28 ఆగ, 2014

సరస్వతీ పుత్ర శ్రీ మాన్ పుట్టపర్తి నారాయణాచార్యులు (2వ భాగం ) --- రచన వి. సదానందేశ్వరయ్య


గో తెలుగు.కాం లో పుట్టపర్తిని గురించిన వ్యాసం పడింది
శ్రీ చెరుకు రామ్మోహన రావ్ గారు ఎంతో ఆత్మీయంగా బదులిచ్చారు..
 

కడపలోని రోజులను జ్ఞాపకం చేసుకున్నారు..
ఆయన facebookలో మెసేజ్ చేస్తూ 

నీ అన్న కాని అన్న..
అని పోస్ట్ చేసారు..
నా హృదయం పులకించిపోయింది..
వారు వ్రాసిన వ్యాసంలో మెరుపులివి..



ఒక మహాకవిని..
పండితుడిని
పధ్నాలుగు భాషల దిట్ట
నాలుగు రూపాయల కోసం ఆశపడడం అవీ దొరకకపోవడం..
ప్చ్..
 

అందరూ పద్మశ్రీ వస్తే చాలని ఎదురుతెన్నులు చూస్తే..
దాని ద్వారా యేవైనా డబ్బులు వస్తాయని అనుకున్నారట..
కానీ ఒక కాగితం స్మృతి చిహ్నం ఇచ్చారట..
సహాయంకోసం శ్రీమతి ఇందిరా గాంధీ ని అడిగారట..
ఆమె కలెక్టర్ కు అప్లయ్ చేసుకోమన్నారట..
ఆ కలెక్టరూ స్కూల్ టీచర్లకు ఆ అర్హత లేదన్నారట..
యేమిటివన్నీ.

మంచి మంచి అవకాశాలను 

చేజేతులా వదులుకొని..
మంచి ఉద్యోగాలను.. 

తృణమాత్రంగా వదిలేసి..
వాళ్ళనూ వీళ్ళనూ సహాయం కోసం అర్థించడం..

అవకాశం వచ్చినపుడు..

ఉద్యోగం కంటే స్వాభిమానం గొప్పది..
వాళ్ళకాళ్ళూ వీళ్ళకాళ్ళూ పట్టుకోవటం చిన్నతనం..
ఒకరికి పెట్టటమే కానీ
దేహీ అనటం ఎందుకు
భగవంతుడు ఇచ్చినది తినడానికీ తాగడానికీ సరిపోదా..
అన్న భావనలు.,



కుటుంబా వసరాలు మీద పడినప్పుడు 
ఎవడైనా సహాయం చేస్తే బాగుండు నన్నతలంపు 
అంటే డబ్బు ఆ అవసరాలకు సరిపడా వస్తే చాలు 
ఎక్కువ వద్దు.. 
దాచుకోవడం 
దాన్ని చూసి మురిసిపోవటం అంటే ఏహ్యత 

ఈ  వ్యక్తిత్వాలు ఈరోజుల్లో కనిపిస్తాయా..?


ఒక సంగీతవిద్వాంసుడు పాడితే..
చెమర్చిన కళ్ళతో భార్య చేతిగాజులు 

ఆయన కాళ్ళ దగ్గర పెట్టే సుబుధ్ధులెవరండీ..
 


మా పెద్దక్కయ్య పెళ్లి చందాలెత్తి చేసారట 
పిల్ల పెళ్ళికి చెం దాలెత్తడం పెళ్ళి చేయడం
అదేమీ తప్పుకాదు..

 అలానే శిష్యులు పుట్టపర్తి కథ నడిపించారనుకోండి .. 


సదానందీ శ్వరయ్య గారు వ్రాసిన ఈ వ్యాస భాగం ఇది 
అవును సదానందం చెప్పినట్లు 
పద్మశ్రీ తీసుకొని తప్పు చేసాను 
అన్న వాక్యం వెంటాడు తూం ది ..



సరస్వతీ పుత్ర శ్రీ మాన్ పుట్టపర్తి నారాయణాచార్యులు (2వ భాగం ) --- రచన వి. సదానందేశ్వరయ్య


శ్రీమాన్ పుట్టపర్తి వారికి 
ప్రభుత్వము పద్మశ్రీ బిరుదునిచ్చిన సందర్భముగా మైదుకూరులో యువజనసాహితీ సంస్థ తరుపున 1973లో ఆచటి హైస్కూల్ ఆవరణలో 
ఒక బహిరంగసభ జరిగింది. 

