21 జులై, 2014

ముంగిటి ముత్యము వీడు..

                       సరస్వతీపుత్రుడు.. 

             శ్రీ అవధానం చంద్రశేఖర శర్మ

సరస్వతీపుత్రుడు దైవ నిర్దిష్టమై 
మహర్షి శివానందుల దివ్యవాణితో అభినందనాశీరూపమున అభివ్యక్తమైన 
అపూర్వ సం కేతము. 

ఇతరులు వంచి యెగబడు 
సింహ  ..శార్దూలాదులను.. 
 సమ్రాట్ ..సార్వ భౌమ.. చక్రవర్తి ..
ప్రఖ్యాతులను బిరుదములను 
కడకంటనైన చూడక నారాయణాచార్యులవారు  
వానిని మనసార సవినయముగా నౌదల నలంకరించుకొన్నారు..
 
ప్రాచీన వాజ్మ యముతో ఒక శారదా తనయుడున్నాడు.
అది అతనికి పుట్టుపేరో ..పెట్టుపేరోమనకు తెలియదు
 
అంతకుదప్ప 
సరస్వతీపుత్ర సంకేతులు 
సాహిత్య ప్రపంచమున పూర్వ మెవ్వరునులేరు..
 
ఆచార్యులతరువాత
దానిని ఎవరేని తాల్చినను
 బరువో ..
అది అనుకరణమో.. 
అనుసరణమో ..
ఎదలో బరువో అనిపించుకొనక మానదు
 
వాగ్దేవి సహజ వాత్సల్యమున 
ప్రస్నుత ప్రయోధరయై ఆ పుత్రునికి
 సంగీత సాహిత్య రసమును చేసినది..
 
ఆయన ఆజీవితము దానిని కడుపార గ్రోలి 
తుష్టిని పుష్టిని పడసి ధన్యుడైనాడు
నిజముగా ఆయన సరస్వతీపుత్రుడు
 
ఆ సంకేతములో ప్రేమయున్నది..
మాధుర్యమున్నది
విన యమున్నది
నిగూఢమగు నహంకారమును ఉన్నది
కావుననే ఆయన
దోషమా.. లేక వినెడు వారి తప్పిదమా..?
అని ప్రశ్నించి..
కాదు.. భావభేదములె సుమ్ము..
అని గడుసుగా సమాధానించి యేనామ కేచిత్ అన్న భవభూతిని ప్రతిధ్వనించినాడు..

తన పదునాల్గవ యేట 
తాను కళాశాల విద్యార్థిగా నున్నపుడే
ఉలిచేరాలకు చక్కిలింతలద్ది
పెనుగొండలక్ష్మిని చేపట్టిన
 రసమయ హృదయుడు ఆయన.
 
ఆయన కవితా విపంచి తొలి మీటలోనే పంచమస్వరమును ప్రవచించినది..
నాటినుండి..
అరవదియేడులకు మింపుగా యెన్ని స్వరజతులు..లయవిన్యాసములు..
తాళములు కృతులు..
 
ఆంధ్రమునెల్ల దాటియు నినదించినచో 
దాదపు నూట యెనిమిదికి పైబడిన 
ఆచార్యులవారి కృతులలో 
పద్యములున్నవి
గద్యములున్నవి
విమర్శలున్నవి
మినీ కవితలున్నవి
గేయములున్నవి
షట్పదులున్నవి
వివిధ భాషా సంప్రదాయములున్నవి
లాస్యమున్నది
తాండవమున్నది..

