23 జులై, 2015

దొరకునా ఇటువంటి సేవ


'ఈలాగున వివరింపలేను
చాలా స్వానుభవైకవేద్యమే '
అన్నారు త్యాగరాజ స్వామి


'మూ కాస్వాదనవత్'
 అన్నాడు నారదుడు
మూగ వానికి తీపి పదార్థాలను పెట్టి 
ఎలాగున్నాయంటే ఏం చెప్తాడు.. 

అలానే .. 
భక్తి సామ్రాజ్జాన్ని అనుభవిస్తున్న భక్తుని చూస్తే 
కలిగే ఆనందం వర్ణనకందదు..

సంగీతంతో ఎన్నెన్ని సాధించవచ్చో 
ఋజువు చేశాడు త్యాగయ్య
ఋజువు చేయాలని కాదు

దివ్యమైన  అనుభూతితో 
హృదయాన్ని పరమాత్మతో అనుసంధానం చేసినప్పుడు..
ఆ విద్యకు ఈశ్వర శక్తి వస్తుంది..

యే విద్య హృదయంతో ఈశ్వరునితో 
అనుసంధానం అవుతుందో..
ఆ విద్యకు ఈశ్వర శక్తి వస్తుంది..



'వసుచరిత్ర సాహితీ సౌరభము' లో 
భట్టుమూర్తి గురించి ప్రస్తావిస్తూ 
ఒక చోట ఇట్లంటారు పుట్టపర్తి ...

''ఇక నీతని సంగీత కళాపాండిత్యము 
కొంత చవిచూడవలసియున్నది..
ఇతని దయతో దిరుమల రాయడును 
నాద రక్తి రసికుడైనాడు 

మూర్తి కవికి 'నాద' శబ్దముపై 
నెక్కువ ప్రణయము..
సంగీత విషయము చెప్పవలసి వచ్చినపుడు..
' నాద ' శబ్దమున కెట్లును 
ప్రధమ తాంబూలము తప్పదు..

వేరు చోటులను మూర్తికవి సామాన్యముగా 
శబ్ద పర్యాయముగా 'నాద'మనియే వాడును 

'నాదోపాసనమే సంగీతము.. ' 
'నాదోపాసనతో నారాయణ విదులు తరించిరని'
త్యాగరాజన్నాడు

గాన యోగుల దృష్టిలో 
జగమంతయు నాదమయమే..
పరమశివుడు నాదతనుడు
రాగరత్న మాలికచే హరిరంజిల్లు నట..

'స్వాదుఫల ప్రద సప్త స్వర రాగ నిచయ నిహిత 
నాదలోలుడై బ్రహ్మా నంద మందవే మనసా'

యని త్యాగయ్య హితబోధ..
సంగీత జ్ఞాన హీనులకు 'మోక్షము గలదా..?'
యని యాతని సవాలు..
'నిద్దుర నిరాకరించి..
శుధ్ధమైన మనస్సుతో '
బాడినంత రాముడు సంతోషింపడు..
'ముద్దుగా తంబూరా బట్టి సుస్వరముతో బాడవలె' నట..

సంగీత మర్థముగాని మొద్దులను జూచి 

''అటుకుల రుచి యెద్దులకు దెలియునా..?'' 
యని త్యాగ బ్రహ్మము నవ్వినాడు..

ఆ సప్త స్వర సుందరుల యనుభూతి 
యచ్చరల యాలింగనమునకు బైచేయి
కమ్మగా స్వర శృతిలో లీ నమై.. 
స్వరములు బల్కించుట 
బహుజన్మ తపః ఫలము 
త్యాగరాజు రాముడు గూడ నిట్టివాడు..

''నాద సుధా రసం బిలను నరాకృతాయెరా..
వేదపురాణాగమ శాస్త్రాదుల కాధారమౌ..

