18 ఫిబ్ర, 2014

స్పర్శవేది

       తలగవు కొండలకైనను
        మలగవు సింగములకైన! మార్కొను గడిమిన్
        గలగవు పిదుగులకైనను
        నిల బల సంపన్నవ్రుత్తి! నేనుగ గున్నల్
        
       నీరాట వనాటములకు
        బోరటం బెట్లు గలిగె! బురుషోత్తముచే
        నారాట మెట్లు మానెను
       ఘోరాటవిలోన భద్ర: కుంజరమునకున్

 యీ పద్యాలు చదువుతుంటే

భావం  అది వ్యక్త పరిచే పధ్ధతి
ఆ పదాలు దానిలో దాగున్న లయ
అవి మనల్ని వెంటాడతాయి


కానీ విమర్శకులు మాత్రం
 భూతద్దాలతో తయారై
మంచివని మనమనుకున్న వాటిల్లోంచీ కూడా లోపాలు వెదికి  చూపిస్తుంటారు
 

ఆరంధ్రాన్వేషణ వలన వారికీ మనకూ కూడా ఒరిగేదేమీలేదు
కాగా
కొంతకాలానికి మనకూ ఆజాడ్యం అంటుకోగలదు
 

మనకెందుకీ రభసలు 
హాయిగా నచ్చిన కవిత్వం చదువుకోక అనుకుంటాం మనం

మరి పోతన్నకు యెదురైన విమర్శలేమిటి
చూద్దామా


గజెంద్రమోక్షంలో అడవిని వర్ణిస్తూ 
పోతన్న వ్రాసిన వచనం వారి కాహారమైంది.
 

ఆధునికులు 
తండ్రితాతల అన్వేషణలో ముందుకు సాగితే
సంప్రదాయవాదులు గ్రామరునే ప్రామాణికంగా పెట్టుకున్నారు


అయినా ఉత్తమ గ్రంధాలను వ్రాసేవారు 
జనాలకోసం రాయనే రాయరు
తనకోసం తన ఆత్మానందం కోసం రాసుకున్నవి మనకు అమృతాలవుతాయి
జనాలను మెప్పించడానికి రాసేవానిలో ఆత్మ ఎక్కడుంటుందీ..


పోతన వ్రాసిన వర్ణన ఇదే
ఒకసారీ అడవిగుండా ప్రయాణించి అందాలు వీక్షించి పుట్టపర్తి వారేం చెప్పారో చూద్దాం సరేనా..


 అది మఱియును మాతులుంగ లవంగ లుంగ చూత కేతకీ భల్లాత కామ్రాతక సరళ పనస బదరీ వకుళ వంజుళ వట కుటజ కుంద కురువక కురంటక కోవిదార ఖర్జూర నారికేళ సిందువార చందన పిచుమంద మందార జంబూ జంబీర మాధవీ మధూక తాల తక్కోల తమాల హింతాల రసాల సాల ప్రియాళు బిల్వామలక క్రముక కదంబ కరవీర కదళీ కపిత్థ కాంచన కందరాళ శిరీష శింశుపాశోక పలాశ నాగ పున్నాగ చంపక శతపత్ర మరువక మల్లికామతల్లికా ప్రముఖ నిరంతర వసంతసమయ సౌభాగ్య సంపదంకురిత పల్లవిత కోరకిత కుసుమిత ఫలిత లలిత విటప విటపి వీరు న్నివహా లంకృతంబును, మణివాలు కానేక విమల పులిన తరంగిణీ సంగత విచిత్ర విద్రుమలతా మహోద్యాన శుక పిక నికర నిశిత సమంచిత చంచూపుట నిర్దళిత శాఖి శాఖాంతర పరిపక్వ ఫల రంధ్ర ప్రవర్షిత రసప్రవాహ బహుళంబును, కనకమయ సలిల కాసార కాంచన కుముద కల్హార కమల పరిమళ మిళిత కబళాహార సంతతాంగీకార భార పరిశ్రాంత కాంతా సమాలింగిత కుమార మత్త మధుకర విట సముదయ సమీపసంచార సముదంచిత శకుంత కలహంస కారండవ జలకుక్కుట చక్రవాక బలాహక కోయష్టిక ముఖర జలవిహంగ విసర వివిధకోలాహల బధిరీభూత భూ నభోంతరాళంబును, తుహినకరకాంత మరకత కమలరాగ వజ్ర వైఢూర్య నీల గోమేధిక పుష్యరాగ మనోహర కనక కలధౌత మణిమయానేక శిఖరితట దరీ విహరమాణ విద్యాధర విబుధ సిద్ధ చారణ గంధర్వ గరుడ కిన్నర కింపురుష మిధున సంతత సరససల్లాప సంగీతప్రసంగ మంగళాయతనంబును, గంధగజ గవయ గండభేరుండ ఖడ్గ కంఠీరవ శరభ శార్దూల చమర శల్య భల్ల సారంగ సాలావృక వరాహ మహిష మర్కట మహోరగ మార్జాలాది నిఖిల మృగనాథ సమూహ సమరసన్నాహ సంరంభ సంచకిత శరణాగత శమనకింకరంబునునై యొప్పు నప్పర్వత సమీపంబునందు.