ఆయన సారస్వత జీవితమున నెంతటి వైవిధ్యమున్నదో వైయక్తిక జీవితమున గూడ అంతటి వైవిధ్యమున్నది
వైవిధ్యము మాత్రమే కాదు
గుణముల పరస్పర వైరుధ్యము కూడ పెనగొనియున్నది
 
ఆ వైరుధ్యము గూడ 
రాజు నెదుట భృత్యుల వలె నిగూఢమై
ఆయనకు లొంగియుండుట వింత

ఆయన హృదయము మృదులము
కాని యెడనెడ తీక్ష్ణమే..
వాక్కు అనుకూలమైనంత వరకు మధురమే..
ఎదురు తిరిగెనా దారుణాఖండల శస్త్రతుల్యము. ఒక రచనకు పూనుకొనెనా..
ప్రపంచమే చేత నింపదు
ఆకాశము సైతము తన శబ్ద గుణమును పరిత్యజించును..
ఆకలి దప్పులు దరికి రావు..
ఆ దీక్ష నుండి విరమించెనా..
ఆ రచనా శేషమును సంధించుటకు రోజులు వారములు కావు
ఒకప్పుడు ఏండ్లును పూండ్లును పట్టును.
సంగీత సాధనములోను అంతే..
గ్రంధపఠనములో మునిగినచో నిద్రాహార స్ఫురణ ఉండదు. దానిని ఆవలవైచినచో మరల తాకుట యెన్నడో ఆయన జీవితములో
భోగము.. యోగము.. రాత్రింబవళ్ళు .
లాలసత ఎంత నభః స్పృశమో సమాధి అంత నిస్తరంగము..
పెద్దన గారి వరూధినిపై ఆయనకు వల్లమాలిన జాలి
దాక్షా రామ గంధర్వాప్సరసల వక్షోజ ద్వయముపై
అత్తమిల్లిన కవి సార్వభౌముని సౌభాగ్యరేఖపై నొకింత
అభిమానము.. 

అయిననేమి..
ఆయన నిరంతర.. నిరంతరాయాష్టాక్షరీ 
మంత్రమనన
స్నాత గంగాజలుడు..
భక్తి రసైక జీవనుడు
సమకాలిక కవులలో  ఆయన నవ్యులలో నవ్యుడు
ప్రాచీన పధాను యాయుతులలో నగ్రగామి..
వక్తలలో వక్త
భావుకులలో భావుకుడు
విమర్శకులలో విమర్శకుడు
వివిధ భాషలలోని ప్రాచీన మహాకవుల
గద్య పద్యములు వేలకొలది ఆయనకు మననారూఢములైఅన్ కంఠస్థములు

ఆధునికుల మేలి రచనములును ఎన్నియో నిత్య సన్నిహితములే..
ఆయన విజ్ఞానము సముద్రమంత గంభీరము
ఆయనను జిజ్ఞాస బడబానల కీల వలె క్రొత్త క్రొత్తలక్ నిత్యమును నాలుకలు సాచెడిది..

ఈర్ష్య లేదు..
స్పర్ధ కలదేమో
పొందిన అసంఖ్యా ఖండ సన్మానములకు సంతృప్తి ఒకవంక..
మరియొక వంక లోకము 
ఇంకను తన్ను గు ర్తింపవలసినంతగా గుర్తింపలేదే..
అను ననుక్షణాసంతృప్తి జ్వాల..
 
'శ్రీనాధుడు-మనస్తత్వము' అన వ్యాసములో 
ఆచార్యు ల వారు పలికిన యీ పలుకులు 
ఇంచుమించు వారి మనస్తత్వమునకు అన్వయించును..

''రసికతకును ధార్మిక దృష్టికిని చాల దూరమని
 శ్రీనాధుని తలంపు
అటులని నాస్తికుడు కాడు
శైవాగమములన్నియు మూలమట్టముగ శోధించినాడు
బ్రాహ్మిని మనసార నుపాసించినాడు..
 
శ్రీనాధుడు పరివర్తన శీలుడు
పాదరసమువంటి వాడు
ఒకచోట నిలువడు
ఒక సిధ్ధాంతమునే అంటియుండడు
 
ఐదు నిముషములు గడచులోపలనే 
పురుగు తొలుచును
భగవత్సేవయా..?
అదియొకవైపు..
భోగములా ..ఇవి యొక వైపు..
ఈ రెంటికిని సంబంధమే లేదు..
హృదయ పాతివ్రత్యమా..?
దాని లోతును గమనించినదెవ్వరు..?
 