స్వరములు ఆరొక గంటలు వరరాగము కోదండము..
దురనదేశ్యము త్రిగుణము నిరతగతి శరము రా

సరస సంగతి సందర్భము గలగిరములు రా..
ధరభజనే భాగ్యమురా .. త్యాగరాజు సేవించు.. 

నాద సుధా రసమే రామ స్వరూపమైనదట..
ఆ మూర్తికీ రాగమే కోదండము
స్వర సుందరులే దాని గంటలు
నిరంతర రాగాలాపనమే శరము..

ఓహో.. ఎంత మధురమైన ఉపాస..
త్యాగయ్య తన్ను మరచి పాడినవాడు
అంటారు పుట్టపర్తి ..

యేమైనా 

తనకోసం తపించే వారి వద్దకు 
తానూ వెతుక్కుంటూ వెడతాడు పరమాత్మ.. 
ఎవరైతే ఏకాగ్ర చిత్తంతో పరతత్త్వాన్ని ధ్యానిస్తూ వుంటారో .. 
దైవం వారి వద్దకు తానే వెళుతుంది .. 
అంతటి ఉదారంతో కూడినది ఆయన కారుణ్యం .. 


14 జులై, 2015

కళ్యాణ వైభోగమే.... !


పెళ్ళి అనగానే
పిల్లలకు ఆనందం..
పెద్దలకు కంగారు.
పెళ్ళి వారి గురించి మంచీ చెడ్డా వాకబు చేసి..
వరుని గుణ గణాలు .. 
సంపాదనా చాతుర్యాన్ని  గూఢచర్యం చేసి..
వారి స్థితీ గతీ తెలుసుకుని..
గణాల పొందిక ను గమనించి
తిథి వార నక్షత్రాలు చూసి..
ముహూర్తం నిర్ణయించి..

అమ్మాయి గునిసినా..

వాడు నిన్ను బాగా చూసుకుంటాడని గదిమి..
పిల్లాడు పిల్ల ముందు తేలిపోయాడనీ..
కాకి ముక్కుకి దొండ పండనీ 
యెవరైనా గుస గుసలాడినా
రూపం కాదు గుణం ప్రధానం..
అందాన్ని కొరుక్కు తింటామా..
ఇత్యాదులతో సర్ది చెప్పుకుంటూ..
తన బిడ్డ పొయినింట సంతోషంగా ఉందాలని ఆరాటపడుతూ..

ఇంట్లో అందరికీ నగలూ బట్టలూ..
వంటవాళ్ళూ పురో హితులూ..
పందిరి మేళాలు..
శుభలేఖలూ.. పిలుపులూ .. 
అయ్యాక ముహూర్తం సమీపిస్తున్న కొద్దీ..
పెళ్ళిపెద్దలో ఇంకా యేదో అలజడి ..
అప్పగింతలై పిల్ల అత్తవారింట అడుగు పెట్టేదాక..
శుభ కార్యం నిర్విఘ్నంగా జరిపించమని
వేయి దేవుళ్ళకు మొక్కులు..
ఇది మామూలు పెళ్ళి తంతు..

బంధాలకు దూరంగా 

ముక్కు మూసుకుని తపస్సు చేసుకుందామని వెళ్ళిన ఋషులూ 
పుత్రికా వ్యామోహంలో చిక్కుకుని..
వారి భవితవ్యానికై చింతించడం మనం చూశాం

విశ్వామిత్రుని తపోభంగం చేయడానికొచ్చిన మేనక

కార్యం పూర్తి కాగానే 
పుట్టిన శిశువుని అలా వదిలి 
దేవలోకానికి చక్కా పోయింది..

ఛ.. నా తపస్సంతా భంగమైపోయింది..

అనవసరంగా స్త్రీ లౌల్యంలో చిక్కుకుపోయాను అని
విశ్వామిత్రుడూ తన దారిన పోయాడు..

అటుగా వెళుతున్న కణ్వ మహర్షి..