                                                                       *** 




 
ప్రాచీనులలో అప్పకవి మొదలైన మహామహులకు పోతన్న కవిత్వము లాక్షణికముగ గనుపింపలేదు
అతడొనర్చిన పాపమేమనగా 
లఘ్వులఘురేఫములకు బ్రాస గూర్చుట..

ఇట్టి పనికిమాలిన యెత్తిపొడుపే పాలకురికి సోమనాధునిపైగూడ గలదు

యీ జాతి వారందరును 
కల్ప వృక్షములను దెగనరికి వంటకట్టెలు 
దయారు చెయుదమను రకము.

అప్పకవి వంటి వారికే గాదు కవుల మనుకొన్నవరిలోను చాలమందికి
పోతనామాత్యుల పై యనుగ్రహము మట్టమే

అందుకే 
ప్రాచీన కవి ప్రశంసల చిట్టాలలో నెక్కడో దప్ప
పోతన పేరు గనుపింపదు
యీ నడుమ
 పోతన్నను గురించి సాగిన విమర్శలు 
ఆయన యూరేది తండ్రి తాత లెవ్వరు
మొదలగు విషయములపైననే 
కొందరు విద్యాధికులాతని 
కవిగా తూచిన వ్రాతలును గలవు

కాని వీరిలో జాలమంది యాంగ్ల విద్యాభక్తులు
వారి సులోచనములు ధరించియే 
ప్రతి విషయమును జూతురు

ప్రాచీనులది అదొక గొడవ
కలమందికొన్నంతనే వారి కంటబడునది
మమ్మటుడు రుయ్యటుడు
తప్పులు బట్టుటలో నున్నంత చొరవ యొప్పులను గ్రహించుటలో లేదు

ఇంతకును 
నీ యిరుదెగల విమర్శనములతోను 
మనకు జరిగిన న్యాయము సున్న

గజేంద్ర మోక్ష కథలో నడవిని వర్ణించుచు 
పోతన్న యొక దీర్ఘ వచనమును వ్రాసినాడు 
దీనినొక ప్రసిధ్ధ విమర్శకుడు వెక్కిరించెను

అమర కోశమును దగ్గరుంచుకుని పోతన్న 
వనోషధి వర్గలోని చెట్ల పేర్లన్నియునిందు జేర్చినాడట
నిఘంటువును దగ్గర బెట్టుకుని 
పదములకు వెదుకవలసిన దురవస్థ 
ప్రాచీనకవులకు లేదు

వారు బాల్యముననే వానినెల్ల వల్లించెడు వారు
పూర్వకవులలో 
గొందరు సంస్కార హీనులైన నుండవచ్చును గాని యవ్యుత్పన్నులు లేరు

అట్టి ప్రబుధ్ధులున్నది మనలోనే..
ఆంగ్ల భాషాభ్యాసము మనకు గొంత 
స్వతంత్ర భావముల నొసగినది
అట్టివారును దక్కువయే

మనపూర్వులు ప్రాచీన సంప్రదాయములకు బానిసలని మనము వారిని నిందింతుము
కాని మనకథ యేమైనది ?
మనమంగ్ల సంప్రదాయములకు దాసులము

ప్రాచీనుల దాస్యములో 
మా యనుకొని సంతోషపడు నాత్మతృప్తియైన నున్నది
మనకదియులేదు..

14 ఫిబ్ర, 2014

యజ్ఞ వేదిక



తస్మాత్ జాగ్రత జాగ్రత.



