అతను వేసుకున్న బట్టలతో పనిలేదు
రాజైనా పేదైనా సాధువైనా సన్యాసైనా..
ఒకటే



క్షణంలో రాజును పేదలా..
సన్యాసిని సంసారిలా..
మార్చేస్తాయి
 

గీతాచార్యుడందుకే వీనిని 
'నరక ద్వారములు' అన్నాడు..


ఈ నడుమ ఒక రోజు నాకో ఫోన్ వచ్చింది..
ఒక పీఠాధిపతి కార్యాలయం నుంచీ

ఆయన పిల్లవాడుగా ఉన్నప్పుడు 
పీఠాధిపత్యం పొందాడు

 జీవితంలో కొన్ని అయాచితంగా లభిస్తాయి 

వానిలో మన ప్రమేయమేం వుండదు..
పాపం పసివాడు 

సన్యాసదీక్ష అవలంబించాడు..
 అనుకొని..

పుట్టపర్తి ప్రతిదినమూ వారింటికెళ్ళి 
భగవద్గీత చెప్పేవారట..
వానికి సన్యాసి ధర్మం గురించి 
యేదో నేర్పించాలని తపన

పుట్టపర్తికీ కొంత సన్యాసిత్వం పై అపేక్ష వున్నది
అందుకు కారణం 

కొందరు  లోపల వున్నారు
వారు ..
అరవిందులు..
రమణులు..
రామకృష్ణులు..
 

వారు ఆశ్రమ జీవితం కొరకు కొంత ప్రయత్నించి వున్నారు కూడా
కానీ మనసులోని అన్ని భావనలను సాకారమొనర్చడం సాధ్యం కాదు
అదీ భార్య నలుగురు పిల్లలతో..
 

తన సఫలమవని కోరికపట్ల అసంతృప్తి.. 
కానీ .. 
ఆశ్రమ జీవితంపై విడని మోహం..

చంద్ర శేఖర పరమాచార్యులవారు కూడా  
అతి చిన్నవయసులో పీఠాధిపతిగా యెంపిక అయ్యారు
ఆ పసివాడు గుర్రపు బండిలో బోర్లా పడుకుని 
లో తాను దుఃఖించార ట..

ఆ తర్వాత ఆ కొత్త పాత్రలో వొదగడానికీ
తనను తాను మార్చుకోడాని కి 
దినదినమూ ప్రయత్నం  చేశారట..
కొత్తలో సత్యదండాన్ని వదలి తిరిగేవారుట..
తరువాత 
తన నడుముకు బట్టతో గట్టిగా కట్టుకుని పడుకునేవారు

ఆ ప్రయత్నాలు స్వచ్చమైన.. 
శక్తివంతమైన సన్యాసిని ..
మనకు చూపాయి..

యెక్కడికైనా నడకే..
లేదా పల్లకీ
ఇతర వాహనాలు యేనాడూ యెక్కలేదు..

 మౌన వ్రతాలూ ఉపవాస దీక్షలూ..

కఠిన ఆహార నియమాలూ
ధ్యాన యోగాది నిత్యకృత్యాలూ..
వయసు ప్రలోభాలకు తావివ్వలేదు..
పూర్వాశ్రమ బంధాలను 
తిరిగి కొనసాగించలేదు..
పూర్తిగా తన జీవితాన్ని 
వైదిక ధర్మానికి ఆశ్రమ విలువలకూ రాసిచ్చేసారు..

అందుకే ఆయన్ని నడిచే దేవుడన్నారు..
కోటీశ్వ రులు సైతం రోడ్డుమీద కూడా సాగిల పడేవారు..

 యీనాడూ కూడా మంచి కార్యాక్రమాలను నిర్వహిస్తున్న గణపతి సచ్చిదానంద స్వామి

 వంటి వారూ..
అలానే సన్యాసిత్వానికి మసి పూస్తున్న నిత్యానందలూ 
మనకు తగుల్తూనే ఉన్నారు..

మరీ స్వామి మనకేం చెబుతారో.. 
అని ఆలోచిస్తూ

నేను వెళ్ళాను..

దూరం నుంచే..    కిటికీ లోంచీ పేద్ద టీవీదర్శనమిచ్చింది
అందులో  ఫుట్ బాల్ మ్యాచ్..

బయట పిల్లలు పిలకలతో వేదాలు చదువుకుంటున్నారు
మరి..లోన టీవీ..??