పక్షులు  పెంచుతున్న బాలికను చూసి 
ముచ్చట పడి ఆశ్రమానికి తెచ్చి పెంచుకోవడం

ఆపై దుష్యంతునితో ఆమె గాంధర్వ వివాహం..
శాపవశాత్తు అతను ఆమెను భార్యగా అంగీకరించకపోవటం..
ఒక ట్విస్టు..

చివరికి ఆకాశవాణి కలుగజేసుకుని
నిజం చెప్పడంతో వారి కాపురం చక్కబడుతుంది..
కణ్వుడు ఊపిరి పీల్చుకున్నాడు..

కవులు తమ కావ్యకన్యలను  

రాజుల కంకితం ఇస్తుంటారు..
తమ కావ్యాలలో పెళ్ళిళ్ళు చేయడంకూడా 
కవులకు రివాజే..

ఇక్కడ విషయమేమిటంటే..

ఇదిగో ఇది..

అది వసురాజు వివహ మహోత్సవ వేడుక..
వరుడు వసురాజు.. 
వధు వు గిరిక.. 
పెండ్లిపెద్ద దేవేంద్రాదులు..

''వసు చరిత్ర సాహితీ సౌరభములు''
 విశేషాలను 
అనన్య సామాన్యం గా  వర్ణించిన పుట్టపర్తికి.. 
గిరికా వసురాజుల పెండ్లి ముహూర్త విషయంలో 
ఒక సందేహం పీడించిందట..

చిత్తగించండి..

''దినమును దేవేంద్ర సభకు బోవుట..
వసురాజున కలవాటు..
ఆనాడాతడు సభకు రాలేదు..
దేవేంద్రునకు గరణము దెలిసికొందమనిపించినది...
ఆ నిరవద్య మిత్రుని..
నేచింత పీడించుచున్నదోయని..

యాతని యాలోచన..

ఇంద్రుడు యోచించి చూచెను..
వసురాజు కలత యాతనికర్థమైనది..
వారు దేవతలు గదా..
పేరామని చలికి..కలువల చెలికి వసురాజెంత కలత జెందెనో యని
ఇంద్రుడు కటకటబడినాడు..

తెల్లవారినంతనే.. 
యాతడు శీతనగ పుత్రుని చెంతకు వచ్చెను..
ఆతడీ కన్నెను వసురాజుకు యాచించినాడు..
'సిరిరా మోకాలొడ్డు ' వాడెవడుండును..
కోలాహలుడు సమ్మతించెను..
గట్టురాపెద్దలు.. పుణ్యవాహినులు.. పెండ్లికాహ్వానింపవడిరి..

వివాహ మహోత్సవమున కప్పటికప్పుడు దేవేంద్రుడొక పట్టణమును సృజించినాడు...
వివాహ మానాడే జరుగవలెనని ...
యాతని పట్టుదల..
యేర్పాటులన్నియు వడి వడిగా సాగెను..
వసురాజునకు వార్త దేవేంద్రుడే దెల్పెను...

ఈ రేయికే యొక శుభలగ్నమేర్పాటుజేయుమని బృహస్పతికి విన్నవించికొన్నాడు..

వధూవరుల యలంకారములతో మధ్యాహ్నము జెల్లినది.. అప్పటికే..

''పౌలోమిఈ ప్రభృతుల్ గుమారినిటు సంభావింపగా మున్ను ది

క్పాలుర్ భూపునలంకరించి, శుభలగ్నంబుంప్రతీక్షింపగా..
నాలోదాను దాను దదర్హవన్మణీ విశేషాన్వేష సన్నధ్ధుడో, నా
నాలోకాప్తుడుచేరె రాగ మహిమన్ రత్నాకర ప్రాంతమున్..''

ఇంతలో .. 
రేగన్నియ రేనిమేను  తొలిగట్టుతుద బొదలినది..
అంగిరసుడు లగ్నమాసన్నమైనదని యెచ్చరించెను..
దైవతవిభుడాదరోక్తి బిలిచినాడు.
వసురాజు సితకరినెక్కి శీతనగోజ్జ్వల శంకరాకృతితో గోలాహలపురముచేరజనెను..
పురియందున్న స్త్రీలు అతని జూచుటకు మేడలపై నిలచిరి..
వసురాజు వేదిక చెంతకు వచ్చెను..''