''కామ క్రోధశ్చ లోభశ్చ దేహే తిష్టంతి తస్కరాః  
జ్ఞాన రత్నాపహారాయ తస్మాత్ జాగ్రత జాగ్రత.. ''
  
జీవితం ఒక కల వంటిది.. 
జీవి కనే కల 
షడూర్ములు కలలోని సన్నివేశాలను 
నిజమని భ్రమింపజేస్తాయి..
 

ఆ సన్నివేశాలతో మమేకమై 
జీవి  తప్పటడుగులు వేసేలా 
 పురికొల్పుతాయి

 ప్రయాణాన్ని నాలుగడుగులు ముందుకూ 
మూడడుగులు వెనక్కు పడేలా చేస్తాయి..

జ్ఞానమనే రత్నాన్ని అపహరించే దొంగలు  
కామ క్రోధ లోభాలు
జీవుని యాత్రలో వెనక్కి పోయేటట్లు..  

భయంకరమైన యాతన వేపుకు తోసివేయగల 
నైపుణి వాని సొత్తు
వానికి జీవితోటే కానీ 
అతను వేసుకున్న బట్టలతో పనిలేదు
రాజైనా పేదైనా సాధువైనా సన్యాసైనా..
ఒకటే



క్షణంలో రాజును పేదలా..
సన్యాసిని సంసారిలా..
మార్చేస్తాయి
 

గీతాచార్యుడందుకే వీనిని 
'నరక ద్వారములు' అన్నాడు..


ఈ నడుమ ఒక రోజు నాకో ఫోన్ వచ్చింది..
ఒక పీఠాధిపతి కార్యాలయం నుంచీ

ఆయన పిల్లవాడుగా ఉన్నప్పుడు 
పీఠాధిపత్యం పొందాడు

 జీవితంలో కొన్ని అయాచితంగా లభిస్తాయి 

వానిలో మన ప్రమేయమేం వుండదు..
పాపం పసివాడు 

సన్యాసదీక్ష అవలంబించాడు..
 అనుకొని..

పుట్టపర్తి ప్రతిదినమూ వారింటికెళ్ళి 
భగవద్గీత చెప్పేవారట..
వానికి సన్యాసి ధర్మం గురించి 
యేదో నేర్పించాలని తపన

పుట్టపర్తికీ కొంత సన్యాసిత్వం పై అపేక్ష వున్నది
అందుకు కారణం 

కొందరు  లోపల వున్నారు
వారు ..
అరవిందులు..
రమణులు..
రామకృష్ణులు..
 

వారు ఆశ్రమ జీవితం కొరకు కొంత ప్రయత్నించి వున్నారు కూడా
కానీ మనసులోని అన్ని భావనలను సాకారమొనర్చడం సాధ్యం కాదు
అదీ భార్య నలుగురు పిల్లలతో..
 

తన సఫలమవని కోరికపట్ల అసంతృప్తి.. 
కానీ .. 
ఆశ్రమ జీవితంపై విడని మోహం..

చంద్ర శేఖర పరమాచార్యులవారు కూడా  
అతి చిన్నవయసులో పీఠాధిపతిగా యెంపిక అయ్యారు
ఆ పసివాడు గుర్రపు బండిలో బోర్లా పడుకుని 
లో తాను దుఃఖించార ట..

ఆ తర్వాత ఆ కొత్త పాత్రలో వొదగడానికీ
తనను తాను మార్చుకోడాని కి 
దినదినమూ ప్రయత్నం  చేశారట..
కొత్తలో సత్యదండాన్ని వదలి తిరిగేవారుట..
తరువాత 
తన నడుముకు బట్టతో గట్టిగా కట్టుకుని పడుకునేవారు

ఆ ప్రయత్నాలు స్వచ్చమైన.. 
శక్తివంతమైన సన్యాసిని ..
మనకు చూపాయి..

యెక్కడికైనా నడకే..
లేదా పల్లకీ
ఇతర వాహనాలు యేనాడూ యెక్కలేదు..

 మౌన వ్రతాలూ ఉపవాస దీక్షలూ..