ఆచార్యులవారికి సన్మానం, 
కవి సుధాకర ఎస్. రాజన్న కవి అధ్యక్షత వహించగా 
నేను వక్తను, 


ఆ రోజుల్లో సహజ యవ్వనం కారణంగా ఆచార్యులవారుపద్మశ్రీ తీసుకొన్నందుకు ఆక్షేపించాను. ఆ బిరుదు సినీనటుడు రేలంగి వేంకటరామయ్యకు ఇచ్చిన తర్వాత ఇచ్చారు. 


అంతకు మునుపే నారాయణాచార్యుల వారిని
 రేడియో గుర్తించని నాడు, 
శాసనమండలి, 
సాహిత్యపరిషత్తులు తిరస్కరించిన నాడు కూడా

 ప్రజలు, 
సాహితీ పిపాసులు, 
ప్రజల మనిషని గుర్తించారు. 


హంగులతో అహంతో 
కవులు గగనసీమలో విహరించే రోజుల్లో 
ఆయన మానవత్వమున్న మనిషిగా
 ప్రగతిపథంలో పయనించినారు. 


కావున ఆచార్యులవారు 
జనప్రియ రామాయణందే కాకుండా 
సమాజగతిని నగ్నంగా చిత్రించగల 
జనతారామాయణం వ్రాయుమని 
మరొక గుడిగంటలు మ్రోగించి, 
పురోగమనాన్ని వ్రాయమన్నాను. 


స్వామికి ఏ రోజు సభలోను 
అధ్యక్ష, ముఖ్య అతిధి, ముఖ్యోపన్యాసకులు అని సంభోదించేఅలవాటు లేదు. 
సన్మానానికి జవాబిస్తూ ఇలా అన్నారు. 

“వాడు సదానందం” చెప్పినట్లు 
నేను పద్మశ్రీ తీసుకొని తప్పుచేసినాను.
 ఇంకా MLCకి ప్రయత్నించాను. 
రేడియోలో ఉద్యోగం ఇస్తామంటే ఆశపడ్డాను.
 ఇవన్నీ పొరపాట్లే. 


పద్మశ్రీ అంటే ఏదో కొంత డబ్బు ఇస్తారనుకున్నాను. 
కాని డిల్లీలో ఒక కాగితం, స్మృతిచిహ్నం ఇచ్చారు. 
ఈ మాటను నేను 
శ్రీమతి ఇందిరాగాంధి గారిని అడిగాను.
 ఆమె ఆర్ధిక సహాయానికి 
మీ జిల్లా కలెక్టరుకు అప్లయ్ చేయమన్నారు. 


కడపలో కలెక్టరు గారిని అడిగినాను. 
ఆయన ఉపాధ్యాయవృత్తిలో ఉన్నవారు 
Below poverty line క్రింద రారని చెప్పి
 రిక్తహస్తాలు చూపించారు. 


కానీ సదానంద చెప్పినట్లు 
ఒకేరకమైన కవిత్వం నేను వ్రాయలేను. 
వ్రాయను. 


నేను వానివలె 
ఏ committed Ideology కు చెందిన వాడిని కాను. 
నా మనస్సు ఎలా స్పందిస్తే అలా వ్రాస్తాను. 

ఇప్పటికే కొన్ని వందలపేజీల గేయసాహిత్యం, ప్రాచీనసాహిత్యం వ్రాశాను 
‘ఎవరైన ప్రచురించి నాకు కొన్ని ప్రతులిస్తే సంతోషిస్తానన్నారు” 

ఇదే ఆయన సిసలైన నిజాయితితో వెలిబుచ్చిన నిఖార్సయిన మనస్తత్వము

26 ఆగ, 2014

వేనుడు

రాజ్జ పాలన..
దానిని పవిత్రమైన యజ్ఞంగా భావించి పాలించిన రాజులు
మనకు ఎందరో కనబడతారు
వారి చరిత్రలు 
మనకు రాజ్జ్య పాలన యెలా చేయాలో చెబుతాయి

యువరాజుగా పట్టాభిషిక్తుడవబోయేముందు శ్రేయోభిలాషులు ప్రజారంజకుడిగా రాజ్జం చేయమని
ప్రజల మాటనే శిరోధార్యంగా భావించాలని
వ్యక్తిగత ప్రయోజనాలు కుటుంబ ప్రయోజనాలను పక్కనపెట్టి ప్రజాసేవలో తరించాలని హితోపదేశం చేస్తారు..