మానవునికిది యొక్కటేనా చాపల్యము..?
దీనిని విడిచినంతనే వైకుంఠ మరచేత నిలుచునా..?
ఇతరములు వదలవలసినవెన్నిలేవు..?
వదలుచున్నామా..?
అసలీ విచారమంతయునెందుకు..?
హాయిగ బ్రదికి కన్నుమూసికొని పోక..
 
అతని జీవితమొక తుఫాను వంటిది..
అందులో మంచి చెడ్డలన్నియు కొట్టుకొని వచ్చినవి
మనకు కావలసిన దానిని వింగడించుకొనవలయునమే..
ఇందలి వాక్యము మనకును అన్వయించును
 
మనకు కావలసినది ఆచార్యులవారి సాహితీమూర్తి
అది అత్యుజ్జ్వలము..
అజరామరము..
దానికి జోహారులు పలుకుదము..

 

20 జులై, 2014

రాయల నాటి కవితా జీవనం

ఈ రాయల నాటి కవితా జీవనం అన్న వ్యాస రాజం పరిశోధన ద్విమాసపత్రికలో 
 1954 సంవత్సరం ఆగష్టు మాసంలో ప్రచురింప బడింది
అందులో 

''వర్ణనవిధానంలో  పెద్దన సయమం'' అన్న భాగమిది..
మిగతా భాగాలు దొరకలేదు 

 
-పుట్టపర్తి అనూరాధ.

సేకరించిన శ్రీశైలం గారికి కృతజ్ఞతలు



11 జులై, 2014

ఉలిచే రాలకు..

పుట్టపర్తి మొదటి కావ్యం పెనుగొండలక్ష్మి మద్రాసు యూనివర్సిటీ పాఠ్యగ్రంధంగా..


తనపదహారవయేట 
ఒక బాలుడు ఒక రచన చేసాడు
అది పేపరుపై పెట్టాడేమో కానీ..
తరువాత అది ప్రచురింపబడుతుందని..ఊహించలేదు 

అది రాళ్ళపల్లి అనంత కృష్ణ శర్మ వంటి పెద్దలు.. మెచ్చుకొ ని వుండవచ్చు
యేదో చిన్న పిల్లవాడు .. 
బాగానే రాశాడు..
పాపం తల్లిలేదు.. పోనీలే కొంచెం ప్రోత్సహిస్తాం
అనుకొని వుండవచ్చు..
నిజంగానే అందులో చిక్కని కవిత్వం ఉండివుండవచ్చు.

అది అతని ముఫ్ఫై రెండవయేట
 యెవరో ముద్రించారు..
అంతకుముందే పలువురి ప్రశంసలందుకున్న ఆకావ్యం ..
మద్రాసు వారు విద్వాన్ కు పెట్టారు..

సాధారణంగా అన్ని కాలాల్లోనూ
యెవరికి తోచిన విధంగా వారు 
రకరకాల రచనలు చేస్తారు.. 
ముద్రిస్తారు.. 

కానీ కొన్నిటికే రాజయోగం పడుతుంది.. కదూ..

పుట్టపర్తి వ్రాసిన రచనల్లా సంవత్సరాల దశాబ్దాల తరబడి
అందమైన రూపం పొందేందుకు

 శప్త కన్యల్లా ఎదురు చూశేవి
 

ఈలోగానే వాటి కీర్తి దశదిశలా గుబాళించిపోయేది
తరువాతెప్పుడో తీరిగ్గా
ఎవరి దయతోనో అవి ముద్రణపొంది వెలుగు చూశేవి..

ఇంకో విచిత్ర విషయం యేంటంటే
విద్వాన్ పరీక్షకు పాఠ్యగ్రంధంగా ఆ కావ్యం పెట్టారు
కానీ రచయిత విద్వాన్ కూడా కాదు..
తానూ విద్వాన్ చేయాలంటే అదే చదవాలి .. 