కఠిన ఆహార నియమాలూ
ధ్యాన యోగాది నిత్యకృత్యాలూ..
వయసు ప్రలోభాలకు తావివ్వలేదు..
పూర్వాశ్రమ బంధాలను 
తిరిగి కొనసాగించలేదు..
పూర్తిగా తన జీవితాన్ని 
వైదిక ధర్మానికి ఆశ్రమ విలువలకూ రాసిచ్చేసారు..

అందుకే ఆయన్ని నడిచే దేవుడన్నారు..
కోటీశ్వ రులు సైతం రోడ్డుమీద కూడా సాగిల పడేవారు..

 యీనాడూ కూడా మంచి కార్యాక్రమాలను నిర్వహిస్తున్న గణపతి సచ్చిదానంద స్వామి

 వంటి వారూ..
అలానే సన్యాసిత్వానికి మసి పూస్తున్న నిత్యానందలూ 
మనకు తగుల్తూనే ఉన్నారు..

మరీ స్వామి మనకేం చెబుతారో.. 
అని ఆలోచిస్తూ

నేను వెళ్ళాను..

దూరం నుంచే..    కిటికీ లోంచీ పేద్ద టీవీదర్శనమిచ్చింది
అందులో  ఫుట్ బాల్ మ్యాచ్..

బయట పిల్లలు పిలకలతో వేదాలు చదువుకుంటున్నారు
మరి..లోన టీవీ..??

నాకు సాదరంగా ఆహ్వానం పలికారు..
టీవీ రూం లొంచీ స్వామి బయటికి వచ్చారు..
వూగే వుయ్యల కుర్చీలో స్వామి ఆశీనులయ్యారు..
స్వామి భారీ విగ్రహం కుర్చీలో కష్టపడి ఒదిగింది..
ఇంతలో స్వామి వారి సహోదరులు వచ్చి చేరారు..  

'పుట్టపర్తివారు మాకు చాలా సన్నిహితులు..'
అంటూ చెప్పారు..
కానీ..
తరువాత సాగిన సంభాషణ అంతా ..
ఎవరు అన్య కులస్తుణ్ణిచేసుకున్నారు..
ఎవరెవరికి యేయే వ్యసనాలున్నాయి..
వగైరాలచుట్టూతిరిగింది..

పది మాటలు స్వచ్చంగా ధారగా సూటిగా 
మాట్లాడలేని స్వాములవారు.. 
మాటిమాటికీ తడబడుతున్నారు..  

వాళ్ళ లో వాళ్ళే మేనేజర్లూ..అకవుటెంట్లూ..నట..
కాషాయ వేషధారణలో తప్ప 
యెందులోనూ కనపడని పవిత్రత..
ఆకాషాయంకూడా గత్యంతరంలేక 
వాళ్ళని భరిస్తున్నట్లనిపించింది..

పైకి సంభాషణ సాగుతున్నా 
లోలోన నా మనసు రోదిస్తోంది
మా అయ్యగురించి 
యేమైనా కొత్త విషయాలు తెలుస్తాయేమో
అని ఎంతో ఆశగా వెళ్ళిన నాకు 

తీవ్ర భంగపాటు..
 

స్వామి గారూ ..వారి సహోదరులూ..
 ఆ వాతావరణం చూసిన నన్ను 
చుట్టుముట్టిన అశాంతి..
 

అతనే..
అతనే ..
 సన్యాసి..
నిజమైన సన్యాసి..
నిజమైన సన్యాసి..


 నా మనసులో ధ్వనులు ప్రతిధ్వనులను సృష్టిస్తున్నాయి..


 ''నేను ఇన్ని కోట్ల గాయత్రి చేసాను ..

ఇన్ని కోట్ల అష్టాక్షరి చేసాను ..
ఇదీ నా స్థితి..
నాకే అనుభూతీ కలుగలేదు....
నీకు కలిగిందా..?

నీవు దేవుణ్ణి చూశావా ..?

నాకు చూపగలవా ..?''
అని పీఠాధిపతులనే ప్రశ్నించి తత్తర పుట్టించినవాడు

 వాళ్ళేం చెబుతారు..
అంత సాధన వాళ్ళే చేసివుండరు
అదీకాక అంత తపన వాళ్ళలో వుంటేకదా..?

 ఆధ్యాత్మికానుభూతి కలుగలేదని 
అశాంతితో ఇల్లు విడిచి దేశం పట్టిపోయి..
అనేక మంది సాధువులనూ సన్యాసులనూ కలుస్తూ..
చివరకు హిమసానువుల పైనుంచీ విరక్తితో

 జీవితం త్యజించాలనుకున్న పుట్టపర్తి ఎక్కడా..
వీళ్ళెక్కడా..