 ఉన్నతమైన విలువలతో జీవించి తాను అందరితో శభాషనిపించుకోవాలని 
ఆనాటి రాజులూ  తహ తహ లాడారు
అందుకు ఉదాహరణలుగా
చాకలివాని మాటకు ఒగ్గి
 సీతను అడవులపాలు చేసిన రాముడు
సత్యసంధతనే నియమంగా పెట్టుకున్న హరిశ్చంద్రుడు
సహనం శాంతి మూర్తీభవించిన 
స్థితప్రజ్ఞు డు .. అజాత శత్రువైన ధర్మ రాజు
స్నేహధర్మానికి ప్రాణం ఇస్తానన్న 
దానగుణ సంపన్నుడైన కర్ణుడు..
కళ్ళకు గంతలు కట్టుకున్న గాంధారీ..

ఇలా ఎందరో మనకు దర్శనమిస్తారు..


 కానీ అటువంటి సత్యకాలంలోనూ
పంటికింద రాళ్ళలా..

 దుర్మార్గులైన ప్రభువులు తారసపడతారు
వారు అధికార గర్వితులు
వారు చేసిందే పాలన
వారు చెప్పిందే చట్టం
 

వారు ఎవ్వరి సలహాను తీసుకోరు జోక్యాన్ని సహించరు..
అటువంటివాడే ఈ వేనుడు
 

మహా దుర్మార్గుడు..
బలవంతుడు..

వాడికి  ఎవ్వరిని పూజించాలో తెలియదు.. 
ఎవ్వరిని గౌరవించాలో తెలియదు..
ఎవ్వరిని రక్షించాలో తెలియదు..


అటువంటి వాడి పాలనలో రాజ్జ్య వ్యవస్థ పాడైపోయింది..
విద్రోహశక్తులకు ధైర్యమొచ్చింది
అమాయకులు వేధింపబడ్డారు..
 

ప్రజలు తపోనిష్టులైన మునులనాశ్రయించి కాపాడమన్నారు..
వారు మరికొంతకాలం ఓపిక పట్టారు..
 

ఎందుకు..
వాడు మాట వినాలి..
లేకపోతే వాని పాపం పండాలి..


కాని రెండవదే నిజమైంది
రాచరికమునకు ధర్మము ప్రధానమైన చక్రము..
ధర్మ శక్తి లేనిది రాజయంత్రము నడువనే నడువదు..
కాబట్టి ధర్మ బధ్ధుడవై నడువుమన్నారు..

 ప్రభువు విష్ణ్వంశ..
ప్రభువేదిచేస్తే అదే ధర్మం..
ప్రశ్నించడానికెవ్వరికీ అధికారం లేదు.. 

పొండన్నాడు వాడు..
అప్పుడేమయింది..


 వారి తపోనిష్టత కళ్ళు తెరిచింది..
వారి మాట 

వహ్ని పర్వతములనుండి దుమికిన లావా అయ్యింది..
వాడు ఆ అగ్నిలో శలభ మయ్యాడు 


 విచిత్రమేమంటే ప్రతి దుర్మార్గుని గూటిలోనూ
వేదాలు వల్లించే చిలుక ఒకటి వుంటుంది
వీడు చేసే దుర్మార్గాలకా ప్రాణినుంచీ 

రక్షణ లభిస్తూ వుంటుంది..

వేనుని తల్లి సునీథా దేవి
ఆమె కొడుకును మంచి మార్గంలో పెట్టటానికెప్పుడూ ప్రయత్నిస్తూనే వుంది
కానీ వాడు వినడు..


తనకొడుకును శపించిన మునులపై 
ఆమె క్రోధం పెట్టుకోలేదు..
మునుల ఆగ్రహానికి మాడి మసైపోయిన వేనుని శరీరాన్నామె కాపాడింది 
ఎన్నోరోజులు పుత్రప్రేమతో..

రాజులేని రాజ్జ్యం ఎలా కొనసాగుతుంది..
మళ్ళీ రాజు అవసరమయ్యాడు
అప్పుడు కుమారుని శరీరాన్ని కాపాడుకుంటూ
తమ దయ కోసం మౌనంగా నిరీక్షిస్తున్న

 సునీథా దేవి సౌశీల్యం వారిని మెప్పించింది..

వారు తిరిగి వచ్చారు
వేనుని తొడపై మథించారు..
అందులోంచీ ఒక ఆజానుబాహుడుద్భవించాడు
ఆయనే ప్రజల కోసం తపించిన పృథు చక్రవర్తి.