ఇక్కడ నొక చిక్కున్నది..
గిరికా వసు రాజుల  వివాహము జరిగినది
మిధున లగ్నమందు..
వివాహ దినము చైత్ర శుధ్ధ చతుర్దశి..

మాంగల్యధారణము సూర్యాస్తమయమైన తరువాత..

చైత్రమాసమున మిధున లగ్నము రాత్రిపూట వచ్చుటకు వీలులేదు..

మరి జ్యోతిషమునందు బండితుడైన భట్టుమూర్తి

యీ పొరపాటెట్లు చేసినాడు..?

ఈ సమస్య నన్ను చాల దినములు పీడించినది..
పండితుల నడిగితిని..
వారొక చిన్న సవరణ చెప్పినారు..
అది యుండవచ్చనిపించినది..
వారి సమాధానమిది..

'' ఒక్క సంవత్సరమునకు ... 
మేషరాశియొక్క యాదిబిందువేబదిమూడు విలిప్తల ప్రకారము తిరోగమించును..

అనగా..
బ్రతియరువదియేండ్లకును ..
ఒక్క యంశతిరోగమనము
మున్నూటయరువది యంశలు తిరోగమించుటకు 21600 సంవత్సరములు పట్టును..
గాని ..
10800 సంవత్సరములకు గాని దాని బేసిసంఖ్యలబ్దమునక్గాని లగ్నసప్తమ పరివర్తన మేర్పడును

అందుచే ..
బగటి రాసులు రాత్రియందును..
రాత్రి రాసులు పగటియందును వచ్చుటకు వీలున్నది..
సూర్య చంద్రుల సంబంధము చేతనే తిధులేర్పడుచున్నవి..
కనుక తిధిలో భేదము వచ్చుటకు వీలులేదు..
నేడు చైత్ర శుధ్ధ చతుర్దశికి చంద్రుడు హస్తలోను
రవి మీనమునందుండునని యంగీకరించుచున్నాము..

కానీ  .. 

అయనాంశను బట్టి వసురాజునాటికి చైత్రమునందు ..
రాత్రిరాసులైన కన్యాదికుంభాంతము  ఉదయరాసులుగా నుండియుండవచ్చును..
ఈ విషయమున నాకన్నను 
సత్యము దేల్చికొనుటకు మీరే యధికారులు ..
నాకును .. గణితమునకును షష్టాష్టకము..
పై పండితులు చెప్పిన  సమాధానమును 
మీకు  మనవి చేసినానంతే..''

అదీ సంగతి .. 
జ్యోతిష శాస్త్ర వాసనలు 
పుట్టపర్తిని ఎలా ఆలోచింప జేశాయో   చూసారా .. 

26 జూన్, 2015

యుధ్ధాలతో ఒరిగేదేమీ లేదు..

నేను పోస్ట్ చేసే విధిలో 
గూగుల్ నూ వెదికి కొంత సమాచారం తీసుకుంటాను
సామవేదం.. చాగంటి వంటి మహాత్ముల ప్రవచనాలు విని కొంత సంస్కారాన్ని పెంచుకుంటున్నాను..
 

పోతన్న రాయలసీమలో పుట్టినారని వ్రాసాను..
అది గూగుల్ నుంచీ తీసుకున్నదే..
 

శ్యామలీయం గారు
 ''కొంపముంచారు.. 
పోతన్న రాయలసీమలో పుట్టారంటే
తెలంగాణావాళ్ళతో విభేదం వస్తుందేమో నని .''

చ మత్కరించారు..