 అందుకే పుట్టపర్తికి దేవుడు కనిపించాడు
దయానంద సరస్వతి గా ..
ప్రేమగా తన ఆశ్రమానికి తీసుకెళ్ళారు..
అన్ని విధాలా పరీక్షించారు..
కాదు కాదు
తండ్రి తన పిల్లవాణి సామర్థ్యానికి మురిసినట్లు మురిసిపోయారు
పుట్టపర్తిని విరక్తినుంచీ బయటకు తెచ్చి..
 

నాయనా నీకు ఇంకా జీవితం ముందుంది..
కీర్తి కిరీటాలు నీకోసం ఎదురు చూస్తున్నాయి..
ఎన్నో అనుభవాలు నీకై వేచి వున్నాయి..
తరువాత ..
నిన్ను నేనే నా దగ్గరికి పిలిపించుకుంటాను..
అని చెప్పి పంపారు..

శ్రీ శ్రీ శ్రీ చంద్రశేఖర పరమాచార్యులవారు
నీకు అంత్యదశలో కృష్ణదర్శనమవుతుందని భరోసా ఇచ్చారు..

 
నూనెకీ ...నీటికీ ..తేడా లేదు
అగ్నిలో పోసినప్పుడు మాత్రమే.. 

దాని నిజ స్వరూపం తెలుస్తుంది.. 
అగ్నిని ఆర్పేవి నీళ్ళు
మరింత ప్రజ్వలింపజేసేది  నూనె..


12 ఫిబ్ర, 2014

పుట్టపర్తి సాహిత్య సర్వస్వం



పుట్టపర్తి సాహిత్య సర్వస్వం ముద్రణ పనులు 
 శరవేగంగా జరుగుతున్నాయి

ఒకవేపు 
ప్రాచ్య లిఖిత గ్రంధాలయం తరఫున 
ముద్రణ జరుగుతున్న కృతుల పనులలో 
అక్కయ్య మునిగి వుంది

పర్యవేక్షణ బాధ్యతను 
ప్రఖ్యాత సంగీత విద్వాంసులు 
శ్రీ కొమండూరు శేషాద్రి గారికప్పగించారు
వారు పుట్టపర్తివారితో 
యెన్నో యేళ్ళ పరిచయం కలిగినవారు

కానీ వారు ఇప్పుడు అమెరికాలో వుంటున్నారు
వారితో ప్రొద్దున అయిదుగంటలకు
తిరిగి సాయంత్రం అయిదు గంటలకు
రెండు రెండు గంటలు ఆన్ లైన్లో 
జాక్ ద్వారా ప్రతిదినమూ సంభాషిస్తూ
ఆ కృతుల వ్యవహారాన్ని చూస్తూంది అక్కయ్య


ఎక్కువగా ప్రయోగంలో లేని రాగాలలో
ముత్తయ్య భాగవతార్ ముత్తుస్వామి దీక్షితులు మొదలైన వారు వానిలో ఒక్కొక్క కీర్తనలే వ్రాసారు
వానిలో కూడా పుట్టపర్తి అనేక కీర్తనలు వ్రాసారు

వాటికి కూడా యేమి ఎత్తుగడలు
యేమి పల్లవులు
యేమి వైవిధ్యం
పుట్టపర్తి సంగీతాత్మకమైన ఆకృతిని తెలుసుకోవలసిన వారు వీనిని తప్పక స్పృశించాల్సిన అవసరముంది
 

రాళ్ళపల్లి సంగీతాన్ని నమ్ముకొని 
సాహిత్యాన్ని నిర్లక్ష్యం చేసారు
నేను సాహిత్యాన్ని నమ్ముకొని 

సంగీతాన్ని పట్టించుకోలేదన్న
పుట్టపర్తి మాటలలోని ఆవేదన 

కొంతవరకు తన కీర్తనలకు పొందుపరచిన 
రాగాలతో కొంతవరకు తీర్చుకున్నారేమో..