తెలుగు పండితునిగా ఉద్యోగం పొందాలంటే 
విద్వాన్ ఉండాలి కదా..
కాలక్రమాన ఆయన విద్వాన్ పరీక్షకు 
అప్పియర్ అయ్యాడు..
అందులో తన పుస్తకమే పాఠ్యగ్రంధం..
ఇక ఆ  పరిస్థితి ఊహించుకోండి..

ఆ ఘడియ రానే వచ్చింది..
పరీక్ష హాలులో ఉలిచేరాళ్ళకు.. చక్కిలింతలిడి..
అన్న ప్రశ్న నిలబడింది
అంతే..
విద్యార్థి.. కవి అయిపొయ్యాడు..

పైన ఎర్రటి ఎండ..
కారిపోతున్న చెమటలు..
అప్పుడప్పుడు అటుగా వస్తున్న జనం అలికిడి..
కానీ శిల్పి యేకాగ్రత ఆ రాయిపైనే..

చెక్కగా చెక్కగా..
అది చక్కని అతివ రూపుదాల్చింది..
అందమైన కళ్ళూ .. 
చక్కని నాసిక.. 
చిన్న చుబుకం..
అద్దాల్లాంటి చెక్కులు..
దోబూచులాడుతున్న సన్నని నవ్వు..


ప్రేమ విభ్రాంతుడై పోయ్యాడు..
అతని కన్నులనుంచీ కన్నీళ్ళుధారలు కట్టాయి 
అరచేతులూ చెమర్చాయి..
అతను ఆ బొమ్మను ముద్దుపెట్టుకున్నాడు 

ఇది ఎవరికైనా అనుభవమే..
తాను రాస్తున్న కథో కవితో 
పాటో పద్యమో ..
అందులో లీనమైపోతే అప్రయత్నంగా కన్నీళ్ళు పొంగుకొస్తాయ్..
గుండె మూగవోతుంది..
ఎందుకూ..
ఆ సృష్టి పై  తనలో పొంగిన ప్రేమ..

ఆ కొండలలో చింత వెక్కసమై యేడ్చుకొనే 
 భావుకుని గా 
విద్వాన్ పరీక్ష రాస్తున్న పుట్టపర్తి 
ఒకే ప్రశ్నకు అదీ ఒక బిట్ కు
సుమారు నలభై పేజీల వివరణ ఇస్తూ పోయారు..
పరీక్ష సమయం అయిపొయ్యింది..
అందరూ వెళ్ళిపోతున్నారు..
తానూ పేపర్ ఇచ్చి..
భారమైన హృదయంతో బయటికి నడిచాడు 

చివరికి ఒకనాడు ఫలితాలు రానే  వచ్చాయి..
తాను రాసిన నలభై పేజీల జవాబుకు..
ప్రశంస వస్తుందా .. ?
పాసుచేస్తారా..?
ఫెయిలా..??

ఫెయిల్..??
ఉత్తీర్ణుడు కాలేదు..
ఒక్కో ప్రశ్నకూ ఇంతా అని మార్కులు 
పాసవడానికి ఇన్ని 
మరి ఒక్క బిట్ కెన్ని ..?? 
రెండు .. 
రెండే వచ్చాయి .. 

పుట్టపర్తి అహం దెబ్బతింది..


కారణం
పుట్టపర్తికి క్వశ్చన్ పేపర్ మార్కుల విధానం తెలియవు..
ఎన్నడూ సీరియస్ గా బడి చదువులు చదవలేదు..

బాధవేసింది..

తను వ్రాసిన పేపర్ తానే నెగ్గక పోతే..
ప్రపంచం నవ్వదా..?

పోయిన చోటంతా..సన్మానాలు.. పూలదండలు
బిరుదులూ సత్కారాలు..
యెవ్వరు సవాల్ చేసినా .. ఓడిపోవలసిందే..


మరి ఇలా జరిగిందేమిటీ..?