''యేమీ రాదులెండి.. 
 తెలంగాణా వాళ్ళు మాకు విరోధులేమీ కారు .. బంధువులే.. 
ఆ మాటకొస్తే ఆత్మ బంధువులు.. 
పోతన్న భాగవతమే భగవత్స్వరూపం .. 
'' భగవంతుడు .. భక్తుడు .. భాగవ తమూ ఒక్కటే వేరు కాదు ''
అన్న పుట్టపర్తి చివరి వాక్యాలు అర్థం కావడానికి 
ఎంతో ఔన్నత్యం కావాలి.. 

మాకు తెలంగాణా వారితో ప్రేమానుబంధాలే వున్నాయి మీ సంగతి చూసుకోండి అన్నగారూ..  
అంటూ ..

కవికి కులమతాలు లేవని జాషువా వంటి వారం టుంటే.. 
ప్రాంతీయతలు కూడానా.. 
అన్నారు కోస్తా ఆంధ్ర ప్రాంతాలకు చెంది
 పుట్టపర్తి పై రిసెర్చ్ చేసిన పద్మావతిగారు..''

మన విభేదాలు పోతన గారికి ఆపాదించడం ఎందుకులెండి వాళ్ళమానాన వాళ్ళని బ్రతకనిద్దాం.. 
నేను మా తండ్రి గారి విశేషాలు 
వారి అభిమానులకు అందించాలనే ఉద్దేశం తో 
బ్లాగు నడిపిస్తున్నానే తప్ప 
నేను పెద్ద జ్ఞాన వంతురాలిని కాదు.. 
కనీసం అలా చెప్పడం నటించటం కూడా రాదు 
నన్నిలా ఒదిలేయండి.. 

మనం 
పోతన్న తెలంగాణా వాడివన్నా పొంగిపోడు.. 
రాయలసీమ వాడివన్నా కుంగిపోడు.. 
అందుకే 
ఆయన భాగవతా న్ని పట్టుకుని ఎంతో మంది తరించిపోతున్నారు..
పుట్టపర్తి అనూరాధ. ''
అంటూ జవాబిచ్చాను .. 

తరువాత మనసంతా వికలమైంది. 
మొన్న పద్మావతి గారి సంభాషణ గుర్తుకొచ్చింది .. 
అది ఇదే .. 
ఆవిడ మాటల్లో నే ..

 '' ద్వానా శాస్త్రిగారు ఈ విషయాన్ని బాగా మేన్షన్ చేసారు   కవులందరినీ సంపుటిగా వేశారట ద్వానాశాస్త్రిగారు .. 
తన పుస్తకాన్ని ఆవిష్కరించడానికి పుట్టపర్తిని ఆహ్వానించారు ద్వానా శాస్త్రి గారు .. 
 సభలో పుస్తకం పరిశీలించారు పుట్టపర్తి 

ఆ పుస్తకం చూపించి సభాముఖంగానే..
 ఇందులో రాయలసీమ కవుల ప్రసక్తి ఎక్కడన్నా వుందా..
ఒక్కరిపేరైనా ప్రస్తావించారా .. 

మా రాయలసీమ కవుల పేర్లేమైనా వున్నాయా..
అని కోపంగా అడిగారు 
ద్వానా శాస్త్రి గారికీ కోపం వచ్చిం ది.. 

ఇద్దరినీ అనుసంధానం చేసారు జానుమద్ది .. 
ద్వానా శాస్త్రి గారింటికి వెళ్ళారు .. 
ద్వానా శాస్త్రిగారు .. బాగానే ఆదరించారు 

''నేను ఇట్లా   అన్నానంటే.. 

మీ కందరికీ కోపం రావచ్చు
కానీ నేను చెప్పకపోతే ఎలా తెలుస్తుంది..

నా కవకాశం వచ్చింది కాబట్టి చెప్పాను..

ఇది తప్పు .. .  పధ్ధతి కాదు 
 అని అన్నారట..