యీ కృషిలో 
పెద్దజమాలప్ప సహకారం తీసుకున్నారు
పుట్టపర్తి
నా కృతులను స్వరపరచాలి జమాలప్పా 
మా ఇంటికి రా అంటే
చెప్పిన సమయానికి 
హార్మోనియం పెట్టె తీసుకొని వచ్చి
ఎన్ని గంటలైనా..  రోజులైనా ..రాత్రైనా.. పగలైనా..
తిండి తిన్నా.. తినకున్నా ..
పుట్టపర్తి కెంత తపన ఉందో 
అంతే తపనతో పనిచేసే వారిని చూస్తే యేమనగలం
భగవంతుని పని అలానే జరుగుతుంది 
అంటాం అంతే కదూ
 
పెద్ద జమాలప్పగారు గొప్ప విద్వాంసులు
ఆరోజుల్లో గండపెండేరం కూడా తొడిగించుకున్నారు
పుట్టపర్తి వారు అపూర్వ రాగాలలో 
యెన్నో కీర్తనలను వ్రాసారు
చాలా వాటికి సంగీతం నోట్లు కూడా వ్రాసారు
ఎత్తుగడలు  ఆకట్టుకొనే విధంగా వున్నా యి
కొన్నిటికి ఆరోహణలు అవరోహణలు వున్నాయి
కొన్నిటికి లేవు
కొన్నిటికి వుండి మరికొన్నిటికి వుండకపోతే బాగుండదు 

కనుక
కొత్త కొత్త రాగాలకు
ప్రాచుర్యంలో లేని రాగాలకు ఆరోహణ అవరోహణల విషయంలో కొమండూరి గారు 
రాధా పార్థసారధి అనే ప్రొఫెసర్ పేరు సూచించారు

ప్రతిరోజూ ఆమె తో సంప్రదింపులు
ఆమె వీలైన సమయంలోనే 
అందుబాటులో ఉన్న సమయంలోనే ఆమె నడగాలి

యే రాగం చెప్పినా మరునిమిషంలో 
ఆరోహణ అవరోహణలు చెప్పే కొమం డూరి గారి
ప్రజ్ఞ కు అక్కయ్య ఎంతో సంతోషపడుతూందిఅయ్య 

శతజయంతి ఘనంగా జరగాలని 
నా చిరకాల వాంఛ
సాహిత్య సర్వస్వం కృతులు ముద్రణ కావటం 
మన అదృష్టం
అంటుంది అక్కయ్య.

నిజానికి అక్కయ్య అకుంఠిత దీక్ష వలననే 
పుట్టపర్తి కార్యాలు నిర్విఘ్నంగా జరుగుతున్నాయి
ఒక కూతురు తన తండ్రికి ఇచ్చే ఘనమైన నివాళి  ఇంతకన్నా యేముంటుంది

బాహ్యంలో బ్రతుకుతున్నా
ప్రతిక్షణం అయ్య అయ్య అని మనసులో జపించేదే నిజమైన తపస్సు 
కాదంటారా..

దేవునికి తన వ్యక్తిగతమైన కోరికలు పక్కన పెట్టి
మా అయ్య సాహిత్య సర్వస్వం త్వరగా ముద్రింపబడాలని మొక్కుకునే బిడ్డలు యెవరికుంటారు..


అదేగాక
కృతుల సాహిత్యం
శిష్యులు వానిని వ్రాసారు
వ్రాత గాని పైత్యం కూడా అందులో కలిసింది
అన్వయం కుదరనివానిని సరిచూసుకోవాలి


నే నూ డి టి పి లో పాలు పంచుకుంటున్నాను 
మే ఘదూతము లోనికవితా సౌరభాలను 
సాక్షత్కారంలోని తులసీదాసును 
సిపయిపితూ రీ లోని దే శ భ క్తిని 
అనుభవిస్తూ చేస్తున్నాను 

నిడుద కన్నుల దాని 
నిండు చెక్కుల దాని 
నడు ము వడ కెడు దాని 
నగవు చిత్తడి దాని 
బెడగు నడకల దాని 
పేర్మి పొడవగు దాని 
దానిమ్మ పూ వంటి తళుకు బెదవుల దాని 
తన్వంగి దలపోసి దలపోసి నిట్టూర్చు ... 
ఆహా .. 