కొన్ని రోజుల తరువాత..
మద్రాసు యూనివర్సిటీ వారికి సంస్కృతంలో 
ఒక పెద్ద లేఖ వ్రాసారు పుట్టపర్తి..


జగమంతా నీవు కవివి.. 
నీవు పండితుడివి..
నీవు విమర్శకుడివి..
నీవు చక్కని ఉపన్యాసకుడివి..
చరిత్రకారుడివి..
అంటూ గొంతెత్తి అరుస్తుంటే..

తనను అనర్హుడని ప్రకటించడం 
యేరకంగా న్యాయం
అంటూ ఆవేశంగా..ప్రశ్నించారు

ఆ ఉత్తరాన్ని యూనివర్సిటీలోని పెద్దలెవరో అందుకున్నారు..
జరిగిన తప్పుకు బాధపడ్డారు.
యెవరో పుట్టపర్తి నారాయణాచార్యులు..
ఒక విద్యార్థి ..
అంతే..

అతడే.. ఇతడని వారికేం తెలుసు..
కానీ తిరిగి పుట్టపర్తి ఉత్తీర్ణులవడం జరిగింది..

ఈ విషయాన్ని
నరాల రామారెడ్డి గారు అక్కయ్య నాగపద్మినితో పంచుకున్నారు..



6 జులై, 2014

అరిగా బంచమమేవగించి..


అళియ రామరాయల ఆస్థానంలో భూషణమై అలరారి
రామరాజ భూషణుడుగా ప్రశంసలందుకున్న భట్టుమూర్తి
రచించిన కావ్యాలలో 

వసుచరిత్ర..ప్రసిధ్ధి పొందింది..
 సంగీత రహస్యాల సారంగా
 వసుచరిత్రను
రామరాజ భూషణుడురచించాడు.
 

పింగళి లక్ష్మి కాంతం గారు.
ఈ కవి సంగీత కళానిధి గాయకుడు.. 

ఈతని రచనలన్నియు లఘు గమకములు గలవి 
కీర్తనల వలె పాడదగినవి..
ఇతనికే  శ్లేష.. సహజము..
అన్నారు..
 

దీనినే పుట్టపర్తి వారు..
తెనుగున భట్టుమూర్తి ఆడినది ఆట.. పాడినది పాట..
అతని నోట నే  మాటవెడలినను .. 

అందొక శ్లేష ఒక వైచిత్రి నవ్వు చుండును..
 

అంటూ అరిగా పంచమమేవగించి..
పద్యం లోని అందాల్ని చూపుతున్నారు. 

ఇది  పుట్టపర్తి వారి 'వసుచరిత్ర వైచిత్రి' వ్యాసం లోని ది 

అరిగా బంచమమేవగించి నవలా లవ్వేళ హిందోళ వై
ఖరి సూపం బికజాత మాత్మ రవభంగ వ్యాకులంబై వనీ
ధర నాలంబిత పల్లవ వ్రత విధుల్ దాల్పం దధీయ ధ్వనిన్
సరిగా గైకొనియెన్ వసంతము మహా సంపూర్ణ భావోన్నతిన్

 

శిశిర వసంతముల సంధికాలము వచ్చినది
అప్పుడు యువతులు హిందోళ రాగమునాలపించిరి
ఆ రాగమునకు పంచమ స్వరము వర్జ్యము
పికములకు పంచమ స్వరమే ప్రాణము
అది లేని హిందోళ వాని చెవులకు వోటైనది
 

ఎటులైనను ఆ జవ్వనుల సంగీతములో 
తాము స్థానము సంపాదించుకొనవలెననుకొన్నవి
అడవులలో జిగుళ్ళు మేయుచు వ్రతము పట్టినవి
వాని తపస్సు పండినట్లు వసంతము వచ్చెను
ఇంకనేమున్నది..?
 