అప్పుడు ద్వానా 
శాస్త్రి గారి మనసులొ ఒక బీజం పడింది.. 
ప్రాంతీయతత్త్వం ఉండకూడదు..అని..
రాయలసీమ .. తెలంగాణ ఇలా అందరు కవులనూ కలుపుకోవటం ప్రారంభించారు..
అందరినీ సమాన దృష్టి తో చూడటం..
ఆదరించటం చేశారట..
 

సాహిత్య చరిత్రలో కూడా 
ఆంధ్ర రాయలసీమ తెలంగాణా ప్రాంతాల కవులను గురించి రాశారట..
సమానదృష్టితో చూడటం అలవర్చు కున్నారు..
 

పొట్టిశ్రీరాముల యూనివర్శిటీనుంచీ అవార్డ్ వచ్చిన సందర్భంలో
 

 ద్వానా శాస్త్రి గారికి 
కవులందరి పట్ల సమాన దృష్టి ఉంది.. 
ప్రాంతీయత అనే దురలవాటు ఈనకు లేదు 
అందుకే ఈ అవార్డ్ వచ్చింది అని శివారెడ్డి గారు వేదికపైనుంచీ చెప్పారట..
 

అప్పుడు జవాబుగా 
నాకు ఇటువంటి దృష్టి పడటానికి బేస్ యేది .. 
పునాది యేది అంటే..
పుట్టపర్తి నారాయణాచార్యులు గారు .. 

అని నాలో ఈ బీజం పడటానికి 
ఇదిగో ఈ సన్నివేశం అని చెప్పారట..
 

తరువాత 
ఉస్మానియా యూనివర్సిటీ లో 
పుట్టపర్తి ఉపన్యాసాల ద్వారా నేను స్పూర్తిని పొందాను..
ఇటువంటి దృష్టి నాకు 

నారాయణాచార్యుల వారి వల్లే పడింది..
అని చెప్పారట..
 

పద్మావతి గారు 
పుట్టపర్తి శ్రీనివాస ప్రబంధం పై రిసెర్చ్ చేస్తున్నారు..
ఆక్రమంలో రాళ్ళబండిగారినీ  ద్వానా శాస్త్రి గారినీ.. 

ఇలా ఎందరితో నో  ఇంటర్వ్యూ నిర్వహించి 
దాన్ని రికార్డ్ కూడా చేశారు..
ఆవిడ సబ్మిషన్ అదీ అయ్యాక 

అన్నీ మీకు అందజేస్తానని చెప్పారు..
ఈ సంఘటనను పెడదామని ఆలోచనలో వుండగానే..
శ్యామలీయం గారి ద్వారా దీన్ని చెప్పాల్సి వచ్చింది..
 

నేను పుట్టపర్తి కూతురిగా 
వీనిని వెలుగులోకి తెస్తున్నానే కానీ..
నాకు యేమీ జ్ఞానం లేదు..
నేనొక మూఢురాలిని అని గుర్తించి..
నా అజ్ఞానాన్ని మా తండ్రి గారిని చూసి క్షమించమని ప్రార్థన..


యే ప్రాంతం వారైనా..
పుట్టపర్తి ప్రబంధ నాయికలు ఉపన్యాసాలు యూనివర్శిటీలో ప్రత్యక్షంగా విన్న అదృష్టవంతులలో నేనూ ఒకడిని అన్న ద్వానా శాస్త్రి గారికి వినయంగా ప్రణమిల్లుతూ..
పుట్టపర్తి అనూరాధ.


24 జూన్, 2015

మా సీమ




ఈ గాలి ..
ఈ నేల ..
ఈ ఊరు .. సెలయేరు..
అని ఒకసినిమా పాట ..
ఎవరికైనా తాను పుట్టిన ఊరు..
ఆ గాలి..
ఆ నేల..
ఆ చరిత్ర మైమరపిస్తూనే వుంటుంది..
 

ఆ ప్రాంతపు నుడికారాలు.. ఊతపదాలు..
పదాల వాడుక..
ప్రతి ప్రాంతానికి భిన్నంగా వుంటాయి..