ఇక
సాక్షాత్కారము లో
తులసీ దాసును రామునికై తపసు చేయమని పంపుతుంది మమతాదేవి
అక్కడ తులసీ దాసుకు మనసు నిలువదు
ప్రతిక్షణం ప్రేయసి సాన్నిధ్యానికై తహ తహ లాడే మనసు
 

రాముడు రాముడంచని 
విరామము లేని జపమ్మునెల్ల 
నీ ప్రేమయె నాక్రమించినది ప్రేయసి ! 
దుర్గమమీ పరీక్షలో
రాముడె నిల్చునొ !

అనురాగ భరాలస ముగ్ధవైన 
నా కామిత మూర్తి 
నీవె కడగన్నుల నిల్తువొ 
ధ్యాన లక్ష్యమై..
ఆమె ధ్యానంలో విలవిల లాడతాడు.. తులసి

యెన్ని యుగంబులయ్యె హృదయేశ్వరి 

వింతగ బల్కరించు నీ కన్ను జూచి 
కాటుక నిగారపు కాంతులు జూచి 
యెంత లోగొన్నదే యీ యెడంద 
నొడగూడని కూడగ రాని చెల్మి, 
నేనన్న ప్రతిజ్ఞయే గరళమైనది 
జీవితముల్ దహింపగన్..

ఒక్కో భావం గుండెల్లో గుచ్చేస్తుంది..

ఇది చూడండి
ప్రేమ బలంబులెంత విపరీతములే
నవ పుష్ప కోమల ప్రేమముతోనె 

భోగి నవలీలగ యోగినొనర్చివైచి తింతీ..
మహనీయమీ తపము నిండగ గీలుగొల్పి 

నా రాముని
రామచంద్రుని విరక్త హృదిన్వెలిగించి వేయవే..

ఆ కడసారి నిన్ను
సొగసంతయు పండిన నిన్ను వీడి
యుద్రేకము నూతగోలగొని
దీనత వచ్చిన యప్పుడీ యెదన్
బ్రాకిన వేయి సర్ప గరళంబుల జావనిదాని కొక్కడా
నాకొక వేయిరాములైన గనుపట్టవలెన్ రహస్సఖీ..
 

రహస్సఖీ.. ఓహ్..
ఎంత కఠినాత్మురాలు కదా ఆ మమతాదేవి

ఒక్కటేమిటి ప్రతి ఒక్క లైనూ హృదయంలో వజ్రవైఢూర్యాల్లా దాచుకోవలసినవే..
ఆ భావతీవ్రతలోంచీ బయటికి రావడం చాలా కష్టం
 

నా చిన్నప్పుడు..
మా అయ్య గీతాంజలి చెప్పేవారు
పాఠం అయిన తరువాత
పిచ్చిపట్టినట్లు అవే చదువుకుంటూ ఒకటే యేడవటం..
నాకప్పుడు పధ్నాలుగేళ్ళే..


ఇక గ్రంధాల విషయానికొస్తే 
శ్రీశైలం గారు వారి తమ్ముడు కొండయ్య గారు 
ప్రూఫ్స్ దిద్దుతున్నారు 

ఎలా 
అన్ని పనులూ పక్కన పెట్టి 
ప్రతిరోజూ ఉదయం అయిదు గంటల నుంచీ రాత్రి వరకూ 
దీక్ష గా
పండరీ భాగవతంలో 650 పేజీలు
 ప్రతి అక్షరం చూస్తున్నారు

డి టి పి గురించి శ్రీశైలం గారేమంటునారో చూడండి
"ప్రక్కన వుందనుకోండీ
నాలుగు లైన్ల తరువాత మళ్ళీ ప్రక్కన వస్తుంది
యీయన యీ ప్రక్కననుంచీ 
ఆ ప్రక్కన కెళ్ళిపోతాడు..
ద్విపదకు రెండవ అక్షరము ప్రాస 
ఆ ప్రాస మిస్సయితే కష్టం కదా

పదిరోజులనుంచీ ఉదయం అయిదు గంటలకు లేచి బయటికి ఎక్కడికీ పోకుండా
ఇదే పని మీద వున్నారు కొండయ్యగారు
ఆ శైలికి ఎవరు సాటి రారు .. హై శైలి
పండరీ భాగవతం చూడడం నా అదృష్టం అన్నారు 
ఆయన

ఇది నాకు లభించిన మంచి అవకాశం
పండరీ భాగవతం ధార అద్భుతమైన ధార
భక్తి తపస్సు చేసి యీ గ్రంధం వ్రాసినట్లు ఉంది
యెవరికీ సాటి రాదు యీ భాషాశైలి అంటారు 