అయ్యయో .. మొత్తం చెప్పేశాను..
మీకిప్పుడు 

నేను క్రింద జత చేసిన రాయల నీతి కథలలోని 
వేనుడు 'సస్పెన్స్ లేని స్టోరీలా' వుంటుందేమో..
కానీ .. పుట్టపర్తి కథనానికీ నా రాతకూ పోలికెక్కడ..

ఈ వేనుని కథను విశ్వనాధవారు 

'వేనరాజు '
అనే నాటకం గా వాశారట..
అది గొప్ప సంచలనాలకు.. వివాదానికీ కేంద్రబిందువైందట..
అంతే మరి గొప్పవారు యేంచేసినా అలానే వుంటుంది..
 

విశ్వనాధవారు
వేనరాజు పాత్రను కౄరుడైన పాలకునిగా, 

వేదధర్మంపై అక్కసుతో 
దారుణ కృత్యాలు చేసే వ్యక్తిగా చిత్రీకరించారు. 

గౌతమ మహర్షితో వేనుడికి వైరం ప్రబలి 
తుదకు వేనుణ్ణి గౌతముడు తపశ్శక్తితో సంహరించడం ప్రధాన ఇతివృత్తంగా పేర్కొనవచ్చు

మరి పుట్టపర్తివారి  వేనుణ్ణి చూద్దామా..



25 ఆగ, 2014

మహాభారత విమర్శనము తెలుగు పరిశోధనలో

 తెలుగు పరిశోధన వారు పుట్టపర్తి వారి మహాభారత విమర్శనము గ్రంధాన్ని పెట్టారు లింక్ ఇది.



తెలుగు పరిశోధన teluguthesis.com: మహాభారత విమర్శనము Maha Bharatha Vimarshanamu: మహాభారత విమర్శనము Maha Bharatha Vimarshanamu పుట్టపర్తి నారాయణాచార్యులు Puttaparthi Narayanacharyulu పుట్టపర్తి నారాయణాచార్...

21 ఆగ, 2014

కోపగృహ నిర్మాణము

కోపగృహము..
రాజుల కాలంలో ఇది తప్పనిసరిగా వుండేది
అదీ రాణుల అంతఃపురాలలో
 


దేనికైనా రాణిగారికి కోపం వస్తే..
ఆవిడ ఆభరణాలన్నీ తీసి విసరి కొడుతూ..
సిగనలంకరిం
చుకున్న పూలు పీకి పడేస్తూ..
పైనున్న వస్త్రాలనూ తీసివేసి నల్ల చీరను ధరించి 

ఆ గృహంలో ఏడు స్తూ కూచుంటుంది
 

ఆ విషయం రాజుగారికి వెళుతుంది
ఆయన పరుగు పరుగున వచ్చి
ఆవిడని బతిమాలి బామాలి కోప కారణం తెలుసుకొని
ఆమె అలుక తీరుస్తాడు
అక్కడికి రాణి అలుకను విడిచి నవ్వుతుంది
 

ఈకాలంలో అంత తీరిక మగవారికెక్కడుంది
పొద్దునలేస్తే పరుగులు పెట్టటమే పని
కృష్ణుడు సత్యభామతో ఈ పాట్లన్నీ పడ్డాడు
 

పాపం రుక్మిణి  ఇలా కృష్ణుని సతాయించి ఎరుగదు
తక్కిన సతుల కింత సీనున్నట్లు కనపడదు..
ఇంక రామాయణంలో కైక కూడ కోప గృహాన్ని ఉపయోగించి రాముణ్ణి అడవుల దారి పట్టించింది..


 రాయలనాటి రసికతా జీవనము చూస్తే..
రాయల నాటి జీవనము.. జనుల వ్యవహారశైలి.. ఆచార వ్యవహారాలు తాను చూచినట్లే
మన కళ్ళకు కట్టి చూపించే  పుట్టపర్తి ప్రతిభ కాశ్చర్యము కలుగుతుంది..


ఇందులో కో పగృహ ప్రస్తావన ఉంది 
రాయల నాటి ప్రజలు 
హాలు కిచెను బెడ్ రూమ్ లున్నట్లే 
కోప గృహాలూ నిర్మించే వారట
 చదవండి .. 
 