జాంకులు ఈడికి వస్తావుండె..
శానా నాళ్ళయిపాయ ఈ దిక్కుకే రాల్యా..
అంతలక్కల ఎదికినా..
యాడా దొరకల్యా...


 ఇది రాయలసీమ భాష.
జాంకులు అంటే మాటి మాటికీ
అంత లక్కల అంటే అన్ని చోట్లా అన ర్థం..
 

పుట్టినప్పటినుంచీ ఎరిగిన భాష కాబట్టి   
మాకు అర్థం అవుతుంది
వేరే ప్రాంతాల వారికి రాయలసీమలో అడుగు పెడితే 

కొంత గందర గోళం గానే ఉండచ్చు..
 

మాకూ ఆంధ్రా ప్రాంతాలకు వెళితే 
వారి భాష కొత్తగా వుంటుంది..
మా ఊరికి నా చిన్న తనంలో ఒక ఆంధ్ర ఆమె కూరగాయలండీ .. కూరగాయలూ..
అంటూ అమ్మేది..
అమ్మాయిగారండీ .. అబ్బాయిగారండీ..
అంటూ మాట్లాడేది..
అది మాకు వింత..
 

భాషదేముంది.. భావం అర్థమవా లి.. 
మనిషికీ మనిషికీ గుండెల్లో ప్రేమ పెరగాలి.
అంతే కానీ.. 
నీ భాష బాలేదు ..
మా భాష చాలా నాజూకైనది..
వంటి మాటలతో ఒకరినొకరు గాయపరచుకోవటం 

ఎవరికీ మంచిది కాదు.. అందువల్ల లాభమూలే దు.. 


అన్ని ప్రాం తా లకున్నట్టే 
రాయలసీమకు ఘన చరిత్ర వుంది...
ఒకప్పుడు కళల రాజ్జంగా ప్రజ్వరిల్లింది..


రాయలసీమ విజయనగర సామ్రాజ్యం లో భాగం

 శ్రీ కృష్ణదేవ రాయలచే పరిపాలించబడినది. 
అది వరకూ తూర్పు చాళుక్యుల పరిపాలనా కేంద్రంగా 
హిరణ్యక రాష్ట్రంగా ఈ ప్రాంతం విలసిల్లినది. 

తర్వాత 
రాయలసీమ పై చోళుల ప్రభావం పెరిగిం ది 
తెలంగాణ, కోస్తా ప్రాంతాలతో పోలిస్తే 
రాయలసీమ వైశాల్యంలో చిన్నదైనా .. 
తెలుగు,తమిళం, కన్నడ మరియు ఉర్దూ కళల్లో, సంస్కృతుల్లో, సాహిత్యంలో 
ఈ ప్రాంతం యొక్క ప్రభావం బహు అధికం.

విజయనగర సామ్రాజ్యపు చక్రవర్తి అయిన
 శ్రీ కృష్ణదేవ రాయలు హయాంలో 
ఈ ప్రాంతపు సంస్కృతి చాలా ఉన్నతి చెం దిం ది . 

అష్టదిగ్గజాలలో ఐదు మంది 
(అల్లసాని పెద్దన, నంది తిమ్మన, ధూర్జటి, కందుకూరి రుద్రకవి (మాదయ్యగారి మల్లన), అయ్యలరాజు రామభధ్రుడు) ఈ ప్రాంతం వారే.
 
కడప జిల్లా కి చెందిన 
యోగి వేమన, బ్రహ్మం గారు తమ రచనల ద్వారా సామాన్య ప్రజానీకాన్ని విద్యావంతులని చేయటానికి ఎంతో కృషి చేశారు. 

శ్రీమద్భాగవతము రచించిన పోతనామాత్యుడు కూడా ఒంటిమిట్ట లోనే జన్మించాడన్న అభిప్రాయం

బళ్ళారి రాఘవ, 
ధర్మవరం రామకృష్ణమాచార్యులు, 
కోలాచలం శ్రీనివాసరావు 
వంటి రంగస్థల ప్రముఖులను అందించిన 
బళ్ళారి ప్రదేశానికి గొప్ప చరిత్ర 
బళ్ళారి లోని రాఘవ కళా మందిర్ 
బళ్ళారి రాఘవ పేరు పై స్థాపించినదే.