9 ఫిబ్ర, 2014

భ్రమర కీట న్యాయం


'బాబూ నీకెవరిష్టం?'
  'సచిన్ టెండూల్కర్'
అంటాడబ్బాయి
కొద్ది రోజులు బ్యాటూ  బాలూ పట్టుకుని ఆడతాడు
పెద్దయ్యాక యే క్లర్కో ఇంజనీరో
 

'నాకు యంటీఆర్ ఇష్టం
ఆయన సినిమాలు ముఫై సార్లకు పైగా చూసేవాణ్ణి'
అంటూంటారు చాలామంది
తర్వాత  నటన చాయలకు కూడ పోకుండా
జీవితం వెళ్ళ దీస్తారు
 

కానీ కొందరుంటారు..
వాళ్ళ ఇష్టం వారి జీవితాన్ని నడిపిస్తుంది
చూపులు పక్కకు తిప్పనివ్వదు
అన్ని జీవిత ప్రాధాన్యతలూ దాని తరువాతే..
అగ్నియై కాల్చేస్తుంది వాళ్ళని
వాళ్ళే భ్రమర కీట న్యాయానికి నిలుస్తారు
 

భ్రమరం కీటకాన్ని తనగూట్లో తెచ్చి ఉంచి 
దానిచుట్టూ ఝుం... అంటూ 

తిరుగుతూ..తిరుగుతూ..  తిరుగుతూ
 

మొదట భయంగా .. తర్వాత తదేకంగా.. 
 తర్వాత యేకాగ్రతగా .. 
తర్వాత తన్ను మరచి..  మరచి .. మరచి .. చూసి..చూసి..
చివరకు కొద్ది రోజులకు 

తానే భ్రమరంగా మారిపోతుంది కీటకం..
ఇదే భ్రమర కీటన్యాయం..
అదే తపస్సు..
అదే అహం బ్రహ్మస్మి..
భక్తుడు సగుణరూపంలో ఉన్న భగవంతుడు అవుతాడు..


దాన్ని అద్భుతంగా ప్రతిపాదించేదే 
పుట్టపర్తి అష్టాక్షరీ కృతి
'' నీవనుచు నీవైతినే పరమాత్మ
నినుజూచి నీవైతినే..
''

భక్తుడు పరమాత్మను ఎల్లవేళలా పాడుచు పొగడుచు.. గుణకీర్తనం చేయుచు
తాను అతనై పోవటం ఉపాసన
మరి భ్రమర కీట న్యాయంలో పుట్టపర్తీ ఒక భ్రమరమైన వారే కదా..
మరి వారేం చెబుతారు ..





పోతన్న జీవితమును 
రామో పాసనతో నారంభించుట మనయదృష్టము
ఉపాసన యనగా 

దాను నమ్మె రామునినో కృష్ణునినో పాడుచు పొగడుచు నాతని దివ్య చరిత్రములను వినుచు జూచుచుండుటయేకదా
 

అట్లు సేయుటలో
నా యుపాసనా మూర్తి యొక్క 

గుణములు అభిరుచులు భక్తున కత్యంత ప్రియములై కొంత కాలమునకు వని స్వభావము గూడ నట్లే మారుటయు గలదని పెద్దలందురు
ఆ భావములు ప్రచండముగ నెదిగినప్పుడు
రూపురేకలు గూడ నట్లే యగునట
భ్రమర కీటక న్యాయమిదే
 

యీ విషయములు మన యూహ కందవు గాని
హనుమంతుని దీవ్రముగ భావించిన వాళ్ళలో 

రా మకృష్ణ పరమహంసకు 
తిన్నని తోక యొకటి బయలుదేరినదట.
 

రాధాదేవి ధ్యానమునందు నిమగ్నుడైన 
చైతన్య ప్రభువునకు దాను మగ వాడనుట 
యెప్పుడో దప్ప జ్ఞాపక మొచ్చెడిది కాదట..

రెండవదేమో గాని 
మొదటి విషయము మాత్రము
పిల్లలకందరికనుభవములో నున్నదే
తోకలేకయే హనుమంతులగుదురు. 

కొన్ని వేళలలో పెద్దలము గూడ..

8 ఫిబ్ర, 2014