కలకంఠ నాద ములతో కకుబంతములు మారుమ్రోగినవి
కలకంఠులు వల్లకులు మేళవించి 

వసంతరాగము నాలపించిరి
ఆ రాగము పిక ధ్వనిని కూడ దనలో గలిపికొని 

తన యుదారతను బ్రకటించెనట..
 

వసనము షాడవ రాగము
కాని రామ రాజ భూషణుని మతమున నది 

సంపూర్ణ రాగమేమో
సంగీత  కళా రహస్య నిధి సిధ్ధాంతము నందుకొనియే తర్వాత విద్వాంసులు 

చ్యుత పంచమము దానిలో నుపయోగించిరి
 

ఇక్కడ కవి సూచించిన సంగీత సంప్రదాయమట్లుండగా..
అరిగా సరిగా నన్న పదములలో మరికొంత చమత్కారమున్నది
ఆ స్త్రీలు అ రిగా పంచమమునేవగించిరట..
అనగా శత్రువుగా నన్న యర్థము స్పష్టమే
ఋషభ స్వర వర్జ్యముగా ననియు నర్థాంతరము
హిందోళము నందు పంచమము తో బాటూ
ఋషభమును వర్జ్యమే..
 

వసంతము పంచమమును సరిగా స్వీకరించెను
అనగా నారోహణమున 

షడ్జ ఋషభ గాంధార యుక్తముగా ననుట
ఇది రామ రాజ భూషణుడు జూపిన చమత్కారము

2 జులై, 2014

పుట్టపర్తి వచన రచన





పుట్టపర్తి వచన రచన..అదొక సముద్రము..
ఇప్పటికే వారి కలమునుండి ఎన్నో వచన కావ్యములుద్భవించినవి..
వాక్యములు చిన్నవిగా..
తీవ్రముగా..
వ్రాయుటలో వారు సిధ్ధ హస్తులు..
 

ఆయన తలపులోని భావమెక్కడ ఆగిన ..
వాక్యమక్కడ ఆగును..
వాక్యములను కొండవీటి చేంతాడు వలె పొడిగించక..
పోడిమిగల పొడి పొడి మాటలలో పొదిగించి..
రచనకు ప్రసాదగుణము.. మాధుర్యము గింగడించుట..
వీరి ప్రత్యేకత..
 

వాక్యమును చిన్నదిచేసి విషయమునకు గాంభీర్యమును సాధించుట 
వారికుగ్గుపాలతో అబ్బిన విద్య
 

ఎక్కడేని 
వాక్యములు సుదీర్ఘములుగ సాగినప్పుడు ..
అది విస్తృ త భావమును విపులీకరించుటలోనో.. నొక్కులు దీర్చుటలోనో..
అతి వ్యాప్త్య వ్యాప్తులను నిగ్రహించుటలోనో.. నిమగ్నమగును..
అపుడు కూడ వ్యర్థ పదములు మచ్చుకైన దొరకవు..
.


వచనము వ్రాయునెడ..
వ్యర్థ పదములు దొర్లకుండ రచన సాగించుట సామాన్యుల కసాధ్యమైన పని..
ఈ విషయములో పుట్టపర్తి వారిచేయి అజేయమైనది..
శక్తి గల వారి చేతిలో తెలుగు బంగారు ముద్ద వంటిదికదా..
ఆ శక్తిని తనలో ఇముడ్చుకున్న పుట్టపర్తి 

ధన్య  జీవి..
 

వారి కవిత్వములో నగుపించు గుణములన్నియు..
వారి గద్యములో కూడ అగుపించును..
సరిగదా గద్యములో మరికొంత బాహాటమగును..
సన్నివేశ కల్పనలో ప్రకల్పనలోని చాతుర్యము..
మనోభావ చిత్రీకరణలోని నైపుణ్యము..
అడుగడుగున తొణికిసలాడును..
వారి ప్రబంధనాయికలు రామకృష్ణుని రచనావైఖరి..
రాయలనాటి రసికతాజీవనము..
మొదలగు వచన రచనలు జగత్ప్రసిధ్ధములు..
కె.సుబ్బయ్య.