తత్త్వవేత్తలు, ఆధ్యాత్మిక గురువులు అయిన 
జిడ్డు కృష్ణమూర్తి, కట్టమంచి రామలింగారెడ్డి 
చిత్తూరుకి చెందినవారు.
చిత్తూరు, కడప జిల్లాలకు చెందిన పలు ఉర్దూ రచయితలు ఉర్దూ సాహ్యిత్యానికి సేవ చేశారు.

బ్రాహ్మణ కులంలో కేవలం రాయలసీమ ప్రాంతానికి మాత్రం పరిమితమైనది ములకనాడు బ్రాహ్మణ ఉపకులం. 

ఈ కులానికి చెందిన త్యాగరాజు కాకర్ల (అర్ధవీడు)కి చెందినవాడు.

ప్రస్తుతం ఇది ప్రకాశం జిల్లా ఉన్నా.. 
 ఒకానొక గానంలో ఈయన పూర్వీకులు రాయలసీమకి చెందినవారని తానే స్వయంగా చెప్పుకొన్నారు.
 
వాగ్గేయకారుడైన అన్నమయ్య 
కడప జిల్లాకి చెందిన తాళ్ళపాకకి చెందినవాడు.
తరిగొండ నరసింహ స్వామి పై 
 వెంకటేశ్వర స్వామి పై అనేక గీతాలని రచించిన వెంగమాంబ తిరుపతి వద్దనున్న తరిగొండకి చెందినది.
 
ప్రముఖ సంగీతకారుడు రాళ్ళపల్లి అనంతకృష్ణశర్మ అనంతపురానికి చెందినవాడు.
మన పుట్టపర్తి సంగతి తెలిసిందే .. 

ప్రముఖ సంగీతకారుడు (మరియు వైద్యుడు) అయిన శ్రీపాద పినాకపాణి జన్మత: శ్రీకాకుళం జిల్లాకి చెందినవారైననూ, కర్నూలులో స్థిర పడ్డారు.


రాయలసీమలోనివే అయినా కర్నూలు భాషపై..మహబూబ్ నగర్ ప్రభావమూ..
చిత్తూరుపై తమిళ భాష వాసన..
అలానే అనంతపురం ప్రజల భాషలో కన్నడ కస్తూరి గుబాళింపూ
కనిపిస్తాయి..


మా అయ్య
 ''ఊనప్పా అంటే..''
 అని ఎవరో అనేవారని
మాటి మాటికి అని నవ్వే వారు
ఊనప్పా అంటే.. నిజమే సుమా అని..


 ఇక విషయానికి వస్తే..
పోలా ప్రగడ సత్య నారాయణ గారు వ్రాసిన ఆ రోజుల్లో పుస్తకంలో..
వారు రాయలసీమలో పనిచేసిన రోజులను అతి సుందరంగా వర్ణించారు..


ఈనాడు సినిమాలలో చూస్తుంటే..
రాయలసీమ అంటే
అందరూ కత్తులు పట్టుకు నరుక్కుంటారనీ..
పగ ప్రతీకారాలతో రగిలిపోతుంటారనీ..
బాంబులు విధిగా తయారు చేస్తారనీ
అభిప్రాయాన్ని ఫిక్స్ చేసారు..
 

కానీ రాయల సీమ ప్రజలు అమాయకులు..
కల్లా కపటం తెలియని వారు
నటించటం..రాదు..
ఆత్మ వంచన చేసుకోవటం..తెలియదు
లోపలేముందో అదే మాట్లాడతారు..
మనసుకు నచ్చితే శక్తి వంచన లేకుండా చేస్తారు..
మరి ''ఆ రోజుల్లో'' కి వెళదామా..
  .