నాకు సాదరంగా ఆహ్వానం పలికారు..
టీవీ రూం లొంచీ స్వామి బయటికి వచ్చారు..
వూగే వుయ్యల కుర్చీలో స్వామి ఆశీనులయ్యారు..
స్వామి భారీ విగ్రహం కుర్చీలో కష్టపడి ఒదిగింది..
ఇంతలో స్వామి వారి సహోదరులు వచ్చి చేరారు..  

'పుట్టపర్తివారు మాకు చాలా సన్నిహితులు..'
అంటూ చెప్పారు..
కానీ..
తరువాత సాగిన సంభాషణ అంతా ..
ఎవరు అన్య కులస్తుణ్ణిచేసుకున్నారు..
ఎవరెవరికి యేయే వ్యసనాలున్నాయి..
వగైరాలచుట్టూతిరిగింది..

పది మాటలు స్వచ్చంగా ధారగా సూటిగా 
మాట్లాడలేని స్వాములవారు.. 
మాటిమాటికీ తడబడుతున్నారు..  

వాళ్ళ లో వాళ్ళే మేనేజర్లూ..అకవుటెంట్లూ..నట..
కాషాయ వేషధారణలో తప్ప 
యెందులోనూ కనపడని పవిత్రత..
ఆకాషాయంకూడా గత్యంతరంలేక 
వాళ్ళని భరిస్తున్నట్లనిపించింది..

పైకి సంభాషణ సాగుతున్నా 
లోలోన నా మనసు రోదిస్తోంది
మా అయ్యగురించి 
యేమైనా కొత్త విషయాలు తెలుస్తాయేమో
అని ఎంతో ఆశగా వెళ్ళిన నాకు 

తీవ్ర భంగపాటు..
 

స్వామి గారూ ..వారి సహోదరులూ..
 ఆ వాతావరణం చూసిన నన్ను 
చుట్టుముట్టిన అశాంతి..
 

అతనే..
అతనే ..
 సన్యాసి..
నిజమైన సన్యాసి..
నిజమైన సన్యాసి..


 నా మనసులో ధ్వనులు ప్రతిధ్వనులను సృష్టిస్తున్నాయి..


 ''నేను ఇన్ని కోట్ల గాయత్రి చేసాను ..

ఇన్ని కోట్ల అష్టాక్షరి చేసాను ..
ఇదీ నా స్థితి..
నాకే అనుభూతీ కలుగలేదు....
నీకు కలిగిందా..?

నీవు దేవుణ్ణి చూశావా ..?

నాకు చూపగలవా ..?''
అని పీఠాధిపతులనే ప్రశ్నించి తత్తర పుట్టించినవాడు

 వాళ్ళేం చెబుతారు..
అంత సాధన వాళ్ళే చేసివుండరు
అదీకాక అంత తపన వాళ్ళలో వుంటేకదా..?

 ఆధ్యాత్మికానుభూతి కలుగలేదని 
అశాంతితో ఇల్లు విడిచి దేశం పట్టిపోయి..
అనేక మంది సాధువులనూ సన్యాసులనూ కలుస్తూ..
చివరకు హిమసానువుల పైనుంచీ విరక్తితో

 జీవితం త్యజించాలనుకున్న పుట్టపర్తి ఎక్కడా..
వీళ్ళెక్కడా..


 అందుకే పుట్టపర్తికి దేవుడు కనిపించాడు
దయానంద సరస్వతి గా ..
ప్రేమగా తన ఆశ్రమానికి తీసుకెళ్ళారు..
అన్ని విధాలా పరీక్షించారు..
కాదు కాదు
తండ్రి తన పిల్లవాణి సామర్థ్యానికి మురిసినట్లు మురిసిపోయారు
పుట్టపర్తిని విరక్తినుంచీ బయటకు తెచ్చి..
 

నాయనా నీకు ఇంకా జీవితం ముందుంది..
కీర్తి కిరీటాలు నీకోసం ఎదురు చూస్తున్నాయి..
ఎన్నో అనుభవాలు నీకై వేచి వున్నాయి..
తరువాత ..
నిన్ను నేనే నా దగ్గరికి పిలిపించుకుంటాను..
అని చెప్పి పంపారు..

శ్రీ శ్రీ శ్రీ చంద్రశేఖర పరమాచార్యులవారు
నీకు అంత్యదశలో కృష్ణదర్శనమవుతుందని భరోసా ఇచ్చారు..

 
నూనెకీ ...నీటికీ ..తేడా లేదు
అగ్నిలో పోసినప్పుడు మాత్రమే.. 

దాని నిజ స్వరూపం తెలుస్తుంది.. 
అగ్నిని ఆర్పేవి నీళ్ళు
మరింత ప్రజ్వలింపజేసేది  నూనె..