 వారి గృహములయందొక రాయియైనను 
యలంకార హీనముగ నున్నచో 
వారి మనస్సు 'కళక్కు 'మనును
 

ప్రతి చోటను కొంచెము సందు దొరకినచో 
 నొక చేపను.. 
నెమలిని 
కడకొక మల్లెపూవునైనను జెక్కించెడివారు
 

కుడ్యములయందు  వారు వర్ణ చిత్రములు వేయుదురు..
ఒక్కొక్కప్పుడింటి పైకప్పులను గూడ

 తైల వర్ణచిత్రములతో అలంకరింతురు
 

అంతేకాదు 
ఇక్కడ ఇంకో విచిత్రమైన సంగతి యేమిటంటే
వారు వారి ఇండ్లలో 

భోజనశాలలు.. మజ్జన శాలలు చిత్రశాలలు 
వేరువేరుగ నుండెను
 

మనకు దెలియని మరియొక వి శేషమానాడుండెడిది
అది 'కోపగృహ నిర్మాణము'
ఇంటి ఆవిడకు కోపము మగనిపై వచ్చినపుడామె  యాగదిలోనికి బోయి దూరికొనును
 

కాని యాకాలమందును 
మగవారికి గోపగృహమున్నట్లు కనుపింపదు.. అంటారు..

(కోపతాపాలు అలకలు అన్నీ ఆడవారి సొత్తు 
ఆమె అలక తీర్చటమూ 
శృంగారములో ఒక భాగం కామోసు..)
 


''ఈనాడే గనుక కోపగృహముల ఆచారమున్నచో మగువలకన్న ముందే.. 
మగవారక్కడ జేరియుందురని నా యనుమానము
కారణమేమనగా
 

మనకీనాడు సంపాదించిపెట్టలేక 
దినమున కొక్కసారియైనను భార్యపై 
గోపము వచ్చుచుండును.
 

ఆనాళ్ళలో యైనను 
అందరు కవులకు కోపగృహముతో నక్కరలేదు
ముక్కుతిమ్మన్నకు మాత్ర  మాయవసరము కలిగినది
 

కృష్ణునిపై గోపమునునుగొన్న సత్యభామాదేవి
 చీకటింటి కడకంకటిపై 
'జలదాంత చంద్రరేఖాసదృశాంగియై'
శరీరమొకచోట పొందక పొరలి పొరలి యేడ్చెనట..

ఏ వాస్తు శాస్త్రకారుడు గనిపెట్టినాడో గాని 


కోపగృహాలవాడుక చాల మంచి యాచారము 
కోపగించిన యావిడ చీకటింటిలో జేరినచో 
తక్కినవారు తకరారు లేకుండ 
తమ పనులను జేసికొన వచ్చును

చూసారా.. 
మా అయ్య ఇలాంటి ప్రబంధప్రమాదాలను  
జాగ్రత్తగా బుర్రలోనే వుంచేసి.. 
ఇంట్లో కోపగృహ నిర్మాణం చెయలెదు.. 
ఒకవేళ చేసి వుంటే మేమూ అప్పుడప్పుడూ  ఉపయోగించేవాళ్ళం కదా.. 

(కోపగృహము సంగతి తెలియక నేను నా చిన్నప్పుడు
మోచెంపేటలో వుండగా నేలపై పడి పొర్లి పొర్లి యేడ్చేదాన్ని
అది కావాల.. ఇది కావాల అని
మా అయ్య వద్దకుంటె గుద్దుకో వాకిట్లో పండుకో
ఎవరైన తొక్కితె లబ లబ మొత్తుకో
అని తాను భుజాలేగిరేస్తూ  పాడేవాళ్ళు
 

ఆ కోపగృహము మా అమ్మ ఉపయోగించదు 
అంత తీరిక ఆమె కెక్కడ .. 
మా అక్కలకు బాగా పనికి వచ్చేది
వాళ్ళల్లో వాళ్ళకు పోటీలెక్కువ
వాళ్ళు పుట్టింటికి వచ్చినప్పుడు..

కోపగృహము ఎప్పుడు ఖాళీగా వుండదేమో బహుశా
ఎప్పుడూ ఎవరో ఒకరు దాన్లో వుంటారు
పైగా బయట మరొకరు వైటింగూ
మా అయ్య పట్టించుకో
రు..
మా అమ్మకు తల వాచిపోయుండేదివాళ్ళ అలకలు తీర్చలేక .. )

16 ఆగ, 2014

రేపు కృష్ణాష్టమి..


రేపు కృష్ణాష్టమి..
కృష్ణుడుద్భవిస్తున్నాడు
అదిగో ప్రకృతి అంతా ఆనందంతో పరవశిస్తోంది
మనకంటే ముందే..
చెట్లకూ.. గాలికీ. మట్టికీ.. నీటికీ..
పశుపక్ష్యాదులకూ ప్రభుని రాక తెలిసిపోతోంది
ఎందుకో..

అదిగో అక్కడేదో పాట లీలగా వినిపిస్తోంది..
విందామా..